LATEST UPDATES

18, ఏప్రిల్ 2020, శనివారం

అక్బర్-బీర్బల్ కథలు - 3 అందరిలోకి అదే తెలివైంది కదా..?!

అక్బర్-బీర్బల్ కథలు - 3

అందరిలోకి అదే తెలివైంది కదా..?!

ఒకరోజు అక్బర్ చక్రవర్తి వేటకు వెళుతూ... తన సేవకుడైన జమాలుద్దీన్‌ను తనతో పాటు రమ్మని అడిగాడు. చక్రవర్తి తనకు తోడుగా వేటకు రమ్మని పిలవడంతో సంతోషం పట్టలేని జమాలుద్దీన్ ప్రభువును అనుసరించాడు. వారిద్దరూ అడవికేసి నడుస్తుండగా... ఇంతలోనే ఆకాశంలో కారు మబ్బులు అలముకోసాగాయి. దీన్ని గమనించిన అక్బర్ చక్రవర్తి ఆకాశంకేసి చూస్తూ.. జమాలుద్దీన్...! వాన వస్తుందంటావా...? అని అడిగాడు.

`నేనెలా చెప్పగలను ప్రభూ... నేనేమైనా భవిష్యత్తు తెలిసినవాడినా..?!' అన్నాడు జమాలుద్దీన్. అలా కొద్ది దూరం సాగిపోయిన తరువాత వారికి ఓ గొర్రెల కాపరి గొర్రెల్ని మేపుతూ కనిపించాడు. సరే జమాలు...! ఆ కనిపించే గొర్రెల కాపరిని కలిసి, వాన వస్తుందో, రాదో కనుక్కుని రా...! అని పంపించాడు అక్బర్.

పరుగు పరుగున గొర్రెలకాపరి వద్దకు వెళ్లిన జమాలుద్దీన్... "వాన వస్తుందో, రాదో నీవేమైనా చెప్పగలవటోయ్..!" అని అడిగాడు. గొర్రెల కాపరి తన కంచర గాడిద తోకను పైకెత్తి పట్టుకుని, తేరిపారజూసి "మబ్బులు కాసేపట్లో చెదిరిపోతాయేమో, వాన రాదని నా గాడిద చెబుతోంది.." అని అన్నాడు.

అక్బరు వద్దకు చేరుకున్న జమాలుద్దీన్.. జరిగిన విషయాన్నంతా వివరించి చెప్పాడు. అంతా విన్న అక్బర్ చక్రవర్తి నవ్వుతూ... "చూశావా... మనకన్నా ఆ చదువురాని వాడే నయం.. గాడిద తోకను చూసే వర్షం రాదనే విషయాన్ని పసిగట్టాడు.." అన్నాడు.

తరువాత ఇద్దరూ కాసేపు అలా ముందుకు సాగిపోగానే... కుండపోతగా వర్షం మొదలైంది. అక్బర్, జమాలుద్దీన్‌లు ఇద్దరూ తడిసి ముద్దయిపోయారు. అక్బర్ చక్రవర్తి చిరాకుపడుతూ... "ఇలా జరిగిందేం జమాలూ... ఇప్పుడే కదా వాన కురవదని చెప్పావు.." అన్నాడు.

అప్పుడు జమాలుద్దీన్ "ప్రభూ... వాన కురవదని చెప్పింది నేను కాదు, కంచర గాడిద తోక. పాపం ఆ గాడిద కూడా సరిగ్గానే వివరించి చెప్పి ఉండవచ్చు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవడంలో గొర్రెల కాపరి పొరబడి ఉంటాడు. వాడి మాటల్ని మీరు కూడా నమ్మారు. తప్పితే ఇందులో నా తప్పు ఏముంది" అన్నాడు.

"సరే... ఈ వాన కాసేపట్లో ఆగిపోతుందా, లేక ఇలాగే రాత్రిదాకా కొనసాగుతుందా..?" మళ్లీ అడిగాడు అక్బర్ చక్రవర్తి. "కాసేపాగండి ప్రభూ...! ఇప్పుడే వస్తాను" అంటూ గబగబా అడుగులేశాడు జమాలుద్దీన్. "ఎక్కడికి వెళ్తున్నావ్.. జమాలూ..!" వింతగా చూస్తూ అడిగాడు అక్బర్ చక్రవర్తి. ఏం లేదు ప్రభూ...! "ఇందాకటి గాడిదనే అడిగేసి వస్తా..! ఎందుకంటే ఇక్కడున్న అందరిలో కంటే, అదే తెలివైనది కదా..!" అన్నాడు.

అప్పటిగానీ విషయం బోధపడని అక్బర్ చక్రవర్తి... "వాన రాకడ, పోకడ మనకు ఎలా తెలుస్తుంది. అంతా ప్రకృతి మాత చలవే కదా..!" అని అనుకున్నాడు. "ప్రకృతిలో సహజసిద్ధంగా జరిగే వాటిని మానవులం తేల్చి చెప్పలేం కదా..!" అంటూ తన సేవకుడు సుతిమెత్తగా తెలియజెప్పిన విషయాన్ని మనసులో తలచుకుంటూ జమాలుద్దీన్ వైపు ప్రశంసాపూర్వకంగా చూశాడు అక్బర్ చక్రవర్తి.

నీతి కథలు - 10 టక్కరి నక్క

నీతి కథలు - 10

టక్కరి నక్క

ఒక అడవిలో టక్కరి నక్క ఒకటి ఉండేది. ఆ అడవిలోనే ఓ పశువుల కాపరి గుడిసె వేసుకుని నివసించేవాడు. అతడికి కోళ్లు, కుక్కలు, బర్రెలు, ఆవులతో పాటు మేకలు కూడా ఉండేవి. వాటిని అడవిలో మేపి, పాలు పితికి జీవనం సాగించేవాడు కాపరి.ఆ గుడిసెలోని చిన్నవైన మేకపిల్లలపై టక్కరి నక్క కన్నుపడింది. ఎలాగైనా సరే వాటిని తినేయాలని అది చాలా కాలం నుంచి ప్రయత్నిస్తోంది. అయితే వాటికి ఎప్పుడూ తల్లి మేక కాపలాగా ఉండటం వల్ల దీనికి సాధ్యం కాలేదు.
ఒకరోజు తల్లి మేక మేతకు అడవికి వెళ్ళటంతో చిన్నవైన పిల్లలు గుడిసెలోనే ఉండిపోయాయి. తల్లి మేక వెళ్తూ వెళ్తూ తాను తప్ప ఎవరు వచ్చి తలుపు తట్టినా తీయవద్దని పిల్లలకు జాగ్రత్త చెప్పి మరీ వెళ్ళింది. ఇదంతా ఓ చాటున దాక్కుని వింటోన్న టక్కరి నక్క, ఇదే మంచి సమయమని, ఎలాగైనా ఈరోజు తన పని కానిచ్చేయాలని పథకం వేసింది.

తల్లిమేక వెళ్లిన కాసేపటికి నక్క గుడిసె వద్దకు వెళ్లి, "నేనే మీ అమ్మను, తలుపు తియ్యండర్రా...!" అని అరచింది.లోపల ఉన్న చిన్న పిల్లలకు అది తమ తల్లి గొంతులాగా అనిపించక పోవటంతో... "నువ్వు మా అమ్మవు కావు. మా అమ్మ గొంతు ఇంత కరుకుగా ఉండదు" అని అన్నాయి. తన పని సాధ్యం కాదని భావించిన నక్క అక్కడ్నించీ వెళ్ళిపోయింది. అయితే మనసు ఉండబట్టక తిరిగీ గుడిసె దగ్గరకు వచ్చి "తలుపు తియ్యమని బ్రతిమాలుకుంది" అమ్మ వచ్చేసిందన్న సంతోషంతో తలుపు సందులోంచి తొంగి చూశాయి మేకపిల్లలు. వాటికి నల్లటి కాళ్ళు తప్ప మరేమీ కనిపించలేదు. "నువ్వు మా అమ్మవు కావు. మా అమ్మకి తెల్ల కాళ్లుంటాయి" అని అన్నాయి.
ఆహా! అలాగా అనుకుంటూ అక్కడ్నించీ వెళ్లిపోయిన నక్క ఈసారి కాళ్లకు తెల్లరంగు పులుముకుని వచ్చింది. గొంతు, కాళ్ళు వాటి అమ్మవిలాగే అనిపించటంతో మేకపిల్లలు తలుపుతీశాయి. అంతే ఒక్కసారిగా వాటిపై పడిన నక్క గబుక్కున మింగేసి, అక్కడ్నించి పారిపోయింది.

ప్రశ్న : అంతరిక్షంలోని నక్షత్రాలు, గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతుంటాయి. ఎందుకు?

ప్రశ్న : అంతరిక్షంలోని నక్షత్రాలు, గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతుంటాయి. ఎందుకు?

జవాబు :
ఏదైనా వస్తువు, ఉదాహరణకు తిరుగుతున్న బొంగరం, ఒక అక్షం ఆధారంగా తన చుట్టూ తాను తిరుగుతుందంటే, అది పరిభ్రమణం చేస్తుందని అంటాం. అంతరిక్షంలోని నక్షత్రాలు, గ్రహాలు ఇలా పరిభ్రమణాలు చేస్తుండడానికి కారణాన్ని భౌతిక శాస్త్ర నియమం 'కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం' ద్వారా వివరించవచ్చు. ఈ నియమం ప్రకారం పరిభ్రమణం చేస్తున్న వస్తువు ఏ కారణం లేకుండా దానంతట అది ఆగిపోదు. పరిభ్రమణం చేస్తున్న బొంగరం కొంతసేపటికి ఆగిపోవడానికి కారణం దాని 'ములుకు'కు నేలకు మధ్య ఉన్న ఘర్షణ (friction) ప్రభావమే. ఆ ఘర్షణ లేకుంటే పరిభ్రమణంలో ఉన్న బొంగరం ఆగకుండా అలా తిరుగుతూనే ఉంటుంది.

ఇక నక్షత్రాలు, గ్రహాల పరిభ్రమణ విషయానికి వస్తే, అవి తమ చుట్టూ తాము పరిభ్రమిస్తున్న వాయుధూళి సముదాయం ఘనీభవించడం వల్ల ఏర్పడినవే. ఈ వాయుమేఘాలు గురుత్వ ప్రభావం వల్ల క్రమేపీ తమలోకి తాము కుంచించుకుపోవడంతో కాలక్రమేణా నక్షత్రాలు, వాటి చుట్టూ గ్రహ వ్యవస్థలు ఏర్పడ్డాయి. ఈ వాయు మేఘాలు కుంచించుకుపోయేకొలదీ వాటి భ్రమణ వేగాలు ఎక్కువయ్యాయి. ఐస్‌పై స్కేటింగ్‌ చేస్తూ తమ చుట్టూ తాము తిరుగుతున్న స్కేటర్లు తాము దూరంగా బార చాపిన చేతులను తమ శరీరానికి దగ్గరగా తెస్తున్నపుడు వారి పరిభ్రమణ వేగం ఎక్కువవుతున్నట్లు.

ఇలా పరిభ్రమిస్తున్న వాయు మేఘాలు క్రమేపీ నక్షత్రాలుగా మారుతున్నపుడు ఆ మేఘాలలోని అతి కొద్ది శాతం పరిభ్రమణ చలనం మాత్రమే నక్షత్రాలకు బదిలీ అవుతుంది. లేకపోతే ఆ చలన వేగానికి నక్షత్రాలు తునాతునకలై పోతాయి. ఇలా జరగకుండా నిరోధించడానికే ఆ నక్షత్రాల నుంచి గ్రహాలు ఏర్పడి, వాయుమేఘాల తొలి పరిభ్రమణ వేగం అంటే తొలి కోణీయ ద్రవ్యవేగాన్ని తలాకొంచెం పంచుకున్నాయి. అందువల్లే నక్షత్రాలు, గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతుంటాయి.

17, ఏప్రిల్ 2020, శుక్రవారం

అక్బర్-బీర్బల్ కథలు - 2 మణిహారం దొంగ

అక్బర్-బీర్బల్ కథలు - 2

మణిహారం దొంగ

అక్బర్ చక్రవర్తికి ఒక రోజు ఉన్నట్టుండి... బీర్బల్‌ను ఏడిపించాలని ఓ సరదా ఆలోచన వచ్చింది. బాగా ఆలోచించిన ఆయన తన మెడలోని హారాన్ని ఒకదాన్ని తీసి చేతబట్టుకుని, తన సేవకుడిని పిలిచి దాచిపెట్టమని చెప్పాడు. రాజాజ్ఞను శిరసావహించిన ఆ సేవకుడు హారాన్ని తీసుకుని దాచిపెట్టాడు.
ఈ విషయాలేమీ తెలియని బీర్బల్ ఎప్పట్లాగే ఆరోజు కూడా సభకు విచ్చేశాడు. బీర్బల్‌ను చూసిన రాజు తాను వేసిన పథకాన్ని గుర్తుకు తెచ్చుకుని నవ్వుకున్నాడు. అంతేగాకుండా... బీర్బల్ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడోనన్న కుతూహలం కూడా ఆయన కలిగింది.

బీర్బల్‌తో అక్బర్ ఇలా అన్నాడు. "బీర్బల్ ఈ రోజు నామనసు ఏమి బాగాలేదు." అన్నాడు. ఈ మాట విన్న బీర్బల్ కంగారుతో.. చెప్పండి మహాప్రభూ.. ఏమైంది? మీ మనస్సు ఎందుకు బాగుండటం లేదు? అని అడిగాడు. ఏం లేదు బీర్బల్...! మహారాణి ప్రేమగా బహూకరించిన నా మణిహారాన్ని ఎవరో తస్కరించారు అని చెప్పాడు మహారాజు.

"స్నానం చేస్తున్నప్పుడు ఎక్కడైనా పెట్టిమర్చిపోయారేమో గుర్తు చేసుకోండి మహారాజా!" అని అన్నాడు బీర్బల్. స్నానానికి వెళుతూ హారం తీసి పక్కన పెట్టాను. తిరిగి వచ్చి చూస్తే, హారం మాయమైపోయింది... అంటూ చెప్పసాగాడు రాజు. మహారాజు చెబుతున్నదంతా మౌనంగా విన్నాడు బీర్బల్.

