LATEST UPDATES

15, మే 2020, శుక్రవారం

వైశాఖ మాసం సందర్భంగా - రచన శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి

వైశాఖ మాసం సందర్భంగా - రచన శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి

మాధవ, మధుసూధన, నారాయణ!
నీ దర్శన భాగ్యఫలం చేత,
నా అజ్ఞాన పొరలు అంతరించే.
నీదు నామజప మహిమ తోడ,
నా పాపములన్నీ పటాపంచలయ్యే.
అనవరతము నిను కొలుస్తూ,
నీ రూపమే అపురూపంగా హృదిలో నిలుపుతూ
నీ అర్చనే నా జీవనముగా భావిస్తూ,
నా జీవితానికి నీవే దిక్కని నమ్ముతూ,
సదా నీ నామ స్మరణే నాకు శరణం!
నన్ను సంస్కరింప రావా!
అచ్యుతా, కేశవా, జనర్ధన!!
(వైశాఖ మాసం సందర్భంగా)

-శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి
25/04/2020, 19:25

ఉత్తరాల తీగ - రచన శ్రీ డా.గూటం స్వామి


ఉత్తరాల తీగ - శ్రీ డా.గూటం స్వామి
💐 ఉత్తరాల తీగ 💐
********

ఇది ఇనుప వస్తువు కాదు
అదొక జ్ఞాపకాల మాల!
తలపుల దొంతర్లను
తన గుండెల్లో గుచ్చుకునే
అపురూప చెలికాడు!

గతంలో ప్రతి ఇంట ఉత్తరాల తీగకు
ఉత్తరాలు గుత్తులుగా పూసేవి!
ఆప్యాయతా పరిమళాలు వెదజల్లేవి!
అందంగా పలకరించేవి!
బంధుత్వాలను పెంచేవి!
స్నేహితులను కలిపేవి!
ఓదార్పును కలిగించేవి!
గతాన్ని కళ్ళముందు పరిచేవి

ఉత్తరాల తీగ ఒక గ్రంథాలయమే!
తాత అమ్మకు రాసిన ఉత్తరం
నాన్న నాయనమ్మకు రాసిన ఉత్తరం
అమ్మ నాన్న ల పెళ్ళికార్డు
ఉత్తరాల తీగలో పదిలం!!

అదొక పురాతన ఆత్మీయ నిధి!
ఒంటరి జీవుల పాలిట పెన్నిధి!
గత చరిత్రకు సాక్షీభూతి!

నేడు ఉత్తరాలు లేవు
ఉత్తరాల తీగలు లేవు!
రాసే తీరుబడి లేదు
చదివే ఓపిక లేదు!
సెల్ ఫోన్ సవ్వడులమధ్య
ప్రాణం లేని పలకరింపుల మధ్య
ఉత్తరాల తీగకు చోటెక్కడిది?
సంబంధాలు వ్యాపారమైన రోజుల్లో
ఉత్తరాలు రాసే అలవాటు ఎక్కడిది!

ఎన్ని సమాచార విప్లవాలు వచ్చినా
సామాన్యుని సమాచార సౌకర్యం ఉత్తరమే కదా!

ఈసారి మా ఊరెళ్ళినప్పుడు
అటకమీద పాత మానుపెట్టెలో
మా తాత భద్రంగా దాచిపెట్టిన
ఉత్తరాలతీగను తెచ్చుకోవాలి!
నా మూలలను ఒకసారి తడుముకోవాలి!!

డా.గూటం స్వామి
(9441092870)
💐💐💐💐💐💐💐

14, మే 2020, గురువారం

కష్టాల గుట్టలు - రచన శ్రీ తాటిపాముల రమేష్


కష్టాల గుట్టలు - రచన శ్రీ తాటిపాముల రమేష్
🌴కష్టాల గుట్టలు 🌴
1. కరోనా  దెబ్బ
    బడుగు  బతుకుల మీద                                                
    పిడుగు దెబ్బ  
    ఉన్న ఉపాధి ఊడి
    చేద్దామంటే పని లేక
    చేతిలో కాని లేక
    వ్యవస్థ అవస్థ గా మారడంతో
    చేసేది  లేక ఉసురు పోసిన
    ఊరి వైపు కదులుతుండ్రు
2. చంకలో చంటి పిల్ల
    నెత్తి  మీద మూట ముల్లె
    సూర్యుడు నిప్పుల
    వర్షం  కురిపిస్తుంటే                 
    ధరణి నూనే కాగిన                            
    గంగాళంలా కాలుతుంటే                                       
    పాదాలకు పాదరక్షకాలు లేక
    కొందామంటే కొత్తలు లేక                    
    కాలిన బొబ్బలతో   
    పాదాలు అరిగే దాక 
    గమ్యం ముద్దాడే దాక
    మారథాన్ ను  సాగిస్తుండ్రు
    స్వేద  సముద్రంలో ఈదుతూ   
    అనుకోకుండా మార్గ మధ్యలోనే
    యముడి ఒడిలో  ఒరుగుతుండ్రు      
3. వాళ్లకు ఢాంబికాలు,                           
    దందాలు తెలియదు
    మాటల మధుర గుళికలు తెలుసు
    కడుపులో కల్మషాలు తెలియదు
    కాయకష్టం తెలుసు
    జేబులకు చిల్లులు పెట్టడం తెలియదు
    పెదవిపై చిరునవ్వు తెలుసు.
4.ఏడు దశాబ్దాల కాలంలో ఏలికలు
   పేదరికంపై ఎత్తిన కత్తి మొండిదైంది
   ఉపాధిపై గురి పెట్టిన                                
   బాణం ఉత్తదయింది
   బడుగుల రాత మారట్లేదు
   కష్టాల గుట్టలు కరగట్లేదు
   ఓట్లేసుకున్నోళ్ళు ఒడ్డెక్కుతుండ్రు          
   ఓట్లేసినోళ్ళు గడ్లెకలుస్తుండ్రు
   ఓటు ఆయుధం తియ్యాలి
   బడుగులను మరిచినోళ్ళకు
   వాత పెట్టాలి.
 ------------------------------‐---
 ✍✍✍✍ తాటిపాముల రమేష్
ZPHS WARDHANNAPET.

13, మే 2020, బుధవారం

ప్రముఖ తత్వవేత్త , అధ్యాత్మికవేత్త జిడ్డు కృష్ణమూర్తి జయంతి సందర్భంగా -శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి


ప్రముఖ తత్వవేత్త , అధ్యాత్మికవేత్త జిడ్డు కృష్ణమూర్తి జయంతి సందర్భంగా -శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి
ఆధునిక తత్వవేత్తలకు ఆద్యులు!
జిడ్డు కృష్ణమూర్తి తత్వ ఆధ్యాత్మికవేత్తగా విఖ్యాతులు!!
దివ్యజ్ఞాన సమాజ జగద్గురువుగా ప్రఖ్యాతి!
పలు దేశాల్లో అధ్యాత్మిక ప్రసంగాలతో ప్రశస్తి!!
జగద్గురువుగా పొందిన గౌరవాలకు ముగింపు,
అసాధారణ రీతిలో సాధారణవ్యక్తిగా జీవితం కొనసాగింపు!!
హృదయంతరాళంలో విప్లవ మథనం,
మనిషిలో సంపూర్ణ పరివర్తనా సాధనం!!
రాజకీయ, ఆర్థిక, సామాజిక సంస్కరణలు!
మానవునిలో సమూల మార్పులు తేలేని ఉపకరణలు!!
సరికొత్త ఆదర్శాలు, మతాత్మక ఆశయాలు!
మనిషి మనస్సును సంపూర్తిగా మార్చని విషయాలు!!
ఇలా ఎన్నెన్నో తత్వాలు ఎన్నెన్నో తర్కాలు,
సమస్త మానవాళిని మార్చగలిగే బోధనలు!!

అనిబీసెంటు మార్గనిర్దేశంలో ఎదిగిన పరమ జ్ఞానులు!
ప్రసిద్ధ రిషి వ్యాలీ పాఠశాల వ్యవస్థాపకులు!
తెలుగునేలపై ఉద్భవించిన ఉషస్సు!
భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపచేసిన తేజస్సు!!
ప్రపంచవ్యాప్తంగా తన తత్వాలలో చిరంజీవిగా యశస్సు!!!
(ప్రముఖ తత్వవేత్త , అధ్యాత్మికవేత్త జిడ్డు కృష్ణమూర్తి జయంతి సందర్భంగా)
-ప్రవీణ్ కుమార్ వేముగంటి.
12/05/2020, 18:30, మంగళవారం.

పట్నం పొమ్మంది!పల్లె రమ్మంది! - రచన శ్రీ డా.గూటం స్వామి

😢పట్నం పొమ్మంది!పల్లె రమ్మంది!😢
********

ఎర్రని తూర్పు వాకిలి‌లో నిలబడి చూస్తే
పచ్చని మా పల్లె కనబడుతోంది!
మా పల్లె పక్కనే ఏరు కనబడుతోంది!
ఏటిఒడ్డన మా వాళ్ళ పాట వినబడతోంది!
మమ్మల్ని పంపండి సారూ!మేముండలేం ఇక్కడ!
ఎన్నాళ్ళు మాకీ చిత్రహింస!

బ్రతుకు తెరువు కోసం పట్నం వచ్చిన వాళ్ళం!
ఇప్పుడు మా బ్రతుకులు చిధ్రం అయ్యాయి!
తింటానికి తిండి కరువయ్యాక
ఇక్కడెలా ఉత్తినే ఉంటాము సారూ!
మమ్మల్ని మా ఊరికి పంపేయండి!
ఎన్నాళ్ళు మాకీ గుండెకోత!

ఇప్పుడు మా బతుకులు
నెత్తురు ముడుగులు!
ఇప్పుడు మా జీవనం
కన్నీటి కడలి తరంగం!
ఇప్పుడు మా ఆలోచన లు
గురితప్పిన గుళకరాళ్ళు!
ఇప్పుడు మా ముందున్నదంతా రక్తసిక్త జీవితం!
ఇప్పుడు మా మార్గమంతా అపజయాల వ్రణాలే!
ఇప్పుడు మా పోరాటమంతా
రేపటిని లోతుగా తవ్వుకోవడం కోసమే!

కాలం ప్రవహిస్తూనే ఉంటుంది!
కాలం పురోగమిస్తూనే ఉంటుంది!
మా వలసకూలీలు మాత్రం
ఇక్కడే ఆవిరైపోవాలా సారూ!

సూర్యాస్తమయాలు ఎప్పుడూ
ఎర్రగానే ఉంటాయి!
ఈ మధ్య సమయంలోనే
జనం పదునెక్కుతారు!
ఎర్రటి తూర్పు వాకిట్లో నిలబడి చూస్తే
పల్లె దిక్కు కనబడుతోంది!
ఇక తెగించటమే తరువాయి!

(లాక్ డౌన్ నేపథ్యంలో వలసకూలీల పాట్లు టి.వి లో చూసి వారి మనో వేదనను కవిత్వీకరించే ప్రయత్నం లో)

డా.గూటం స్వామి
(9441092870)
😢😢😢😢😢😢😢😢

12, మే 2020, మంగళవారం

వలస విలాపం! - రచన డా.గూటం స్వామి

😢  వలస విలాపం! 😢
**********************
వలసకూలీల
సర్కాస్ ఫీట్లు చూసి
మానవత్వం సిగ్గుతో చచ్చిపోయింది!
తినడానికి బుక్కెడు బువ్వ
ఉండటానికి రవ్వంత చోటు
సొంతూరు కి వెళ్ళడానికి
కావలసిన ఏర్పాట్లు
ఇవేమి చేయలేని పాలకుల తీరుకు
భరతమాత భోరున విలపిస్తోంది!

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను
విమానాల్లో తరలిస్తున్న పాలకులు
దేశాభివృద్ధి లో పాలుపంపులున్న
వలసకూలీల ను 
గాలికొదిలేయడం ఏమిటని
మానవతావాదులు ప్రశ్నిస్తున్నారు!

వాళ్ళు మణులడిగారా?
మాన్యాలు అడిగారా?
మా ఊళ్ళకి మమ్మల్ని పంపండి అంటుంటే
మీనమేషాలు లెక్కిస్తారెందుకు?

కరోనా తెచ్చింది విదేశాలనుంచి వచ్చినవారే!
దేశ పరిస్థితి ని చిధ్రంచేసిందీ వారే!
అయినా వలసకూలీలంటే
ఎందుకో పాలకులకు అంత అలుసు?

పాలకులారా!నాయకులారా!
వారి కోపం కట్టలు తెంచుకోకముందే
వాళ్ళు వెళ్ళడానికి ఏర్పాట్లు చేయండి!
వారి ఉసురు మీకు తగలకముందే
వాళ్ళ ఇంటికి వాళ్ళు ను చేర్చండి!
దేశం మీ రొక్కరిదే కాదు!
దేశమంటే ఇలాంటి వారితో కలిపే!!

(లారీలెక్కి ప్రయాణం చేయడానికి ప్రయత్నిస్తున్న వలసకూలీల ఫోటో చూసి బాధతో)

డా.గూటం స్వామి
(9441092870)
😢😢😢😢😢😢

మాతృదేవోభవ-రచన శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి

మనం తీసుకునే ప్రతి శ్వాస,
అమ్మ ప్రేమతో వేసిన భిక్ష!
మన జన్మ అమ్మకు అదో పునర్జన్మ!!
తన ప్రాణానికి ప్రాణం అడ్డువేసి,
మనకు ప్రాణం పోసేది అమ్మ!!
అమ్మ లేనిదే జీవం లేదు!
అమ్మ లేనిదే సృష్టే లేదు!!
సృష్టికి సృష్టే అమ్మ!
దైవానికి దైవం అమ్మ!!
లోకం లోకి తెచ్చేది అమ్మ!
లోకాన్ని చూపేది అమ్మ!!
తన రుధిరం మనకు మధుర ఆహారం!
తన అనురాగం, మనకు అనుబంధం!
తన ఒద్దికైనా ఒడి, మనకు ఇంపైన గుడి!!
అనుక్షణం మన గురించి తన విచారం!
ప్రతిక్షణం మన బాగోగులు తన ఆచారం!!
గోరంత ముద్దలతో కొండంత బలం ఇస్తుంది!
చిరు కోపంతో క్రమశిక్షణ కలిగిస్తుంది!!
బుడిబుడి అడుగులు వడివడి పరుగులు,
అన్ని తానై, అన్నింటా తానై!
నడకతో పాటు నడతను నేర్పిస్తుంది!!
మనమే అమ్మకు శ్వాస! మనమే అమ్మకు ధ్యాస!!
అమ్మ మనసు వెన్న, అవనిలో మిన్న!!
అమ్మకు అమ్మగా తన రుణం తీర్చగలమా!??
అమ్మ ప్రేమకు అనంతకోటి వందనాలు!
(ప్రతిరోజూ అమ్మ పూజనీయం!
అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా)
-ప్రవీణ్ కుమార్ వేముగంటి.
10/05/2020, 18:30, ఆదివారం.

5, మే 2020, మంగళవారం

టీ కప్పులో సునామీ, రచన శ్రీ తాటిపాముల రమేష్

🌴 టీ కప్పులో సునామీ 🌴
 మానవుడు ఉప్పెనలు , ఉపద్రవాలను
ఎన్నో చూశాడు
క్రిములు కొత్త కాదు,                  
క్వారంటైన్ లు కొత్త కాదు
ఎన్నో బీమారులను బార్డర్ దాటించాడు
ఇది టీ కప్పులో సునామీ లాంటిది
దీనికి అదరవద్దు, బెదరవద్దు
గాంధీ, నెహ్రూలు ఇచ్చిన ఆత్మవిశ్వాసాన్ని
మనం ఆయుధంగా  చేసుకుందాం
నేతాజీ, అల్లూరి, భగత్ సింగ్ అందించిన
వీరత్వాన్ని ఒంటి నిండా నింపుకుందాం
క్విట్ ఇండియా ఉద్యమంలో సామాన్యులు చూపించిన
ధైర్యాన్ని దైవంగా మార్చుకుందాం
కార్గిల్ వార్ లో సైనికులు చూపించిన
కరేజ్ ను మన ఒంపు కుందాం
వరదలు వచ్చినప్పుడు వంగిపోవడం
ప్రవాహం తగ్గినప్పుడు లేచి నిలబడే
గడ్డిపోస మనకు ఆదర్శం
మీడియాలో వచ్చే ఆరోహణ, అవరోహణ అంకెల పై ఆందోళన వద్దు
జగతి అంతరించదు, ఆరాటం వద్దు
 నిరాశ కు నిప్పు పెడదాం
ధైర్య పు గుండెలకు దండలు వేద్దాం
ఇంటిని ఒక బంకర్ గా మార్చుకుందాం
సరదాల సందళ్ళతో స్వర్గధామం చేసుకుందాం
కష్టాల కడలి ఎన్నో రోజులుండవు
ఉషోదయం వస్తుంది
జీవితంలో వెలుగు రేఖలు తెస్తుంది
ప్రకృతిని శాసించడం మానుకుందాం
మానవుడు ప్రకృతికి వచ్చిన
అతిధి మాత్రమేనని తెలుసుకుందాం .
-----‐-------------'------------------
✍✍✍✍ తాటిపాముల రమేష్
ZPHS WARDHANNAPET.

1, మే 2020, శుక్రవారం

స్టీరింగ్ తిప్పలు, రచన శ్రీ తాటిపాముల రమేష్

🌴 స్టీరింగ్ తిప్పలు🌴   
చేతులతో స్టీరింగ్ తిప్పకుంటే
బతుకు బండి కదలని వాళ్ళు
రయ్యి రయ్యి మంటూ
సరిహద్దుల్ని చెరుపుకుంటూ
రాష్ట్రాల్ని  దాటుకుంటూ
వాయువేగంతో కదులుతుంటే
విషపురుగు విశ్వరూపం తో
లాక్ డౌన్ బ్రేకులు పడి
కరోనా  పంజరంలో చిక్కుకున్నారు
నిలువ నీడ లేక
ఊరి బయట ఉండిపోయారు
లారీ నే  క్వారంటై న్ గా మార్చుకుని
కాలం  ఎళ్లదీస్తున్రు
చేతిలో ఉన్న పదీ పరక వడిశినయ్
తిండి గింజలు లేక తిప్పలు మొదలైనయ్
ఊరి వైపు చూస్తే అనుమానపు
అడ్డుగోడలు ఎక్కువై అడుగు పెట్టనీయట్లే
దొరికినప్పుడు తిని
లేని నాడు నీళ్లతోనే కడుపు నింపుతున్రు
వాళ్లు మన ఇంటికి ఇనుప చువ్వలు
మన రూఫ్ కు కాంక్రీటును
పప్పులు ,ఉప్పులు, కూరగాయలు
సకలం అందించి సాదిన్రు
మన ఐశ్వర్యం వెనక వాళ్ల
చెమట చుక్కలు దాగున్నాయి
వాళ్లకిప్పుడు కష్టమొచ్చింది
కండ్లల్ల పెట్టుకొని కాపాడాలి
ఆర బెట్టిన కడుపులను
బుక్కెడు బువ్వ తో నింపాలి
ఏ తల్లి  కన్న బిడ్డలో
 మన బిడ్డల్లా చూసుకోవాలి
వారి గమ్యాలకు చేరేవరకు 
మానత్వాన్ని  చిలకరిస్తూ
వాడిపోకుండా చూడాలి

( లాక్ డౌన్ వలన పొరుగు రాష్ట్రాల లారీ డ్రైవర్లు, క్లీనర్లు పడుతున్న కష్టాలు
ఈనాడులో వచ్చిన కథనంపై స్పందన)
-----------------------------------
✍✍✍ తాటిపాముల రమేష్
ZPHS WARDHANNAPET

29, ఏప్రిల్ 2020, బుధవారం

అంతర్మథనం, రచన శ్రీ తాటిపాముల రమేష్

🌴అంతర్మథనం 🌴
గ్లోబలైజేషన్ ఊడలు దిగి
ప్రపంచమే కుగ్రామంగా మారడంతో
సోషల్ స్టేటస్ కోసం
ఉన్న ఊరును, కన్నతల్లిని వదిలేసి
ఆశల అలలతో అమెరికాలో వాలిపోయా
నేర్చుకున్న చదువుకు
న్యూయార్క్ లో కొలువు కొట్టేశా
భుజంపై తెల్లకోటు, చేతిలో స్టేతస్కోప్
సెకండ్ల ముళ్ళుతో పరిగెత్తి
పేరు ప్రతిష్టలు మూటగట్ఠా
ఐశ్వర్యాన్ని కూడ బెట్టా
హార్డిల్స్ లేని జీవితం
ఆహ్లాదంగా సాగుతుంటే
అపరిచితుడు లెక్క
మాయ పురుగు మంది లో చేరి
ఆకు పురుగు లెక్క ఆరగిస్తుంటే
డే అండ్ నైట్ కరోనా పై
జమ్మి చెట్టు మీద దాచిన
ఆయుధాలన్నీ తీసి వాడినా
కంట్రోల్  కాకపోవడంతో
పక్కనున్న పేషట్లు ప్యాక్ కట్టేస్తుంటే
చివరకు కలిగ్స్ కూడా కరోనా కాటుతో
మృత్యువు  కుహరంలోకి  జారుతుంటే
 ఆస్పత్రులన్నీ మరుభూమిగా మారి శవాల గుట్టలుగా దర్శనమిస్తుంటే            
కాలు కదలట్లేదు, చేతులు మెదలట్లేదు
ఒళ్లంతా వైబ్రేషన్,మనసంతా ఎమోషన్
భారంతో గుండె బరువెక్కుతుంది
ఎక్కడి నుండి ఏ వార్త వస్తుందో
ఏ గాలి ఏ దుర్వార్త మోసుకొస్తుందో
అని ఆందోళన , ఆ మహమ్మారి
ఎప్పుడు కబళిస్తొందోనని ఒకటే ఆవేదన
ధైర్యం ఆవిరై,జీవితం చీకట్లు కమ్ముకుంది
లాక్ డౌన్ కు లాక్ తీసేస్తే
సొంతగడ్డపై వాలిపోతా
అమ్మ ఒడిలో వొదిగి పోతా
జన్మభూమి రుణం తీర్చుకుంటా.
( అమెరికాలో ప్రవాస భారతీయ వైద్యుల
మరణాలకు నివాళి తో )
--‐----‐-------------------------
✍✍✍✍✍తాటిపాముల రమేష్
ZPHS WARDHANNAPET .