అంతా విన్న బీర్బల్... "ఆ హారం దొంగ ఎవరో ఇక్కడే ఉన్నాడు. ఆ విషయం నాకు బాగా తెలుసు. కాబట్టి ఆ హారం ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది. "మహారాజా! మీకు ఎవరి మీదనైన అనుమానం ఉంటే చెప్పండి" అని అడిగాడు. లేదు బీర్బల్! నాకు ఎవ్వరి మీద అనుమానం లేదు. అయినా సరైన ఆధారాలు లేకుండా ఎవరినైనా అనుమానించడం చాలా తప్పు అన్నాడు రాజు. సభలో ఉన్న వారంతా వారికి తోచిన సలహాలు చెబుతూ ఉండే బీర్బల్ మాత్రం మౌనంగా ఉండిపోయాడు.

కొద్దిసేపటి తర్వాత మహారాజు ఇలా అన్నాడు.. "బీర్బల్ ఈ సమస్య పరిష్కరించగలవాడివి నువ్వేనని నాకు అనిపిస్తోంది... నీకు జ్యోతిష్యం తెలుసు కాబట్టి ఆ హారం దొంగ ఎవరో నువ్వే కనిపెట్టాలి" అని అన్నాడు. రాజు చెప్పిన దానికి బీర్బల్ ఒప్పుకుంటూ... మహారాజా మీరు స్నానానికి వెళుతూ హారం ఎక్కడ పెట్టారో ఆ స్థలం నాకు చూపించండి అని అడిగాడు. వెంటనే చక్రవర్తి ఓ అల్మరా వద్దకు తీసుకెళ్లి ఇక్కడే పెట్టానని చెప్పాడు.

అల్మరా వద్దకు వెళ్ళిన బీర్బల్... "ఆహా...! అలాగా...! సరి సరే....!!" అని అన్నాడు. దీంతో బీర్బల్ ఏం చేస్తున్నాడో అక్కడున్న వారందరికీ అర్థం కాలేదు. అల్మరానే ఆయనకు ఏదో చెబుతోంది అన్నట్లుగా ఆశ్చర్యపోయి చూస్తుంటారు వాళ్ళు. వెంటనే బీర్బల్ మహారాజా హారం దొంగెవరో దొరికిపోయాడు అన్నాడు. రాజు హారాన్నే దొంగిలించే ధైర్యం ఎవరికుంది? ఎవరు వాడు చెప్ప బీర్బల్...! అన్నాడు అక్బర్.

ప్రభూ...! ఈ అల్మారా ఏం చెప్తోందంటే ఎక్కడ మీరు స్నానం చేసి త్వరగా వచ్చేస్తారోనన్న కంగారుతో ఉన్న దొంగ గడ్డం అల్మరాలో ఇరుక్కుపోయిందట! అని చెప్పాడు. కావాలంటే మీరు అల్మరా తెరిపించండి... తప్పకుండా అందులో మీకు వెంట్రుకలు కనిపిస్తాయి. అన్నాడు.

దీంతో రాజు ఎవరికైతే తన ఉంగరాన్ని దాచి పెట్టమని ఇచ్చాడో అతను కంగారుగా గడ్డం సవరించుకున్నాడు. అంతే బీర్బల్ దొంగను పట్టుకుని, మహారాజా ఇతడే దొంగ అని చూపించాడు. పట్టుబడ్డ రాజు సేవకుడు భయంతో వణుకుతూ అక్బర్ వద్దకు వెళ్ళగా... ఆయన జరిగిందంతా బీర్బల్‌కు వివరించాడు. దీంతో బీర్బల్ శాంతించి, నవ్వుకున్నాడు.

అయితే సభలో ఉన్న వారందరితో సహా మహారాజుకు కూడా.. అసలు బీర్బల్ దొంగను ఎలా పట్టుకోగలిగాడో ఎవ్వరికీ అర్ధంకాలేదు. అదే విషయం బీర్బల్‌ను అడిగాడు. అప్పుడు అసలు విషయం వివరించాడు బీర్బల్. మరేం లేదు మహారాజా..! మీరు అల్మరాలో హారం పెట్టానని చెప్పారు. మీరు చెప్పింది నిజమే అనుకున్నాను నేను.

అంతేగాకుండా మీరు నాకు జ్యోతిష్యం తెలుసునని చెప్పగానే నాకో ఉపాయం తోచింది. అల్మరా దగ్గరికెళ్ళి చెవి ఆనించి ఏదో విన్నట్టుగానే నటించాను. దొంగ గడ్డం అల్మరాలో చిక్కుకుపోయిందని కల్పించి చెప్పాను. నేను అలా చెప్తే నిజంగా హారం దొంగిలించిన దొంగ గడ్డం సవరించుకుంటాడని అనుకున్నాను.

అనుకున్నట్టుగానే ఆ సేవకుడు మీరు దాచిపెట్టమని చెప్పిన విషయాన్ని మర్చిపోయి గడ్డం సవరించుకున్నాడు. అంతే దొంగ దొరికిపోయాడు అని చెప్పాడు బీర్బల్. బీర్బల్ తెలివితేటలను రాజు, ప్రజానీకం మెచ్చుకుని ప్రశంసలు, పొగడ్తలతో ముంచెత్తారు.

నీతి కథలు - 9 మతిలేని మృగరాజు

నీతి కథలు - 9

మతిలేని మృగరాజు

ఒక దట్టమైన అడవిలో ఒక సింహం నివసించేది. అడవికి రాజైన ఆ సింహం, ప్రతిరోజు జంతువులని తినేది, ఒకేసారి ఒక్కటి, ఒక్కోసారి రెండు లేదా మూడింటిని కూడా తింటూ ఉండేది. జంతువులన్నీ తమ రాజుతో విసిగిపోయాయి. అందుకని అవి ఒకరోజు సమావేశం ఏర్పాటుచేసి, ఒక నిర్ణయానికి వచ్చాయి. అదేమంటే, ఒకవేళ సింహం తన గుహనుండి బయటికి రాకుండా ఉండాలంటే అవి రోజుకి ఒక జంతువును ఆహారంగా ఆ సింహం వద్దకే పంపించాలి. రోజుకో జంతువు తనకి తానుగా సింహం దగ్గరికి వెళితే, మిగతావి మనశ్శాంతిగా అడవిలో జీవించగలవు.

రోజులు గడుస్తున్నాయి. జంతువుల సంఖ్య తరిగిపోతూనే ఉంది. మృగరాజు తన గుహలోనే కుర్చుని తన దగ్గరకు వచ్చిన భోజనాన్ని ఆనందిస్తూ తినేది. ఒక రోజు ఒక కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు భయపడుతూనే గుహకు బయలుదేరింది. అది తాబేలులాగా నెమ్మదిగా నడుస్తూ గుహ చేరుకునేసరికి సాయంత్రం అయింది. ఆకలితో అలమటిస్తున్న సింహానికి కుందేలుపైన ఎంతగానో కోపం వచ్చింది.

కుందేలు భయంతో ఏడవడం మొదలు పెట్టింది. "ఓ రాజా! ఇది నా తప్పు కాదు. మా జంతువుల సభ తప్పు కుడా కాదు. మా సభ వాస్తవానికి ఏడు కుందేళ్ళని పంపిందికానీ, మమ్మల్ని దారిలో ఒక దుర్మార్గుడు ఆపాడు. వాడు మిమ్మల్ని తిట్టాడు అంతేకాక నా స్నేహితులందర్నీ తినేసానని మీకు చెప్పమని ఆజ్ణాపించాడు" అని అంది. సింహం వెంటనే, అది పడుకున్న చోట నుండి లేచింది. "అదెక్కడుంటుందో నాకు ముందుచెప్పు? నేను దానిని బతికుండగానే తినేస్తాను" అంది కోపంగా.

"అది ఆముదం చెట్టు వెనుక ఉన్న ఒక బావిలో గుహ ఏర్పరచుకుని అందులో ఉంటోంది రాజా!" అని కుందేలు బదులు పలికింది.కుందేలును వెంటబెట్టుకుని సింహం బావి దగ్గరికి వచ్చింది. సింహం బావి గోడలపైన నిలబడి బావిలోపలికి తొంగి చుసింది. బావిలో దానికి మరో సింహం కనిపించింది. కానీ, వాస్తవానికి అక్కడ కనిపించింది నీటిలో తన ప్రతిబింబమే. కానీ, సింహం దాన్ని మరో సింహం అనుకుంది. అది తన భయంకరమైన పళ్ళు చూపింది. ఇంకో సింహం కూడా తన పళ్ళు చూపించింది. సింహం గట్టిగా గాడ్రించింది. రెండోది కూడా అదే చేసింది. బావిలో నుండి సింహం గొంతు ప్రతిధ్వనించి తిరిగి దానికే మరింత భయంకరంగా వినిపించింది.

ఇంకో సింహం ఆ ఆడవిలోకి వచ్చిందనుకుంది సింహం. మరేమీ ఆలోచించకుండా బావిలో ఉన్న ఆ కొత్త సింహం మీదకి ఉరికింది. దానితో అది బావిలో పడి, నీటిలో మునిగి చనిపోయింది. కుందేలు సంతోషంతో వేగంగా గెంతుతూ తిరిగి వెళ్ళిపోయింది. అది ప్రాణాలతో రావడం చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. జరిగినదంతా విడమర్చి చెప్పింది కుందేలు, సింహం పీడ పోయినందుకు అన్నీ సంతోషించాయి.

ప్రశ్న: పాదరసం నీటిలో కరగదు-కలవదు.ఎందువల్ల?

ప్రశ్న: పాదరసం నీటిలో కరగదు-కలవదు.ఎందువల్ల?

జవాబు:
భూమిపై ఉన్న వందకుపైగా మూలకాల్లో సాధారణ ఉష్ణోగ్రతా పీడనాల దగ్గర ద్రవస్థితిలో ఉన్నవి రెండే రెండు. ఒకటి బ్రోమిన్‌. ఇది అలోహం (non metal) , రెండోది పాదరసం. ఇది లోహం. అరచేతిలో పెట్టుకొంటే ద్రవంగా మారే రుబిడియం, ఫ్రాన్షియం, గెలియం వంటి ఇతర లోహాలు ఉన్నాయి. మూలకాలకు స్వతహాగా ధ్రువత్వం (polarity) ఉండదు.

ఒకే కణానికి విద్యుదావేశం ఉంటే వాటిని అయానులు అంటారు. ఉదాహరణకు (Nacl) ఉప్పులో సోడియం కణానికి ధనావేశం ఉంటుంది. ఒక కణంలో ఓ ప్రాంతంలో ధనావేశ లక్షణం, మరో ప్రాంతంలో రుణావేశ లక్షణం ఉంటే అటువంటి పదార్థాలను ధ్రువపదార్థాలు (polar materials) అంటారు. ఉదాహరణకు అమ్మోనియో (NH3) అణువులో నత్రజని పరమాణువు ప్రాంతంలో రుణావేశితం స్వల్పంగా పోగయి ఉంటుంది. హైడ్రోజన్‌లున్న ప్రాంతంలో స్వల్పంగా ధనావేశం పోగయి ఉంటుంది. అందుకే ఆ అణువును ధ్రువాణువు అంటారు. పూర్తిగాగానీ లేదా పాక్షికంగానైనా గానీ విద్యుదావేశం అదనంగా లేని పరమాణువుల్ని అణువుల్ని, పదార్థాల్ని మనం అధ్రువ పదార్థాలు అంటాం. అయస్కాంత పదార్థాలు అయస్కాంత లక్షణాలున్న పదార్థాలతోనే ప్రభావితమైనట్లే, విద్యుదావేశమున్న పదార్థాలు ఇతర విద్యుదావేశిత పదార్థాలతోనే ప్రభావితమవుతాయి. నీటి అణువు H2o కూడా ధ్రువ అణువు. ఆక్సిజన్‌ దగ్గర రుణావేశం, హైడ్రోజన్ల దగ్గర ధనావేశం స్వల్పంగా పోగయి ఉంటాయి. కాబట్టి నీటిని ధ్రువద్రావణి అంటారు. అందువల్ల అయాను లక్షణాలున్న ఉప్పు, ధ్రువ లక్షణాలున్న చక్కెర, ఆల్కహాలు వంటివి నీటిలో బాగా కరుగుతాయి, కలుస్తాయి. పాదరసానికి ధ్రువ లక్షణం లేకపోవడం వల్ల నీటిలో కరగదు. కలవదు.

16, ఏప్రిల్ 2020, గురువారం

అక్బర్-బీర్బల్ కథలు - 1 దొంగ సాధువు

అక్బర్-బీర్బల్ కథలు - 1

దొంగ సాధువు

అక్బరు చక్రవర్తి సువిశాల సామ్రాజ్యంలో సుల్తాన్‌పురి అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక ఆశ్రమం ఉండేది, అందులో ఒక గుడ్డివాడైన సాధువు నివసిస్తుండేవాడు. ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉండే ఆ సాధువుకు ఊరి జనాలందరి భవిష్యత్తు తెలుసని ప్రజలందరూ నమ్ముతూ ఉండేవారు.

ఒకరోజు అతడి ఆశ్రమానికి ఒక వ్యక్తి తన అన్నకూతురును తీసుకొస్తాడు. ఆ అమ్మాయికి ఆరోగ్యం సరిగా లేదు. ఎందుకంటే అంతకు కొన్నిరోజుల క్రితం ఆమె కళ్లెదురుగానే ఆమె అమ్మా, నాన్నలను ఎవరో దారుణంగా చంపేశారు. ఆ అఘాయిత్యాన్ని కళ్లారా చూసిన ఆ అమ్మాయికి అప్పటినుండి బుద్ధి స్వాధీనంలో లేకుండా తయారవుతుంది. 

దీనికి బాధపడ్డ ఆ అమ్మాయి చిన్నాన్న ఈ సాధువు బాగుచేస్తాడన్న నమ్మకంతో వైద్యం కోసం తీసుకొస్తాడు. అయితే ఆ అమ్మాయి ఆ సాధువును చూడగానే... ఏడుపు మొదలుపెట్టింది. తన అమ్మానాన్నలను చంపింది అతడే అని ఏడుస్తూ చెప్పింది. అది విన్న జనాలంతా ఆశ్చర్యపోయారు.