26, ఏప్రిల్ 2020, ఆదివారం

నీతి కథలు - 18 తోక చివర తెల్ల మచ్చ ఉన్ననక్క

నీతి కథలు - 18

తోక చివర తెల్ల మచ్చ ఉన్ననక్క

అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక నక్క ఉండేది. అది ఎప్పుడూ ఇతర జంతువులకు లేనిపోనివి చెప్తూ భయపెట్టేది. నక్క చెప్పే అబద్ధాలను నమ్మి ఆ జంతువులు భయపడుతూ ఉంటే అది చూసి నక్క ఆనందంగా ఉండేది. రాను రాను నక్కకు ఇదొక వ్యాపకంగా మారింది. ప్రతిరోజూ ఏదో ఒక జంతువునైనా భయపెట్టకపోతే దానికి తోచేది కాదు. ఆ అడవిలో ఒక గుర్రం కూడా ఉండేది. అది అడవిలోని పచ్చిక బయళ్లలో మేస్తూ చాలా అందంగా, ఆరోగ్యంగా ఉండేది. ఎవరి జోలికి పోకుండా వినయంగా ఉండేది. ఒక రోజు నక్క మేత మేస్తున్న గుర్రం దగ్గరకు వచ్చింది. గుర్రం దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దాంతో నక్క ‘అడవిలో జంతువులన్నీ తనను చూస్తే గౌరవంగా, తను చెప్పే కబుర్ల కోసం ఆసక్తిగా ఉంటే ఈ గుర్రం తనను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు, దీని సంగతి చూడాలి’ అనుకున్నది. పైకి గుర్రంతో ‘‘నీకు ఒక ప్రమాదం ముంచుకు రాబోతోంది. నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే వెంటనే ఇక్కడ నుంచి పారిపో’’ అన్నది.

‘‘ఏమిటా ప్రమాదం’’ అని అడిగింది గుర్రం. ‘‘మన మృగరాజు సింహం నిన్ను చంపటానికి వస్తోంది. నేను అక్కడి నుంచే వస్తున్నాను’’ అంది నక్క. నక్క గురించి పూర్తిగా తెలిసిన గుర్రం దానికి బుద్ధి చెప్పాలనుకుంది. ‘‘అంతేనా? నాకు సింహం అంటే భయం లేదులే. దాని గురించి నువ్వు ఆందోళన చెందాల్సిన పని లేదు’’ అని చెప్పి, ‘‘నక్కా... నక్కా... నా సంగతి అలా ఉంచుగానీ మొదట నీ ప్రాణాలు రక్షించుకో’’ అన్నది గుర్రం. నా ప్రాణాలకేమైంది అని అడిగింది నక్క.

మన రాజు సింహానికి ఉన్న ఒక్కగానొక్క పిల్లకు జబ్బు చేసిందట. వైద్యం కోసం ఎలుగుబంటి దగ్గరకు వెళ్తే ‘తోక చివర తెల్ల మచ్చ ఉన్న నక్క రక్తం తాగిస్తే జబ్బు నయం అవుతుంద’ని చెప్పిందట. అప్పటి నుంచి సింహం నీ కోసం వెతుకుతోంది. నువ్వు కనిపిస్తే చంపేస్తుంది. వెళ్లి దాక్కుని నీ ప్రాణాల్ని కాపాడుకో’’ అని చెప్పింది. దాంతో భయపడిపోయిన నక్క వెంటనే అడవిలో దట్టంగా ఉన్న చెట్లమధ్యలో దూరి ఎవరికీ కనపడకుండా నక్కుతూ నక్కుతూ ఇంటికి వెళ్లింది.

మూడు రోజుల తర్వాత ఒక కుందేలు నక్క ఇంటికి వచ్చింది. నక్కకి కనీసం కుందేల్ని పట్టుకునే ఓపిక కూడా లేదు. తన విషయం అంతా చెప్పి ‘సింహం వస్తోందేమో చూసి చెప్ప’మని అడిగింది. ‘‘వామ్మో అటువైపు వెళ్తే తోడేలు చంపుతుందని ఒకసారి నువ్వే చెప్పావు. నేను వెళ్లను, నాకు భయం’’ అన్నది కుందేలు. మరొక రోజు నక్కను చూడడానికి కోతి వచ్చింది, అది కూడా అలాగే అన్నది. గతంలో అనవసరంగా వాటికి లేని పోని భయాలు కల్పించినందుకు నక్క తనని తాను తిట్టుకుంది. వారం రోజుల తర్వాత గుర్రం వచ్చింది. ‘‘సింహం వస్తోందా’’ అని అడిగింది నక్క. ‘‘సింహం రాదు. కావాలనే నీకు అబద్ధం చెప్పాను. ఎందుకంటే నువ్వు అందరికీ లేనిపోనివి చెప్పి భయపెడుతున్నావు కదా? భయం అంటే నీకు తెలియాలనే అలా చెప్పాను’’ అంది గుర్రం. నక్క తప్పు తెలుసుకుని అప్పటి నుంచి జాగ్రత్తగా ఉండసాగింది.

అక్బర్-బీర్బల్ కథలు - 11 బీర్బల్‌ కు ఆస్థానంలో ఉన్నత పదవి

అక్బర్-బీర్బల్ కథలు - 11

బీర్బల్‌ కు ఆస్థానంలో ఉన్నత పదవి

అక్బర్‌ చక్రవర్తి సభలో కొలువుదీరి వున్నప్పుడు ఒక యువకుడు మెల్లగా లోపలికి ప్రవేశించాడు. అక్బర్‌ చూపులు తనమీద పడగానే అతడు వంగి సలాం చేశాడు. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు?' అని అడిగాడు అక్బర్‌ చక్రవర్తి. ప్రభూ! నా పేరు మహేశ్‌దాస్‌. ఆగ్రాకు నాలుగామడల దూరంలో వున్న కుగ్రామం మాది.
ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చాను,'' అన్నాడు ఆ యువకుడు. ``నీకు ఇక్కడ ఉద్యోగం దొరుకుతుందని ఎవరు చెప్పారు?'' అని అడిగాడు అక్బర్‌. ``నా తెలివితేటల్ని చూసి, `నువ్వు చక్రవర్తి దగ్గరికి వెళ్లు, నీకు తప్పక ఉద్యోగం దొరుకుతుంది,' అని మా పంతులే చెప్పారు. ఆయన మాటవిని అంతదూరం కాలినడకనే వచ్చి, అతి ప్రయత్నం మీద తమ దర్శనం చేసుకోగలిగాను ప్రభూ,'' అన్నాడు మహేశ్‌.

``ప్రతి ఉపాధ్యాయుడూ, తన విద్యార్థుల గురించి అలాగే గొప్పగా అంచనా వేస్తాడు. ఉత్తమ అర్హతలు గలవారికి మాత్రమే మేము ఇక్కడ ఉద్యోగలిస్తాం,'' అన్నాడు అక్బర్‌. "నేను ఉత్తముల్లోకెల్లా ఉత్తముడినని రుజువు చేయగలను ప్రభూ,'' అన్నాడు మహేశ్‌ ఎంతో ఆత్మవిశ్వాసంతో. "చేసి చూపు మరి. ఆలస్యం దేనికి?'' అన్నాడు అక్బర్‌.
``అందుకు ప్రభువులు ఒక చిన్న కానుకను దయచేయాలి,'' అన్నాడు మహేశ్‌. ``మొదట ప్రతిభను నిరూపించుకుంటే తప్ప కానుకలు ఇవ్వరు,'' అన్నాడు అక్బర్‌. ``నేను అడిగే కానుకకు దమ్మిడీ ఖర్చుకాదు ప్రభూ!'' అన్నాడు మహేశ్‌. ``అలాగా? ఏమిటది?'' అని అడిగాడు అక్బర్‌. 30 కొరడా దెబ్బలు, ప్రభూ! అన్నాడు మహేశ్‌. అతడి కోరిక విని చక్రవర్తితో పాటు అందరూ ఆశ్చర్యపోయారు.
``నీకేమైనా పిచ్చి పట్టిందా?'' అన్నాడు అక్బర్‌ అసహనంగా. ``ఆ సంగతి తరవాత తెలుస్తుంది. మొదట నేను అడిగింది దయచేసి ఇప్పించండి ప్రభూ,'' అన్నాడు మహేశ్‌ వినయంగా. అక్బర్‌ వెంటనే కొరడా తెప్పించి, దాన్ని తెచ్చిన వాణ్ణి దగ్గరికి పిలిచి, "కొరడాతో వాణ్ణి నిజంగానే కొట్టొద్దు. కొడుతున్నట్టు అభినయిస్తూ, మెల్లగా తాకించు,'' అని చెవిలో చెప్పాడు. భటుడు వెళ్ళి అలా ఝళిపిస్తూంటే, ముందుకు వంగిన మహేశ్‌, ఒకటి, రెండూ... అంటూ లెక్కించి, పది రాగానే, "ఆగు!'' అని అరిచి తలెత్తి అక్బర్‌ చక్రవర్తిని చూస్తూ, "ప్రభూ, కానుకలో నా వాటా నేను పుచ్చుకున్నాను.

ఇక మిగిలిన దాన్ని తమ ఉద్యోగుల్లో ఇద్దరు సమంగా పంచుకుంటారు,'' అన్నాడు. ``ఏమిటి నువ్వంటున్నది?'' అని అడిగాడు అక్బర్‌ అతడు చెబుతున్నది అంతుబట్టక. "అవును ప్రభూ! భవన ద్వారం వద్ద నిలబడ్డ ఇద్దరు కాపలా భటులు ఏదైనా ఇస్తే తప్ప నన్ను లోపలికి వదలనన్నారు. `నా దగ్గర డబ్బులు లేవు. ప్రభువిచ్చే కానుకను మీతో సమానంగా పంచుకుంటాను,' అని మాట ఇచ్చి లోపలికి వచ్చాను ప్రభూ,'' అన్నాడు మహేశ్‌. ``అలాగా!'' అన్నాడు అక్బర్‌ కోపంతో. "వాళ్ళను పిలిపిస్తే అంతా తమకు తెలుస్తుంది,'' అన్నాడు మహేశ్‌. అక్బర్‌ తల పంకించాడు.కొంతసేపటికి ఆ ఇద్దరు భటులూ అక్కడికి రాగానే, ``మిత్రులారా, మీరు నాకెంతో సాయపడ్డారని ప్రభువులకు విన్నవించాను. మీ దయ లేకుంటే నాకు ప్రభువుల దర్శన భాగ్యం లభించేదికాదని చెప్పాను. ఆయన దయచేసిన కానుకలో మీకు తలా ఒక వాటా ఇవ్వాలి కదా. ప్రభువులు ఇప్పిస్తారు. పుచ్చుకోండి,'' అన్నాడు మహేశ్‌.

ఇద్దరు భటులూ, సంతోషంగా తలలూపారు. ఒక భటుణ్ణి ముందుకు రమ్మని, కొరడా పట్టుకున్న వ్యక్తి పది దెబ్బలు కొట్టాడు. ఆ తరవాత రెండవ కాపలాభటుడు కుయ్యో మొర్రో అంటూ మిగిలిన పది కొరడాదెబ్బలూ తిన్నాడు. "ఈ క్షణమే, లంచగొండులైన మిమ్మల్ని, ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాను,'' అన్న అక్బర్‌ చక్రవర్తి, మహేశ్‌ కేసి తిరిగి, "నువ్వు చాలా తెలివైనవాడివి.మీ బడిపంతులు చెప్పింది నిజం. నీ సమర్థత నిరూపించుకున్నావు. ఇప్పుడే నిన్నుపేరుతో నా ఆస్థానంలో ఉన్నత పదవిలో నియమిస్తున్నాను,'' అన్నాడు చిన్నగా నవ్వు తూ.

ప్రశ్న: రైలు వేగంగా వెళుతున్నా రాత్రి వేళల్లో రైలు పెట్టెలోపలి లైట్ల చుట్టూ తిరుగుతున్న పురుగులు అక్కడే ఎలా ఎగరగలుగుతాయి?

ప్రశ్న: రైలు వేగంగా వెళుతున్నా రాత్రి వేళల్లో రైలు పెట్టెలోపలి లైట్ల చుట్టూ తిరుగుతున్న పురుగులు అక్కడే ఎలా ఎగరగలుగుతాయి?

జవాబు: స్టేషనులో ఆగి ఉన్న రైలులో మనం కూర్చొని ఒక బంతినిపైకి విసిరితే, అది తిరిగి మన చేతిలోకే పడుతుంది. అదే వేగంగా వెళుతున్న రైలు పెట్టెలో కూర్చొని బంతిని పైకి విసిరినా అది కూడా మన చేతిలోనే పడుతుంది. బంతి పైకి వెళ్లి తిరిగి వచ్చేలోగా రైలు ముందుకు కదులుతుంది కాబట్టి అది వెనక్కి ఎందుకు పడదనే సందేహం మీకు కలగవచ్చు. దీనికి కారణం రైలు సమ వేగంతో ముందుకు వెళుతుండడమే. మనం బంతిని పైకి విసిరినపుడు మన చేతిలోంచి పైకి గాలిలోకి లేచిన బంతికి కూడా రైలు వేగమే ఉంటుంది. అంటే సమవేగంతో వెళుతున్న రైలుకు ఉండే ధర్మాలన్నీ ఆ రైలులో ఉన్న ప్రయాణికులకు, వస్తువులకు కూడా ఉంటాయన్నమాట. అదే సూత్రం రైలులో లైటు చుట్టూ తిరుగుతున్న పురుగులకు కూడా వర్తిస్తుంది. అంటే ఆ పురుగులు కూడా రైలు వేగాన్ని కలిగి ఉంటాయి. అందువల్లే పురుగులు రైలు నిలకడగా ఉన్నప్పుడు, వేగంగా ఉన్నప్పుడు ఒకే రకంగా లైటు చుట్టూ తిరుగుతుంటాయి.

కరోనా రంగస్థలం

🌴 కరోనా రంగస్థలం🌴
1. నిన్నటి వరకు పిల్లల గుంపుతో
   తల్లి కోడిలా స్కూల్ మైదానమంతా
   తనివితీరా తిరిగి నాను
   సకల నైపుణ్యాలతో బోర్డుపై బోధించి
   కరుణ, దయ, జాలి, ప్రేమ అనే
   పిల్లర్ల పాదులను తవ్వి
   భవిష్యత్ తరాల ను నిర్మించాను
2. నేడు నేను జీవం పోసిన
   పాత్రలు కరోనా రంగస్థలంలో
   అద్భుతంగా నటించి
   అందరి మన్ననలను పొందుతుంటే
   నేను ఆనంద సాగరంలో మునిగి                                   
   పోతున్నాను.
3. లాఠీ పట్టిన చేతులు
   నవరసాలను పండిస్తుంటే
   రోడ్లన్నీ నిశ్శబ్ద రాగాలు ఆలపిస్తుంటే
   ఖాకీల పై జనం పూల వర్షం కురిపిస్తుంటే
   నేను ఆనంద డోలికల్లో తేలిపోతున్నాను
4. తెల్లకోటు వేసినోళ్ళు
   బతికించాలనే ఆరాటం ఒకవైపు
   బతకాలనే పోరాటం మరోవైపు
   మరణాల సంఖ్యను మైనస్ లోకి
   రావడానికి ఊపిర్లు ఊదుతూ
   కరోనా క్లైంట్ లకు
   ఆశల అమృతాన్ని తాగిస్తుంటే
   సబ్బండ వర్గాల నుండి
   ప్రశంసల జల్లుకు తడిసి ముద్దవుతుంటే
   నా కండ్ల నుండి ఆనంద భాష్పాలు
   రాలుతున్నాయి.
5. చీకట్లో లేచి, చీపుర్లను చేతబట్టి
   రోడ్లను నిద్ర లేపి, మలినాలను
   కడిగిపారేస్తున్న సఫాయి కర్మచారులను
   పాలకులు పాదాలు కడుగుతుంటే
   నేను పొంగిపోతున్నాను
6. కరెన్సీ కట్టలను గుట్టలుగా పేర్చి నోళ్లు
   ఘనీభవింఛిన దాతృత్వాన్నికరిగించుకొని
   ముడుచుకున్న మనసులను విప్పుకొని
   రెక్కలొచ్చిన పక్షిలా ఎగిరి వచ్చి
   సహాయపు కుసుమాలను పంచుతుంటే
   రంతి దేవుడికి వారసులయ్యారని
   నేను మురిసి పోతున్నాను
7. పుడమిపై పుడుతున్న
   రాచపుండు లను
   భవిష్యత్ తరాలకు తాకకుండా
   మరింతమంది వైజ్ఞానికులను
   తయారుచేయడానికి
   ఫ్యూచర్ కోసం కరికులం ఫ్రేమ్ ను
   మార్చుకొని నవ్య వ్యూహాలతో
   బోధిస్తూ నవ సమాజాన్ని నిర్మిస్తాను.
--------------------------------------------
✍✍✍✍✍✍✍✍✍
         తాటిపాముల రమేష్
       జడ్.పి.హెచ్.ఎస్ వర్ధన్నపేట.

25, ఏప్రిల్ 2020, శనివారం

ఆహా ఎంతమార్పు -రచయిత షేక్ రంజాన్

ఆహా ఎంతమార్పు
            ......................
కాలుష్యము  తొలగిపోయ్యాను
చెట్టు కొమ్మ  చిగురించెను
ఆకుపైన  సీతాకోకచిలుక
రెమ్మ నుండి  మొగ్గలెన్నో
పూల నుండి   కాయలెన్నో
కాయ రంగు   మారిపొయ్యాను
           ~ఆహా ఎంతమార్పు

ఫ్యాక్టరీలు  మూతపడ్డవి
పర్వతాలు బయటపడినవి
నది జలాలు  రంగుమారేను
నెమలి  నాట్యమాడుతున్నది
కోకిల   పాటపాడుతున్నది
జింక  పరుగులెడుతున్నది
పిచ్చుక   గూడుకడుతున్నది
           ~ఆహా ఎంతమార్పు

జనసాంద్రత  తక్కువయా
శబ్ద కాలుష్యము       తగ్గిపోయి                          
 నీటి కలుషితము కాకపోయా
కలుషిత ఆహారము  లేకపోయా
డ్రైనేజీలు  శుభ్రమయా
దోమలు ఈగలు  లేకపోయా రోగాలు   రాకపాయా
        ~ఆహా ఎంతమార్పు

ఇంటికి   పరిమితమై
ఇల్లు    శుభ్రత చేయచుంటిరి
పాత రోలు  బయట పడే
రోకలి  చేత బూని
మానిసన కారం  దంచుతుంటిరి
గొడ్డు కారం  నూరుతుంటిరి
           ~ఆహా ఎంతమార్పు        
 మూలనున్న   చల్ల కవం
కడవలోన   పెరుగును
చిలికి చిలికి  వెన్నెతీసి
నేయిని  చేస్తుంటిరి
           ~ఆహా ఎంతమార్పు

రచయిత.......
షేక్  రంజాన్
TSUTF జిల్లా కార్యదర్శి ఖమ్మం

24, ఏప్రిల్ 2020, శుక్రవారం

ఏం మాయ చేసావే కరోనా

🌴 ఏం మాయ చేసావే కరోనా 🌴

1. పెన్ను పేపర్ ముట్ట లేదు
    ఫైనల్ పరీక్షలు రాయలేదు
    కరోనా కంగారుతో
    పొట్టే గాండ్లను  పై తరగతులకు
    ప్రమోట్  చేయడం తో
    ఎగిరి గంతేసి సెల్ ఫోన్లు, టీవీలతో
    తీన్మార్ జేస్తుండ్రు.
2 . బాటిల్ లో సుక్క లేక
     ప్లేట్లో లో ముక్క లేక
     బార్ షాపులు తెరుచుకోక
     దోస్త్ గాళ్ళు ఇంటికి రాకా
     రోజంతా పొద్దు పోక
     అలవాటుపడ్డ పాణాలు
     గాయి గాయి  అయితున్నయి.
3. లాక్ టౌన్ కాలం ఎక్కువై
    అత్తా కోడళ్ళ మధ్య
    ఆలుమొగల్ల మధ్య
    చిటపటలు,చిందులు ఎక్కువై
    ఓపిక సహనం తక్కువై
    ఫిర్యాదుల కేసులు
     పరేషాన్ జేస్తున్నయి
4. కూలి నాలి కులవృత్తోల్లకు
    పని లేక కరెన్సీ కష్టాలతో
    శ్రమజీవుల బతుకు సమరం
    దిన దిన గండం తో
    బతుకు సుడిగుండం లా మారింది
5. మందిర్, మసీద్,
    చర్చిలను మూత పెట్టి
    చరిత్రను తిరగబెట్టి
    భగవంతున్ని ఇంటికి తెచ్చి
    మందిరంలో కాదు దేవుడు
    మదిలోనే ఉండాలని నేర్పింది
6.  అమెరికా నీ దెబ్బతో అల్లాడుతుంది
     అందమైన ఐరోపా ఆగమౌతుంది
     విశ్వమంతా ఇసురుకొని
    పసికూనల నుండి పండుటాకుల వరకు
    ఆకు తినే పురుగు లాగా ఆరగిస్తుంది.
7. శాస్త్రీయతకు సవాల్ విసిరి
    ప్రగతి నంతా ప్రశ్నార్ధకం చేసి
    ప్రకృతిని మరిచిన మనిషికి
    జ్ఞానోదయం కలిగించింది.
-------------------------------
✍✍✍ తాటిపాాముల రమేష్
 జడ్.పి.హెచ్.ఎస్ వర్ధన్నపేట.

నీతి కథలు - 17 చిట్టెలుక ఉపకారం

నీతి కథలు - 17

చిట్టెలుక ఉపకారం

ఒక అడవిలో పెద్ద సింహం ఒకటి ఉండేది. ఆ అడవికి రాజుగా అది పెత్తనం చెలాయిస్తూ ఉండేది. ఆ అడవిలోనే చిట్టెలుక కూడా ఉండేది. ఒకరోజు సింహం చెట్టు క్రింద పడుకొని ఉండగా, పక్క ఉన్న కన్నంలోనుంచి చిట్టెలుక అటూ, ఇటూ పరుగెత్తుతూ సింహం కాలును తొక్కింది.అంతే.. సింహానికి పట్టరాని కోపం వచ్చి పంజా విదిలించి, తన కాలుకింద చిట్టెలుక అదిమిపట్టింది. బాగా భయపడిపోయిన చిట్టెలుక గజగజా వణుకుతూ.. మృగరాజా... నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు, ఎప్పుడో ఒకప్పుడు తమరికి ఉపకారం చేసి పెడతానని దీనంగా వేడుకుంది.

చిట్టెలుక మాటలకు సింహం పెద్దగా విరగబడి నవ్వుతూ... "ఏమన్నావు.. నువ్వు నాకు సాయం చేస్తావా..? నా కాలివేలు గోరంత కూడా లేవు. పిసరంత ప్రాణం కలిగిన నువ్వు నాకు ఉపకారం చేస్తావా...? ఎంత విచిత్రం..." అని నవ్వుతూ.. సర్లే బ్రతికిపో.. అంటూ చిట్టెలుకను వదిలిపెట్టింది. దీంతో బ్రతుకుజీవుడా అనుకుంటూ చిట్టెలుక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయింది. కాలం అలా గడవసాగింది. ఒకరోజు అనుకోకుండా సింహం ఒక వేటగాడి వలలో చిక్కుపోయి గింజుకుంటూ కనిపించింది చిట్టెలుకకి. ఎంత గింజుకున్నా వలలోంచి తప్పించుకోలేని సింహం... కొంత సేపట్లో వేటగాడు వచ్చి, తనను బంధించి తీసుకుపోయి బోనులో పెడతాడో, లేక ప్రాణాలే తీస్తాడో... అనుకుంటూ బాధపడసాగింది.

ఇదంతా చూసిన చిట్టెలుక సింహం హీన స్థితిని చూసి జాలిపడింది. సింహాన్ని ఎలాగైనా సరే కాపాడాలనుకుని నిర్ణయించుకున్న చిట్టెలుక గబా గబా వల తాళ్ళంన్నింటినీ కొరకసాగింది. చిట్టెలుక చేస్తున్న పనిని చూస్తున్న సింహం సంభ్రమాశ్చర్యాలకు గురైంది. మొత్తం వల తాళ్ళన్నింటినీ చిట్టెలుక కొరికేయడంతో, సింహం వలనుండి బయటపడింది.

చిట్టెలుక ముఖం చూసేందుకు కూడా సిగ్గనిపించిన సింహం ఇలా అంది... "ఒకరోజు నేను నిన్ను నా కాలుగోటితో సమానమని కించపరిచేలా మాట్లాడాను, ఈసడించుకున్నాను. అవన్నీ మనసులో పెట్టుకోని నీవు, నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టానన్న ఒకే ఒక్క కారణంతో ఈరోజు నన్ను కాపాడావు. నీ గొప్ప మనసు అర్థం చేసుకోలేకపోయాను, నన్ను మన్నించు" అని చిట్టెలుకతో అంది. అవన్నీ ఇప్పుడెందుకు మృగరాజా... మీరు చేసిన సహాయానికి, నేను ఈరోజు మిమ్మల్ని కాపాడాను అంతే..! అని సర్దిచెప్పింది చిట్టెలుక. ఆరోజు నుండి సింహం, చిట్టెలుకలు ఎంతో సఖ్యతగా జీవించసాగాయి.

అక్బర్-బీర్బల్ కథలు - 9నా తిండి తింటే.. పని చేయ్యాల్సిందే..!

అక్బర్-బీర్బల్ కథలు - 9

నా తిండి తింటే.. పని చేయ్యాల్సిందే..!

ఒకసారి అక్బర్ చక్రవర్తి.. తన మందీ మార్బలంతోపాటు బీర్బల్‌ను కూడా వెంటబెట్టుకుని వినోదం కోసం అడవికి వెళ్లాడు. అయితే తన గుర్రం తాను కోరుకున్నంత వేగంగా పరిగెత్తక పోవటంతో అక్బర్‌కు చాలా కోపం వచ్చింది. ఒక కొరడా తీసుకుని దాన్ని కొట్టేందుకు సిద్ధమయ్యాడు.

అది చూసిన బీర్బల్ వెంటనే "మహారాజా.. దయచేసి దాన్ని కొట్టకండి" అంటూ అడ్డుపడ్డాడు. "నా తిండి తింటుంది కాబట్టి అది చచ్చినట్లు కా కోసం పని చెయ్యాల్సిందే. అదలా చేయకపోతే దాన్ని కొట్టే హక్కు నాకుంద"ని బదులిచ్చాడు అక్బర్. అయినప్పటికీ.. "దయచేసి తమరు ఆ గుర్రంమీద జాలి చూపించండ"ని పదే పదే వేడుకున్నాడు బీర్బల్.

"అది సరేగానీ.. నేను నువ్వు చెప్పినట్లుగానే వింటాను. కానీ నా తిండి తిన్న వాళ్లెవరైనా సరే నా పని చేయాల్సిందే" అన్నాడు మొండిగా అక్బర్. ఆ తర్వాత కొంతదూరం వెళ్లిన తరువాత వారికి జింక ఒకటి కనిపించింది. దాన్ని వేటాడి చంపేసి కోటకు తీసుకెళ్దామని అన్నాడు అక్బర్.

అలా ఆ జింకను వేటాడుతూ అక్బర్, బీర్బల్‌లు ఇద్దరూ మిగతా మందీ మార్బలం నుంచి వేరుగా అయిపోయారు. కాసేపటి తరువాత అక్బర్‌కు బాగా ఆకలి వేసింది. మన ఆహార పదార్థాలన్నీ మన వాళ్లవద్దనే ఉండిపోయాయి. ఇప్పుడెలా మహాప్రభూ..? అని అన్నాడు బీర్బల్. అయితే ప్రస్తుతం మనవద్ద గుర్రం తినే దాణా తప్ప మరింకేమీ తినేందుకు లేవని చెప్పాడు బీర్బల్.

"ఏమీ లేని దానికన్నా గుర్రం దాణా అయినా నయమే కదా..? అదే ఇవ్వు" అన్నాడు అక్బర్. దాంతో ఇద్దరూ గుర్రం మెడకు వేళాడుతున్న సంచిలోని గుగ్గిళ్లు తీసుకుని గుప్పిళ్లకొద్దీ తిన్నారు. ఆకలి తీరిన తరువాత అక్బర్.. "ఇక మనవాళ్ల కోసం వెతుకుదాం పదా..?!" అంటూ గుర్రం ఎక్కబోయాడు.

అయితే అసలే ఆకలిగా ఉన్న ఆ గుర్రం అక్బర్‌ను వెనుక కాళ్లతో తన్నింది. కోపంతో ఊగిపోయిన అక్బర్ కొరడాతో దాన్ని బాదేందుకు సిద్ధపడగా బీర్బల్ అడ్డుకున్నాడు. "ఎంత పొగరు, దాన్ని చంపేస్తానంటూ" గుర్రం మీదికి ఉరికాడు అక్బర్. "అయ్యా మీరు అలా చేయలేరు" అన్నాడు బీర్బల్

"ఏం ఎందుకు చేయలేను? నన్ను ఆపవద్ద"ని చెప్పి గుర్రం మీది మీదికి వెళ్లాడు అక్బర్. "అలా చేయటం సరికాదు ప్రభూ..! ఎందుకంటే మీరు ఇప్పుడే దాని తిండి తినేశారు. మీరే దాని పని చేయాలి" అన్నాడు బీర్బల్. బీర్బల్ మాటలకు అక్బర్‌కు కోపం స్థానంలో నవ్వు పలుకరించింది.

"ఏంటి బీర్బల్..? గుర్రంపని నేను చేయటమా..? ఏం చెయ్యాలేంటి..?" నవ్వుతూనే అడిగాడు. మరేం లేదు మహారాజా..! మీరు దాని తిండి తినేశారు కాబట్టి దాని పని చేయాలి. దాని అది పని చేయాలంటే.. దాన్ని మీమీద ఎక్కి స్వారీ చేయనివ్వండి అన్నాడు. దాంతో బీర్బల్ మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించిన అక్బర్.. తన పొరపాటును గ్రహించాడు. ఆ తరువాత బీర్బల్‌ను వెంటబెట్టుకుని ఆ అడవిలో కనిపించకుండా పోయిన తమవాళ్లకోసం వెతుక్కుంటూ వెళ్లిపోయాడు.

ప్రశ్న: నీళ్ల కుళాయిలపై ఏర్పడే తెల్లటి మరకలను నిమ్మరసం ఎలా తొలిగిస్తుంది?

ప్రశ్న: నీళ్ల కుళాయిలపై ఏర్పడే తెల్లటి మరకలను నిమ్మరసం ఎలా తొలిగిస్తుంది?

జవాబు:
నీళ్ల కుళాయిలపై ఏర్పడే తెల్లటి మరకలను నిమ్మరసంతోనే కాకుండా, ద్రాక్షరసం నుంచి తయారు చేసే 'వినిగర్‌'తో కూడా తొలగించవచ్చు. కుళాయిలపై వాటిలో ప్రవహించే నీటిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం అయాన్ల వల్ల ఏర్పడే లవణాల మూలంగా తెల్లని సున్నపు మరకలు ఏర్పడతాయి. ఉప్పునీటిలో ఈ లవణాల శాతం అధికంగా ఉంటుంది. కుళాయిలపై నీటి అణువులు భాష్పీభవనం చెందిన తర్వాత ఈ మరకలు శాశ్వతంగా ఉండిపోతాయి. వీటిని ఏ రసాయనిక ద్రావకం ద్వారానైనా తొలగించవచ్చు. కానీ అతి గాఢత కలిగిన ఆ ద్రావకాల వల్ల రసాయనిక చర్యలు జరిగి కుళాయిలు తయారయిన లోహాలు కరిగిపోయే ప్రమాదం ఉంది. కానీ కుళాయిలపై సున్నపు మరకలు పడిన ప్రదేశాలను అతి తక్కువ గాఢత ఉండే నిమ్మరసం లేక వినిగర్‌తో రుద్దితే, నిమ్మరసంలోని సిట్రిక్‌ ఆమ్లం, వినిగర్‌లో ఉండే ఎసిటిక్‌ ఆమ్లం, ఆ కుళాయిలకు అంటుకుపోయిన తెల్లటి సున్నపు మరకలను అంటే ఆ లవణాలను తొలగిస్తాయి. తర్వాత ఆ ప్రదేశాలను నీటితో కడిగితే, కుళాయిలు మునుపటి లాగే మెరుస్తుంటాయి.

23, ఏప్రిల్ 2020, గురువారం

మాయ రోగం మమ్మల్నేం జేస్తది

🌴మాయ రోగం మమ్మల్నేం జేస్తది 🌴
1. పలుగు పార పట్టేటోళ్ళం
     మేడి పట్టి దుక్కి దున్నేటోళ్ళం 
     నాటు, కలుపు,కోత కోసేటోళ్లం
     పుట్ల కొద్దీ తూర్పార బట్టి
     ఎడ్ల బండ్ల కు ఎత్తేటోళ్ళం
     మాయ రోగం మమ్మల్నేం జేస్తది
2.  కొండలను పిండి చేసి
      బండలను చిట్లగొట్టి
      ఫూటు రౌతు ఎత్తెటోళ్ళం
      ఇటుక ఇటుకను పేర్చి
      ఇండ్లను కట్టెటోళ్ళం
      మాయరోగం మమ్ముల్నేం జేస్తది.
3.    పోగు పోగు పేర్చి
       కన్నీళ్లతో కండెలను చుట్టి
       అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి
       ప్రపంచాన్ని అబ్బురపరచినోళ్ళం
       మోకు ముస్తాదు చేతబట్టి
       కత్తి పట్టి కల్లును గీసేటోళ్ళం
       మాయ రోగం మమ్ముల్నేం జేస్తది
4.   మట్టిలో కెమిస్ట్రీని మిక్స్ చేసి
       చక్రంతో మనసు దోచే
       మట్టి పాత్రలు చేసేటోళ్ళం
       కత్తి, బ్లేడు ను చేతబట్టి
        స్టైల్ గా కటింగ్ చేసేటోళ్ళం
       మాయ రోగం మమ్ముల్నేం జేస్తది
5.    డప్పు కొట్టి దరువు వేసేటోళ్ళం
       మేడ మిద్దెలకు రంగులద్దెటోళ్ళం
       కష్టాల కావడిని మోస్తూ
       కలవరం చెందకుండా
       సబ్బండ వర్గాలు
       సవాల్ గా తీసుకుంటాం
      కరోనా అంతమే
      మా పంతంగా కదులుదాం.
6.   కాలు బయట పెట్టకుండా
      నీ గొలుసును కత్తిరిస్తం
     సానిటైజర్లను వాడి
     నీకు సమాధి కడతాం
     పిడికిలెత్తి పోరు సల్పి
     నిన్ను పొలిమేర దాటిస్తాం.
------------------------------------------
✍✍✍ తాటిపాముల రమేష్
 జడ్పీహెచ్ఎస్ వర్ధన్నపేట.

నీతి కథలు - 15 కుందేలుకు గుణపాఠం

నీతి కథలు - 15

కుందేలుకు గుణపాఠం

కుందేలు, తాబేలు స్నేహితులు. కుందేలుకు తను తెల్లగా అందంగా ఉంటానని, వేగంగా పరుగెత్తగలనని గర్వంగా ఉండేది. ఒకరోజు కుందేలుకు తాబేలును ఏడ్పించాలని పించింది. ‘‘మిత్రమా! రేపు మా ఇంటికి వస్తావా? నీ కోసం రుచికరమైన ఆహారం సిద్ధం చేస్తాను. సరిగ్గా భోజనాల వేళకు రావాలి’’ అంది. ‘సరే’ అంది తాబేలు.

తాబేలు వేగంగా నడవలేకపోవడంతో, కుందేలు ఇంటికి ఆలస్యంగా చేరుకుంది. ‘‘నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు మిత్రమా! ఇంతసేపూ చూసి నేను తినేశాను’’ అంది కుందేలు నవ్వు బిగపట్టుకుంటూ. తాబేలుకు కుందేలు ఉద్దేశ్యం అర్థమైంది. ఎలాగైనా దానికి గుణపాఠం చెప్పాలనుకుంది. కొద్దిరోజుల తరువాత తాబేలు కుందేలును తన ఇంటికి విందుకు పిలిచింది. కుందేలు... తాబేలు చెప్పిన సమయం కంటే ముందే వెళ్ళింది. ‘‘కాళ్ళు కడుక్కుని రా నేస్తం. భోజనం సిద్ధంగా ఉంది’’ అంది తాబేలు.

గుమ్మం అవతల నల్లటి తారును పూసి ఉంచింది తాబేలు. కుందేలు నుయ్యి దగ్గర కాళ్ళు కడుక్కుని, గడప దాటి లోపలికి అడుగుపెట్టగానే ‘‘అయ్యో! నీ కాళ్ళకు నల్లగా ఏదో అంటుకుంది. శుభ్రం చేసుకునిరా!’’ అంది. కుందేలు అలాగే చేసింది. ఈసారి కూడా దాని కాళ్ళకు తారు అంటుకుంది. తాబేలు మళ్ళీ పంపించింది. ఇలా చాలాసార్లు జరిగింది. కుందేలు అలసిపోయి గుమ్మం దగ్గరే కూలబడి, ‘‘నువ్వు కావాలనే ఇలా చేస్తున్నావు కదూ!’’ అంది. ‘‘అవును. నేను నెమ్మదిగా నడుస్తానన్న విషయం నీకు తెలిసి కూడా నన్ను వెక్కిరించావు. నువ్వు చేసిన తప్పును నీకు తెలియాలనే ఇలా చేశాను. నిన్ను బాధ పెడితే నన్ను క్షమించు. రా భోజనం చేద్దాం’’ అంటూ పిలిచింది తాబేలు. దానితో కుందేలు తన తప్పు తెలుసుకుంది.

అక్బర్-బీర్బల్ కథలు - 8 ధనికుడైనందుకు ప్రాప్తించిన శిక్ష...!

అక్బర్-బీర్బల్ కథలు - 8

ధనికుడైనందుకు ప్రాప్తించిన శిక్ష...!

ఒకరోజు అక్బర్‌ పాదుషా తన మంత్రి బీర్బల్‌‌తో కలిసి వేటకు బయలుదేరాడు. అది చలికాలం కావడంతో చలి విపరీతంగా ఉంది. కొంతదూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకు దారి ప్రక్కన ఒక పేదవాడు పడుకుని కనిపించాడు. ఆ మనిషి శరీరం మీద ఒక చిరిగిన అంగీ తప్ప మరే వస్త్రం లేదు.

అక్బర్‌ ఆ మనిషిని పరీక్షగా చూసి.. "బీర్బల్..‌! ఈ వ్యక్తి మరణించినట్లున్నాడు కదూ..?" అని ప్రశ్నించాడు. బీర్బల్‌ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి పరీక్షగా చూసి, "లేదు ప్రభూ..! ఈ వ్యక్తి మరణించలేదు. ఆదమరచి నిద్రపోతున్నాడ"ని చెప్పాడు.

బీర్బల్‌ మాటలపై నమ్మకం కలగకపోవటంతో అక్బర్‌... "క్రింద పరుపులేదు. కప్పుకోవడానికి కంబళిలేదు క్రింద రాళ్ళు, రప్పలు, పైన చలి యింత చలిలో విశ్రాంతిగా నిద్రించడం ఎవరికైనా సాధ్యమా...? ఇతడు నిశ్చయంగా మరణించాడు" అని అన్నాడు. "లేదు ప్రభూ...! ఇతను మంచి నిద్రలో ఉన్నాడు. ఇటువంటి నిద్ర మీకూ, నాకు కూడా పట్టద"ని చెప్పాడు బీర్బల్‌.
కష్టపడకపోతే ఇంతే మరి...!!

వెంటనే అక్బర్‌ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి పరిశీలనగా చూశాడు. ఆ మనిషి గాఢనిద్రలో ఉన్నట్లుగా గ్రహించి ఆశ్చర్యపోయాడు. వెంటనే... "బీర్బల్...‌! నువ్వన్నట్లుగానే ఈ వ్యక్తి గాఢనిద్రలో ఉన్నాడు. కానీ యితనికి ఈ రాళ్ళ మీద యింత చలిలో ఎలా నిద్ర పట్టిందో నాకు అర్థం కావడం లేద"ని అన్నాడు.

"జహాపనా...! ధనికుడై ఉండడానికి, నిద్ర పట్టడానికి ఏమీసంబంధంలేదు. నిద్ర ష్టపడితేనే వస్తుంది. ఈ పేదవాడు కష్టపడి పనిచేసి అలసిపోయాడు. అందువల్లనే ఇతనికి గాఢనిద్ర పట్టింది. ఇటువంటి సుఖనిద్ర కష్టపడితేనే లభిస్తుంద" ని వివరించి చెప్పాడు బీర్బల్‌.

అయినప్పటికీ... బీర్బల్‌ మాటలపై అక్బర్‌కు నమ్మకం కలుగలేదు. "అది కాదు బీర్బల్‌..! ఈ వ్యక్తికి ధనవంతుల ఆహార పానీయాలూ, నిద్రపోవడానికి హంసతూలికా తల్పాలు వుంటే... ఇతడు ఇంతకంటే గాఢంగా నిద్రపోగలడు కదా..!" అని అన్నాడు అక్బర్. "హుజూర్...‌! మీరు అన్న మాటలు నిజంకావు. కావాలంటే ఇతనిని కొంతకాలం ధనవంతునిగా చేసి చూడండి" అని చెప్పాడు బీర్బల్‌ .

దీంతో.. తాను చెప్పిన మాటలే నిజమని నిరూపించాలని నిశ్చయించుకున్నాడు అక్బర్‌ చక్రవర్తి. ఆ వ్యక్తిని నిద్ర నుండి లేపి తన వెంట రాజభవనానికి తీసుకువెళ్ళాడు. ఆ వ్యక్తి నివసించడానికి సకల సౌకర్యాలతో ఒక ప్రత్యేక భవనం ఏర్పాటు చేశాడు. రుచికరమైన ఆహార పానీయాలు, విశ్రాంతి తీసుకోవడానికి కావలసిన హంసతూలికాతల్పం వగైరా అన్ని ఏర్పాట్లు చేయిం చాడు.

కష్టపడి కాయకష్టం చేసుకునే ఆ వ్యక్తికి ఆ రాజ భవనంలో తినడం విశ్రాంతి తీసుకోవడం తప్ప, వేరే పనేమీ లేకుండా పక్షంరోజులు గడిచిపోయాయి. ఒకనాడు అక్బర్‌ ఆ వ్యక్తిని గురించి బీర్బల్‌ని అడిగాడు. "ప్రభూ..! ఆ నకిలీ ధనికుడికి మూడు దినాలుగా జ్వరం" అని చెప్పాడు. ఆ మాట వినగానే ఉలిక్కిపడ్డ అక్బర్... "అంటే అతనికి విశ్రాంతి లేదన్నమాట, ఎవరి నిర్లక్ష్యంవల్ల ఇలా జరిగింద..?"ని ప్రశ్నించాడు.

"జహాపనా...! నాలుగు రోజుల క్రితం సాయంత్రం ఈయన బండిలో కూర్చుని షికారు వెళ్ళాడు. దారిలో చలిగాలి తగిలింది. దాంతో అతనికి జలుబు చేసి జ్వరం వచ్చింది" అని చేప్పాడు బీర్బల్‌ . "చలి నుండి రక్షించుకోడానికి ఆ సమయంలో అతని దగ్గర కంబళి లేదా..?" అని ప్రశ్నించాడు అక్బర్‌. "లేకేం ప్రభూ...! ఆ మనిషి మీద తమకు అపార దయ ఉంది ఇంక వస్త్రాలకు లోటేమిటి..? అతని తల నుండి కాళ్ళ వరకూ ఉన్ని వస్త్రం కప్పి ఉంది. అయినా అతనికి జలుబు చేసింద"ని చెప్పాడు బీర్బల్‌.

"అతనికి నిద్ర బాగా పడుతున్నది కదూ..?" అడిగాడు అక్బర్‌. "ఏపూటా సరైన నిద్రలేదు. హంసతూలికాతల్పం మీద విశ్రమించిన పిదప నౌకర్లు కాళ్ళుపడితే కాసేపు నిద్ర పోగలుగుతున్నాడని" చెప్పాడు బీర్బల్‌. "ఏం..? ఎందుకని..? అక్కడ రోడ్డు ప్రక్కన చిరిగిన బట్టలతో పడుకున్నప్పుడు చలివేయలేదు. ఇక్కడ ఉన్ని వస్త్రం కప్పుకున్నా చలి వల్ల జలుబు చేసింది. అక్కడ అతను రాళ్ళ మీద హాయిగా నిద్రపోగలిగాడు. ఇక్కడ హంసతూలికా తల్పం మీద పడుకున్నా నిద్రపట్టడం లేదు. ఎంత ఆశ్చర్యం?" అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు అక్బర్.

"దీంట్లో ఆశ్చర్యపోయేందుకు ఏమీలేదు ప్రభూ..! అతడు పాపం ధనికుడై కష్టాలపాలయ్యాడంతే.." అన్నాడు బీర్బల్‌. "రాళ్ళురప్పలపై హాయిగా నిద్రించిన వ్యక్తి హంసతూలికాతల్పం మీద నిద్రించలేకపోతున్నాడు. ఇది ధనికుడైనందు వలన అతడికి కలిగిన శిక్ష. ఇంతకు ముందు ఇతడు పగలంతా కష్టపడి పనిచేసేవాడు. అందువలన అతని శరీరం ఆరోగ్యంగా ఉండేది. దాంతో మంచి నిద్రపట్టేది. ఇప్పుడు మీరు ఇతనికి విశ్రాంతినిచ్చి సుకుమారంగా తయారు చేశారు. మామూలు చలి, వేడి కూడా ఇతను ఇప్పుడు భరించలేకపోతున్నాడ"ని వివరించి చెప్పాడు బీర్బల్‌.