మహానుభావుడైన సాధువు ఎవరినైనా ఎందుకు చంపుతాడు. పైగా గుడ్డివాడు ఆ పని ఎలా చేస్తాడని తమలో తాము అనుకోసాగారు. అంతే కాదు ఆ అమ్మాయికి పిచ్చిపట్టిందని, అందుకే ఏవేవో మాట్లాడుతోందని అన్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ సాధువు కూడా ఆ విషయాన్నే నిర్ధారించి ఆశ్రమం నుండి వాళ్లను వెళ్లగొట్టించాడు.


అయితే ఆ అమ్మాయి రోజంతా అలాగే ఏడుస్తూనే ఉంటుంది. దీంతో ఆమె చెప్పిన మాటలు నిజమేనన్న సందేహంతో ఆమె చిన్నాన్న బీర్బల్ దగ్గరకు తీసుకెళ్ళాడు. జరిగినదంతా విన్న బీర్బల్ మరుసటిరోజు ఆ అమ్మాయిని, ఆమె చిన్నాన్నను, గుడ్డివాడైన సాధువును రాజు సభకు పిలిపించాడు.

నువ్వు ఈ అమ్మాయి అమ్మానాన్నలను చంపావా? అని గుడ్డి సాధువు ప్రశ్నించాడు బీర్బల్. "నేను గుడ్డివాడిని, నేనెలా చంపగలను?" అన్నాడు సాధువు సమాధానంగా. అలాగా..?! అంటూ ఒక్క నిమిషం వ్యవధిలో కత్తి తీసి సాధువు మీదికి ఉరికాడు బీర్బల్. అంతే.... తనకు అపాయం ముంచుకొస్తోందని గ్రహించిన సాధువు వెంటనే మరో కత్తి తీసుకుని బీర్బల్ పైకి ఎదురుదాడికి దిగాడు దొంగసాధువు.

అసలు రూపాన్ని బయటపెడుతూ తనపైకి దాడికి దిగిన దొంగ సాధువు తలను ఒక్క దెబ్బతో తెగ్గొట్టాడు బీర్బల్. అంతేగాకుండా అతడివల్ల నష్టపోయిన ఆ అమ్మాయికి రాజు ఆస్థానంలోనే ఆశ్రయం కల్పించాడు.

నీతి కథలు - 8 బ్రాహ్మణబాలుడి కథ

నీతి కథలు - 8

బ్రాహ్మణబాలుడి కథ

పూర్వం విచిత్రపురం అనే రాజ్యం ఉండేది. దానికి రాజు తంత్రవర్మ. ఇతడు కాస్తభోగలాలసుడూ, మరికాస్త స్వార్ధపరుడూనూ. అయితే ప్రజల అదృష్టం కొద్దీ ఇతడి మంత్రులు కొంత బుద్ధిమంతులు. అందుచేత రాజ్యపాలన కొంత సజావుగా సాగుతూ ఉండేది.

ఇలా ఉండగా, ఓ రోజు, ఈ రాజు అడవికి వేటకు వెళ్ళాడు. మధ్యాహ్నం వరకూ జంతువుల వేటలో గడిపాడు. ఇక విశ్రాంతి తీసికొందామని నది ఒడ్డు చేరాడు. అక్కడ అతడి కొక అందమైన యువతి కన్పించింది. ఆమెని చూడగానే రాజుకి కన్ను చెదిరింది. మెల్లిగా ఆమెని చేరి “ఓ సుందరీ! నీవెవ్వరు? ఇంత నిర్జనారణ్యంలో ఒంటరిగా ఎందుకు సంచరిస్తున్నావు?” అనడిగాడు. అందుకామె అలవోకగా ఓ చిరునవ్వు నవ్వి “రాజా! నేను ముని కన్యను! ఈ అరణ్యంలోనే మా నివాసం” అంది.

రాజు ఆమె పైన తనకు గల మోహన్ని వ్యక్తపరిచాడు. ఆమె “రాజా! నేను ముని వృత్తిలో నున్నదానిని. మీరు దేశాన్నేలే మహారాజులు. మీలాంటి వారు మాలాంటి వారాని కోరదగునా? కానీ, కోరి మీరు నన్నడిగినప్పడు కాదనడం సరికాదు. నాతల్లిదండ్రులను అర్ధించి నన్ను పొందండి” అంది. వీరిలా మాట్లాడు కొంటూ ఉండగా, హఠాత్తుగా వాళ్ళ ముందో రాక్షసుడు ప్రత్యక్షమయ్యడు. చెట్టంత రాక్షసుడు భీకరంగా గర్జిస్తూ ఒక్కవుదుటున రాజుని గుప్పిట బంధించి మ్రింగబోయాడు. తంత్రవర్మ ఒక్కపెట్టున పెద్దగా ఏడుస్తూ “వద్దు. వద్దు! నన్ను చంపవద్దు” అన్నాడు.“ఒక్క షరతు మీద నిన్ను వదిలేస్తాను” అన్నాడు రాక్షసుడు. “చెప్పు. తప్పక నెరవేరుస్తా” అన్నాడు రాజు. "నీరాజ్యంలో తల్లిదండ్రులిద్దరూ ఉన్న బాలుణ్ణి, నీకు బదులుగా నాకు సమర్పించేటట్లయితే, నిన్నువదిలేస్తాను" అన్నాడు రాక్షసుడు.

రాజు తంత్రవర్మ సరేనన్నాడు. రాక్షసుడు వదిలిందే క్షణం, రాజధానికి పరుగెత్తాడు. సైనికుల్ని పంపి రాజ్యంలో పేదవారి గురించి ఆరా తీయించాడు. చివరికి ఓ బ్రాహ్మణ కుటుంబాన్ని ఎంచుకున్నాడు. ఆ పేద వారింట భార్యా,భర్త, ముగ్గురు కొడుకులూ ఉన్నారు. వారు ఆపూట కూటికి కూడా లేని పేదవారు. రాజు బ్రాహ్మణ దంపతలకి పెద్దఎత్తున డబ్బాశ పెట్టి వారి ముగ్గురు కొడుకుల్లో ఒకరిని తనకి ధారాదత్తం చెయ్యమని అడిగాడు. బ్రాహ్మణుడు "రాజా! నాపెద్ద కొడుకంటే నాకు చాలా ఇష్టం. రేపు నేను ఛస్తే నాకు తలకొరివి పెట్టవలసింది వాడే కదా! అందుచేత నాపెద్దకొడుకుని ఇవ్వను. మిగిలిన ఇద్దరిలో నీకు కావలసిన వాణ్ణి తీసుకుపో!" అన్నాడు.

అంతలో అతడి భార్య "మహారాజా! నాచిన్నకొడుకంటే నాకు తీరని ముద్దు. అంతే గాక రేపు నేను ఛస్తే, నాకు తలకొరివి పెట్టవలసినవాడు చిన్నవాడు. అందుచేత నా చిన్నకొడుకుని మీరు తీసికెళతానంటే నేను ఒప్పకోను. కావాలంటే మా రెండవకొడుకుని తీసుకుపొండి" అన్నది.రాజు వారికి డబ్బుచ్చి, రెండో కొడుకుని కొనుక్కున్నాడు. ఆ బాలుణ్ణి తీసికెళ్ళి రాక్షసుడికి సమర్పించాడు. ముదురుగా, అరిషర్వర్గపూరితమైన, దుర్గంధభరితమైన రాజు శరీరం బదులుగా, తనకు ఆహారం కాబోతున్న బ్రాహ్మణబాలుడి లేత శరీరాన్ని ఆబగా చూస్తూ రాక్షసుడు పిల్లవాణ్ణి మింగబోయాడు.

సరిగ్గా ఆ పిల్లవాణ్ణి గుప్పట బిగించి, నోట బెట్టబోతుండగా ఆ బాలుడు గట్టిగా ఫకాలు మని నవ్వాడు. మరుక్షణం రాక్షసుడు పిల్లవాణ్ణి నేలదించి తలెత్తకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. భేతాళుడింత వరకూ కథచెప్పి, విక్రమాదిత్యుణ్ణి చూసి "విక్రమాదిత్య మహారాజా! ఎందుకు బ్రాహ్మణ బాలుడు నవ్వాడు? అది చూసి రాక్షసుడు బాలుణ్ణి మ్రింగకుండా ఎందుకు వదిలి పెట్టిపోయాడు? తెలిసీ సమాధానం చెప్పకపోతే నీ తలవెయ్యివక్కలౌతుంది. జవాబు చెప్పి మౌనభంగం చేశావో నేను నీకు అధీనం కాను" అన్నాడు.

విక్రమాదిత్యుడు పెదవులమీద చిరునవ్వు మెరుస్తుండగా, "భేతాళా! ఆబాలుడి నవ్వులో "ఇరుగు పొరుగు వారు కొట్టవచ్చినప్పుడు కాపాడవలసిన వారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులే దయమాలి బిడ్డలను హింసిస్తూ ఉంటే కాపాడవలసిన వాడు రాజు. రాజే కృరుడై ప్రజలని బాధిస్తుంటే కాపాడవలసినది దైవం. అలాంటి దైవమే దయమాలి నన్ను చంపబోతుంటే ఇంక నేమి గతి?" అన్నభావం ఉన్నది. అది చూసి రాక్షసుడే అయినా బాలుడితో పోల్చుకుంటే తనకు గల బలం తాలూకూ దైవత్వాన్ని గుర్తిరిగి రాక్షసుడు పిల్లవాణ్ణి విడిచి పెట్టిపోయాడు" అన్నాడు.

ప్రశ్న : వైద్యులు నాడి పట్టుకుని చూస్తారెందుకు?

ప్రశ్న : వైద్యులు నాడి పట్టుకుని చూస్తారెందుకు?

జవాబు :
ప్రస్తుత వైద్యులు  రోగిని తాకడం తగ్గించారు. . కానీ పాతరోజుల్లో వైద్యులు తమ రోగిని ముంజేయి దగ్గర పట్టుకుని చూసేవారు. అది నాడిని పట్టుకోవడము అని మనము అనుకుంటాము . వాస్తవములో వైద్యుడు రక్తనాళము పట్టుకుని చూస్తాడు . రక్తనాళము లో రక్తము ఒక క్రమవేగముతో ప్రవహిస్తుంది. అది కాకుండా ధమని గోడలు గుండె కొట్టుకోవడము మాదిరిగానే పల్స్ కొట్టుకొంటుంది. అది ఎన్నిసార్లు కొట్టుకుంటున్నాదో లెక్కపెడతారు. అనారోగ్యానికి గురి అయినప్పుడు ఆ రక్తప్రవాహ వేగము మారుతుంది. ఆ వేగము తగ్గిందా , పెరిగిందా అనేది చేయి పట్టుకుని తెలుసుకొని దానిని బట్టి రోగాన్ని అంచనావేయడము వైద్యులు చేస్తారు.

15, ఏప్రిల్ 2020, బుధవారం

నీతి కథలు - 7 నసీరుద్దీన్ కథలు

నీతి కథలు - 7

నసీరుద్దీన్ కథలు

అది మౌల్వీ నసీరుద్దీన్ నివసించే దేశం. ఆ దేశాన్ని తైమూర్ పాలిస్తుండేవాడు. ఇతడు పేరుకే రాజుగానీ, పరమ పిసినారి, స్వార్ధపరుడూను. అతడికి ఈర్ష్యాసూయలు కూడా ఎక్కువే.  ఎప్పుడూ నసీరుద్దీన్ నుండి సలహాలు తీసుకొంటాడే గానీ ఏనాడు మంచి పారితోషికం ఇవ్వడు.నసీరుద్దీన్ తనకి ఒక గుర్రం కావాలని తైమూర్ ని అర్ధించాడు. పిసినారి తైమూర్ కి నసీరుద్దీన్ కి గుర్రాన్నివ్వడం ఇష్టంలేదు. ఇవ్వక తప్పేట్లు లేదు.


దాంతో ఓ ముసలి చచ్చు గుర్రాన్ని నసీరుద్దీన్ కిచ్చాడు. ఇలా ఉండగా ఓ రోజు తైమూర్ తన పరివారంతో కలిసి వేటకి బయలుదేరాడు. నసీరుద్దీన్ కూడా వాళ్ళ వెంట ఉన్నాడు. అందరూ గోబీ ఎడారి చేరారు. ఇంతలో గాలి, దుమ్ము రేగాయి. మేఘాలు కమ్ముకొచ్చాయి. అంతలోనే ఉరుములు మెరుపులతో కుంభవృష్టి మొదలయ్యింది.

తైమూర్, అతని సైనికులు ఎక్కిన గుర్రాలు బలంగా ఉన్నాయి. ఆ గుర్రాలు మీద వాళ్ళంతా ఒక్క ఉదుటున దౌడు తీయిస్తూ వెనక్కి ఊళ్ళోకి మళ్ళారు. అయినా గానీ ఊరు చేరే లోగా తడిసి ముద్దయ్యారు. నసీరుద్దీన్ గుర్రం ముసలిది, ఒక్కచిక్కినది అయిన చచ్చు గుర్రంమయ్యే.గాలి మొదలవ్వగానే అది అడుగు తీసి అడుగు వెయ్యకుండా, ఉన్న చోటునే బిర్ర బిగిసినట్లు నిలబడి పోయింది. ఎంత అదిలించినా కదల్లేదు, మెదల్లేదు. చేసేది లేక నసీరుద్దీన్ గుర్రం దిగాడు. వర్షం మొదలయ్యేలోగా బట్టలు విప్పి ఆ గుర్రం క్రింద దాచాడు. ఎడారిలో తడుస్తూ అలాగే నిలబడ్డాడు. 

వర్షం తగ్గాక ఒళ్ళార్చుకొని, గుర్రం క్రింద దాచిన దుస్తులు తొడుక్కొని గుర్రమెక్కి ఊళ్ళోకి వచ్చాడు. కొంచెమైనా తడవకుండా, పొడి దుస్తులతో వచ్చిన నసీరుద్దీన్ ని చూచి తైమూర్ ఆశ్చర్యపోయాడు. "అదేమిటయ్యా నసీరుద్దీన్. ఎంత వేగంగా వచ్చినా మేం ముద్దగా తడిసిపోయాము. నువ్వెలా తడవకుండా వచ్చావు? ఎక్కడున్నావు ఇప్పటి దాకా?" కుతుహలంగా అడిగాడు తైమూర్.