అక్బర్‌కు ఇప్పుడు కూడా బీర్బల్‌ మాటలపై నమ్మకం కలుగలేదు. ఆ రాత్రి ఆయన బీర్బల్‌ని వెంట బెట్టుకుని ఆ నకిలీ ధనవంతుడున్న భవంతికి వెళ్ళాడు. అక్కడ ఆ వ్యక్తి మంచం మీద నిద్రపట్టక అవస్థపడుతున్నాడు. "ఆ వ్యక్తికి ఎందుకని నిద్రపట్టడం లేద"ని బీర్బల్‌ని అడిగాడు అక్బర్.

"జహాపనా..! అతని పక్కమీద ఏదో ఉండి గుచ్చుకుంటోంది. అందుకే అతనికి నిద్ర పట్టలేదు" అన్నాడు బీర్బల్. బీర్బల్‌ లోపలికి వెళ్లి అతని తల్పాన్ని పరీక్షించాడు. దుప్పటి కింద ఒక ప్రత్తి గింజ కనిపించింది. దాన్ని అక్బర్‌కి చూపించి "చూడండి ప్రభూ..! దీని కారణంగా ఈ కొత్త ధనికుడికి నిద్రపట్టడం లేద"ని అన్నాడు.


"ఇంతకు ముందు ఇతనికి రాళ్ళు కూడా గుచ్చు కోలేదు. ఇప్పుడు ఈ చిన్న విత్తనం ఇతనికి కష్టం కలిగింది. మీరు ఇతని చేత్తో పక్కకూడా దులపనివ్వడం లేదు. ఇది ధనికుడైనందుకు ప్రాప్తించిన శిక్ష. కష్టపడి పనిచెయ్యకపోవడమే దీనికి కారణం" అని అక్బర్‌తో అన్నాడు బీర్బల్. అప్పటికి బీర్బల్‌ మాటలతో ఏకీభవించిన అక్బర్.. మరునాడు ఆ వ్యక్తిని రాజ భవనం నుంచి పంపిస్తూ.. ముందులాగే కష్టపడి, శ్రమించి సుఖంగా జీవించమని చెప్పి రాజభవనం నుంచి పంపించేశాడు అక్బర్..!

ప్రశ్న: అన్ని దేశాల్లో కరెన్సీ విలువ ఒకటే ఉండదు ఎందుకు?

ప్రశ్న: అన్ని దేశాల్లో కరెన్సీ విలువ ఒకటే ఉండదు ఎందుకు?

జవాబు:
ప్రతి దేశానికీ ఆయా దేశపు సంస్కృతి చరిత్ర, మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు రాజకీయ విధానం ఉంటాయి. దేశాలు వేర్వేరు అయినా మానవులందరికీ ఆహారం, గాలి, నీరు వంటి ప్రాథమిక అవసరాలతో పాటు వాహనాలు, నగలు, కంప్యూటర్లు, కాగితం, పుస్తకాలు, భవనాలు, లోహ పరికరాలు, మందులు, చెప్పులు, మోటార్లు, పెన్నులు, రంగులు, కళ్లద్దాలు, ఎరువులు, విమానాలు మొదలైన వేలాది వస్తువులు, పరికరాలు సాధారణం. అయితే అన్ని వస్తువులు, అన్ని దేశాల్లో, అన్ని స్థాయిల్లో అన్ని రుతువుల్లో తయారు కావు. ఇచ్చి పుచ్చుకోవడం అవసరం. భారతదేశంలో తయారయ్యే కొన్ని వస్తువులు, సేవలు అమెరికాకు, అమెరికాలో ఉత్పత్తి అయ్యే పరికరాలు సేవలు భారత దేశానికీ అవసరం. మన వస్తువును ఇచ్చి అదే సమయంలో వారి వస్తువును మార్పిడి చేసుకునే వస్తు మార్పిడి విధానం వల్ల సమస్యలున్నాయి కాబట్టి ఈ రోజు మనం కొన్ని వస్తువులను అమెరికాకు ఇచ్చి దానికి సంబంధించిన గుర్తుగా ఒక టోకెన్‌ తీసుకుంటాం. అదే టోకెన్‌ను రేపు నేను వారికి ఇచ్చి వారి వస్తువుల్ని తీసుకోగలను. మానవ శ్రమ వల్లనే వస్తువులకు విలువ ఏర్పడ్డం వల్ల బల్ల విలువ, సెల్‌ఫోను విలువ ఒకేలా ఉండదు. కాబట్టి టోకెన్ల సంఖ్య మార్పిడి చేసుకొనే వస్తువు మీద ఆధారపడి ఉంటుంది. ఇలా వస్తుమార్పిడి వేర్వేరు దేశాల్లోనే కాకుండా ఒకే దేశంలో వేర్వేరు ప్రజలకు అవసరం అవుతుంది. కాబట్టి టోకెన్లు అంతర్జాతీయంగా, జాతీయంగానూ అవసరం. ఆ టోకెన్లనే కరెన్సీ అంటారు. రూపాయి మన కరెన్సీకి ప్రమాణం. అమెరికాకు డాలర్‌ ప్రమాణం, ఐరోపా దేశాలకు యూరో ప్రమాణం.

అంతర్జాతీయంగా బంగారాన్ని ప్రమాణంగా ఎంచుకున్నారు. అత్యంత విలువైంది. కాబట్టి మన దేశంలో 10 గ్రాముల్ని దాదాపు 30 వేల రూపాయలకు అమ్మితే అమెరికాలో 500 డాలర్లు పెడితే 10 గ్రాములు వస్తుంది. అంటే 500 డాలర్ల విలువ 30 వేల రూపాయల విలువ సమానం. మరో మాటలో చెప్పాలంటే ప్రతి డాలరుకు ఆ సమయంలో 60 రూపాయల మారకం విలువ అన్నట్టు అర్థం. ఐరోపాదేశాలు కూడబలుక్కుని తమదేశాల్లో ఉన్న వివిధ రకాల కరెన్సీలకు ప్రత్యామ్నాయంగా 'యూరో'ను సార్వత్రికంగా వాడుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ పరస్పర అవగాహనకు వస్తే ఒకే కరెన్సీని చలామణీ చేసుకోవడం అసాధ్యం కాదు.

22, ఏప్రిల్ 2020, బుధవారం

అక్బర్-బీర్బల్ కథలు - 7 చుక్కల్ని మూటకట్టిన బీర్బల్...!!

అక్బర్-బీర్బల్ కథలు - 7

చుక్కల్ని మూటకట్టిన బీర్బల్...!!

మొగలాయి చక్రవర్తులలో అక్బర్ గొప్పవాడు. హాస్యప్రియుడయిన అక్బర్ ఒకరోజు రాజ ప్రాసాదంపై నిలబడి ఆకాశంవైపుకి చూశాడు. ఆకాశంలో మిలమిలా మెరిసే నక్షత్రాలు లెక్కలేనన్ని కనిపించాయి. వాటిని చూడగానే ఆయనకు ఒక కోరిక కలిగింది. ఆ కోరికలోని చిలిపితనానికి ఆయనకే నవ్వు వచ్చి, కిసుక్కున నవ్వేశాడు.

తెల్లారగానే సభకు వచ్చాడు అక్బర్ చక్రవర్తి. అందరూ ఎవరి స్థానాలలో వారు కూర్చుని ఉన్నారు. అప్పుడు చక్రవర్తి మాట్లాడుతూ... మీలో ఎవరైనా సరే ఆకాశంలో కనిపించే చుక్కల్ని లెక్కపెట్టి, అవెన్ని ఉన్నాయో ఖచ్చితంగా చెప్పాలి. అలా చెప్పినవారికి వెయ్యి బంగారు నాణాలను బహుమతిగా ఇస్తానని చెప్పాడు.

నక్షత్రాలను లెక్క పెట్టేందుకు ఓ పదిహేను రోజుల గడువును కూడా తీసుకోవచ్చునని కూడా చెప్పాడు అక్బర్ చక్రవర్తి. దీంతో సభలోని వారందరూ ఆలోచనలో పడ్డారు. అయ్యో..! ఆకాశంలో లెక్కకు మించి ఉన్న నక్షత్రాలను లెక్కగట్టి, ఖచ్చితమైన లెక్కను ప్రభువుకు చెప్పాలా..? అదెలా సాధ్యమవుతుందని అందరూ తమలో తాము అనుకోసాగారు.
ఆవగింజల్ని లెక్కపెట్టారట..!

అప్పుడు బీర్బల్ లేచి... మహారాజా..! మీరు చెప్పినట్లు చుక్కలు లెక్కపెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. దానికి మహారాజు సరేనని అన్నాడు. ఇక ఆరోజు నుంచి బీర్బల్ ఏకధాటిగా చుక్కల్ని లెక్కపెట్టడం ప్రారంభించాడు. అలా పదిహేను రోజులు గడిచాయి. ఆ మరుసటిరోజు సభకు వచ్చాడు.

మహారాజా..! మీరు చెప్పినట్లుగానే చుక్కలన్నింటినీ లెక్కపెట్టాను. అయితే నోటితో లెక్కపెట్టలేకపోయాను. కాగితంపై కూడా రాసేందుకు వీలు కాలేదు. అందుకే ఒక ఆవాల బస్తా దగ్గర పెట్టుకుని ఒక్కో నక్షత్రాన్ని చూస్తూ, ఒక్కో ఆవగింజను ఈ సంచిలో వేశాను. మొత్తం పదిహేను రోజులూ ఇలాగే చేశాను. కాబట్టి, ఈ సంచిలో ఎన్ని ఆవగింజలున్నాయో, ఆకాశంలో అన్ని చుక్కలున్నాయి మహాపభ్రూ అంటూ... మూట విప్పి ఆవాలను కుప్పగా పోశాడు.

ఆవాలను చూసిన అక్బర్ చక్రవర్తి... నవ్వుతూ చాలా ఉన్నాయే అని అన్నాడు. మహారాజా.. మీకు నమ్మకం లేకపోతే ముందు ఈ ఆవగింజలన్నింటినీ లెక్కపెట్టించండి. తరువాత నక్షత్రాలను లెక్క పెట్టించండి. అందరి అనుమానం తీరిపోతుందని తెలివిగా బదులిచ్చాడు బీర్బల్.

బీర్బల్ యుక్తిని మెచ్చుకున్న అక్బర్ చక్రవర్తి.. సంతోషంగా తాను ఇస్తానను వెయ్యి బంగారు నాణాలను బహుమానంగా ఇచ్చాడు. సభలోనివారంతా కూడా బీర్బల్ తెలివితేటలను మెచ్చుకుని హాయిగా నవ్వుకోసాగారు.

నీతి కథలు - 14 వర్తకుడి సమయస్ఫూర్తి

నీతి కథలు - 14

వర్తకుడి సమయస్ఫూర్తి

ఒకసారి ఒక సామంతరాజు దగ్గరకు ఒక గుర్రాల వర్తకుడు వచ్చాడు. అతనితో పాటు ఒక గుర్రం కూడా ఉంది. ‘‘ప్రభూ! నా దగ్గర ఈ గుర్రంలాంటి మేలైన, నాణ్యమైన గుర్రాలున్నాయి. అవి మీ అశ్వశాలలో తప్పకుండా ఉండవలసినవి. వాటిలోంచి మీకోసం ఏరికోరి ఈ గుర్రాన్ని తీసుకువచ్చాను’’ అని విన్నవించుకున్నాడు.

‘‘అలాగా... దీని ధర ఎంత చెప్తున్నావు?’’ అని అడిగాడు రాజు.‘‘ఎంతో కాదు, మహారాజా... రెండువందల బంగారు నాణాలు ఇవ్వండి చాలు’’ అన్నాడు వర్తకుడు. ‘‘ధర చాలా ఎక్కువ? రెండువందల బంగారు నాణాలకి నేను పది గుర్రాలు కొంటున్నాను’’ అన్నాడు రాజు. ‘‘ప్రభూ! దీన్ని ప్రత్యేకించి మీకోసమే తెచ్చాను. మీకు ఇష్టమైన ధర ఇచ్చి ఈ ఒక్కదానిని తీసుకోండి’’ అని ప్రాధేయపూరకంగా అన్నాడు వర్తకుడు. 

రాజు ఇరవై బంగారు నాణాలకు బేరం కుదిర్చాడు. అప్పటికప్పుడే ధనం తెప్పించి వర్తకుడికి ఇచ్చాడు. వర్తకుడు తన చేతిలో ధనం పడగానే గబుక్కున గుర్రం ఎక్కి పారిపోసాగాడు. ఆ సంఘటనతో రాజు బిత్తరపోయాడు. అక్కడే ఉన్న సైనికాధికారులు గుర్రాలను అధిరోహించి వర్తకుడిని పట్టుకోవడానికి అతని వెంటే పరుగెత్తారు. 

చాలాసేపటికి సైనికాధికారులు ముఖాలు వేలాడేసుకుని ఒట్టి చేతులతో తిరిగి వచ్చారు. రాజు వర్తకుడిని పట్టుకోలేకపోయినందుకు సైనికాధికారులను కేకలేశాడు. అయితే ఆ మరునాడు వర్తకుడు అదే గుర్రంతో తిరిగి ఆస్థానానికి రావడం చూసి రాజు ఆశ్చర్యపోయాడు.  వర్తకుడు వినయంగా రాజుకు నమస్కరించి ‘‘ప్రభూ! నా గుర్రాల పనితనాన్ని, నాణ్యతను మీకు తెలియజేయాలని అలా చేశాను. నన్ను క్షమించండి’’ అన్నాడు.

వర్తకుడి సమయస్ఫూర్తికి, తెలివితేటలకు రాజు ఎంతగానో సంతోషించాడు. వర్తకుడి దగ్గర ఉన్న గుర్రాలన్నింటినీ అతడు చెప్పిన ధర చెల్లించి కొన్నాడు రాజు.

ప్రశ్న: స్నానం చేసేటపుడు, బట్టలు ఉతికేప్పుడు సబ్బులు మురికిని ఎలా వదిలించగలవు?

ప్రశ్న: స్నానం చేసేటపుడు, బట్టలు ఉతికేప్పుడు సబ్బులు మురికిని ఎలా వదిలించగలవు?

జవాబు:
మనం వేసుకొనే వస్త్రాల మీద, శరీరం మీద చేరే మురికి కణాలు రెండు రకాలు. కొన్ని నూనె లాంటి జిడ్డు పదార్థాలకు చెందినవైతే, మరికొన్ని విద్యుదావేశాలు కలవి. గాలిలోని కణాలు ఒకదానిని మరొకటి రాసుకోవడం వల్ల వాటికి విద్యుదావేశం కలుగుతుంది. మామూలుగా నీటిలో ముంచి బట్టలు ఉతకడం వల్లకానీ శరీరంపై నీరు పోసుకుని రుద్దుకోవడం వల్ల కానీ ఈ మురికి కణాలు సులభంగా తొలిగిపోవు. పైగా ఉతకడం వల్ల, రుద్దడం వల్ల ఈ కణాలలో విద్యుదావేశం తొలిగిపోయి బట్టలకు, ఒంటికి అంటుకుపోతాయి. నూనె కణాలు నీటితో కలవక పోవడం వల్ల అవి మరీ అతుక్కుపోతాయి. సబ్బు వివిధ రకాల రసాయనిక పదార్థాల సమ్మేళనం. సబ్బులోని రసాయనిక అణువులకు ఉన్న ప్రత్యేక ధర్మం, అణు నిర్మాణం మూలంగా అవి మురికిలోని జిడ్డుతో కూడిన కణాలకు, విద్యుదావేశం ఉన్న కణాలకు అంటుకుంటాయి. తర్వాత నీరు పోసి ఉతకడం గానీ, రుద్దడం కానీ చేయగానే సబ్బుకణాలు మురికి కణాలను తమతో పాటు, గుడ్డలనుంచి, ఒంటి నుంచి తొలగిస్తాయి.

స్నానానికి వాడే సబ్బుల్లో మురికిని తొలగించే రసాయన పదార్థాలతో పాటు సువాసన వెదజల్లే పదార్థాలు కూడా ఉండటం వల్ల మనకి ఆహ్లాదంగా అనిపిస్తుంది.

21, ఏప్రిల్ 2020, మంగళవారం

నీతి కథలు - 13 చిత్రకారుడి సమయస్ఫూర్తి

నీతి కథలు - 13

చిత్రకారుడి సమయస్ఫూర్తి

కొండవీడు రాజ్యానికి సుదర్శనుడు అనే రాజు ఉండేవాడు. చక్కని రూపం, ఎంచక్కని తెలివితేటలతో సుందరాంగుడు అనేట్టుగా వుండే ఆయనకు పుట్టుకతోనే చిన్న అవలక్షణం ఉండేది. ఎడమకన్ను కాస్త మెల్లగా ఉండటమే ఆ అవలక్షణం.ఆయన అందం గురించి అందరూ మెచ్చుకుంటూంటే పైకి సంతోషించినా మెల్లకన్ను గురించి కాస్త బాధపడేవాడు. అందరూ మెచ్చుకునే తన అందమైన రూపం చిత్రపటంలో చూసుకోవాలనిపించింది సుదర్శనుడికి. ఆ విషయమే మంత్రి మాధవుడితో చెప్పాడు.

వెంటనే ‘రాజుగారి అందమైన చిత్రం గీసిన వారికి విలువైన బహుమతులు అందిస్తా’మంటూ రాజ్యమంతా దండోరా వేయించాడు మంత్రి. ఆ వార్త విన్న రాజ్యంలోని చిత్రకారులంతా ఎంతో ఆనందించారు. కాని రాజును చూడగానే వారి ఆనందం ఆవిరై పోయింది. రాజుకున్న మెల్లకన్ను చిత్రంలో చూపిస్తే ఆయన ఆగ్రహానికీ, ఆ పైన వేసే శిక్షను ఊహించుకుని వచ్చిన చిత్రకారులంతా ప్రాణభయంతో బతుకుజీవుడా అంటూ మళ్లీ వస్తామంటూ వెళ్లిపోయారు. చివరికి రాజాస్థానంలో ధైర్యంగా ముగ్గురు చిత్రకారులు ధైర్యంతో మిగిలారు. సింహాసనంపై ఠీవిగా కూర్చున్న సుదర్శనుణ్ని చూస్తూ బొమ్మలు గీయడానికి సిద్ధమయ్యారు ఆ ముగ్గురు చిత్రకారులు.


గంటసేపు కష్టపడి ముగ్గురూ ఎవరికి వారు రాజుగారి చిత్రాలు గీయటం పూర్తి చేశారు. అందులో మొదటి చిత్రకారుడు తాను గీసిన చిత్రం తీసుకెళ్లి రాజుకి చూపించాడు. అచ్చం రాజుగారిలా వున్న చిత్రానికి రాజుగారికి మల్లే మెల్లకన్నూ యధావిధిగా చిత్రించాడు అతడు. అది చూసిన రాజు ఊహించినట్టుగానే ఉగ్రుడై చిత్రకారుడిపై కోపం ప్రదర్శించి తన అసహనం చూపించాడు. రెండవ చిత్రకారుడు చాలా ఆనందంగా తాను గీసిన చిత్రం తీసుకుని రాజు వద్దకొచ్చాడు. ఆ చిత్రం కూడా రాజులాగే చాలా అందంగా ఉంది. చిత్రంగా రాజు రెండు కళ్లూ సరిగ్గా వున్నట్టు గీసాడతడు.ఆ చిత్రకారుడి అతి వినయానికి తెలివికి చిరాకు పడ్డాడు రాజు. అసంతృప్తితో నిరుత్సాహంగా దాన్ని పక్కన పడేశాడు.


చివరగా మూడో చిత్రకారుడు చాలా ధైర్యంగా తాను గీసిన సుదర్శనుడి అందమైన చిత్రపటాన్ని రాజు చేతికందించాడు. దాన్ని తీక్షణంగా చూసిన రాజు మొహంలో చిరునవ్వులు మెరిశాయి.ఆ చిత్రకారుడి యుక్తికి నైపుణ్యానికి మనసారా అభినందించి విలువైన బహుమతులు అందించడమేగాక అతడ్ని ఆ రాజ్యానికి ఆస్థాన చిత్రకారుడిగా నియమించాడు రాజు. అందమైన రూపంతో జీవకళ ఉట్టిపడే ముఖ కవళికలు, అపురూప ఆభరణాలు రాచఠీవితో హుందాగా ఒక పక్కకు చూస్తూ కూర్చున్నట్టు గీసిన రాజుగారి బొమ్మలో సరిగ్గా ఉన్న కన్నును మాత్రమే చిత్రకారుడు బొమ్మలో చూపించాడు. మెల్లకన్ను చిత్రంలో అవతలి వైపుగా ఉండి కన్పించకుండా ఉండేట్టు గీశాడు. చిత్రకారుడి సమయస్ఫూర్తికి అక్కడున్న వారంతా ఆనందించడమే గాక అందమైన రూపంలో మంచితనంలో చిన్న అవలక్షణం, చెడ్డ గుణం కనిపించవనే నిండు నిజం తెలుసుకున్నారు.

అక్బర్-బీర్బల్ కథలు - 6 గుడ్డివారు ఎవరు..?

అక్బర్-బీర్బల్ కథలు - 6

గుడ్డివారు ఎవరు..?

ఒకరోజు అక్బరు చక్రవర్తి సభలో కూర్చొని ఉన్నారు. "మన పట్టణంలో గుడ్డివారు ఎక్కువమంది ఉన్నారా..? లేక మంచివారు ఎక్కువమంది ఉన్నారా..?" అంటూ సభికులను ప్రశ్నించాడు చక్రవర్తి. ఆయన ప్రశ్నకు అక్కడున్న ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు.

అప్పుడు బీర్బల్ లేచి... "మహారాజా..! మన పట్టణంలోనే కాదు, లోకంలో చాలామంది గుడ్డివారే ఉన్నార"ని అన్నాడు. అయితే వారిని మీకు చూపేందుకు నాకు రెండురోజులు గడువు ఇప్పించండని అడిగాడు బీర్బల్. అందుకు అక్బర్ సరేనని తలూపాడు.

మరుసటి రోజు బీర్బల్ దర్బారుకు వెళ్లలేదు. బాగా జనం తిరిగే ఒక కూడలి వద్ద కూర్చున్నాడు. అతని చుట్టూ చెప్పులు ఉన్నాయి. ఒక చెప్పును కుడుతూ కూర్చున్నాడాయన. ఆయనకు పక్కనే అక్కడ ఏం జరుగుతుందనేది రాసేందుకు ఇద్దరు పనివాళ్లను నియమించుకున్నాడు.

ప్రతిఒక్కడూ వచ్చి "పండిట్ జీ... ఏమి చేస్తున్నారు మీరు..?" అని ప్రశ్నిస్తూ వెళ్లిపోతున్నారు. అలా అడిగిన వారి పేర్లను పనివారు రాస్తూనే ఉన్నారు. అలా సాయంకాలం అయ్యింది. రాజుగారు విహారం కోసం అదే దారిలో వచ్చాడు. ఆయన కూడా బీర్బల్‌ని చూసి అందరూ అడిగిన ప్రశ్ననే అడిగాడు. అంతే రాజుగారి పేరు కూడా లిస్టులో చేరిపోయింది.