"అహా..హా! ఏం చెప్పను హూజూర్! అద్బుతం. అమోఘం.” ఇంకా పరవశంలోనే ఉన్నట్లు నటిస్తూ మైమరుపుగా అన్నాడు నసీరుద్దీన్. తైమూర్ కుతుహలం మరింత పెరిగిపోయింది."ఏమిటి అద్భుతం? త్వరగా చెప్పవయ్యా!” అంటూ తొందర పెట్టాడు తైమూర్. "హూజూర్! ముందుగా నేను మీకు కృతఙ్ఞతలు చెప్పుకోవాలి” అన్నాడు నసీరుద్దీన్. "ఎందుకు?" ఆత్రంగా అడిగాడు తైమూర్."ఇంత అద్భుతమైన గుర్రాన్ని నాకు ఇచ్చినందుకు హూజూర్!” మరింత వినయంగా అన్నాడు నసీరుద్దీన్. అయోమయంగా చూశాడు తైమూర్. 

"నన్ను వివరంగా చెప్పనివ్వండి హూజూర్! గాలీ వానా మొదలవ్వగానే మీరంతా వేగంగా ఊరి వైపు దౌడు తీశారా? సరిగ్గా అప్పడే నేనూ నా గుర్రాన్ని అదిలించాను. అప్పుడు జరిగింది అద్భుతం! మీరిచ్చిన గుర్రం సామాన్యమైనది కాదు హూజూర్! అది ఆకాశంలో ఎగర గలదు. వాన మొదలు కాగానే అది నన్ను మబ్బుల్లోకి తీసికెళ్ళింది. ఎంత పైకంటే అప్పుడు కురుస్తోన్న మేఘం కంటే పైకి. ఆ మేఘల్లోని నందనవనం లాంటి తోటకి తీసికెళ్ళింది. అక్కడ ఎంత బాగుందనుకొన్నారు హూజూర్! పరిమళాలు వెదజల్లే పూలు, మధురమైన ఫలాలు, పక్షులు కిలకిలా రావాలు. అక్కడ ఎంచక్కా విహరించాను. తిరిగి రావాలనే అనిపించలేదు. కానీ మీరు నాగురించి వాకబు చేసి, నేనేమయ్యానో అని కంగారు పడతారని వచ్చేసాను” భావాన్ని అభినయీస్తూ, దృశ్యాన్ని కళ్ళకి కట్టినట్లు వివరించాడు నసీరుద్దీన్. 

తైమూర్ కి మతిపోయింది.అంత అద్భుతమైన గుర్రాన్ని తేరగా నసీరుద్దీన్ కి ఇచ్చేసినందుకు ఏడుపొచ్చింది. ఎలాగైనా ఆ గుర్రాన్ని తిరిగి పొందాలని “నసీరుద్దీన్. నీకిచ్చిన గుర్రం ముసలిది. ఆకాశంలో ఎగర గలదేమో గానీ, మామూలు సమయాల్లో వేగంగా పరిగెత్తలేదు. అది నాకు తిరిగి ఇచ్చేయ్. నీకు మరో మంచి గుర్రం ఇస్తాను” అన్నాడు.

నసీరుద్దీన్ నసుగుతూ “హూజూర్! ఇచ్చిన వస్తువు తిరిగి తీసికొన్నారనీ చెడ్డపేరు మీకు వస్తుందేమో! నా మూలంగా మీకు చెడ్డపేరు రావడం నాకిష్టం లేదు” అన్నాడు.నసీరుద్దీన్ ని బ్రతిమాలి బామాలి, ఎదురు డబ్బిచ్చి, మరో మంచి గుర్రాన్నిచ్చి నసీరుద్దీన్ దగ్గరున్న ముసలి చచ్చు గుర్రాన్ని తిరిగి కొనుక్కున్నాడు తైమూర్. 

మర్నాడు వాళ్ళు మళ్ళీ వేటకి వెళ్ళారు. గోబీ ఎడారి లోకి ప్రవేశించగానే, ముందు రోజులాగే ఆ రోజూ గాలీ వానా వచ్చాయి.మంచి బలమైన గుర్రం ఎక్కిన నసీరుద్దీన్ ఆఘామేఘాల మీద ఊళ్ళోకి దౌడాయించాడు. తైమూర్ ఎక్కిన ముసలి చచ్చూ గుర్రం, గాలీ వానా మొదలవ్వగానే శిలా విగ్రహం లాగా నిలబడిపోయింది. తైమూర్ దాన్ని కొరడాతో కొట్టాడు. పిడిగుద్దులు గుద్దాడు. బండతిట్లు తిట్టాడు. తన్నాడు. ఉహూ! ఏం చేసినా ఆ ముసలి గుర్రం అడుగు తీసి అడుగు వేయ్యలేదు. వర్షంలో ముద్దగా తడిసిపోయాడు తైమూర్. 


ఆ తడిసిన దుస్తులతోనే వర్షం తగ్గాక ఊళ్ళోకి తిరిగి వచ్చాడు. దాంతో బాగా జలుబు చేసి జ్వరం వచ్చింది. ఆ రాత్రి నీరసంగా పక్కమీదకి వాలుతున్నప్పుడు అర్ధమయ్యింది తైమూర్ కి తను, ముసలి గుర్రాన్నిచ్చినందుకే నసీరుద్దీన్ తనకి గుణపాఠం నేర్పాడని. అంతే! కన్నంలో తేలు కుట్టిన దొంగలా కిక్కురమన కుండా ఉండిపోయాడు.

తెనాలి రామకృష్ణ కథలు - శ్రీ కృష్ణదేవరాయుల కల

తెనాలి రామకృష్ణ కథలు

శ్రీ కృష్ణదేవరాయుల కల

500 సంవత్సరాల క్రితం విజయనగరమనే సామ్రాజ్యాన్ని శ్రీ కృష్ణదేవరాయులు పరిపాలించేవారు. ఆయిన ఒక రోజు నిద్రలొ ఒక కల కన్నారు. ఆ కలలో ఆయినకొక అందమైన భవనము కనిపించింది. ఆ భవనం ఆకశంలో తేలుతూ, లక్ష దీపాలతో చాలా అద్భుతంగా వుంది. తలుచుకుంటే చాలు, మాయమైపోయే ఆ భవనాన్ని కలలో చూసిన రాయలు ఆ కలను మరువలేకపోయారు. మొన్నాడు సభలో ఆయిన ఆ కలను వివరించి దాన్ని నిజం చేయాలన్న ఆయిన గట్టి నిర్ణయాన్ని అందరికీ తెలిపేరు. అది విన్న వారంత అలాంటి భవనమును ఎలా కట్టగలము – అసలు గాలిలో తేలే భవనాన్ని కట్టడం అసాధ్యము కదా అని నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. రాయులు కోపగించుకుని – “అదంతా నాకు అనవసరం. మీరేంచేస్తారో నాకు తెలీదు కాని నా కల నిజమవ్వాలి. అలాంటి భవనాన్ని కట్టిన వారికి నేను లక్ష వరహాల బహుమానము ఇస్తాను – లేదా మీరందరు నాకు కనిపించకండి” అని ఆఙాపించారు. విన్నవారంత నిర్ఘాంతపోయారు. ఎన్ని రోజులు గడిచినా రాయులు ఆ కలను మరువలేదు.

ఒక రోజు సభకొక వృద్ధుడు వచ్చాడు. నెరిసిపోయిన గెడ్డం, జుత్తు, మీసాలతో పాపం అతి కష్టం మీద కర్ర తో నడుస్తున్నాడు. నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని రాయులవారి ని ప్రార్థించాడు. “నీకేమన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు, నేను న్యాయం చేస్తాను” అని రాయులు హామి ఇచ్చారు.

“నా దెగ్గిర నూరు నాణ్యాలున్నాయి స్వామి, అవి ఒకరు దొంగలించుకుపోయారు. నాకు వారెవరో తెలుసు, నా నాణ్యాలు అడిగి ఇప్పించండి” అని ఆ వృద్ధుడు విన్నపించాడు.
శ్రద్ధగా విన్న రాయులు ఈ దొంగతనం యెవరు చేసారు, యెక్కడ చెసారు అని ప్రశ్నించారు.
వృద్ధుడు తడపడడం చూసి “నీకేమి భయం లేదు, చెప్పు” అని రాయులు ప్రోత్సహించారు.
“నా నూరు నాణ్యాలు దొంగలించింది మీరే స్వామి” అన్నాడు వృద్ధుడు. “నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే అవి దోచారు.”

రాయులకు చాలా కోపం వచ్చింది. “యేమిటీ వెటకారం! కలలో జరిగినది నిజమనుకుంటే ఎలా?” అని కోపంగా అడిగారు. ఈ మాట విన్న వృద్ధుడు తన గెడ్డం, మీసం తీసేసి, కర్రను పక్కకు పడేసి, పగటి వేశాన్ని విప్పేసాడు. చూస్తే అతను తెనాలి రామకృష్ణ.
“క్షమించండి స్వామి – మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికే ఇలా చేసాను” అన్నాడు తెనాలి.

రాయులకు చాలా నవ్వొచ్చింది. ఇంత చక్కగా ఆయినకు అర్ధమయ్యేలా చెప్పిన తెనాలి రామకృష్ణను ఆయిన చాలా అభినందించారు.

ప్రశ్న: దురద కలిగించే మొక్కలుంటాయా?

ప్రశ్న: దురద కలిగించే మొక్కలుంటాయా?

జవాబు:
 ఉంటాయి... కొన్ని రకాల మొక్కలు , గడ్డి  మన చర్మానికి తాకినప్పుడు  దురద పెడుతుంది. మన ప్రాంతాలలొ దొరికే " దురదగుండాకు " అందరికీ తెలినదే. ఇంగ్లీష్ లో స్టింగింగ్ నెటిల్ అంటారు. ఇది గ్రామాల్లో , ఊరి బయట రోడ్డు పక్కన పెరిగే ఓ పిచ్చి మొక్క. ఆ మొక్కల ఆకుల మీద సూచ్మ రూపములో గొట్టాలవంటి సూదులు ఉంటాయి. వాటి అంచుల్లో దురద కలిగించే రసాయనము ఉంటుంది . ఆ రసాయనము  ప్రభావము వలన దురద వస్తుంది. అది ఆ మొక్కలు రక్షణకోసము ఏర్పరచుకున్న వ్యవస్థ . 

ఈ విషయము తెలిసిన జంతువులు ఆ మొక్కలను మాత్రము తినవు . వాటికి దూరము గా ఉంటాయి. ఆత్మరక్షణ వాటి ఉద్దేశము . కాని మనిషికే ఇబ్బంది.

14, ఏప్రిల్ 2020, మంగళవారం

కొత్తయుద్ధం - కొత్త కథ

కొత్తయుద్ధం - కొత్త కథ

అది ఒక జింకల వనం. అందులో జింక జాతులు ఆనందంగా నిర్భయంగా జీవిస్తున్నాయి .

        ఒకసారి ఆ వనం నుంచి ఒక జింక దారితప్పి వేరే అడవిలోకి వెళ్ళింది . అక్కడ దానికి ఎన్నో కొత్త కొత్త జంతువులు తోడేళ్ళను , పులులను , సింహాలను , నక్కలను తొలిసారి అక్కడే చూసింది.

       అక్కడ ఒక కొమ్ముల జింక ఎదురై " ఓ జింక సోదరా ఈ అడవిలో నిన్నెప్పుడూ చూడలేదే " అంది.

    "అవును మాది జింకలవనం " అంది.

 " ఈ అడవి మీ జింకలవనం లాంటిది కాదు .  ఇక్కడ మనల్ను చంపి తినే క్రూర మృగాలు ఉన్నాయి . వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో మీకసలు తేలియదు . కాబట్టి ఇక్కడినుండి త్వరగా వెళ్ళిపో " అంటూ ఆ జింక గెంతుతూ వెళ్ళి పోయింది.

 " పిరికి జింక నేనూ జింకనే అదెలా తప్పించుకుందో నేనూ అలాగే తప్పిచుకోగలను " అనుకుంటూ జింకలవనం జింక ముందుకు వెళ్ళింది.

     అక్కడ చెట్టుకింద నిద్రపోతున్న సింహం కనిపించింది . జింక చిన్నగా దాని దగ్గరికి వెళ్ళి తన ముందరి గిట్టతో సింహం తోక తొక్కింది .

  సింహానికి మెలకువ వచ్చింది . బద్దకంగా లేస్తూ జింకను చూసి గర్జించింది . ఆ గర్జన విని జింకకు గుండె ఆగినంతపని అయింది .

 వెనుదిరిగి వచ్చిన దారినే పరుగు పెట్టింది. అడవిని దాటి జింకలవనం వైపు పరుగు తీస్తూనేవుంది . జింకలవనం సమీపానికి రాగానే సింహానికి చిక్కింది. సింహం దాన్ని చంపి చీల్చి ఆరగించింది .

  తరువాత సింహం లేచి మెల్లగా జింకలవనం లోకి వెళ్ళింది . దానికి అది క్రొత్త ప్రదేశం . అక్కడ దానికి గుంపులు గుంపులుగా జింకలు కనిపించాయి . సింహం ఆనందానికి అంతులేదు. దొరికిన జింకను దొరికినట్టు చంపి తినేస్తుంది .

   కొత్తగా ముంచుకొచ్చిన ఈ మృత్యువును చూసి జింకలన్నీ భయపడి పోయాయి .* *చెల్లాచెదురు అయ్యాయి. పొదల్లో దాక్కున్నాయి. బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నాయి .

   పొ‌రపాటున ఏ జింకయినా బయటికొస్తే చాలు సింహం దాన్ని పడగొట్టేస్తుంది .

      అయితే ఆ జింకల్లో తెలివయిన కుర్ర జింక ఒకటుంది . దాని పేరు జ్ఞాననేత్ర . జింకల పెద్దలు జ్ఞాన నేత్ర దగ్గరికి వచ్చి "దీనికి పరిష్కార మారర్గం ఏమిటి " అని అడిగాయి .

     " జింక పెద్దలారా నేనూ అదే ఆలోచిస్తున్నాను . ఈ క్రూర జంతువును ' సింహం ' అని అంటారు . దీని పంజా నుంచి తప్పించుకొనే చాకచక్యం మనకు లేదు.
ఎటు ఆలోచించినా . . ఎంత యోచించినా ఒకేఒక్క దారి కనిపిస్తుంది.

ఈ సింహం ఆహారం లేకుండా 14 రోజులు మాత్రమే బ్రతకగలదు . కానీ మనం 21రోజులు బ్రతకగలం.

కాబట్టి మన జింకలన్నీ తమ పొదల్లోకి దూరి 14రోజులు బయటకు రాకుంటేచాలు దాని పీడ మనకు విరగడౌతుంది.
మనలో ఎవరైనా నిర్లక్ష్యంతో బయటకు వచ్చి దానికి చిక్కారా దాని జీవితకాలం మరో 14రోజులు పెంచినట్లే.

  ఈరోజు అమావాస్య ఇప్పుడే పొదల్లోకి దూరిపోదాం.
పున్నమి నాటికి బయటకు వద్దాం తమ పొదల నుండి బయటకు రాకుండా చూసే బాధ్యత ఆ జింకల పేద్దలదే" అంది.

జింకలన్నీ జ్ఞాననేత్రం మాటలు విన్నాయి. ఆకలితో అలమటించాయి.

             పున్నమి వచ్చింది . జింకలన్నీ ఒక్కొక్కటే భయం భయంగా బయటకు వచ్చాయి . వనం మధ్య చెట్టుకింద చచ్చి పడి ఉన్న సింహాన్ని చూశాయి . ఆనందంతో అరిచాయి , గెంతాయి . జింకల కేరింతలతో వనం అంతా పులకరించింది .

అరవై సామెతలతో.. అందమైన కధ

అరవై సామెతలతో.. అందమైన కధ.

          "కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది.." అంటూ గొణుగుతూ.. అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన భర్త కాంతారావు గారికి కాఫీ తెచ్చి ఇచ్చింది సుమతి..     " ఏంటోయ్ నీలో నువ్వే గొణుక్కుంటున్నావు.. ఏంటో.. అర్ధమయేటట్లు చెప్పొచ్చు కదా! " అన్నారు ఆయన..

      "ఏం చెప్పమంటారు.. " చిలక్కి చెప్పినట్లు చెప్పాను" మీకు.. విన్నారా.. మీ అక్కగారి" నోట్లో నువ్వు గింజ దాగదు " అని.. నామాట వినకుండా.. ఆవిడ చెవిలో ఊదారు.. ఆవిడ సంగతి తెలిసిందే గా

"తిరిగే కాలూ.. తిట్టే నోరూ ఊరుకోదని" మనమ్మాయికి కుజ దోషం వుందని ఆవిడ ఊరంతా టాంటాం చేస్తోంది. ఒకరిని అనుకుని ఏం లాభం.." మన బంగారు మంచిదవాలి కానీ".. ఇక దీనికి పెళ్ళి అయినట్టే.." అంది సుమతి.

      "ఔనా.. మా అక్క అలా చెప్పదే ఎవరికీ..

"అనుమానం.. పెను భూతం.." అనవసరంగా అపార్థం చేసుకోకు.. మీ పుట్టింటి వాళ్ళేమయినా చెపుతున్నారేమో కనుక్కో.. జాతకం రాయించింది మీ తమ్ముడేగా.. " అన్నాడు కాంతారావు.

    "ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు" ప్రతీదానికీ మా అన్నదమ్ముల్ని ఆడిపోసుకోవడమే మీరు."ఆడలేనమ్మ మద్దెల గోల" లాగా... అయినా మా తమ్ముడేం మీ అక్కయ్య లాగా ఎవరికీ చాటింపులు వేసే రకం కాదు.." అంది సుమతి.

        "ముంజేతి కంకణానికి అద్దమేల".. అయినా.. ఇప్పుడు ఆ గోల ఆపి అసలు సంగతికి రా... ఇంతకీ నీ బాధ... మా అక్క అందరికీ చెపుతోందనా... మనమ్మాయి పెళ్ళి కావడం లేదనా.. " చెవిలో జోరీగ లాగా " నస పెట్టకుండా ఏదో చెప్పు ముందు.." అన్నాడు కాంతారావు.

      "ఇంకేం వుందీ చెప్పడానికీ.. మీకు ఎప్పుడూ" కడుపే కైలాసం.. ఇల్లే వైకుంఠం" నా మాట ఎప్పుడు పట్టించుకున్నారు కనకనా.. అమ్మాయికో మంచి సంబంధం వాకబు చేద్దాం అనిగానీ.. అల్లుడి కాళ్లు కడిగి కన్యాదానం చేద్దామనిగానీ.. ఆలోచనే లేదు.. " అంది సుమతి నిష్ఠూరం గా..

  "ఓసి, పిచ్చిదానా.. " కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదే ".. ఆ ఘడియ రాలేదింకా మన పిల్లకి.. " అన్నాడు తాపీగా..

    "అబ్బబ్బా మీకు చెప్పీ చెప్పీ నా " తల ప్రాణం తోకకివస్తోంది" . " చెవినిల్లు కట్టుకుని పోరినా" వినిపించుకోరు. మీ పెదనాన్న కొడుకు.. చూడండి.. ఎంచక్కా రెండేళ్ళలో ఇద్దరి ఆడపిల్లలు పెళ్ళి చేసి

"గుండెల మీద కుంపటి" దించేసుకున్నారు.. కాస్త ఆయన ఎరికలో ఏవైనా మంచి సంబంధాలున్నాయేమో అడగండి." అంది సుమతి.

      "వాడినా.. వాడు" ఉపకారం అంటే ఊళ్ళోంచి పారిపోయేరకం." వాడినుంచి నేను సహాయం ఆశించడం "ఇసుకలో నూనె పిండినంత".. అయినా వాడు

"అయినవాళ్ళకి ఆకులు.. కాని వాళ్ళకి కంచాలు" పెట్టే తరహా.. వాడిని చచ్చినా అడగను." అన్నాడు కాంతారావు.

  "అయ్యో.." అలా అనుకుంటే ఎలా అండీ..

  "వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్లు పట్టుకున్నాడు" ఆయన ముందు మనమెంతటివారం.. అయినా మన
"నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది." మీరోసారి ఫోను చెయ్యండి.. ఆ తర్వాత" అందితే జుట్టు అందకపోతే కాళ్లు" పట్టుకుందాం." అంది సుమతి.

     "వాడి గురించి "అరటిపండు వలచి చేతిలో పెట్టినట్లు" చెప్పినా నీకు అర్ధం కావడం లేదు. సరేలే..

"తుమ్మితే ఊడిపోయే ముక్కు ఉన్నా ఒకటే పోయినా ఒకటే" నీ తృప్తి కోసం వాడిని అడుగుతాను. ఆ ఫోన్ ఇటు తీసుకురా..

    "హలో.. అన్నయ్యా.. నేనురా.. కాంతారావు ని.. ఎలా వున్నావు? అమ్మాయిల దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయా? కులాసాగా వున్నారా ?.. ఆ.. ఏం లేదు.. ఈ ఏడు మేము మా శ్రీవల్లికి సంబంధాలు చూడడం మొదలెట్టాము.. నీ ఎరికలో ఏవైనా మంచి సంబంధాలుంటే చెప్పమని మీ మరదలు అడగమంటే.. అందుకని ఫోను చేస్తున్నాను.. నీకు.."

    "మేనరికమా... లేదన్నయ్యా.. నీకు తెలీనిదేముందీ.. "పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు" అయినా.. వాడిని గారాబంతో చెడగొట్టింది అక్క... "మొక్కై వంగనిది మానై వంగునా" వాడికి ఇంకా ఉద్యోగం.. సద్యోగం లేదు.. స్ధిరపడలేదు... ఓ పక్క.. అక్కయ్య అంటూనే వుందిలే.. సంబంధం కలుపుకోరా.. అంటూ... మా ఇద్దరికీ సుతారామూ ఇష్టం లేదు.. "అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు" వద్దు అని చెప్పేసాలే అక్కకి.. ఏదైనా సాంప్రదాయ కుటుంబం, మంచి ఉద్యోగం చేసుకుంటున్న పిల్లాడెవరైనా వుంటే చెప్పు.. నా స్ధితిగతులు నీకెరికేగా..... ఔను.. జాతకంలో కొంచెం కుజ దోషం వుందట.. ఏవో పరిహార పూజలు చేయించింది మీ మరదలు.. అక్క చెప్పిందా..." అన్నాడు కాంతారావు..

    ఆ ఫోను లో ఆ అన్నగారి మాటలు అన్నీ విని విసురుగా ఫోను పెట్టేసారు కాంతారావు గారు..

    "ఏంటండీ.. ఏమన్నారు మీ అన్నయ్య?" అంది సుమతి.

    "నీ మాట విని వాడికి ఫోన్ చేసాను... నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి. "మంచోడు మంచోడు అంటే చంకనెక్కి కూర్చున్నాడట" ఇలాంటి వాడే..."కళ్ళు నెత్తికెక్కాయి" వాడికి."కడుపు నిండిన బేరాలూ.. కడుపు నిండిన మాటలూ" వాడివి. ఏంటో ఆడపిల్ల పెళ్ళి చేయడమంటే ఆషామాషి అనుకుంటున్నావా.. నాకంటే ఏదో అదృష్టం పుచ్చి మంచి సంబంధాలు వచ్చాయి... అందరికీ అలా రావు... ఎవరైనా పెళ్ళిళ్ళ పేరయ్యని పట్టుకుని "గంతకి తగిన బొంతని" వెతుక్కోమని ఉచిత సలహా పడేసాడు."* *"ఊరుకున్నంత ఉత్తమం లేదు.. బోడిగుండంత సుఖం లేదు" అనవసరంగా వీడికి ఫోన్ చేసి మాటలనిపించుకున్నాను" అన్నాడు కాంతారావు కోపంగా..

      "అయ్యో.. అంతమాటన్నారా.. అయినా..

  "జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి" పోన్లెండి ఆయన బుధ్ది బయటపడింది... "తలని తన్నేవాడొకడుంటే.. తాడిని తన్నేవాడొకడుంటాడు." ఏదో ఒకరోజు ఆయనకే తెలుస్తుంది.. "ఉంగరాల చేత్తో మొట్టేవాడు చెపితేనే మాట వింటారు కొందరు".. మీరేం బాధ పడకండి.. "మనసుంటే మార్గముంటుంది".. ఆ దేముడే మనకే దారి చూపిస్తాడు. చెప్పడం మర్చిపోయా... నా చిన్నప్పటి స్నేహితురాలు పార్వతి నిన్న గుళ్ళో కనపడింది... తనకి తెలిసిన మంచి సంబంధాలు వున్నాయట.. ఈ రోజు మనింటికి వచ్చి.. చెపుతానంది.. చూద్దాం తనేం చెపుతుందో... "విత్తం కొద్దీ వైభోగం" పైగా మన దురదృష్టం "గోరు చుట్టు మీద రోకలి పోటు" లాగా పిల్లకి కుజ దోషం ఒకటీ... అది కప్పెట్టి పెళ్ళి చేయలేం కదా.." అంది సుమతి.

    మర్నాడు.. కాంతారావు ఆఫీసు నుంచి.. రాగానే.. ఆనందంతో ఎదురెళ్ళింది సుమతి.

  "ఏంటోయ్.. "గాజుల కళకళ గుమ్మంలోనే ఎదురయిందీ".... కొంపతీసి ఉదయం నేను "నక్కని తొక్కివెళ్ళినట్టున్నాను".. అన్నారు.. చమత్కారంగా..

      "పోండి.. మీకెప్పుడూ వేళాకోళమే... ముందిలా కూర్చుని కాఫీ తాగుతూ... నేను చెప్పే విషయం సావధానంగా వినండి. "ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయకండి" అంది. "ముద్దొచ్చినపుడే చంకకెక్కాలి" అనుకుంది సుమతి.

        బుద్ధి గా చేతులుకట్టుకుని..ఆ.. ఇప్పుడు చెప్పు" అన్నాడు కాంతారావు.

      "నిన్న.. నా స్నేహితురాలు పార్వతి గురించి చెప్పాను కదా.. మధ్యాహ్నం తను వాళ్ళాయనని తీసుకుని మన ఇంటికి వచ్చింది. ఆయన బేంక్ మేనేజర్ గా పని చేసి రిటైర్ అయ్యారట. పెద్దది ఆడపిల్ల కి పెళ్ళి చేసి.. కాపురానికి పంపారట. తర్వాత అబ్బాయి.. వేణుగోపాల్.. ఎమ్ బి ఏ.. చేసి.. ఏదో పెద్ద కంపెనీలో చేస్తున్నడట. నెలకి లక్ష పైగా జీతం వస్తోందట. గుళ్ళో నాతో పాటు మన వల్లిని చూసారు కదా.. పిల్ల చక్కగా

  "చిదిమి దీపం పెట్టుకునేలా వుంది" అనిపించిందట. వాళ్ళ వేణుకి చేసుకుంటామని అడిగారు. అప్పటికీ చెప్పాను.. "అంగట్లో అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని వుంది" అన్న చందాన పిల్ల జాతకంలో కుజ దోషం గురించి కూడా చెప్పాను. వాళ్ళ కి అలాంటి పట్టింపులు ఏవీ లేవనీ... అసలు జాతకాల గురించి

  ఆలోచించమనీ.. పైగా పెట్టుపోతలు కూడా ఏవీ ఆశించమనీ.. చెప్పారు. నాకైతే... "వెతకపోయిన తీగ కాలికి చుట్టుకున్నట్టు" అనిపించింది. "ఉయ్యాల్లో బిడ్డని పెట్టుకుని ఊరంతా తిరిగామేమో" మనం. ఇదిగో అబ్బాయి ఫోటో ఇచ్చి వెళ్ళారు.. చూడండి.. దొరబాబు లా వున్నాడు.. మన శ్రీవల్లి పక్కన చూడ ముచ్చటగా వుంటాడనిపించింది. ఇంతకంటే గొప్ప సంబంధం మనం తేలేము.. ఆలోచించండి.." అంది సుమతి.. సంబరంగా.