మరుసటిరోజు ఉదయాన్నే బీర్బల్ అక్బర్ సభకు తరలివచ్చాడు. వస్తూనే అక్బర్ వద్దకు వెళ్ళి.. "ఈ లిస్టు చూడండి మహారాజా... మన పట్టణంలో గుడ్డివారు ఎంతమంది ఉన్నారో మీకు సులభంగా తెలుస్తుంద"ని అన్నాడు. వెంటనే రాజుగారు ఆ లిస్టు తీసుకుని చదవడం ప్రారంభించాడు.

ఆ లిస్టులో చాలామంది పేర్లు వారి చిరునామాలతో సహా రాసి ఉన్నాయి. అందులో తన పేరు కూడా కనిపించడంతో అక్బర్ ఖంగుతిన్నాడు. "అదేంటి బీర్బల్...! నా పేరును కూడా ఈ లిస్టులో రాశావెందుకు..?" అని ప్రశ్నించాడు మహారాజు.

అప్పుడు బీర్బల్ మాట్లాడుతూ... "మహారాజా...! మీరందరూ నేను చేసే పనిని చూస్తూ కూడా ఏం చేస్తున్నావని అడిగారు కదండీ... కళ్ళుండి కూడా చూడలేనివారు గుడ్డివారే కదా...!!" అన్నాడు. దీంతో అక్బర్‌కు తాను చేసిన పొరపాటేంటో అర్థమై, దానికి చింతిస్తూ... బీర్బల్‌ తెలివితేటలను అభినందించాడు.

ప్రశ్న: కొందరు మనుషులు పొట్టిగా, మరి కొందరు బాగా ఎత్తుగా ఉంటారెందుకు?

ప్రశ్న: కొందరు మనుషులు పొట్టిగా, మరి కొందరు బాగా ఎత్తుగా ఉంటారెందుకు?

జవాబు:
విపరీతమైన జన్యులక్షణాలు, గర్భస్థ సమయంలో పిండంలో కలిగిన మార్పుల మూలాన ప్రపంచంలో అత్యంత పొడవైన వ్యక్తిగా సుమారు ఎనిమిది అడుగుల 3 అంగుళాల ఎత్తుగల సుల్తాన్‌ కోసెన్‌ గిన్నిస్‌ రికార్డుకెక్కాడు. ప్రపంచంలో నేటి వరకు రికార్డు ప్రకారం అత్యంత పొట్టి వ్యక్తి నేపాల్‌ దేశానికి చెందిన చంద్ర బహద్దూర్‌ డాంగీ. ఇతని ఎత్తు కేవలం ఒక అడుగు తొమ్మిదిన్నర అంగుళాలు. ఇలాంటి విపరీతమైన వ్యత్యాసాలు మినహాయిస్తే సాధారణ ప్రజానీకంలో ఎత్తు పొడవులు తేడా ఉండటానికి చాలానే కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనవి, అప్రధానమైనవి ఉన్నాయి. అప్రధానమైనవి అరుదుగా సంభవించే కారణాలు. ఉదాహరణకు గర్భంలో ఉండగా తల్లి సరిగా ఆహారం తీసుకోనట్లయితే పిండం ఎదుగుదలలో లోపం వచ్చి ఆ తర్వాత ఎంత తిన్నా పొడవు పెరగక పోవచ్చు. ఒక వేళ మామూలుగానే తల్లి ఆరోగ్యంగా గర్భం ధరించినా ప్రసవం తర్వాత నూతన శిశువుకు బాలారిష్టాలు కల్గి ఎముకల ఎదుగుదలలో లోపాలు వచ్చినా, పెరిగే క్రమంలో పోషకాహారం లేకున్నా, బాల్యంలోనే ఎదుగుదల క్షీణించవచ్చు. మనిషి సుమారు 20 సంవత్సరాల లోపే ఎదుగుతాడు. ఆ తర్వాత ఎదుగుదల ఉండదు. కాబట్టి 20 సంవత్సరాల లోపు పోషకాహారం, వ్యాయామం, మంచి నిద్ర అవసరం.

ప్రధానమైన కారణాలు జన్యు సంబంధమైనవి. ఉదాహరణకు తల్లిదండ్రులు ఇరువురూ పొడవుగా ఉన్నట్లయితే పిల్లలు కూడా పొడవుగానే ఎదిగే అవకాశం ఉంది. చైనా, జపాన్‌, నేపాల్‌, మలేషియా వంటి ప్రాంతాల్లో ప్రజల జన్యుతత్వం అక్కడ సగటు మనిషి ఎత్తు 5 అడుగుల వరకే ఉండేలా ఉంది. అమెరికా, దక్షిణాఫ్రికా, కెనడా, రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అలాంటి జన్యుతత్వం లేదు.
సాధారణంగా వారు 6 అడుగుల వరకు పెరుగుతారు. భారతీయులు సగటుగా 5 నుంచి 6 అడుగుల మధ్య ఉంటారు. అత్యంత పొడవుకు కూడా జన్యువులే కారణం.

19, ఏప్రిల్ 2020, ఆదివారం

నీతి కథలు - 11 చేప ముందుచూపు

నీతి కథలు - 11

చేప ముందుచూపు

అనగనగా ఒక చెరువులో మూడు చేపలు ఉండేవి. అసలే ఎండాకాలం, చెరువులో ఎప్పటికప్పుడు నీళ్లు తగ్గిపోతుండటంతో చేపలన్నీ చచ్చిపోతున్నాయి. దీంతో కలత చెందిన మూడు చేపలు ఒకచోట సమావేశమైనాయి. అయ్యో.. ఈ సంవత్సరం ఇప్పటిదాకా వానలే పడటం లేదు. మన చెరువులో చూస్తే... నీళ్ళు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ఈరోజు కొంతమంది జాలర్లు వచ్చి, ఇంకో పది రోజుల్లో నీళ్ళన్నీ ఇంకిపోతాయి. అప్పుడు వచ్చి ఈ చేపలన్నింటినీ వలవేసి పట్టుకెళ్లిపోవచ్చు అని మాట్లాడుకుంటున్నారు. ఇక్కడే ఉంటే మనం చచ్చిపోవడం ఖాయం" అని అనుకున్నాయి.

మొదటి చేప మాట్లాడుతూ... ఇక్కడికి దగ్గర్లోనే ఇంకో పెద్ద చెరువు ఉంది, మనందరం అక్కడికి వెళ్లిపోదాము అని అంది. ఇది విన్న రెండో చేప... "సర్లే ఆ జాలర్లు వచ్చినప్పుడు కదా మనకి అపాయం. అప్పటిదాకా ఖంగారు పడాల్సిందేమీలేదు" అని తేల్చి చెప్పింది. ఇక మూడో చేప... "నీళ్ళు ఇంకిపోయినప్పుడు, జాలర్లు వచ్చినప్పుడు కదా... ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం ఇప్పట్లో లేదంటూ" ఎంచక్కా వెళ్లిపోయింది.

ఎంతచెప్పినా మిగతా రెండు చేపలు వినక పోవడంతో... మొదటి చేప ఆ రాత్రికి రాత్రే నెమ్మదిగా దొర్లుకుంటూ పక్కనే కొద్ది దూరంలో ఉన్న పెద్ద చెరువులోకి వెళ్లిపోయింది. అలా కొన్ని రోజులు గడిచాయి.చెరువులో నీళ్లు ఇంకిపోసాగాయి. అది తెలిసిన జాలర్లు వల తీసుకుని చెరువుకు వచ్చారు. జాలర్లను చూసిన రెండో చేప కాస్తంత తెలివిగా ఆలోచించి చచ్చిన దానిలాగా పడుకుంది. ఛీ..ఛీ చచ్చిపోయిన చేప మనకెందుకులే అనుకుంటూ జాలర్లు ఎత్తి దూరంగా విసిరి పారేశారు. జాలర్లు విసిరిన విసుర్లో... అది పక్కనే ఉన్న చిన్న నీటి కొలనులో పడి ప్రాణాలు దక్కించుకుంది.

ఇక చెప్పిన మాట వినని మూడో చేప మాత్రం వలలో పడి గిజ గిజ తన్నుకుంటూ జాలర్ల కంట్లో పడింది. ఆహా ఎంత పెద్ద చేపో... భలేగా వలలో పడిందని వాళ్లు సంతోషిస్తూ... ఇంటికి తీసుకెళ్లి వండుకుని తినేశారు.

అక్బర్-బీర్బల్ కథలు - 4 కథ అడ్డం తిరిగింది..!

అక్బర్-బీర్బల్ కథలు - 4

కథ అడ్డం తిరిగింది..!

ఒకరోజు బీర్బల్ రాజదర్బారుకు వస్తున్నాడు. దారిలో రేగుపండ్లు అమ్మేవాడు కనిపించాడు. రేగుపండ్లు చూడ్డానికి చాలా బాగా, అనిపించటంతో గంప మొత్తాన్ని కొనేసి రాజు అంతఃపురానికి తీసుకువచ్చాడు బీర్బల్.

అక్బర్ చక్రవర్తి దర్బారుకు వెళ్లేందుకు తయారవుతూ గంపవైపు చూశాడు. ఏంటయ్యా ఆ గంప..? అందులో ఏముంది అని ఆరా తీశాడు.

ప్రభూ.. ఇవి రేగుపండ్లు, చాలా బాగున్నాయి. ప్రభువులవారు తింటారని తెచ్చాను అన్నాడు. బీర్బల్ ఆ అంతఃపురంలో తనతోనూ, రాణిగారీతో చనువు ఉన్నవాడు కాబట్టి, వెంటనే రాణీగారిని కూడా అక్కడకు పిలిపించాడు అక్బర్ చక్రవర్తి.

ఒక పెద్ద పళ్లెంలో రేగుపండ్లు పోసి బల్లమీద ఉంచారు. రాణీగారూ, చక్రవర్తీ ఒకవైపు... వారిద్దరికీ ఎదురుగా బీర్బల్ కూర్చొన్నారు. ముగ్గురూ పండ్లు తినడం ప్రారంభించారు. కానీ రాజుగారు పండ్లు తినేసి, గింజలను మాత్రం రాణీగారివైపు వేస్తున్నాడు. రాణిగారిని తిండిపోతుగా చేసి హేళన చేయాలని రాజు ఉద్దేశ్యం గాబోలు.

తినగా, తినగా... రాణీగారి వైపు గింజలు ఎక్కువయ్యాయి. అక్బర్ చక్రవర్తి దగ్గర మాత్రం అసలు గింజలే లేవు. బీర్బల్ వద్ద మాత్రం కాసిన్ని గింజలు ఉన్నాయి.

ఇంతలో అక్బర్ చక్రవర్తి.. "చూశావా బీర్బల్... రాణీగారు ఎంత తిండిపోతో.. ఆమె ముందు చూడండి ఎన్ని గింజలున్నాయో..?" అని అన్నాడు. ఆ మాట విన్నవెంటనే రాణీగారు సిగ్గుతో తలవంచుకున్నారు.

అయితే బీర్బల్ ఊరికే ఉంటాడా... వెంటనే "మహారాజా.. రాణీగారికంటే తమరే ఎక్కువ తిండిపోతులాగా ఉన్నారు. రాణీగారు పండ్లు తిని గింజలు మాత్రమే వదలిపెట్టారు. తమరు పండ్లుతోపాటు గింజల్ని కూడా మింగేశార"ని అన్నాడు. పాపం.. రాజుగారు.. సిగ్గుపడక తప్పలేదు. రాణీగారిని ఇరికించాలనుకుంటే తానే ఇలా దొరికిపోయానని మనసులో అనుకున్నాడు అక్బర్ చక్రవర్తి.

ప్రశ్న: రాత్రిపూట భోజనం తర్వాత చెట్ల కింద నడవవచ్చా?ప్రమాదమేమీ లేదా?

ప్రశ్న: రాత్రిపూట భోజనం తర్వాత చెట్ల కింద నడవవచ్చా?ప్రమాదమేమీ లేదా?

జవాబు:
నడుస్తున్నపుడు తలకు ఆకులు తాకేలా పొట్టిగా ఉన్న చెట్ల కింద ఎక్కువ సేపు రాత్రుళ్లు ఉండకూడదనేది ఓ సూచన. అలా ఉన్నంత మాత్రాన విపరీతమైన సమస్య, ప్రాణాపాయం ఏమీ రాదు. కానీ ఆక్సిజన్‌ను మనతో పాటు చెట్టు కూడా శ్వాసక్రియలో వాడుకుంటుంది. మనలాగే శ్వాసక్రియలో చెట్లు కూడా కార్బన్‌ డయాక్సైడును విడుదల చేస్తాయి. కార్బన్‌ డయాక్సైడ్‌ అణుభారం 44. నైట్రోజన్‌, ఆక్సిజన్‌లున్న గాలి కన్నా ఇది ఎక్కువ. అదే పనిగా చెట్టు కిందే ఉంటే కార్బన్‌డయాక్సైడ్‌ బరువెక్కి చెట్టు కిందికి పోగవుతుంది కాబట్టి మనకు ప్రాణ వాయువయిన ఆక్సిజన్‌ తక్కువగా లభ్యమవుతుంది. అయితే చెట్టు ఆకులు తగిలేలా ఎవరూ చెట్లకింద నడవరు, పడుకోరు.

చెట్టు కొమ్మలకు, నేలకు మధ్య బాగా సందు ఉన్నట్లయితే గాలి ఎప్పటికప్పుడు విసరణం చెందుతుంది. కాబట్టి అదేపనిగా కార్బన్‌డయాక్సైడు అక్కడే ఉండిపోదు. మామూలుగా ఎత్తుగా ఉన్న చెట్ల కింద పగలయినా రాత్రయినా నడిస్తే ప్రత్యేక తేడా ఉండదు. ప్రమాదం ఏమీ లేదు. భోజనం తర్వాత కొంత నడక మంచిది అన్న సామెత నేడు చెల్లదని వైద్యులు అంటున్నారు. భోజనం తర్వాత కొంత విశ్రాంతి అవసరమని శాస్త్రవేత్తలు సూత్రీకరిస్తున్నారు.

అయినా భోజనానికీ, చెట్లకు సంబంధం ఏముంటుంది? చెట్ల కింద రాత్రుళ్లు నడవాలా వద్దా అన్నదే మీమాంస లేదా భోజనం తర్వాత నడవటం మంచిదా, కాదా అనేది సంశయం.

18, ఏప్రిల్ 2020, శనివారం

అక్బర్-బీర్బల్ కథలు - 3 అందరిలోకి అదే తెలివైంది కదా..?!

అక్బర్-బీర్బల్ కథలు - 3

అందరిలోకి అదే తెలివైంది కదా..?!

ఒకరోజు అక్బర్ చక్రవర్తి వేటకు వెళుతూ... తన సేవకుడైన జమాలుద్దీన్‌ను తనతో పాటు రమ్మని అడిగాడు. చక్రవర్తి తనకు తోడుగా వేటకు రమ్మని పిలవడంతో సంతోషం పట్టలేని జమాలుద్దీన్ ప్రభువును అనుసరించాడు. వారిద్దరూ అడవికేసి నడుస్తుండగా... ఇంతలోనే ఆకాశంలో కారు మబ్బులు అలముకోసాగాయి. దీన్ని గమనించిన అక్బర్ చక్రవర్తి ఆకాశంకేసి చూస్తూ.. జమాలుద్దీన్...! వాన వస్తుందంటావా...? అని అడిగాడు.

`నేనెలా చెప్పగలను ప్రభూ... నేనేమైనా భవిష్యత్తు తెలిసినవాడినా..?!' అన్నాడు జమాలుద్దీన్. అలా కొద్ది దూరం సాగిపోయిన తరువాత వారికి ఓ గొర్రెల కాపరి గొర్రెల్ని మేపుతూ కనిపించాడు. సరే జమాలు...! ఆ కనిపించే గొర్రెల కాపరిని కలిసి, వాన వస్తుందో, రాదో కనుక్కుని రా...! అని పంపించాడు అక్బర్.

పరుగు పరుగున గొర్రెలకాపరి వద్దకు వెళ్లిన జమాలుద్దీన్... "వాన వస్తుందో, రాదో నీవేమైనా చెప్పగలవటోయ్..!" అని అడిగాడు. గొర్రెల కాపరి తన కంచర గాడిద తోకను పైకెత్తి పట్టుకుని, తేరిపారజూసి "మబ్బులు కాసేపట్లో చెదిరిపోతాయేమో, వాన రాదని నా గాడిద చెబుతోంది.." అని అన్నాడు.

అక్బరు వద్దకు చేరుకున్న జమాలుద్దీన్.. జరిగిన విషయాన్నంతా వివరించి చెప్పాడు. అంతా విన్న అక్బర్ చక్రవర్తి నవ్వుతూ... "చూశావా... మనకన్నా ఆ చదువురాని వాడే నయం.. గాడిద తోకను చూసే వర్షం రాదనే విషయాన్ని పసిగట్టాడు.." అన్నాడు.

తరువాత ఇద్దరూ కాసేపు అలా ముందుకు సాగిపోగానే... కుండపోతగా వర్షం మొదలైంది. అక్బర్, జమాలుద్దీన్‌లు ఇద్దరూ తడిసి ముద్దయిపోయారు. అక్బర్ చక్రవర్తి చిరాకుపడుతూ... "ఇలా జరిగిందేం జమాలూ... ఇప్పుడే కదా వాన కురవదని చెప్పావు.." అన్నాడు.

అప్పుడు జమాలుద్దీన్ "ప్రభూ... వాన కురవదని చెప్పింది నేను కాదు, కంచర గాడిద తోక. పాపం ఆ గాడిద కూడా సరిగ్గానే వివరించి చెప్పి ఉండవచ్చు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవడంలో గొర్రెల కాపరి పొరబడి ఉంటాడు. వాడి మాటల్ని మీరు కూడా నమ్మారు. తప్పితే ఇందులో నా తప్పు ఏముంది" అన్నాడు.

"సరే... ఈ వాన కాసేపట్లో ఆగిపోతుందా, లేక ఇలాగే రాత్రిదాకా కొనసాగుతుందా..?" మళ్లీ అడిగాడు అక్బర్ చక్రవర్తి. "కాసేపాగండి ప్రభూ...! ఇప్పుడే వస్తాను" అంటూ గబగబా అడుగులేశాడు జమాలుద్దీన్. "ఎక్కడికి వెళ్తున్నావ్.. జమాలూ..!" వింతగా చూస్తూ అడిగాడు అక్బర్ చక్రవర్తి. ఏం లేదు ప్రభూ...! "ఇందాకటి గాడిదనే అడిగేసి వస్తా..! ఎందుకంటే ఇక్కడున్న అందరిలో కంటే, అదే తెలివైనది కదా..!" అన్నాడు.

అప్పటిగానీ విషయం బోధపడని అక్బర్ చక్రవర్తి... "వాన రాకడ, పోకడ మనకు ఎలా తెలుస్తుంది. అంతా ప్రకృతి మాత చలవే కదా..!" అని అనుకున్నాడు. "ప్రకృతిలో సహజసిద్ధంగా జరిగే వాటిని మానవులం తేల్చి చెప్పలేం కదా..!" అంటూ తన సేవకుడు సుతిమెత్తగా తెలియజెప్పిన విషయాన్ని మనసులో తలచుకుంటూ జమాలుద్దీన్ వైపు ప్రశంసాపూర్వకంగా చూశాడు అక్బర్ చక్రవర్తి.

నీతి కథలు - 10 టక్కరి నక్క

నీతి కథలు - 10

టక్కరి నక్క

ఒక అడవిలో టక్కరి నక్క ఒకటి ఉండేది. ఆ అడవిలోనే ఓ పశువుల కాపరి గుడిసె వేసుకుని నివసించేవాడు. అతడికి కోళ్లు, కుక్కలు, బర్రెలు, ఆవులతో పాటు మేకలు కూడా ఉండేవి. వాటిని అడవిలో మేపి, పాలు పితికి జీవనం సాగించేవాడు కాపరి.ఆ గుడిసెలోని చిన్నవైన మేకపిల్లలపై టక్కరి నక్క కన్నుపడింది. ఎలాగైనా సరే వాటిని తినేయాలని అది చాలా కాలం నుంచి ప్రయత్నిస్తోంది. అయితే వాటికి ఎప్పుడూ తల్లి మేక కాపలాగా ఉండటం వల్ల దీనికి సాధ్యం కాలేదు.
ఒకరోజు తల్లి మేక మేతకు అడవికి వెళ్ళటంతో చిన్నవైన పిల్లలు గుడిసెలోనే ఉండిపోయాయి. తల్లి మేక వెళ్తూ వెళ్తూ తాను తప్ప ఎవరు వచ్చి తలుపు తట్టినా తీయవద్దని పిల్లలకు జాగ్రత్త చెప్పి మరీ వెళ్ళింది. ఇదంతా ఓ చాటున దాక్కుని వింటోన్న టక్కరి నక్క, ఇదే మంచి సమయమని, ఎలాగైనా ఈరోజు తన పని కానిచ్చేయాలని పథకం వేసింది.

తల్లిమేక వెళ్లిన కాసేపటికి నక్క గుడిసె వద్దకు వెళ్లి, "నేనే మీ అమ్మను, తలుపు తియ్యండర్రా...!" అని అరచింది.లోపల ఉన్న చిన్న పిల్లలకు అది తమ తల్లి గొంతులాగా అనిపించక పోవటంతో... "నువ్వు మా అమ్మవు కావు. మా అమ్మ గొంతు ఇంత కరుకుగా ఉండదు" అని అన్నాయి. తన పని సాధ్యం కాదని భావించిన నక్క అక్కడ్నించీ వెళ్ళిపోయింది. అయితే మనసు ఉండబట్టక తిరిగీ గుడిసె దగ్గరకు వచ్చి "తలుపు తియ్యమని బ్రతిమాలుకుంది" అమ్మ వచ్చేసిందన్న సంతోషంతో తలుపు సందులోంచి తొంగి చూశాయి మేకపిల్లలు. వాటికి నల్లటి కాళ్ళు తప్ప మరేమీ కనిపించలేదు. "నువ్వు మా అమ్మవు కావు. మా అమ్మకి తెల్ల కాళ్లుంటాయి" అని అన్నాయి.
ఆహా! అలాగా అనుకుంటూ అక్కడ్నించీ వెళ్లిపోయిన నక్క ఈసారి కాళ్లకు తెల్లరంగు పులుముకుని వచ్చింది. గొంతు, కాళ్ళు వాటి అమ్మవిలాగే అనిపించటంతో మేకపిల్లలు తలుపుతీశాయి. అంతే ఒక్కసారిగా వాటిపై పడిన నక్క గబుక్కున మింగేసి, అక్కడ్నించి పారిపోయింది.