    "నువ్వు చెప్పిందీ నిజమే సుమతీ... పిల్లాడు బావున్నాడు.. కుటుంబమా.. మంచి సాంప్రదాయ కుటుంబమని చెపుతున్నావు.. పైగా వాళ్ళకి ఈ జాతకాల పట్టింపు లేకపోవడం... నిజంగా మన అదృష్టం. సరే మరి.. రేపు వెళ్లి మంచీ చెడూ మాట్లాడి వద్దాం." అన్నాడు కాంతారావు.

      రేపటిదాకా ఎందుకూ..

    "శుభస్య శీఘ్రం..." ."తలుచుకున్నపుడే తాత ప్రయాణం" అన్నట్లుగా ఇప్పుడే బయలుదేరదాం. మనం వస్తున్న్నట్టు పార్వతి కి ఫోన్ చేస్తాను."మీన మేషాలు లెక్కపెడుతూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తా అయిపోతుంది".. లేవండి.. లేవండి.." అంది సుమతి.

      "లేడికి లేచిందే పరుగు".. మా లేడీ గారు యమ హుషారుగా వున్నారు.. ఉండు పనిలో పని... మా పెదనాన్న కొడుక్కి ఫోన్ చేసి.. ఈ విషయం చెప్పాలి.

"గంతకి తగిన బొంత" అన్నాడుగా... ఇప్పుడు నేను చెప్పే ఈ సంబంధం వాడికి "కుక్క కాటుకి చెప్పు దెబ్బ" అనిపించాలి. "ఇనుము విరిగినా అతకవచ్చుకానీ.. మనసు విరిగితే అతకలేము..".. అంతలా నా మనసుని బాధ పెట్టాడు వాడు." అన్నాడు కాంతారావు.

        "పోన్లెండి.. "ఊరందరిదీ ఓ దారి ఉలిపిరి కట్టెదో దారి" వదిలేయండి.. ఆయనని.. "గురివింద గింజ తనకింద నలుపెరగదట" మనకెందుకింక ఆయన సంగతి.. ముందు బయలుదేరదాం పదండి" అంటూ భర్త ని తొందరపెట్టింది సుమతి.

        వెళ్లే దారిలో..."ఏవండీ.. చెప్పడం మర్చిపోయా.. ఇందాక పార్వతీ.. వాళ్ళాయన వచ్చినపుడు మీ అక్కయ్య గారు వచ్చారు.. విషయం అంతా తెలుసుకున్నారు.. వాళ్ళు వెళ్ళాక.. తన కొడుక్కి.. శ్రీవల్లి ని ఇవ్వడంలేదని ఉక్రోషం తో.. నానా మాటలు అన్నారు.."ఏ రాయైతేనేం పళ్ళూడకొట్టుకోవడానికి".. ఆ జాతకాల పట్టింపులు నాకు లేవన్నాను.. అయినా నా మాటకి విలువీయకుండా పరాయిసంబంధాలకి పోతున్నారూ.. "కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక పోతుంది" అంటూ.. శాపనార్థాలు పెట్టిందావిడ..

"శుభం పలకరా పెళ్ళి కొడకా అంటే పెళ్ళి కూతురు... ఏది ?" అన్నట్టుగా.. ఈవిడ అపశకునపుమాటలేంటీ.. అని బాధేసింది నాకు" అంది సుమతి.

    "పోనీలే.. మా అక్క సంగతి తెలుసుకదా... నువ్వు ఎందుకు.."గుమ్మడి కాయల దొంగంటే భుజాలు తడుముకుంటావు" పట్టించుకోకు..."గుడ్డి గుర్రానికి పళ్ళు తోమడం" తప్ప దానికి వేరే పనీపాటా లేదు.

  "పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్టు" అది అలా వాగుతూనే వుంటుంది. వదిలేయి తన మాటలు.. ఎప్పుడూ వుండేవేగా.." అంటూ భార్య ని ఓదార్చాడు.

          పెళ్లి చూపులు అయిపోవడం.. పెళ్లి మాటలు మాట్లాడుకోవడం.. ఆకాశమోత పెళ్ళి పందిరిలో భూదేవంత అరుగు మీద.. కాంతారావు, సుమతి దంపతులు.. పెళ్లి కొడుకు కి కాళ్లు కడిగి కన్యాదానం చేయడం అయిపోయి.. . అమ్మాయిని అత్తగారింటికి సాగనంపారు.

      పై పంచతో చెమర్చిన కళ్ళని తుడుచుకుంటూ..

  "అందరికాళ్ళు మొక్కినా అత్తవారింటికి పోక తప్పదు కదా" అంటూ అనుకున్నాడు ఆ ఆడపిల్ల తండ్రి.

      ఈ జాతకాలు కుదరడం లేదనే వంకో.. ఈ కుజ దోషం కారణంగానో.. చాలా మంది ఆడపిల్లలకి.. సరైన సమయంలో వివాహం కాకపోవడమో.. అసలు వివాహాలే కాకపోవడమో జరుగుతోంది. విఙ్ఙానం ఇంతలా వెల్లివిరిసి.. ప్రపంచం ఆధునికంగా ముందుకు కు సాగిపోతోంటే... ఇంకా ఈ మూఢ నమ్మకాలేంటి ? ఆడపిల్లల జీవితాలకి ఈ జాతకాలు ఓ అడ్డుగోడ.. చదువుకున్నవారిలోనే ఈ జాడ్యం ఎక్కువగా వుంది.. అందరికీ.. మా శ్రీవల్లి చేయందుకున్న వేణుమాధవ్.. ఓ ఆదర్శం కావాలి... అనుకున్నాడు కాంతారావు.

        ఇంతలో ఫోన్మోగింది.... ఈ పెళ్ళి కి పిలవలేదుగా.. అందుకే ఈ సంగతి తెలీక ... పెదనాన్న కొడుకు.... "ఒరేయ్ కాంతారావూ... మీ అమ్మాయికి ఏదైనా నా సంబంధం వుంటే చెప్పమన్నావుగా... ఇక్కడ.. ఈ. సేవ లో పనిచేస్తూంటాడు.. నెలకి పదివేలు జీతం .. అతనికీ కుజ దోషం వుందట.  సరిపోతుంది ఇద్దరికీ.. వాళ్ళ నెంబర్ ఇస్తాను.. ఓ సారి మాట్లాడి.. సంబంధం కుదుర్చుకో... నాపేరు చెపితే.. కట్నంలో.. కాస్త తగ్గిస్తారు.." అన్నాడు..

    "ఆ.. అన్నయ్యా... "దొంగలు పడ్డ ఆరునెలలకి కుక్కలు మొరిగాయట".. అర్ధమయిందనుకుంటాను.." అంటూ ఫోన్ పెట్టేసాడు.

13, ఏప్రిల్ 2020, సోమవారం

సామెత కథ- ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలువుతాయి

 సామెత కథ

‘ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలువుతాయి’

పూర్వ కాలంలో, వ్యాపారం రెండు విధాలుగా జరెగేది. చిన్న చిన్న వ్యాపారులు వస్తువులను బళ్ళమీద ఒక ఊరి నుండి ఇంకొక వూరికి తిప్పుతూ చేసే చిల్లర వస్తువుల వ్యాపారం ఒకటి. రెండవ రకం, బాగా ధనవంతులైన వ్యాపారులు ఓడల మీద సరుకులను విదేశాలకు తీసుకువెళ్ళి చేసే వ్యాపారం. దైవం అనుకూలించనప్పుడు, అదృష్టం కలిసిరానప్పుడు, సముద్ర యానంలో సంభవించిన ఏ తుఫాను లోనో సరుకులను తీసుకెళుతూండిన  ఓడలు గల్లంతై పెద్ద పెట్టున నష్టపోయి తెల్లవారేసరికల్లా ధనవంతుడు దరిద్రుడై మిగలడం, దేశంలో పొరుగూళ్ళలో చేస్తూండిన చిన్న సరుకుల వ్యాపారమే దైవం అనుకూలించడం వలన బాగా కలిసొచ్చి కొద్ది రోజుల్లోనే బాగా ధనవంతుడై బళ్ళలో చేస్తూండిన వ్యాపారం వృధ్ధి చెంది ఓడల కెక్కి విదేశాలకు మళ్ళడం లాంటి సందర్భాలూ సన్నివేశాలూ నిజజీవితంలోనివి కథలలో కెక్కి కనిపిస్తూంటాయి.

‘ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి’ అన్న సామెత ఇలాంటి దృష్టాంతాలనుంచి పుట్టిందే. ఇందులో, కాలం కలిసొస్తే బండి ఓడవడం, కలిసి రానప్పుడు ఓడ బండవడం సరియైనది. అయితే, సుమతీ శతక కర్త అయిన బద్దెన మంత్రి ఈ సామెతను కలిమి లేముల్లాగా ఓడలు బళ్ళ మీదా, బళ్ళు ఓడల మీదా వస్తాయి అంటూ కలిమి లేముల ప్రసక్తి తెచ్చి వాటి రాకపోకలను అన్వయించడానికి చేసిన ప్రయత్నంలో, అన్వయం అంత బాగా కుదరక పోయినప్పటికీ, లోకం సరిపెట్టుకుంది. కానీ, భాస్కర శతక కర్త అయిన మారయగారి వెంకయ గారు దీని అర్ధాన్నే పూర్తిగా మార్చి వేశాడు. కష్టాల్లో పరస్పర సహకారం అన్న అర్ధంలో దృష్టాంతంగా దీనిని వాడాడు.  సరిపెట్టుకుందామని చూసినా సరే, సరిగా అన్వయం కుదరని సందర్భం ఇందులోది. నీటిపై ఓడలో బళ్ళు ప్రయాణించడం, నేల మీద బళ్ళపై ఓడలు ప్రయాణించడం లోకానుభవానికి దృష్టాంతాలుగా సాధారణంగా దొరికే సన్నివేశాలు కావు. అందువలన, సుమతీ శతకంలోనూ, భాస్కర శతకంలోనూ వాడబడిన రూపాలు సరియయినవి కావు. అన్వయానికి కుదరని రూపాలని తేలుతుంది.

లోకానుభవాలను సామెతల రూపంలో నీతి బోధకాలుగా చెప్పే ప్రక్రియలో, అతి తక్కువ మాటలలో చెపాల్సిన విషయాన్ని చెప్పడానికి వీలుగా మాటల్ని వడపోసి వడపోసి కూర్చగా అయినవే సామెతలు. వాటిలో వ్యర్ధ పదాలూ, అర్ధ రహితమైన మాటలు సాధారణంగా ఉండవు.  ప్రతి మాట వెనుకా ఏదో బలమైన కారణం, అర్ధవంతమైన అనుభవ సారం తప్పకుండా ఉంటుంది. అందువల్ల ఈ సామెత ‘ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి’ అన్న రూపమే అసలైనదీ, లోకానుభవ సిధ్ధమైనదీను!

సుమతీ శతకము లోని పద్యం

ఓడల బండ్లును వచ్చును
ఓడను నాబండ్ల మీద నొప్పుగ వచ్చున్
ఓడలు బండ్లును వలెనే
వాడంబడు కలిమిలేమి వసుధను సుమతీ!”


తెలుగులో ఈ సామెత  భాస్కర శతకం రచించ బడిన రోజుల నుంచీ ఉంది. దీనికి నిదర్శనం భాస్కర శతకంలోనే ఉంది. భాస్కర శతకంలో మూడవ పద్యం:

“అక్కరపాటు వచ్చు సమయంబున జుట్టము లొక్క రొక్కరి
న్మక్కువ నుధ్ధరించుటలు మైత్రికి జూడగ యుక్తమే సుమీ
యొక్కట; నీటిలో మెరక నోడల బండ్లను బండ్లనోడలున్
దక్కక వచ్చుచుండుట నిదానము గాదె తలంప భాస్కరా!”

బేధమల్లా, ఈ పద్యంలో భాస్కర శతకకర్తగా భావింప బడుతూన్న మారయగారి వెంకయ ఇప్పుడు వాడబడుతూన్న ‘ఓడలు బళ్ళు అవుతాయి’ అన్నరూపంలో కాకుండా, ‘ఓడల బండ్లు వచ్చుట’ అన్న రూపంలో వాడాడు. అర్ధం విషయంలో సందేహం లేకుండా స్పష్టత కోసంగా ‘నీటిలో, మెరక’ అన్న పదాలు గూడా వాడాడు.  దీనిని బట్టి చూస్తే ఈ సామెత పూర్వం ‘ఓడలు బళ్ళు లాగుతాయి, బళ్ళు ఓడలు లాగుతాయి’ అన్న రూపంలో ఉండి, రాను రాను ‘ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి’ అని మారినట్లుగా కనిపిస్తుంది.

భాస్కర శతకంలో ఈ సామెత వాడబడిన సందర్భములో విశదమయ్యే అర్ధానికీ, ఇప్పుడు వాడ బడుతూన్న అర్ధానికి కూడా తేడా కనిపిస్తుంది.  భాస్కర శతకంలో ఇది ‘ఆపత్కాలంలో పరస్పర సహకారం’ అన్న అర్ధంలో వాడబడి కనిపిస్తూండగా, ఇప్పుడు దానికి సంబంధం లేని అదృష్టంతో తారు మారు కాగలిగే పరిస్థితులకు సూచకంగా వాడబడుతోంది.

12, ఏప్రిల్ 2020, ఆదివారం

సామెతల కథలు - ఈగలమోత

సామెతల కథలు

ఈగలమోత

పూర్వం లలాటరాజ్యాన్ని విచిత్రసేనుడు పాలిస్తుండేవాడు. ఒకసారి అతనికో సమస్య వచ్చింది. గుంపులు గుంపులుగా వచ్చిన ఈగలు సభలో తీవ్ర అసౌకర్యాన్ని కలిగించసాగాయి. ఝుమ్మని మోత చేస్తూ సభికులు, రాజు మొహంపై వాలసాగాయి. ఎంత తోలినా తిరిగి వచ్చేవి. కొంతమంది మాట్లాడేటప్పుడు నోటిగుండా పొట్టలోకి జారుకునేవి. వాటి దెబ్బకు అందరూ గగ్గోలు పెట్టారు. పరిష్కారం చూపమని రాజును వేడుకున్నారు. సేవకులు వింజామరలతో వీస్తున్నా అది విచిత్రసేనుడికి ఉపశమనం మాత్రమే కలిగిస్తోంది. అంతఃపురంలోని రాజపరివారమంతా ఈగల వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోసాగారు.