ప్రశ్న : అంతరిక్షంలోని నక్షత్రాలు, గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతుంటాయి. ఎందుకు?

ప్రశ్న : అంతరిక్షంలోని నక్షత్రాలు, గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతుంటాయి. ఎందుకు?

జవాబు :
ఏదైనా వస్తువు, ఉదాహరణకు తిరుగుతున్న బొంగరం, ఒక అక్షం ఆధారంగా తన చుట్టూ తాను తిరుగుతుందంటే, అది పరిభ్రమణం చేస్తుందని అంటాం. అంతరిక్షంలోని నక్షత్రాలు, గ్రహాలు ఇలా పరిభ్రమణాలు చేస్తుండడానికి కారణాన్ని భౌతిక శాస్త్ర నియమం 'కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం' ద్వారా వివరించవచ్చు. ఈ నియమం ప్రకారం పరిభ్రమణం చేస్తున్న వస్తువు ఏ కారణం లేకుండా దానంతట అది ఆగిపోదు. పరిభ్రమణం చేస్తున్న బొంగరం కొంతసేపటికి ఆగిపోవడానికి కారణం దాని 'ములుకు'కు నేలకు మధ్య ఉన్న ఘర్షణ (friction) ప్రభావమే. ఆ ఘర్షణ లేకుంటే పరిభ్రమణంలో ఉన్న బొంగరం ఆగకుండా అలా తిరుగుతూనే ఉంటుంది.

ఇక నక్షత్రాలు, గ్రహాల పరిభ్రమణ విషయానికి వస్తే, అవి తమ చుట్టూ తాము పరిభ్రమిస్తున్న వాయుధూళి సముదాయం ఘనీభవించడం వల్ల ఏర్పడినవే. ఈ వాయుమేఘాలు గురుత్వ ప్రభావం వల్ల క్రమేపీ తమలోకి తాము కుంచించుకుపోవడంతో కాలక్రమేణా నక్షత్రాలు, వాటి చుట్టూ గ్రహ వ్యవస్థలు ఏర్పడ్డాయి. ఈ వాయు మేఘాలు కుంచించుకుపోయేకొలదీ వాటి భ్రమణ వేగాలు ఎక్కువయ్యాయి. ఐస్‌పై స్కేటింగ్‌ చేస్తూ తమ చుట్టూ తాము తిరుగుతున్న స్కేటర్లు తాము దూరంగా బార చాపిన చేతులను తమ శరీరానికి దగ్గరగా తెస్తున్నపుడు వారి పరిభ్రమణ వేగం ఎక్కువవుతున్నట్లు.

ఇలా పరిభ్రమిస్తున్న వాయు మేఘాలు క్రమేపీ నక్షత్రాలుగా మారుతున్నపుడు ఆ మేఘాలలోని అతి కొద్ది శాతం పరిభ్రమణ చలనం మాత్రమే నక్షత్రాలకు బదిలీ అవుతుంది. లేకపోతే ఆ చలన వేగానికి నక్షత్రాలు తునాతునకలై పోతాయి. ఇలా జరగకుండా నిరోధించడానికే ఆ నక్షత్రాల నుంచి గ్రహాలు ఏర్పడి, వాయుమేఘాల తొలి పరిభ్రమణ వేగం అంటే తొలి కోణీయ ద్రవ్యవేగాన్ని తలాకొంచెం పంచుకున్నాయి. అందువల్లే నక్షత్రాలు, గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతుంటాయి.

17, ఏప్రిల్ 2020, శుక్రవారం

అక్బర్-బీర్బల్ కథలు - 2 మణిహారం దొంగ

అక్బర్-బీర్బల్ కథలు - 2

మణిహారం దొంగ

అక్బర్ చక్రవర్తికి ఒక రోజు ఉన్నట్టుండి... బీర్బల్‌ను ఏడిపించాలని ఓ సరదా ఆలోచన వచ్చింది. బాగా ఆలోచించిన ఆయన తన మెడలోని హారాన్ని ఒకదాన్ని తీసి చేతబట్టుకుని, తన సేవకుడిని పిలిచి దాచిపెట్టమని చెప్పాడు. రాజాజ్ఞను శిరసావహించిన ఆ సేవకుడు హారాన్ని తీసుకుని దాచిపెట్టాడు.
ఈ విషయాలేమీ తెలియని బీర్బల్ ఎప్పట్లాగే ఆరోజు కూడా సభకు విచ్చేశాడు. బీర్బల్‌ను చూసిన రాజు తాను వేసిన పథకాన్ని గుర్తుకు తెచ్చుకుని నవ్వుకున్నాడు. అంతేగాకుండా... బీర్బల్ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడోనన్న కుతూహలం కూడా ఆయన కలిగింది.

బీర్బల్‌తో అక్బర్ ఇలా అన్నాడు. "బీర్బల్ ఈ రోజు నామనసు ఏమి బాగాలేదు." అన్నాడు. ఈ మాట విన్న బీర్బల్ కంగారుతో.. చెప్పండి మహాప్రభూ.. ఏమైంది? మీ మనస్సు ఎందుకు బాగుండటం లేదు? అని అడిగాడు. ఏం లేదు బీర్బల్...! మహారాణి ప్రేమగా బహూకరించిన నా మణిహారాన్ని ఎవరో తస్కరించారు అని చెప్పాడు మహారాజు.

"స్నానం చేస్తున్నప్పుడు ఎక్కడైనా పెట్టిమర్చిపోయారేమో గుర్తు చేసుకోండి మహారాజా!" అని అన్నాడు బీర్బల్. స్నానానికి వెళుతూ హారం తీసి పక్కన పెట్టాను. తిరిగి వచ్చి చూస్తే, హారం మాయమైపోయింది... అంటూ చెప్పసాగాడు రాజు. మహారాజు చెబుతున్నదంతా మౌనంగా విన్నాడు బీర్బల్.

అంతా విన్న బీర్బల్... "ఆ హారం దొంగ ఎవరో ఇక్కడే ఉన్నాడు. ఆ విషయం నాకు బాగా తెలుసు. కాబట్టి ఆ హారం ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది. "మహారాజా! మీకు ఎవరి మీదనైన అనుమానం ఉంటే చెప్పండి" అని అడిగాడు. లేదు బీర్బల్! నాకు ఎవ్వరి మీద అనుమానం లేదు. అయినా సరైన ఆధారాలు లేకుండా ఎవరినైనా అనుమానించడం చాలా తప్పు అన్నాడు రాజు. సభలో ఉన్న వారంతా వారికి తోచిన సలహాలు చెబుతూ ఉండే బీర్బల్ మాత్రం మౌనంగా ఉండిపోయాడు.

కొద్దిసేపటి తర్వాత మహారాజు ఇలా అన్నాడు.. "బీర్బల్ ఈ సమస్య పరిష్కరించగలవాడివి నువ్వేనని నాకు అనిపిస్తోంది... నీకు జ్యోతిష్యం తెలుసు కాబట్టి ఆ హారం దొంగ ఎవరో నువ్వే కనిపెట్టాలి" అని అన్నాడు. రాజు చెప్పిన దానికి బీర్బల్ ఒప్పుకుంటూ... మహారాజా మీరు స్నానానికి వెళుతూ హారం ఎక్కడ పెట్టారో ఆ స్థలం నాకు చూపించండి అని అడిగాడు. వెంటనే చక్రవర్తి ఓ అల్మరా వద్దకు తీసుకెళ్లి ఇక్కడే పెట్టానని చెప్పాడు.

అల్మరా వద్దకు వెళ్ళిన బీర్బల్... "ఆహా...! అలాగా...! సరి సరే....!!" అని అన్నాడు. దీంతో బీర్బల్ ఏం చేస్తున్నాడో అక్కడున్న వారందరికీ అర్థం కాలేదు. అల్మరానే ఆయనకు ఏదో చెబుతోంది అన్నట్లుగా ఆశ్చర్యపోయి చూస్తుంటారు వాళ్ళు. వెంటనే బీర్బల్ మహారాజా హారం దొంగెవరో దొరికిపోయాడు అన్నాడు. రాజు హారాన్నే దొంగిలించే ధైర్యం ఎవరికుంది? ఎవరు వాడు చెప్ప బీర్బల్...! అన్నాడు అక్బర్.

ప్రభూ...! ఈ అల్మారా ఏం చెప్తోందంటే ఎక్కడ మీరు స్నానం చేసి త్వరగా వచ్చేస్తారోనన్న కంగారుతో ఉన్న దొంగ గడ్డం అల్మరాలో ఇరుక్కుపోయిందట! అని చెప్పాడు. కావాలంటే మీరు అల్మరా తెరిపించండి... తప్పకుండా అందులో మీకు వెంట్రుకలు కనిపిస్తాయి. అన్నాడు.

దీంతో రాజు ఎవరికైతే తన ఉంగరాన్ని దాచి పెట్టమని ఇచ్చాడో అతను కంగారుగా గడ్డం సవరించుకున్నాడు. అంతే బీర్బల్ దొంగను పట్టుకుని, మహారాజా ఇతడే దొంగ అని చూపించాడు. పట్టుబడ్డ రాజు సేవకుడు భయంతో వణుకుతూ అక్బర్ వద్దకు వెళ్ళగా... ఆయన జరిగిందంతా బీర్బల్‌కు వివరించాడు. దీంతో బీర్బల్ శాంతించి, నవ్వుకున్నాడు.

అయితే సభలో ఉన్న వారందరితో సహా మహారాజుకు కూడా.. అసలు బీర్బల్ దొంగను ఎలా పట్టుకోగలిగాడో ఎవ్వరికీ అర్ధంకాలేదు. అదే విషయం బీర్బల్‌ను అడిగాడు. అప్పుడు అసలు విషయం వివరించాడు బీర్బల్. మరేం లేదు మహారాజా..! మీరు అల్మరాలో హారం పెట్టానని చెప్పారు. మీరు చెప్పింది నిజమే అనుకున్నాను నేను.

అంతేగాకుండా మీరు నాకు జ్యోతిష్యం తెలుసునని చెప్పగానే నాకో ఉపాయం తోచింది. అల్మరా దగ్గరికెళ్ళి చెవి ఆనించి ఏదో విన్నట్టుగానే నటించాను. దొంగ గడ్డం అల్మరాలో చిక్కుకుపోయిందని కల్పించి చెప్పాను. నేను అలా చెప్తే నిజంగా హారం దొంగిలించిన దొంగ గడ్డం సవరించుకుంటాడని అనుకున్నాను.

అనుకున్నట్టుగానే ఆ సేవకుడు మీరు దాచిపెట్టమని చెప్పిన విషయాన్ని మర్చిపోయి గడ్డం సవరించుకున్నాడు. అంతే దొంగ దొరికిపోయాడు అని చెప్పాడు బీర్బల్. బీర్బల్ తెలివితేటలను రాజు, ప్రజానీకం మెచ్చుకుని ప్రశంసలు, పొగడ్తలతో ముంచెత్తారు.

నీతి కథలు - 9 మతిలేని మృగరాజు

నీతి కథలు - 9

మతిలేని మృగరాజు

ఒక దట్టమైన అడవిలో ఒక సింహం నివసించేది. అడవికి రాజైన ఆ సింహం, ప్రతిరోజు జంతువులని తినేది, ఒకేసారి ఒక్కటి, ఒక్కోసారి రెండు లేదా మూడింటిని కూడా తింటూ ఉండేది. జంతువులన్నీ తమ రాజుతో విసిగిపోయాయి. అందుకని అవి ఒకరోజు సమావేశం ఏర్పాటుచేసి, ఒక నిర్ణయానికి వచ్చాయి. అదేమంటే, ఒకవేళ సింహం తన గుహనుండి బయటికి రాకుండా ఉండాలంటే అవి రోజుకి ఒక జంతువును ఆహారంగా ఆ సింహం వద్దకే పంపించాలి. రోజుకో జంతువు తనకి తానుగా సింహం దగ్గరికి వెళితే, మిగతావి మనశ్శాంతిగా అడవిలో జీవించగలవు.

రోజులు గడుస్తున్నాయి. జంతువుల సంఖ్య తరిగిపోతూనే ఉంది. మృగరాజు తన గుహలోనే కుర్చుని తన దగ్గరకు వచ్చిన భోజనాన్ని ఆనందిస్తూ తినేది. ఒక రోజు ఒక కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు భయపడుతూనే గుహకు బయలుదేరింది. అది తాబేలులాగా నెమ్మదిగా నడుస్తూ గుహ చేరుకునేసరికి సాయంత్రం అయింది. ఆకలితో అలమటిస్తున్న సింహానికి కుందేలుపైన ఎంతగానో కోపం వచ్చింది.

కుందేలు భయంతో ఏడవడం మొదలు పెట్టింది. "ఓ రాజా! ఇది నా తప్పు కాదు. మా జంతువుల సభ తప్పు కుడా కాదు. మా సభ వాస్తవానికి ఏడు కుందేళ్ళని పంపిందికానీ, మమ్మల్ని దారిలో ఒక దుర్మార్గుడు ఆపాడు. వాడు మిమ్మల్ని తిట్టాడు అంతేకాక నా స్నేహితులందర్నీ తినేసానని మీకు చెప్పమని ఆజ్ణాపించాడు" అని అంది. సింహం వెంటనే, అది పడుకున్న చోట నుండి లేచింది. "అదెక్కడుంటుందో నాకు ముందుచెప్పు? నేను దానిని బతికుండగానే తినేస్తాను" అంది కోపంగా.

"అది ఆముదం చెట్టు వెనుక ఉన్న ఒక బావిలో గుహ ఏర్పరచుకుని అందులో ఉంటోంది రాజా!" అని కుందేలు బదులు పలికింది.కుందేలును వెంటబెట్టుకుని సింహం బావి దగ్గరికి వచ్చింది. సింహం బావి గోడలపైన నిలబడి బావిలోపలికి తొంగి చుసింది. బావిలో దానికి మరో సింహం కనిపించింది. కానీ, వాస్తవానికి అక్కడ కనిపించింది నీటిలో తన ప్రతిబింబమే. కానీ, సింహం దాన్ని మరో సింహం అనుకుంది. అది తన భయంకరమైన పళ్ళు చూపింది. ఇంకో సింహం కూడా తన పళ్ళు చూపించింది. సింహం గట్టిగా గాడ్రించింది. రెండోది కూడా అదే చేసింది. బావిలో నుండి సింహం గొంతు ప్రతిధ్వనించి తిరిగి దానికే మరింత భయంకరంగా వినిపించింది.

ఇంకో సింహం ఆ ఆడవిలోకి వచ్చిందనుకుంది సింహం. మరేమీ ఆలోచించకుండా బావిలో ఉన్న ఆ కొత్త సింహం మీదకి ఉరికింది. దానితో అది బావిలో పడి, నీటిలో మునిగి చనిపోయింది. కుందేలు సంతోషంతో వేగంగా గెంతుతూ తిరిగి వెళ్ళిపోయింది. అది ప్రాణాలతో రావడం చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. జరిగినదంతా విడమర్చి చెప్పింది కుందేలు, సింహం పీడ పోయినందుకు అన్నీ సంతోషించాయి.

ప్రశ్న: పాదరసం నీటిలో కరగదు-కలవదు.ఎందువల్ల?

ప్రశ్న: పాదరసం నీటిలో కరగదు-కలవదు.ఎందువల్ల?

జవాబు:
భూమిపై ఉన్న వందకుపైగా మూలకాల్లో సాధారణ ఉష్ణోగ్రతా పీడనాల దగ్గర ద్రవస్థితిలో ఉన్నవి రెండే రెండు. ఒకటి బ్రోమిన్‌. ఇది అలోహం (non metal) , రెండోది పాదరసం. ఇది లోహం. అరచేతిలో పెట్టుకొంటే ద్రవంగా మారే రుబిడియం, ఫ్రాన్షియం, గెలియం వంటి ఇతర లోహాలు ఉన్నాయి. మూలకాలకు స్వతహాగా ధ్రువత్వం (polarity) ఉండదు.

ఒకే కణానికి విద్యుదావేశం ఉంటే వాటిని అయానులు అంటారు. ఉదాహరణకు (Nacl) ఉప్పులో సోడియం కణానికి ధనావేశం ఉంటుంది. ఒక కణంలో ఓ ప్రాంతంలో ధనావేశ లక్షణం, మరో ప్రాంతంలో రుణావేశ లక్షణం ఉంటే అటువంటి పదార్థాలను ధ్రువపదార్థాలు (polar materials) అంటారు. ఉదాహరణకు అమ్మోనియో (NH3) అణువులో నత్రజని పరమాణువు ప్రాంతంలో రుణావేశితం స్వల్పంగా పోగయి ఉంటుంది. హైడ్రోజన్‌లున్న ప్రాంతంలో స్వల్పంగా ధనావేశం పోగయి ఉంటుంది. అందుకే ఆ అణువును ధ్రువాణువు అంటారు. పూర్తిగాగానీ లేదా పాక్షికంగానైనా గానీ విద్యుదావేశం అదనంగా లేని పరమాణువుల్ని అణువుల్ని, పదార్థాల్ని మనం అధ్రువ పదార్థాలు అంటాం. అయస్కాంత పదార్థాలు అయస్కాంత లక్షణాలున్న పదార్థాలతోనే ప్రభావితమైనట్లే, విద్యుదావేశమున్న పదార్థాలు ఇతర విద్యుదావేశిత పదార్థాలతోనే ప్రభావితమవుతాయి. నీటి అణువు H2o కూడా ధ్రువ అణువు. ఆక్సిజన్‌ దగ్గర రుణావేశం, హైడ్రోజన్ల దగ్గర ధనావేశం స్వల్పంగా పోగయి ఉంటాయి. కాబట్టి నీటిని ధ్రువద్రావణి అంటారు. అందువల్ల అయాను లక్షణాలున్న ఉప్పు, ధ్రువ లక్షణాలున్న చక్కెర, ఆల్కహాలు వంటివి నీటిలో బాగా కరుగుతాయి, కలుస్తాయి. పాదరసానికి ధ్రువ లక్షణం లేకపోవడం వల్ల నీటిలో కరగదు. కలవదు.

16, ఏప్రిల్ 2020, గురువారం

అక్బర్-బీర్బల్ కథలు - 1 దొంగ సాధువు

అక్బర్-బీర్బల్ కథలు - 1

దొంగ సాధువు

అక్బరు చక్రవర్తి సువిశాల సామ్రాజ్యంలో సుల్తాన్‌పురి అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక ఆశ్రమం ఉండేది, అందులో ఒక గుడ్డివాడైన సాధువు నివసిస్తుండేవాడు. ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉండే ఆ సాధువుకు ఊరి జనాలందరి భవిష్యత్తు తెలుసని ప్రజలందరూ నమ్ముతూ ఉండేవారు.

ఒకరోజు అతడి ఆశ్రమానికి ఒక వ్యక్తి తన అన్నకూతురును తీసుకొస్తాడు. ఆ అమ్మాయికి ఆరోగ్యం సరిగా లేదు. ఎందుకంటే అంతకు కొన్నిరోజుల క్రితం ఆమె కళ్లెదురుగానే ఆమె అమ్మా, నాన్నలను ఎవరో దారుణంగా చంపేశారు. ఆ అఘాయిత్యాన్ని కళ్లారా చూసిన ఆ అమ్మాయికి అప్పటినుండి బుద్ధి స్వాధీనంలో లేకుండా తయారవుతుంది. 

దీనికి బాధపడ్డ ఆ అమ్మాయి చిన్నాన్న ఈ సాధువు బాగుచేస్తాడన్న నమ్మకంతో వైద్యం కోసం తీసుకొస్తాడు. అయితే ఆ అమ్మాయి ఆ సాధువును చూడగానే... ఏడుపు మొదలుపెట్టింది. తన అమ్మానాన్నలను చంపింది అతడే అని ఏడుస్తూ చెప్పింది. అది విన్న జనాలంతా ఆశ్చర్యపోయారు.

మహానుభావుడైన సాధువు ఎవరినైనా ఎందుకు చంపుతాడు. పైగా గుడ్డివాడు ఆ పని ఎలా చేస్తాడని తమలో తాము అనుకోసాగారు. అంతే కాదు ఆ అమ్మాయికి పిచ్చిపట్టిందని, అందుకే ఏవేవో మాట్లాడుతోందని అన్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ సాధువు కూడా ఆ విషయాన్నే నిర్ధారించి ఆశ్రమం నుండి వాళ్లను వెళ్లగొట్టించాడు.


అయితే ఆ అమ్మాయి రోజంతా అలాగే ఏడుస్తూనే ఉంటుంది. దీంతో ఆమె చెప్పిన మాటలు నిజమేనన్న సందేహంతో ఆమె చిన్నాన్న బీర్బల్ దగ్గరకు తీసుకెళ్ళాడు. జరిగినదంతా విన్న బీర్బల్ మరుసటిరోజు ఆ అమ్మాయిని, ఆమె చిన్నాన్నను, గుడ్డివాడైన సాధువును రాజు సభకు పిలిపించాడు.

నువ్వు ఈ అమ్మాయి అమ్మానాన్నలను చంపావా? అని గుడ్డి సాధువు ప్రశ్నించాడు బీర్బల్. "నేను గుడ్డివాడిని, నేనెలా చంపగలను?" అన్నాడు సాధువు సమాధానంగా. అలాగా..?! అంటూ ఒక్క నిమిషం వ్యవధిలో కత్తి తీసి సాధువు మీదికి ఉరికాడు బీర్బల్. అంతే.... తనకు అపాయం ముంచుకొస్తోందని గ్రహించిన సాధువు వెంటనే మరో కత్తి తీసుకుని బీర్బల్ పైకి ఎదురుదాడికి దిగాడు దొంగసాధువు.

అసలు రూపాన్ని బయటపెడుతూ తనపైకి దాడికి దిగిన దొంగ సాధువు తలను ఒక్క దెబ్బతో తెగ్గొట్టాడు బీర్బల్. అంతేగాకుండా అతడివల్ల నష్టపోయిన ఆ అమ్మాయికి రాజు ఆస్థానంలోనే ఆశ్రయం కల్పించాడు.

నీతి కథలు - 8 బ్రాహ్మణబాలుడి కథ

నీతి కథలు - 8

బ్రాహ్మణబాలుడి కథ

పూర్వం విచిత్రపురం అనే రాజ్యం ఉండేది. దానికి రాజు తంత్రవర్మ. ఇతడు కాస్తభోగలాలసుడూ, మరికాస్త స్వార్ధపరుడూనూ. అయితే ప్రజల అదృష్టం కొద్దీ ఇతడి మంత్రులు కొంత బుద్ధిమంతులు. అందుచేత రాజ్యపాలన కొంత సజావుగా సాగుతూ ఉండేది.

ఇలా ఉండగా, ఓ రోజు, ఈ రాజు అడవికి వేటకు వెళ్ళాడు. మధ్యాహ్నం వరకూ జంతువుల వేటలో గడిపాడు. ఇక విశ్రాంతి తీసికొందామని నది ఒడ్డు చేరాడు. అక్కడ అతడి కొక అందమైన యువతి కన్పించింది. ఆమెని చూడగానే రాజుకి కన్ను చెదిరింది. మెల్లిగా ఆమెని చేరి “ఓ సుందరీ! నీవెవ్వరు? ఇంత నిర్జనారణ్యంలో ఒంటరిగా ఎందుకు సంచరిస్తున్నావు?” అనడిగాడు. అందుకామె అలవోకగా ఓ చిరునవ్వు నవ్వి “రాజా! నేను ముని కన్యను! ఈ అరణ్యంలోనే మా నివాసం” అంది.

రాజు ఆమె పైన తనకు గల మోహన్ని వ్యక్తపరిచాడు. ఆమె “రాజా! నేను ముని వృత్తిలో నున్నదానిని. మీరు దేశాన్నేలే మహారాజులు. మీలాంటి వారు మాలాంటి వారాని కోరదగునా? కానీ, కోరి మీరు నన్నడిగినప్పడు కాదనడం సరికాదు. నాతల్లిదండ్రులను అర్ధించి నన్ను పొందండి” అంది. వీరిలా మాట్లాడు కొంటూ ఉండగా, హఠాత్తుగా వాళ్ళ ముందో రాక్షసుడు ప్రత్యక్షమయ్యడు. చెట్టంత రాక్షసుడు భీకరంగా గర్జిస్తూ ఒక్కవుదుటున రాజుని గుప్పిట బంధించి మ్రింగబోయాడు. తంత్రవర్మ ఒక్కపెట్టున పెద్దగా ఏడుస్తూ “వద్దు. వద్దు! నన్ను చంపవద్దు” అన్నాడు.“ఒక్క షరతు మీద నిన్ను వదిలేస్తాను” అన్నాడు రాక్షసుడు. “చెప్పు. తప్పక నెరవేరుస్తా” అన్నాడు రాజు. "నీరాజ్యంలో తల్లిదండ్రులిద్దరూ ఉన్న బాలుణ్ణి, నీకు బదులుగా నాకు సమర్పించేటట్లయితే, నిన్నువదిలేస్తాను" అన్నాడు రాక్షసుడు.

రాజు తంత్రవర్మ సరేనన్నాడు. రాక్షసుడు వదిలిందే క్షణం, రాజధానికి పరుగెత్తాడు. సైనికుల్ని పంపి రాజ్యంలో పేదవారి గురించి ఆరా తీయించాడు. చివరికి ఓ బ్రాహ్మణ కుటుంబాన్ని ఎంచుకున్నాడు. ఆ పేద వారింట భార్యా,భర్త, ముగ్గురు కొడుకులూ ఉన్నారు. వారు ఆపూట కూటికి కూడా లేని పేదవారు. రాజు బ్రాహ్మణ దంపతలకి పెద్దఎత్తున డబ్బాశ పెట్టి వారి ముగ్గురు కొడుకుల్లో ఒకరిని తనకి ధారాదత్తం చెయ్యమని అడిగాడు. బ్రాహ్మణుడు "రాజా! నాపెద్ద కొడుకంటే నాకు చాలా ఇష్టం. రేపు నేను ఛస్తే నాకు తలకొరివి పెట్టవలసింది వాడే కదా! అందుచేత నాపెద్దకొడుకుని ఇవ్వను. మిగిలిన ఇద్దరిలో నీకు కావలసిన వాణ్ణి తీసుకుపో!" అన్నాడు.

అంతలో అతడి భార్య "మహారాజా! నాచిన్నకొడుకంటే నాకు తీరని ముద్దు. అంతే గాక రేపు నేను ఛస్తే, నాకు తలకొరివి పెట్టవలసినవాడు చిన్నవాడు. అందుచేత నా చిన్నకొడుకుని మీరు తీసికెళతానంటే నేను ఒప్పకోను. కావాలంటే మా రెండవకొడుకుని తీసుకుపొండి" అన్నది.రాజు వారికి డబ్బుచ్చి, రెండో కొడుకుని కొనుక్కున్నాడు. ఆ బాలుణ్ణి తీసికెళ్ళి రాక్షసుడికి సమర్పించాడు. ముదురుగా, అరిషర్వర్గపూరితమైన, దుర్గంధభరితమైన రాజు శరీరం బదులుగా, తనకు ఆహారం కాబోతున్న బ్రాహ్మణబాలుడి లేత శరీరాన్ని ఆబగా చూస్తూ రాక్షసుడు పిల్లవాణ్ణి మింగబోయాడు.

సరిగ్గా ఆ పిల్లవాణ్ణి గుప్పట బిగించి, నోట బెట్టబోతుండగా ఆ బాలుడు గట్టిగా ఫకాలు మని నవ్వాడు. మరుక్షణం రాక్షసుడు పిల్లవాణ్ణి నేలదించి తలెత్తకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. భేతాళుడింత వరకూ కథచెప్పి, విక్రమాదిత్యుణ్ణి చూసి "విక్రమాదిత్య మహారాజా! ఎందుకు బ్రాహ్మణ బాలుడు నవ్వాడు? అది చూసి రాక్షసుడు బాలుణ్ణి మ్రింగకుండా ఎందుకు వదిలి పెట్టిపోయాడు? తెలిసీ సమాధానం చెప్పకపోతే నీ తలవెయ్యివక్కలౌతుంది. జవాబు చెప్పి మౌనభంగం చేశావో నేను నీకు అధీనం కాను" అన్నాడు.

విక్రమాదిత్యుడు పెదవులమీద చిరునవ్వు మెరుస్తుండగా, "భేతాళా! ఆబాలుడి నవ్వులో "ఇరుగు పొరుగు వారు కొట్టవచ్చినప్పుడు కాపాడవలసిన వారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులే దయమాలి బిడ్డలను హింసిస్తూ ఉంటే కాపాడవలసిన వాడు రాజు. రాజే కృరుడై ప్రజలని బాధిస్తుంటే కాపాడవలసినది దైవం. అలాంటి దైవమే దయమాలి నన్ను చంపబోతుంటే ఇంక నేమి గతి?" అన్నభావం ఉన్నది. అది చూసి రాక్షసుడే అయినా బాలుడితో పోల్చుకుంటే తనకు గల బలం తాలూకూ దైవత్వాన్ని గుర్తిరిగి రాక్షసుడు పిల్లవాణ్ణి విడిచి పెట్టిపోయాడు" అన్నాడు.

ప్రశ్న : వైద్యులు నాడి పట్టుకుని చూస్తారెందుకు?

ప్రశ్న : వైద్యులు నాడి పట్టుకుని చూస్తారెందుకు?

జవాబు :
ప్రస్తుత వైద్యులు  రోగిని తాకడం తగ్గించారు. . కానీ పాతరోజుల్లో వైద్యులు తమ రోగిని ముంజేయి దగ్గర పట్టుకుని చూసేవారు. అది నాడిని పట్టుకోవడము అని మనము అనుకుంటాము . వాస్తవములో వైద్యుడు రక్తనాళము పట్టుకుని చూస్తాడు . రక్తనాళము లో రక్తము ఒక క్రమవేగముతో ప్రవహిస్తుంది. అది కాకుండా ధమని గోడలు గుండె కొట్టుకోవడము మాదిరిగానే పల్స్ కొట్టుకొంటుంది. అది ఎన్నిసార్లు కొట్టుకుంటున్నాదో లెక్కపెడతారు. అనారోగ్యానికి గురి అయినప్పుడు ఆ రక్తప్రవాహ వేగము మారుతుంది. ఆ వేగము తగ్గిందా , పెరిగిందా అనేది చేయి పట్టుకుని తెలుసుకొని దానిని బట్టి రోగాన్ని అంచనావేయడము వైద్యులు చేస్తారు.

15, ఏప్రిల్ 2020, బుధవారం

నీతి కథలు - 7 నసీరుద్దీన్ కథలు

నీతి కథలు - 7

నసీరుద్దీన్ కథలు

అది మౌల్వీ నసీరుద్దీన్ నివసించే దేశం. ఆ దేశాన్ని తైమూర్ పాలిస్తుండేవాడు. ఇతడు పేరుకే రాజుగానీ, పరమ పిసినారి, స్వార్ధపరుడూను. అతడికి ఈర్ష్యాసూయలు కూడా ఎక్కువే.  ఎప్పుడూ నసీరుద్దీన్ నుండి సలహాలు తీసుకొంటాడే గానీ ఏనాడు మంచి పారితోషికం ఇవ్వడు.నసీరుద్దీన్ తనకి ఒక గుర్రం కావాలని తైమూర్ ని అర్ధించాడు. పిసినారి తైమూర్ కి నసీరుద్దీన్ కి గుర్రాన్నివ్వడం ఇష్టంలేదు. ఇవ్వక తప్పేట్లు లేదు.


దాంతో ఓ ముసలి చచ్చు గుర్రాన్ని నసీరుద్దీన్ కిచ్చాడు. ఇలా ఉండగా ఓ రోజు తైమూర్ తన పరివారంతో కలిసి వేటకి బయలుదేరాడు. నసీరుద్దీన్ కూడా వాళ్ళ వెంట ఉన్నాడు. అందరూ గోబీ ఎడారి చేరారు. ఇంతలో గాలి, దుమ్ము రేగాయి. మేఘాలు కమ్ముకొచ్చాయి. అంతలోనే ఉరుములు మెరుపులతో కుంభవృష్టి మొదలయ్యింది.

తైమూర్, అతని సైనికులు ఎక్కిన గుర్రాలు బలంగా ఉన్నాయి. ఆ గుర్రాలు మీద వాళ్ళంతా ఒక్క ఉదుటున దౌడు తీయిస్తూ వెనక్కి ఊళ్ళోకి మళ్ళారు. అయినా గానీ ఊరు చేరే లోగా తడిసి ముద్దయ్యారు. నసీరుద్దీన్ గుర్రం ముసలిది, ఒక్కచిక్కినది అయిన చచ్చు గుర్రంమయ్యే.గాలి మొదలవ్వగానే అది అడుగు తీసి అడుగు వెయ్యకుండా, ఉన్న చోటునే బిర్ర బిగిసినట్లు నిలబడి పోయింది. ఎంత అదిలించినా కదల్లేదు, మెదల్లేదు. చేసేది లేక నసీరుద్దీన్ గుర్రం దిగాడు. వర్షం మొదలయ్యేలోగా బట్టలు విప్పి ఆ గుర్రం క్రింద దాచాడు. ఎడారిలో తడుస్తూ అలాగే నిలబడ్డాడు. 

వర్షం తగ్గాక ఒళ్ళార్చుకొని, గుర్రం క్రింద దాచిన దుస్తులు తొడుక్కొని గుర్రమెక్కి ఊళ్ళోకి వచ్చాడు. కొంచెమైనా తడవకుండా, పొడి దుస్తులతో వచ్చిన నసీరుద్దీన్ ని చూచి తైమూర్ ఆశ్చర్యపోయాడు. "అదేమిటయ్యా నసీరుద్దీన్. ఎంత వేగంగా వచ్చినా మేం ముద్దగా తడిసిపోయాము. నువ్వెలా తడవకుండా వచ్చావు? ఎక్కడున్నావు ఇప్పటి దాకా?" కుతుహలంగా అడిగాడు తైమూర్.

"అహా..హా! ఏం చెప్పను హూజూర్! అద్బుతం. అమోఘం.” ఇంకా పరవశంలోనే ఉన్నట్లు నటిస్తూ మైమరుపుగా అన్నాడు నసీరుద్దీన్. తైమూర్ కుతుహలం మరింత పెరిగిపోయింది."ఏమిటి అద్భుతం? త్వరగా చెప్పవయ్యా!” అంటూ తొందర పెట్టాడు తైమూర్. "హూజూర్! ముందుగా నేను మీకు కృతఙ్ఞతలు చెప్పుకోవాలి” అన్నాడు నసీరుద్దీన్. "ఎందుకు?" ఆత్రంగా అడిగాడు తైమూర్."ఇంత అద్భుతమైన గుర్రాన్ని నాకు ఇచ్చినందుకు హూజూర్!” మరింత వినయంగా అన్నాడు నసీరుద్దీన్. అయోమయంగా చూశాడు తైమూర్. 

"నన్ను వివరంగా చెప్పనివ్వండి హూజూర్! గాలీ వానా మొదలవ్వగానే మీరంతా వేగంగా ఊరి వైపు దౌడు తీశారా? సరిగ్గా అప్పడే నేనూ నా గుర్రాన్ని అదిలించాను. అప్పుడు జరిగింది అద్భుతం! మీరిచ్చిన గుర్రం సామాన్యమైనది కాదు హూజూర్! అది ఆకాశంలో ఎగర గలదు. వాన మొదలు కాగానే అది నన్ను మబ్బుల్లోకి తీసికెళ్ళింది. ఎంత పైకంటే అప్పుడు కురుస్తోన్న మేఘం కంటే పైకి. ఆ మేఘల్లోని నందనవనం లాంటి తోటకి తీసికెళ్ళింది. అక్కడ ఎంత బాగుందనుకొన్నారు హూజూర్! పరిమళాలు వెదజల్లే పూలు, మధురమైన ఫలాలు, పక్షులు కిలకిలా రావాలు. అక్కడ ఎంచక్కా విహరించాను. తిరిగి రావాలనే అనిపించలేదు. కానీ మీరు నాగురించి వాకబు చేసి, నేనేమయ్యానో అని కంగారు పడతారని వచ్చేసాను” భావాన్ని అభినయీస్తూ, దృశ్యాన్ని కళ్ళకి కట్టినట్లు వివరించాడు నసీరుద్దీన్. 

తైమూర్ కి మతిపోయింది.అంత అద్భుతమైన గుర్రాన్ని తేరగా నసీరుద్దీన్ కి ఇచ్చేసినందుకు ఏడుపొచ్చింది. ఎలాగైనా ఆ గుర్రాన్ని తిరిగి పొందాలని “నసీరుద్దీన్. నీకిచ్చిన గుర్రం ముసలిది. ఆకాశంలో ఎగర గలదేమో గానీ, మామూలు సమయాల్లో వేగంగా పరిగెత్తలేదు. అది నాకు తిరిగి ఇచ్చేయ్. నీకు మరో మంచి గుర్రం ఇస్తాను” అన్నాడు.

నసీరుద్దీన్ నసుగుతూ “హూజూర్! ఇచ్చిన వస్తువు తిరిగి తీసికొన్నారనీ చెడ్డపేరు మీకు వస్తుందేమో! నా మూలంగా మీకు చెడ్డపేరు రావడం నాకిష్టం లేదు” అన్నాడు.నసీరుద్దీన్ ని బ్రతిమాలి బామాలి, ఎదురు డబ్బిచ్చి, మరో మంచి గుర్రాన్నిచ్చి నసీరుద్దీన్ దగ్గరున్న ముసలి చచ్చు గుర్రాన్ని తిరిగి కొనుక్కున్నాడు తైమూర్. 

మర్నాడు వాళ్ళు మళ్ళీ వేటకి వెళ్ళారు. గోబీ ఎడారి లోకి ప్రవేశించగానే, ముందు రోజులాగే ఆ రోజూ గాలీ వానా వచ్చాయి.మంచి బలమైన గుర్రం ఎక్కిన నసీరుద్దీన్ ఆఘామేఘాల మీద ఊళ్ళోకి దౌడాయించాడు. తైమూర్ ఎక్కిన ముసలి చచ్చూ గుర్రం, గాలీ వానా మొదలవ్వగానే శిలా విగ్రహం లాగా నిలబడిపోయింది. తైమూర్ దాన్ని కొరడాతో కొట్టాడు. పిడిగుద్దులు గుద్దాడు. బండతిట్లు తిట్టాడు. తన్నాడు. ఉహూ! ఏం చేసినా ఆ ముసలి గుర్రం అడుగు తీసి అడుగు వేయ్యలేదు. వర్షంలో ముద్దగా తడిసిపోయాడు తైమూర్. 


ఆ తడిసిన దుస్తులతోనే వర్షం తగ్గాక ఊళ్ళోకి తిరిగి వచ్చాడు. దాంతో బాగా జలుబు చేసి జ్వరం వచ్చింది. ఆ రాత్రి నీరసంగా పక్కమీదకి వాలుతున్నప్పుడు అర్ధమయ్యింది తైమూర్ కి తను, ముసలి గుర్రాన్నిచ్చినందుకే నసీరుద్దీన్ తనకి గుణపాఠం నేర్పాడని. అంతే! కన్నంలో తేలు కుట్టిన దొంగలా కిక్కురమన కుండా ఉండిపోయాడు.

తెనాలి రామకృష్ణ కథలు - శ్రీ కృష్ణదేవరాయుల కల

తెనాలి రామకృష్ణ కథలు

శ్రీ కృష్ణదేవరాయుల కల

500 సంవత్సరాల క్రితం విజయనగరమనే సామ్రాజ్యాన్ని శ్రీ కృష్ణదేవరాయులు పరిపాలించేవారు. ఆయిన ఒక రోజు నిద్రలొ ఒక కల కన్నారు. ఆ కలలో ఆయినకొక అందమైన భవనము కనిపించింది. ఆ భవనం ఆకశంలో తేలుతూ, లక్ష దీపాలతో చాలా అద్భుతంగా వుంది. తలుచుకుంటే చాలు, మాయమైపోయే ఆ భవనాన్ని కలలో చూసిన రాయలు ఆ కలను మరువలేకపోయారు. మొన్నాడు సభలో ఆయిన ఆ కలను వివరించి దాన్ని నిజం చేయాలన్న ఆయిన గట్టి నిర్ణయాన్ని అందరికీ తెలిపేరు. అది విన్న వారంత అలాంటి భవనమును ఎలా కట్టగలము – అసలు గాలిలో తేలే భవనాన్ని కట్టడం అసాధ్యము కదా అని నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. రాయులు కోపగించుకుని – “అదంతా నాకు అనవసరం. మీరేంచేస్తారో నాకు తెలీదు కాని నా కల నిజమవ్వాలి. అలాంటి భవనాన్ని కట్టిన వారికి నేను లక్ష వరహాల బహుమానము ఇస్తాను – లేదా మీరందరు నాకు కనిపించకండి” అని ఆఙాపించారు. విన్నవారంత నిర్ఘాంతపోయారు. ఎన్ని రోజులు గడిచినా రాయులు ఆ కలను మరువలేదు.

ఒక రోజు సభకొక వృద్ధుడు వచ్చాడు. నెరిసిపోయిన గెడ్డం, జుత్తు, మీసాలతో పాపం అతి కష్టం మీద కర్ర తో నడుస్తున్నాడు. నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని రాయులవారి ని ప్రార్థించాడు. “నీకేమన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు, నేను న్యాయం చేస్తాను” అని రాయులు హామి ఇచ్చారు.

“నా దెగ్గిర నూరు నాణ్యాలున్నాయి స్వామి, అవి ఒకరు దొంగలించుకుపోయారు. నాకు వారెవరో తెలుసు, నా నాణ్యాలు అడిగి ఇప్పించండి” అని ఆ వృద్ధుడు విన్నపించాడు.
శ్రద్ధగా విన్న రాయులు ఈ దొంగతనం యెవరు చేసారు, యెక్కడ చెసారు అని ప్రశ్నించారు.
వృద్ధుడు తడపడడం చూసి “నీకేమి భయం లేదు, చెప్పు” అని రాయులు ప్రోత్సహించారు.
“నా నూరు నాణ్యాలు దొంగలించింది మీరే స్వామి” అన్నాడు వృద్ధుడు. “నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే అవి దోచారు.”

రాయులకు చాలా కోపం వచ్చింది. “యేమిటీ వెటకారం! కలలో జరిగినది నిజమనుకుంటే ఎలా?” అని కోపంగా అడిగారు. ఈ మాట విన్న వృద్ధుడు తన గెడ్డం, మీసం తీసేసి, కర్రను పక్కకు పడేసి, పగటి వేశాన్ని విప్పేసాడు. చూస్తే అతను తెనాలి రామకృష్ణ.
“క్షమించండి స్వామి – మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికే ఇలా చేసాను” అన్నాడు తెనాలి.

రాయులకు చాలా నవ్వొచ్చింది. ఇంత చక్కగా ఆయినకు అర్ధమయ్యేలా చెప్పిన తెనాలి రామకృష్ణను ఆయిన చాలా అభినందించారు.

ప్రశ్న: దురద కలిగించే మొక్కలుంటాయా?

ప్రశ్న: దురద కలిగించే మొక్కలుంటాయా?

జవాబు:
 ఉంటాయి... కొన్ని రకాల మొక్కలు , గడ్డి  మన చర్మానికి తాకినప్పుడు  దురద పెడుతుంది. మన ప్రాంతాలలొ దొరికే " దురదగుండాకు " అందరికీ తెలినదే. ఇంగ్లీష్ లో స్టింగింగ్ నెటిల్ అంటారు. ఇది గ్రామాల్లో , ఊరి బయట రోడ్డు పక్కన పెరిగే ఓ పిచ్చి మొక్క. ఆ మొక్కల ఆకుల మీద సూచ్మ రూపములో గొట్టాలవంటి సూదులు ఉంటాయి. వాటి అంచుల్లో దురద కలిగించే రసాయనము ఉంటుంది . ఆ రసాయనము  ప్రభావము వలన దురద వస్తుంది. అది ఆ మొక్కలు రక్షణకోసము ఏర్పరచుకున్న వ్యవస్థ . 

ఈ విషయము తెలిసిన జంతువులు ఆ మొక్కలను మాత్రము తినవు . వాటికి దూరము గా ఉంటాయి. ఆత్మరక్షణ వాటి ఉద్దేశము . కాని మనిషికే ఇబ్బంది.

14, ఏప్రిల్ 2020, మంగళవారం

కొత్తయుద్ధం - కొత్త కథ

కొత్తయుద్ధం - కొత్త కథ

అది ఒక జింకల వనం. అందులో జింక జాతులు ఆనందంగా నిర్భయంగా జీవిస్తున్నాయి .

        ఒకసారి ఆ వనం నుంచి ఒక జింక దారితప్పి వేరే అడవిలోకి వెళ్ళింది . అక్కడ దానికి ఎన్నో కొత్త కొత్త జంతువులు తోడేళ్ళను , పులులను , సింహాలను , నక్కలను తొలిసారి అక్కడే చూసింది.

       అక్కడ ఒక కొమ్ముల జింక ఎదురై " ఓ జింక సోదరా ఈ అడవిలో నిన్నెప్పుడూ చూడలేదే " అంది.

    "అవును మాది జింకలవనం " అంది.

 " ఈ అడవి మీ జింకలవనం లాంటిది కాదు .  ఇక్కడ మనల్ను చంపి తినే క్రూర మృగాలు ఉన్నాయి . వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో మీకసలు తేలియదు . కాబట్టి ఇక్కడినుండి త్వరగా వెళ్ళిపో " అంటూ ఆ జింక గెంతుతూ వెళ్ళి పోయింది.