వంద ఈగల్ని చంపితే ఒక బంగారు వరహాను బహుమతిగా ప్రకటించాడు విచిత్రసేనుడు. అది కూడా సరైన ఫలితం ఇవ్వలేదు. పనీపాట లేని వాళ్ళు తప్ప ఇతరులు ఈగల్ని చంపడానికి ఆసక్తి చూపలేదు. దాంతో.. ’ కోటనుంచి ఈగల్ని తక్షణమే తరమగలిగిన వారికి లక్షవరహాలు బహుమతి ఇవ్వబడుతుందని' దండోరా వేయించాడు.

మరుసటిరోజు కిరీటి అనే యువకుడు సభకు వచ్చాడు. ఈగల్ని తరిమేందుకు సిద్ధంగా ఉన్న సంగతి విచిత్రసేనుడికి తెలియపరిచాడు. "నీవు ఏం చేసినా, ఎలా చేసినా... ఈగలమోత మాత్రం ఇక వినపడకూడదు. నీ పనిని ప్రారంభించు." అని రాజు ఆదేశించాడు. సభలోంచి బయటకు వెళ్ళిన కిరీటి ఓ అర్ధగంట తర్వాత తిరిగివచ్చాడు. అతను వచ్చిన కొద్దిసేపటికే ఈగలన్నీ బయటకు జారుకున్నాయి. సభలో ఒక్కటి కూడా లేదు! రాజు, సభికులు ఆనందం, ఆశ్చ్యర్యం కలగలిపిన ముఖాలతో ఉన్నారు.

"ఏం మంత్రం వేశావు? లేక ఏదైనా మాయ చేశావా?" విచిత్రసేనుడు అడిగాడు.

"ఇందులో మాయమంత్రాలు ఏమీలేవు... ఏదో నాకున్న కాస్త లోకజ్ఞానఫలితం" వినయంగా అన్నాడు కిరీటి.

"ఎలా చేసినా పెద్ద ఇబ్బందిని తొలిగించావు. ఇవిగో లక్ష వరహాలు.." అంటూ ధనం మూటను ఇవ్వబోయాడు విచిత్రసేనుడు.

"రాజా.. మీ బహుమతిని స్వీకరించలేక పోతున్నందుకు నన్ను క్షమించండి. ఈగలు మళ్ళీ కోటలోకి వచ్చి గతంలో లాగానే మీకు ఇబ్బందిని కలిగిస్తాయి. ప్రస్తుతం నేను వాటిని కోట బయటికి మాత్రమే తీసుకెళ్ళగలిగాను. నాది శాశ్వతమైన పరిష్కారం కాదు."

"ఇంతకీ ఏం చేశావు?" గద్దించి అడిగాడు విచిత్రసేనుడు.

"పెద్ద బెల్లం ముద్దను కోట బయట ఉంచి వచ్చాను. దాంతో ఈగలన్నీ బెల్లం చుట్టూ చేరాయి. ఆ ముద్దను పూర్తిగా జుర్రుకోగానే కోటలోకి రావడం ఖాయం."
ఆ మాటలు వినగానే విచిత్రసేనుడికి కోపం తారాస్థాయికి చేరింది.

"మేము కోరింది శాశ్వతపరిష్కారం, ఇలాంటి చిట్కాలు కాదు. సమయం వృధా చేస్తే నీకు కారాగారశిక్ష తప్పదు." ఉచ్ఛస్థాయి గొంతుతో చెప్పాడు.

"శాశ్వతపరిష్కారం మీదగ్గరే ఉంది. విచక్షణ లేని ప్రజలు రాజ్యాన్ని చెత్తకుప్పలు, ఎరువుదిబ్బలుగా మార్చారు. వాటివల్ల పెరిగిన ఈగలు ఎన్నో రోజుల నుండి ప్రజల ఆరోగ్యంతో ఆడుకోసాగాయి. పలుసార్లు మీ దృష్టికి తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వాటి ప్రభావం అంతఃపురానికి పాకిందనే దండోరా విన్నప్పుడు సమస్య పరిష్కార మవుతుందని సంతోషించాం. రాజ్యపరిస్థితిని పూర్తిగా తెలిపేందుకే వచ్చానుకాని, బహుమతి కోసం కాదు." వివరంగా చెప్పాడు కిరీటి.

విచిత్రసేనుడికి జ్ఞానోదయమైంది. మూలకారణాన్ని తొలగించాలే గాని, ఉపశమన చర్యల వల్ల సమస్య పరిష్కారం కాదని గ్రహించాడు. కిరీటిని మంత్రిగా నియమించుకుని రాజ్యాన్ని సుందరంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే పనిని అప్పగించాడు.

11, ఏప్రిల్ 2020, శనివారం

సామెత కథ - జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం

సామెత కథ

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం

పూర్వం మన దేశంలోని అడవుల్లో వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు భయంకరులైన రాక్షసులు నివసిస్తూ వుండేవారు. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. మనుష్యులను చంపి తింటుండేవారు. ఆ చంపి తినే పద్ధతి కూడా చాలా చిత్రంగా ఉండేది. ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించి ఆ అడవి వెంబడి వెళ్ళే ప్రయాణికులని తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని వినయంగా అడిగేవాడు. పాపం వాళ్ళు ఇల్వలుడి మాటలు నమ్మి అతని ఇంటికి వెళ్ళేవారు. వాళ్ళని స్నానం చేసి విశ్రాంతి తీసుకోమని చెప్పి వంట చేయడానికని ఇల్వలుడు వంటింట్లో దూరేవాడు. అక్కడ వాతాపిని చంపి ముక్కలు చేసి ఆ మాంసంతో వంటకాలు చేసేవాడు. వంట అయిపోయాక అతిథుల్ని పిలిచి స్వయంగా వడ్డించేవాడు. ఇల్వలుడు వడ్డించిన పదార్ధాలన్నీ బాటసారులు సుష్ఠుగా తినేవారు. భోజనం పూర్తి చేసి వాళ్ళు పీటమీద నుంచి లేవబోయే సమయానికి ఇల్వలుడు వాళ్ళముందు నిలబడి, "వాతాపీ! ఓ వాతాపీ! రా! త్వరగా బయటికి రా " అని పిలిచేవాడు. అతిథుల కడుపులో మాంసరూపంలో ఉన్న వాతాపి ఈ పిలుపు వినగానే మళ్ళీ ప్రాణం పోసుకుని వాళ్ళ పొట్టలు చీల్చుకుని బయటకు వచ్చేవాడు . పాపం! ఆ అతిధులు పొట్ట పగిలి చనిపోయేవారు. అప్పుడు అన్నదమ్ములిద్దరూ చనిపోయిన అతిథుల మాంసాన్ని లొట్టలేసుకుంటూ తినేవారు.

చాలాకాలం వరకు ఈ మోసాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు. కొన్నాళ్ళకు ఈ రహస్యం బయటకు పొక్కింది. అప్పుడు ఆ అరణ్యాలలో వుండే మునులంతా అగస్త్యమహర్షి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పారు. అగస్త్యమహర్షి గొప్ప పండితుడు, జ్ఞాని. చాలా మంత్రశక్తులు ఉండేవి ఆయనకు. మహాసముద్రాలను, పర్వతాలను కూడా శాసించగలిగేవాడు.అగస్త్యుడు వెంటనే ఇల్వలుడు, వాతాపి ఉండే ప్రదేశానికి బయలుదేరాడు.

మహర్షిని చూడగానే ఇల్వలుడు ఇల్లు చేరుకోగానే వినయంగా చేతులు కట్టుకుని, "మహాత్మా! తమరు స్నానం చేసి జపం చేసుకుంటూ వుండండి. నేను క్షణంలో వంట చేస్తాను" అన్నాడు. తరువాత వంటింట్లోకి వెళ్ళి ఎప్పటిలాగే వాతాపిని చంపి ఆ మాంసంతో వంటకాలు చేశాడు.

తర్వాత ఇల్వలుడు మహర్షిని విందుకు పిలిచాడు. కొసరి కొసరి తను వండిన వంటకాలన్నీ వడ్డించాడు. తను ఏం తింటున్నదీ మహర్షికి తెలియకపోతే కదా!

ఆనందంగా భోజనం చేసి ఎడం చేత్తో పొట్టమీద రాసుకుంటూ మెల్లగా " జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం " అనుకున్నాడు.

అది ఇల్వలుడికి వినపడలేదు.

ఆయన చెయ్యి కడుక్కోటానికి లేచి నిలబడగానే ఇల్వలుడు "వాతాపీ! ఓ వాతాపీ! బయటకు రా! " అని గట్టిగా పిలిచాడు. కాని ఎంతసేపటికీ వాతాపి బయటకు రాలేదు. ఇల్వలుడికి భయం వేసింది.

అగస్త్యుడు చిరునవ్వు నవ్వుతూ "ఏ వాతాపిని నాయనా నువ్వు పిలుస్తున్నావు? నీ తమ్ముడే అయితే అతను ఎప్పుడో నా పొట్టలో జీర్ణమైపోయాడు" అన్నాడు. తన ఎదుట ఉన్నది అగస్త్యులవారనీ, ఆయనకు మహత్తరశక్తులు ఉన్నాయనీ అప్పుడు అర్థమయింది ఇల్వలుడికి, ఒణికిపోతూ మహర్షి కాళ్ళమీద పడి "మహాత్మా! దయచేసి నన్ను ప్రాణాలతో విడిచిపెట్టండి. మరెప్పుడూ ఇటువంటి పాపం చెయ్యను" అన్నాడు.

తాపసి దయతలచి సరే అన్నాడు.

ఇల్వలుడు మరెప్పుడూ ఎవర్నీ చంపనని ప్రమాణం చేసి, ఆ అడివి వదలిపెట్టి వెళ్ళిపోయాడు.

9, ఏప్రిల్ 2020, గురువారం

మర్యాద రామన్న కథలు: సూరయ్య - పేరయ్య

మర్యాద రామన్న కథలు

సూరయ్య - పేరయ్య

రామాపురం లోనే సూరయ్య , పేరయ్య అనే స్నేహితులు ఉండేవారు. ఇద్దరూ ఒకటే తరగతి, ఒకటే పాఠశాలలో చదవడం చేత స్నేహముగా ఉండేవారు. చదువులు అయిపోయిన తర్వాత ఇద్దరు చెరొక వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. సూరయ్య ఇనుము వ్యాపారం చేసేవాడు. కాని మంచిగా అందరితోనూ కలిసిమెలిసి ఉండేవాడు. నిజాయితీగా వ్యవహరించేవాడు. అలాగే పేరయ్య పేరు తగ్గట్టుగా పేరాశ ఎక్కువ. పేరయ్య కిరానా దుకాణం నిర్వహించేవాడు. ఎదుటివారి అవసరాన్ని బట్టి ధర చెప్పేవాడు.

ఎవరి వ్యాపారం వారిదైనా ఇద్దరూ తరచూ కలిసే కొనుగోలుకై పట్టణానికి వెళ్ళి కొనుగోళ్ళు చేసుకుని తిరిగి కలిసే వచ్చేవారు. సూరయ్యకు ఇద్దరు కుమార్తెలు. పేరయ్యకు ఒక కుమార్తె, ఒక కుమారుడు. ఒకరోజు సూరయ్య కుటుంబంతో సహా తీర్థయాత్రలకు వెళ్దామనుకుంటున్నాము. నా వద్దనున్న ఇనుము ఇంటి ముందు వదిలేసి వెళ్తే,తిరిగి వచ్చేసరికి ఎవరైనా దొంగతనము చేస్తారేమో మీ ఇంటి ఆవరణలో పెట్టనా ? అని పేరయ్యను అడిగాడు. దాందేముంది మా ఇంటి ప్రక్కన గల స్థలంలో వేసుకొని నిశ్చింతగా వెళ్ళి రమ్మని పేరయ్య చెప్పాడు. సూరయ్య ఒక మంచి రోజు చూసుకుని తీర్థయాత్రలకు బయలుదేరాడు.

తీర్థ యాత్రలకు వెడుతూ, సూరయ్య పుట్ల కొద్దీ ఇనుమును దాచమని మిత్రుడైన పేరయ్యకు అప్పగించాడు. సూరయ్య వెళ్ళాక, ఇనుము ధర బాగా పెరగడంతో, అదంతా అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు పేరయ్య. సూరయ్య తిరిగి వచ్చి, తన ఇనుము సంగతి అడగ్గా, “అదా! ఇంకెక్కడుంది? ఎలుకలు అంతా ఎప్పుడో తినేశాయి కదా! నేనేం చేసేది?” అంటూ దీర్ఘాలు తీశాడు పేరయ్య. సూరయ్య, మర్యాదరామన్న దగ్గరకెళ్ళి చెప్పాడు. మర్యాదరామన్నకి సూరయ్య చెపుతున్న దాంట్లో అబద్ధం లేదు అనిపించడంతో, పేరయ్య సంగతి ఆరా తీయించాడు. పేరయ్య ఇంటికి వెళ్ళి, పాత స్నేహం ప్రకారం, అతని కొడుకుని విందుకు పిలవమన్నాడు రామన్న. విందుకు వచ్చిన పేరయ్య కొడుకును ఒక గదిలో బంధించేలా చేశాడు. ఎంతకూ కొడుకు రాకపోవడంతో, విందు పేరుతో తన కొడుకును సూరయ్యే ఏదో చేసి ఉంటాడని, నేరుగా ఏమీ అనకుండా, రామన్నకు ఫిర్యాదు చేశాడు. ఇలా జరుగుతుందని రామన్న ఊహించినదే అయింది. సరిగ్గా సూరయ్య అప్పుడే అక్కడకు వచ్చాడు. కొడుకు గురించి రామన్న ఎదుటనే పేరయ్య అడుగ్గా, అతడి కొడుకుని గద్దలు ఎత్తుకు పోయాయి. నేనేం చేసేది అని తొణక్కుండా జవాబు చెప్పాడు సూరయ్య. “ఎంత చోద్యం కాకపోతే, మనిషంత మనిషిని గద్దలు ఎత్తుకు పోవడమా?” అడిగాడు పేరయ్య.