 " పిరికి జింక నేనూ జింకనే అదెలా తప్పించుకుందో నేనూ అలాగే తప్పిచుకోగలను " అనుకుంటూ జింకలవనం జింక ముందుకు వెళ్ళింది.

     అక్కడ చెట్టుకింద నిద్రపోతున్న సింహం కనిపించింది . జింక చిన్నగా దాని దగ్గరికి వెళ్ళి తన ముందరి గిట్టతో సింహం తోక తొక్కింది .

  సింహానికి మెలకువ వచ్చింది . బద్దకంగా లేస్తూ జింకను చూసి గర్జించింది . ఆ గర్జన విని జింకకు గుండె ఆగినంతపని అయింది .

 వెనుదిరిగి వచ్చిన దారినే పరుగు పెట్టింది. అడవిని దాటి జింకలవనం వైపు పరుగు తీస్తూనేవుంది . జింకలవనం సమీపానికి రాగానే సింహానికి చిక్కింది. సింహం దాన్ని చంపి చీల్చి ఆరగించింది .

  తరువాత సింహం లేచి మెల్లగా జింకలవనం లోకి వెళ్ళింది . దానికి అది క్రొత్త ప్రదేశం . అక్కడ దానికి గుంపులు గుంపులుగా జింకలు కనిపించాయి . సింహం ఆనందానికి అంతులేదు. దొరికిన జింకను దొరికినట్టు చంపి తినేస్తుంది .

   కొత్తగా ముంచుకొచ్చిన ఈ మృత్యువును చూసి జింకలన్నీ భయపడి పోయాయి .* *చెల్లాచెదురు అయ్యాయి. పొదల్లో దాక్కున్నాయి. బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నాయి .

   పొ‌రపాటున ఏ జింకయినా బయటికొస్తే చాలు సింహం దాన్ని పడగొట్టేస్తుంది .

      అయితే ఆ జింకల్లో తెలివయిన కుర్ర జింక ఒకటుంది . దాని పేరు జ్ఞాననేత్ర . జింకల పెద్దలు జ్ఞాన నేత్ర దగ్గరికి వచ్చి "దీనికి పరిష్కార మారర్గం ఏమిటి " అని అడిగాయి .

     " జింక పెద్దలారా నేనూ అదే ఆలోచిస్తున్నాను . ఈ క్రూర జంతువును ' సింహం ' అని అంటారు . దీని పంజా నుంచి తప్పించుకొనే చాకచక్యం మనకు లేదు.
ఎటు ఆలోచించినా . . ఎంత యోచించినా ఒకేఒక్క దారి కనిపిస్తుంది.

ఈ సింహం ఆహారం లేకుండా 14 రోజులు మాత్రమే బ్రతకగలదు . కానీ మనం 21రోజులు బ్రతకగలం.

కాబట్టి మన జింకలన్నీ తమ పొదల్లోకి దూరి 14రోజులు బయటకు రాకుంటేచాలు దాని పీడ మనకు విరగడౌతుంది.
మనలో ఎవరైనా నిర్లక్ష్యంతో బయటకు వచ్చి దానికి చిక్కారా దాని జీవితకాలం మరో 14రోజులు పెంచినట్లే.

  ఈరోజు అమావాస్య ఇప్పుడే పొదల్లోకి దూరిపోదాం.
పున్నమి నాటికి బయటకు వద్దాం తమ పొదల నుండి బయటకు రాకుండా చూసే బాధ్యత ఆ జింకల పేద్దలదే" అంది.

జింకలన్నీ జ్ఞాననేత్రం మాటలు విన్నాయి. ఆకలితో అలమటించాయి.

             పున్నమి వచ్చింది . జింకలన్నీ ఒక్కొక్కటే భయం భయంగా బయటకు వచ్చాయి . వనం మధ్య చెట్టుకింద చచ్చి పడి ఉన్న సింహాన్ని చూశాయి . ఆనందంతో అరిచాయి , గెంతాయి . జింకల కేరింతలతో వనం అంతా పులకరించింది .

అరవై సామెతలతో.. అందమైన కధ

అరవై సామెతలతో.. అందమైన కధ.

          "కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది.." అంటూ గొణుగుతూ.. అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన భర్త కాంతారావు గారికి కాఫీ తెచ్చి ఇచ్చింది సుమతి..     " ఏంటోయ్ నీలో నువ్వే గొణుక్కుంటున్నావు.. ఏంటో.. అర్ధమయేటట్లు చెప్పొచ్చు కదా! " అన్నారు ఆయన..

      "ఏం చెప్పమంటారు.. " చిలక్కి చెప్పినట్లు చెప్పాను" మీకు.. విన్నారా.. మీ అక్కగారి" నోట్లో నువ్వు గింజ దాగదు " అని.. నామాట వినకుండా.. ఆవిడ చెవిలో ఊదారు.. ఆవిడ సంగతి తెలిసిందే గా

"తిరిగే కాలూ.. తిట్టే నోరూ ఊరుకోదని" మనమ్మాయికి కుజ దోషం వుందని ఆవిడ ఊరంతా టాంటాం చేస్తోంది. ఒకరిని అనుకుని ఏం లాభం.." మన బంగారు మంచిదవాలి కానీ".. ఇక దీనికి పెళ్ళి అయినట్టే.." అంది సుమతి.

      "ఔనా.. మా అక్క అలా చెప్పదే ఎవరికీ..

"అనుమానం.. పెను భూతం.." అనవసరంగా అపార్థం చేసుకోకు.. మీ పుట్టింటి వాళ్ళేమయినా చెపుతున్నారేమో కనుక్కో.. జాతకం రాయించింది మీ తమ్ముడేగా.. " అన్నాడు కాంతారావు.

    "ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు" ప్రతీదానికీ మా అన్నదమ్ముల్ని ఆడిపోసుకోవడమే మీరు."ఆడలేనమ్మ మద్దెల గోల" లాగా... అయినా మా తమ్ముడేం మీ అక్కయ్య లాగా ఎవరికీ చాటింపులు వేసే రకం కాదు.." అంది సుమతి.

        "ముంజేతి కంకణానికి అద్దమేల".. అయినా.. ఇప్పుడు ఆ గోల ఆపి అసలు సంగతికి రా... ఇంతకీ నీ బాధ... మా అక్క అందరికీ చెపుతోందనా... మనమ్మాయి పెళ్ళి కావడం లేదనా.. " చెవిలో జోరీగ లాగా " నస పెట్టకుండా ఏదో చెప్పు ముందు.." అన్నాడు కాంతారావు.

      "ఇంకేం వుందీ చెప్పడానికీ.. మీకు ఎప్పుడూ" కడుపే కైలాసం.. ఇల్లే వైకుంఠం" నా మాట ఎప్పుడు పట్టించుకున్నారు కనకనా.. అమ్మాయికో మంచి సంబంధం వాకబు చేద్దాం అనిగానీ.. అల్లుడి కాళ్లు కడిగి కన్యాదానం చేద్దామనిగానీ.. ఆలోచనే లేదు.. " అంది సుమతి నిష్ఠూరం గా..

  "ఓసి, పిచ్చిదానా.. " కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదే ".. ఆ ఘడియ రాలేదింకా మన పిల్లకి.. " అన్నాడు తాపీగా..

    "అబ్బబ్బా మీకు చెప్పీ చెప్పీ నా " తల ప్రాణం తోకకివస్తోంది" . " చెవినిల్లు కట్టుకుని పోరినా" వినిపించుకోరు. మీ పెదనాన్న కొడుకు.. చూడండి.. ఎంచక్కా రెండేళ్ళలో ఇద్దరి ఆడపిల్లలు పెళ్ళి చేసి

"గుండెల మీద కుంపటి" దించేసుకున్నారు.. కాస్త ఆయన ఎరికలో ఏవైనా మంచి సంబంధాలున్నాయేమో అడగండి." అంది సుమతి.

      "వాడినా.. వాడు" ఉపకారం అంటే ఊళ్ళోంచి పారిపోయేరకం." వాడినుంచి నేను సహాయం ఆశించడం "ఇసుకలో నూనె పిండినంత".. అయినా వాడు

"అయినవాళ్ళకి ఆకులు.. కాని వాళ్ళకి కంచాలు" పెట్టే తరహా.. వాడిని చచ్చినా అడగను." అన్నాడు కాంతారావు.

  "అయ్యో.." అలా అనుకుంటే ఎలా అండీ..

  "వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్లు పట్టుకున్నాడు" ఆయన ముందు మనమెంతటివారం.. అయినా మన
"నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది." మీరోసారి ఫోను చెయ్యండి.. ఆ తర్వాత" అందితే జుట్టు అందకపోతే కాళ్లు" పట్టుకుందాం." అంది సుమతి.

     "వాడి గురించి "అరటిపండు వలచి చేతిలో పెట్టినట్లు" చెప్పినా నీకు అర్ధం కావడం లేదు. సరేలే..

"తుమ్మితే ఊడిపోయే ముక్కు ఉన్నా ఒకటే పోయినా ఒకటే" నీ తృప్తి కోసం వాడిని అడుగుతాను. ఆ ఫోన్ ఇటు తీసుకురా..

    "హలో.. అన్నయ్యా.. నేనురా.. కాంతారావు ని.. ఎలా వున్నావు? అమ్మాయిల దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయా? కులాసాగా వున్నారా ?.. ఆ.. ఏం లేదు.. ఈ ఏడు మేము మా శ్రీవల్లికి సంబంధాలు చూడడం మొదలెట్టాము.. నీ ఎరికలో ఏవైనా మంచి సంబంధాలుంటే చెప్పమని మీ మరదలు అడగమంటే.. అందుకని ఫోను చేస్తున్నాను.. నీకు.."

    "మేనరికమా... లేదన్నయ్యా.. నీకు తెలీనిదేముందీ.. "పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు" అయినా.. వాడిని గారాబంతో చెడగొట్టింది అక్క... "మొక్కై వంగనిది మానై వంగునా" వాడికి ఇంకా ఉద్యోగం.. సద్యోగం లేదు.. స్ధిరపడలేదు... ఓ పక్క.. అక్కయ్య అంటూనే వుందిలే.. సంబంధం కలుపుకోరా.. అంటూ... మా ఇద్దరికీ సుతారామూ ఇష్టం లేదు.. "అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు" వద్దు అని చెప్పేసాలే అక్కకి.. ఏదైనా సాంప్రదాయ కుటుంబం, మంచి ఉద్యోగం చేసుకుంటున్న పిల్లాడెవరైనా వుంటే చెప్పు.. నా స్ధితిగతులు నీకెరికేగా..... ఔను.. జాతకంలో కొంచెం కుజ దోషం వుందట.. ఏవో పరిహార పూజలు చేయించింది మీ మరదలు.. అక్క చెప్పిందా..." అన్నాడు కాంతారావు..

    ఆ ఫోను లో ఆ అన్నగారి మాటలు అన్నీ విని విసురుగా ఫోను పెట్టేసారు కాంతారావు గారు..

    "ఏంటండీ.. ఏమన్నారు మీ అన్నయ్య?" అంది సుమతి.

    "నీ మాట విని వాడికి ఫోన్ చేసాను... నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి. "మంచోడు మంచోడు అంటే చంకనెక్కి కూర్చున్నాడట" ఇలాంటి వాడే..."కళ్ళు నెత్తికెక్కాయి" వాడికి."కడుపు నిండిన బేరాలూ.. కడుపు నిండిన మాటలూ" వాడివి. ఏంటో ఆడపిల్ల పెళ్ళి చేయడమంటే ఆషామాషి అనుకుంటున్నావా.. నాకంటే ఏదో అదృష్టం పుచ్చి మంచి సంబంధాలు వచ్చాయి... అందరికీ అలా రావు... ఎవరైనా పెళ్ళిళ్ళ పేరయ్యని పట్టుకుని "గంతకి తగిన బొంతని" వెతుక్కోమని ఉచిత సలహా పడేసాడు."* *"ఊరుకున్నంత ఉత్తమం లేదు.. బోడిగుండంత సుఖం లేదు" అనవసరంగా వీడికి ఫోన్ చేసి మాటలనిపించుకున్నాను" అన్నాడు కాంతారావు కోపంగా..

      "అయ్యో.. అంతమాటన్నారా.. అయినా..

  "జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి" పోన్లెండి ఆయన బుధ్ది బయటపడింది... "తలని తన్నేవాడొకడుంటే.. తాడిని తన్నేవాడొకడుంటాడు." ఏదో ఒకరోజు ఆయనకే తెలుస్తుంది.. "ఉంగరాల చేత్తో మొట్టేవాడు చెపితేనే మాట వింటారు కొందరు".. మీరేం బాధ పడకండి.. "మనసుంటే మార్గముంటుంది".. ఆ దేముడే మనకే దారి చూపిస్తాడు. చెప్పడం మర్చిపోయా... నా చిన్నప్పటి స్నేహితురాలు పార్వతి నిన్న గుళ్ళో కనపడింది... తనకి తెలిసిన మంచి సంబంధాలు వున్నాయట.. ఈ రోజు మనింటికి వచ్చి.. చెపుతానంది.. చూద్దాం తనేం చెపుతుందో... "విత్తం కొద్దీ వైభోగం" పైగా మన దురదృష్టం "గోరు చుట్టు మీద రోకలి పోటు" లాగా పిల్లకి కుజ దోషం ఒకటీ... అది కప్పెట్టి పెళ్ళి చేయలేం కదా.." అంది సుమతి.

    మర్నాడు.. కాంతారావు ఆఫీసు నుంచి.. రాగానే.. ఆనందంతో ఎదురెళ్ళింది సుమతి.

  "ఏంటోయ్.. "గాజుల కళకళ గుమ్మంలోనే ఎదురయిందీ".... కొంపతీసి ఉదయం నేను "నక్కని తొక్కివెళ్ళినట్టున్నాను".. అన్నారు.. చమత్కారంగా..

      "పోండి.. మీకెప్పుడూ వేళాకోళమే... ముందిలా కూర్చుని కాఫీ తాగుతూ... నేను చెప్పే విషయం సావధానంగా వినండి. "ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయకండి" అంది. "ముద్దొచ్చినపుడే చంకకెక్కాలి" అనుకుంది సుమతి.

        బుద్ధి గా చేతులుకట్టుకుని..ఆ.. ఇప్పుడు చెప్పు" అన్నాడు కాంతారావు.

      "నిన్న.. నా స్నేహితురాలు పార్వతి గురించి చెప్పాను కదా.. మధ్యాహ్నం తను వాళ్ళాయనని తీసుకుని మన ఇంటికి వచ్చింది. ఆయన బేంక్ మేనేజర్ గా పని చేసి రిటైర్ అయ్యారట. పెద్దది ఆడపిల్ల కి పెళ్ళి చేసి.. కాపురానికి పంపారట. తర్వాత అబ్బాయి.. వేణుగోపాల్.. ఎమ్ బి ఏ.. చేసి.. ఏదో పెద్ద కంపెనీలో చేస్తున్నడట. నెలకి లక్ష పైగా జీతం వస్తోందట. గుళ్ళో నాతో పాటు మన వల్లిని చూసారు కదా.. పిల్ల చక్కగా

  "చిదిమి దీపం పెట్టుకునేలా వుంది" అనిపించిందట. వాళ్ళ వేణుకి చేసుకుంటామని అడిగారు. అప్పటికీ చెప్పాను.. "అంగట్లో అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని వుంది" అన్న చందాన పిల్ల జాతకంలో కుజ దోషం గురించి కూడా చెప్పాను. వాళ్ళ కి అలాంటి పట్టింపులు ఏవీ లేవనీ... అసలు జాతకాల గురించి

  ఆలోచించమనీ.. పైగా పెట్టుపోతలు కూడా ఏవీ ఆశించమనీ.. చెప్పారు. నాకైతే... "వెతకపోయిన తీగ కాలికి చుట్టుకున్నట్టు" అనిపించింది. "ఉయ్యాల్లో బిడ్డని పెట్టుకుని ఊరంతా తిరిగామేమో" మనం. ఇదిగో అబ్బాయి ఫోటో ఇచ్చి వెళ్ళారు.. చూడండి.. దొరబాబు లా వున్నాడు.. మన శ్రీవల్లి పక్కన చూడ ముచ్చటగా వుంటాడనిపించింది. ఇంతకంటే గొప్ప సంబంధం మనం తేలేము.. ఆలోచించండి.." అంది సుమతి.. సంబరంగా.

    "నువ్వు చెప్పిందీ నిజమే సుమతీ... పిల్లాడు బావున్నాడు.. కుటుంబమా.. మంచి సాంప్రదాయ కుటుంబమని చెపుతున్నావు.. పైగా వాళ్ళకి ఈ జాతకాల పట్టింపు లేకపోవడం... నిజంగా మన అదృష్టం. సరే మరి.. రేపు వెళ్లి మంచీ చెడూ మాట్లాడి వద్దాం." అన్నాడు కాంతారావు.

      రేపటిదాకా ఎందుకూ..

    "శుభస్య శీఘ్రం..." ."తలుచుకున్నపుడే తాత ప్రయాణం" అన్నట్లుగా ఇప్పుడే బయలుదేరదాం. మనం వస్తున్న్నట్టు పార్వతి కి ఫోన్ చేస్తాను."మీన మేషాలు లెక్కపెడుతూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తా అయిపోతుంది".. లేవండి.. లేవండి.." అంది సుమతి.

      "లేడికి లేచిందే పరుగు".. మా లేడీ గారు యమ హుషారుగా వున్నారు.. ఉండు పనిలో పని... మా పెదనాన్న కొడుక్కి ఫోన్ చేసి.. ఈ విషయం చెప్పాలి.

"గంతకి తగిన బొంత" అన్నాడుగా... ఇప్పుడు నేను చెప్పే ఈ సంబంధం వాడికి "కుక్క కాటుకి చెప్పు దెబ్బ" అనిపించాలి. "ఇనుము విరిగినా అతకవచ్చుకానీ.. మనసు విరిగితే అతకలేము..".. అంతలా నా మనసుని బాధ పెట్టాడు వాడు." అన్నాడు కాంతారావు.

        "పోన్లెండి.. "ఊరందరిదీ ఓ దారి ఉలిపిరి కట్టెదో దారి" వదిలేయండి.. ఆయనని.. "గురివింద గింజ తనకింద నలుపెరగదట" మనకెందుకింక ఆయన సంగతి.. ముందు బయలుదేరదాం పదండి" అంటూ భర్త ని తొందరపెట్టింది సుమతి.

        వెళ్లే దారిలో..."ఏవండీ.. చెప్పడం మర్చిపోయా.. ఇందాక పార్వతీ.. వాళ్ళాయన వచ్చినపుడు మీ అక్కయ్య గారు వచ్చారు.. విషయం అంతా తెలుసుకున్నారు.. వాళ్ళు వెళ్ళాక.. తన కొడుక్కి.. శ్రీవల్లి ని ఇవ్వడంలేదని ఉక్రోషం తో.. నానా మాటలు అన్నారు.."ఏ రాయైతేనేం పళ్ళూడకొట్టుకోవడానికి".. ఆ జాతకాల పట్టింపులు నాకు లేవన్నాను.. అయినా నా మాటకి విలువీయకుండా పరాయిసంబంధాలకి పోతున్నారూ.. "కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక పోతుంది" అంటూ.. శాపనార్థాలు పెట్టిందావిడ..

"శుభం పలకరా పెళ్ళి కొడకా అంటే పెళ్ళి కూతురు... ఏది ?" అన్నట్టుగా.. ఈవిడ అపశకునపుమాటలేంటీ.. అని బాధేసింది నాకు" అంది సుమతి.

    "పోనీలే.. మా అక్క సంగతి తెలుసుకదా... నువ్వు ఎందుకు.."గుమ్మడి కాయల దొంగంటే భుజాలు తడుముకుంటావు" పట్టించుకోకు..."గుడ్డి గుర్రానికి పళ్ళు తోమడం" తప్ప దానికి వేరే పనీపాటా లేదు.

  "పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్టు" అది అలా వాగుతూనే వుంటుంది. వదిలేయి తన మాటలు.. ఎప్పుడూ వుండేవేగా.." అంటూ భార్య ని ఓదార్చాడు.

          పెళ్లి చూపులు అయిపోవడం.. పెళ్లి మాటలు మాట్లాడుకోవడం.. ఆకాశమోత పెళ్ళి పందిరిలో భూదేవంత అరుగు మీద.. కాంతారావు, సుమతి దంపతులు.. పెళ్లి కొడుకు కి కాళ్లు కడిగి కన్యాదానం చేయడం అయిపోయి.. . అమ్మాయిని అత్తగారింటికి సాగనంపారు.

      పై పంచతో చెమర్చిన కళ్ళని తుడుచుకుంటూ..

  "అందరికాళ్ళు మొక్కినా అత్తవారింటికి పోక తప్పదు కదా" అంటూ అనుకున్నాడు ఆ ఆడపిల్ల తండ్రి.

      ఈ జాతకాలు కుదరడం లేదనే వంకో.. ఈ కుజ దోషం కారణంగానో.. చాలా మంది ఆడపిల్లలకి.. సరైన సమయంలో వివాహం కాకపోవడమో.. అసలు వివాహాలే కాకపోవడమో జరుగుతోంది. విఙ్ఙానం ఇంతలా వెల్లివిరిసి.. ప్రపంచం ఆధునికంగా ముందుకు కు సాగిపోతోంటే... ఇంకా ఈ మూఢ నమ్మకాలేంటి ? ఆడపిల్లల జీవితాలకి ఈ జాతకాలు ఓ అడ్డుగోడ.. చదువుకున్నవారిలోనే ఈ జాడ్యం ఎక్కువగా వుంది.. అందరికీ.. మా శ్రీవల్లి చేయందుకున్న వేణుమాధవ్.. ఓ ఆదర్శం కావాలి... అనుకున్నాడు కాంతారావు.

        ఇంతలో ఫోన్మోగింది.... ఈ పెళ్ళి కి పిలవలేదుగా.. అందుకే ఈ సంగతి తెలీక ... పెదనాన్న కొడుకు.... "ఒరేయ్ కాంతారావూ... మీ అమ్మాయికి ఏదైనా నా సంబంధం వుంటే చెప్పమన్నావుగా... ఇక్కడ.. ఈ. సేవ లో పనిచేస్తూంటాడు.. నెలకి పదివేలు జీతం .. అతనికీ కుజ దోషం వుందట.  సరిపోతుంది ఇద్దరికీ.. వాళ్ళ నెంబర్ ఇస్తాను.. ఓ సారి మాట్లాడి.. సంబంధం కుదుర్చుకో... నాపేరు చెపితే.. కట్నంలో.. కాస్త తగ్గిస్తారు.." అన్నాడు..

    "ఆ.. అన్నయ్యా... "దొంగలు పడ్డ ఆరునెలలకి కుక్కలు మొరిగాయట".. అర్ధమయిందనుకుంటాను.." అంటూ ఫోన్ పెట్టేసాడు.