“పుట్ల కొద్దీ ఇనుము మింగేసిన ఎలుకలే ఉన్నప్పుడు, మనుషుల్ని ఎత్తుకుపోయే గద్దలు ఉండడంలో వింతేముంది” అన్నాడు సూరయ్య. తత్తరపోయాడు పేరయ్య. నిజమా? కాదా? ఏమిటి కథ? అని గద్దించాడు మర్యాదరామన్న. తలూపాడు పేరయ్య. సూరయ్య, రామన్నకు దండాలు చెప్పుకుంటూ, అందరితోనూ “ధర్మప్రభువు మర్యాద రామన్న” అని బతికినంత కాలం చెప్పుకుంటూ ఉండేవాడు. రామన్న ఇలాంటి తీర్పులెన్నో ఇచ్చాడు.

8, ఏప్రిల్ 2020, బుధవారం

సమాధానం ప్రయత్నించండి

సమాధానం ప్రయత్నించండి

1) ఆకాశాన్ని ఆ చివరి నుంచీ ఈ చివరి దాకా కప్పి వేసే ముచ్చటైన ఆయుధం ఏది?

2) పిట్ట గాని పిట్ట, నాలుగు కాళ్ళతో నడుస్తుంది. ఏమిటది?

3) తీసిన కొద్దీ పెద్దదయ్యేది ఏది ?

4) కీలుగాని కీలు, వనంగాని వనం కొన్నాడట. ?

5) పావుశేరు పాలల్లో పాలెన్ని?

6) నాలుగు అక్షరాల పదం - అర్థం శివుడు, మొదటి అక్షరం తప్పిస్తే, విష్ణువు, మళ్లీ అలాగే చేస్తే భర్త.

7) పెంచిన కారుగాని కారు, వరంగాని వరం చేయించుకోటానికి వెళ్ళాడు. 

8) కాయగాని కాయ మీద కాయగాని కాయ వేస్తే, కుయ్యో, మొఱ్ఱో అన్నాట్ట!

9) అక్షరాల పదాన్ని. కానుక అని అర్థం. మొదటి రెండు అక్షరాలు కలిపితే 'ఎక్కువ' అనీ, చివరి రెండు అక్షరాలు కలిపితే 'బుద్ధి' అనీ అర్థం. నేనెవరు?

10) నేను 5 అక్షరాల తెలుగు పదాన్ని. నాలో
మొదటి రెండు అక్షరాలు  కలిపితే తోటి అని అర్థం,

11) నేను 6 అక్షరాల తెలుగు పదాన్ని. నాలో 1,2,3,6 కలిపితే ఓ పురాణ గ్రంథం, 4,5,6 - భూభాగం, 1,2,6 - బరువు, 3,2,6 - జీవిత కాలం, 5,2,6 - బాణము అని అర్థం. ఇంతకీ ఎవరు నేను?

12) నేను 6 అక్షరాల తెలుగు పదాన్ని. నాలో 1,2,3,6 కలిపితే గెలుపు, 4,5,6 - తోవ, 4,1 - మామిడి చెట్టు,
4,3,6 - అదృశ్యం ఇంతకీ నేనెవరిని?

13) నేను 5 అక్షరాల తెలుగు పదాన్ని. నాలో మొదటి రెండు అక్షరాలు కలిపితే - క్రీడ అని అర్థం. అలా 3,4 - ధర 1,5 - మొదలు ఇంతకీ నేనెవరిని ?

14) గంగావతరణ కోసం ఓ మహనీయుని కృషి ?

15) రామాంజనేయ యుద్ధానికి కారకుడు ?

16) సుప్రసిద్ధ కర్ణాటక సంగీతపు రాగం ?

17) శుక్రసుత క్రింది నుంచి పైకి వచ్చింది.

18) అజ్ఞాతంలో ద్రౌపది పేరు ?

19) మంగళ వాద్యాలలో ఉండే ప్రధాన వాద్యాలు ఏమిటి?

20) ధూమకేతువు అనగా ?

జవాబులు:

1)ఇంధ్ర ధనుస్సు
2)లొట్ట పిట్ట - ఒంటె
3)గొయ్యి
4)వకీలు, జనవరి, భవనం
5)రెండు ('పా' అనే అక్షరం)
6)ఉమాపతి - మాపతి - పతి
7)షావుకారు, క్షవరం
8)తలకాయ మీద మొట్టికాయ
9)బహుమతి
10)సహకారము
11)భారత దేశము
12)విజయ మార్గము
13)ఆట వెలది
14)భగీరథ ప్రయత్నం 
15)యయాతి
16)ఆరభి
17)దేవయాని
18)మాలిని
19)నాదస్వరం & డోలు 
20)తోకచుక్క

మర్యాద రామన్న కథలు - గంగమ్మ మోసకారితనం

మర్యాద రామన్న కథలు

గంగమ్మ మోసకారితనం

రంగాపురానికి దగ్గరగా మాచవరం అనే గ్రామము ఉండేది. ఆఊరిలో నివశించే రంగమ్మ చాలా నిజాయితీగా, ఎక్కువ తక్కువగా దుబారా చేయక తనకు ఉన్నదానిలోనే తృప్తిగా బ్రతికేది. రంగమ్మకు రెండు గేదెలు ఉండేవి. ఆ గేదెలు ఇచ్చేపాడితోనే కొన్ని పాలు అమ్ముకుని తన కుటుంబ అవసరాలకు మరికొన్ని ఉంచుకునేది. తన ఇంటిలోని పాలు వలన వచ్చే నెయ్యి కాచి అప్పుడప్పుడు ఆ నెయ్యి ని కూడా అమ్మేది. ఆమె ఇంటికి పొరుగున గంగమ్మ కుటుంబం ఉండేది. గంగమ్మ చాలా గడసరి. అయినదానికి కానిదానికి దుబారాగా ఖర్చు చేసేది. ఆర్భాటాలు ఎక్కువగా ప్రదర్శించేది. ఆమెకు ఎనిమిది గేదెల పాడి ఉండేది. ఊర్లో ఎక్కువ మందికి ఆమెనే పాలు పోసేది. అందుకని ఆమె మాటలను ఊరిలోని నమ్మేవారు.

ఒకసారి అనుకోకుండా గంగమ్మ ఇంట్లోని నెయ్యగిన్నె జారి పడింది. ఒక వీశెడు నెయ్యి నేలపాలైంది. సరేలే ఏం చేస్తాను నాకు ప్రాప్తతం లేదని సర్ధిచెప్పుకునే సమయంలో ఆ ఊరిలోని రామయ్య బానే మోతుబరి రైతు వచ్చి తనకు ఆరు వీశెల నెయ్యి కావాలని అడిగాడు. గంగమ్మకు ఏమి చెయ్యాలో పాలుపోక ఆలోచనలో పడింది. వెంటనే ఆమెకు రంగమ్మ గుర్తుకు వచ్చింది. తన ఇంటిలోని నెయ్యిని ఒక డబ్బాలో పోసి రంగయ్యను కూర్చోమని నెయ్యి గిన్నెతో రంగమ్మ ఇంటికి వెళ్ళి ఒక్క వీశెడు నెయ్యి అరువుగా ఇవ్వమని రెండు రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానని చెప్పింది. ఎంతైనా పొరుగున ఉన్న మనిషి కదా అని వీశెడు నెయ్యి ఇస్తూ రెండు రోజుల్లో ఇవ్వాలని చెప్పింది. సరేనంటూ గంగమ్మ నెయ్యి తీసుకుని వెళ్ళి రంగయ్యకు ఆరు వీశెల నెయ్యి ఇచ్చి పంపివేసింది.

రెండు రోజుల్లో తిరిగి ఇస్తానన్న గంగమ్మ నెయ్యి గురించి ఏమీ మాట్లాడకుండా , ఏమీ తెలియనిదానిలా ఉన్నది. అలా వారం గడిచింది. కానీ గంగమ్మ తిరిగి నెయ్యి ఇవ్వలేదు. ఉండబట్టలేక రంగమ్మ వెళ్ళి తనకు ఇవ్వాల్సిన నెయ్యి గురించి అడిగింది. వెంటనే గంగమ్మ నేను నీ దగ్గర నెయ్యి తీసుకోవడం ఏమిటి? నేనే ఊరిలోని వారికి అమ్ముతాను. నీదగ్గర నేను అరువు తీసుకున్నానంటే నవ్వుతారు. ఇప్పటికైనా వెళ్ళిపో, ఎవరైనా వింటే పరువుపోతుంది అని గదమాయించింది. ఇరుగుపొరుగు వారితో రంగమ్మ చెబితే ఎనిమిది గేదెలకు ఆసామీ అయిన గంగమ్మ వీశెడు నెయ్యి అప్పు తీసుకోవడమా? నిజంగానే ఇది జరిగినా,ఎవరూ రంగమ్మను నమ్మలేదు. పైగా గంగమ్మనే సమర్ధించారు.

ఫిర్యాదు దివాణానికి చేరింది. మర్యాద రామన్న తీర్పు మరునాటికి గాని, చెప్పనన్నాడు. ఆ రాత్రి గంగమ్మ ప్రవర్తనను భటులతో ఆరా తీయించి, మర్నాడు ఇద్దరూ రాగానే, చెరో చెంబు నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కోమన్నాడు. రంగమ్మకి ఒక్క చెంబుతో సరిపోయింది. గంగమ్మకి నాలుగు చెంబులు నీళ్ళిచ్చినా, కాళ్ళు పూర్తిగా తడవలేదు. దీనిని బట్టి, రంగమ్మ ఉన్నంతలోనే సర్దుకొని, ఇతరులకు అప్పు ఇవ్వగల స్థితిలో ఉన్నదని, గంగమ్మ దుబారా మనిషి అని తేల్చేశాడు మర్యాదరామన్న. రంగమ్మ దగ్గర గంగమ్మే అప్పు పుచ్చుకున్నదని, మర్యాదగా బాకీ తీర్చకపోతే దండించవలసి ఉంటుందనీ తీర్పు చెప్పి, ప్రశంసలు పొందాడు.

7, ఏప్రిల్ 2020, మంగళవారం

తమాషా ప్రశ్నలు

తమాషా ప్రశ్నలు

1. పిల్లలు ఉండని స్కూల్ ఏమిటి?

2. నడవలేని కాలు ఏమిటి?

3. ఆడలేని బ్యాట్ ఏమిటి?

4. కనిపించని గ్రహం ఏమిటి?

5.. భోజనంలో పనికి రాని రసం ఏమిటి?

6.. తాగలేని రమ్ ఏమిటి?

7. దేవుడు లేని మతం ఏమిటి?

8. దున్నలేని హలం?

9.  రాజులు నివశించని కోట ఏమిటి?

10. స్కూల్ బ్యాగులో ఉండని స్కేలు

11. నోరు లేకపోయినా కరిచేవి?

12. చేయడానికి ఇష్టపడని ధర్మం

13. ఓకే చోదకుడితో నడిచే బస్సు

14. ఎంత విసిరినా చేతిలో ఉండే కర్ర

15. ఉత్తరానికి, దక్షిణానికి తేడా?

16. మిసిసిపీ నదిలో ఎక్కువ ఏమున్నాయి?

17. మొదటి ర్యాంకు రావాలంటే పరీక్షలు ఎలా రాయాలి?

18. మనకు కలలు ఎందుకు వస్తాయి.

19. మిరపకాయ కొరితే  ఏమవుతుంది?

20. రోజూ మారేదేది?

జవాబులు

1) డ్రైవింగ్ స్కూల్

2) పంపకాలు

3) దోమల బ్యాట్

4) నిగ్రహం.

5) పాదరసం.

6) తగరం.

7) కమతం

8) కుతూహలం.

9) తులసి కోట

10) రిక్టర్ స్కేలు

11) చెప్పులు

12) కాలధర్మం

13) డబుల్ డెక్కర్ బస్సు

14) విసనకర్ర

15) ఉత్తరం పోస్టు డబ్బాలో వేయగలం. దక్షిణాన్ని వేయలేం.

16)  ‘సీ’లు

17) పెన్నుతో

18) కంటాం కాబట్టి

19) రెండు ముక్కలవుతుంది.

20) తేదీ

మర్యాద రామన్న కథలు - పేదరాసి పెద్దమ్మ - దొంగలు

మర్యాద రామన్న కథలు

పేదరాసి పెద్దమ్మ - దొంగలు

రంగాపురం అనే ఊరిలో ఒక పేదరాసి పెద్దమ్మ ఉండేది. ఆమె ఆ ఊరికి వచ్చేవారికి పూటకూళ్ళ భోజనాలు పెడుతూ జీవనం సాగిస్తూ ఉండేది. ఒకరోజు ఆమె ఇంటికి నలుగురు వ్యక్తులు వచ్చి ఆమెను తమకు భోజనం వండి పెట్టమని, ఆ ఊర్లో రెండు, మూడు రోజుల పాటు ఉంటామని తెలిపారు. సరేనని పెద్దమ్మ వారిని స్నానపాదులు ముగించుకుని వచ్చేలోగా భోజనం సిద్ధం చేస్తానని తన పనిలో నిమగ్నమైనది.

ఆ నలుగురు వ్యక్తులు దొంగతనాలు చేస్తూ వచ్చిన సొమ్మును పంచుకునేవారు. వారు పెద్దమ్మ ఇంటికి రాకముందే వేరే గ్రామంలో దొంగతనము చేసి ఆ సొమ్ముతో పెద్దమ్మ ఇంటికి వచ్చారు. వారు ఒకసారి ఆ గ్రామ పరిస్థితులు తాము దొంగతనము చేయడానికి ఎలా ఉంటుందో చూద్దామని బయలుదేరాలని అనుకున్నారు. అలాగే పెద్దమ్మ అమాయకత్వం కూడా వారికి అర్థమైంది. ఎలాగైనా ఆమె వద్ద సొమ్ము భద్రముగా ఉంటుందని ఆ నలుగురు లోపలకి వెళ్ళి పెద్దమ్మా ఇదిగో మాకు చిన్న సహాయం చేసిపెట్టు. మేము ఒకపని కోసం ఊరిలోకి వెళ్తున్నాము. ఈ వరహాల మూటను నీవద్ద భద్రముగా ఉంచు. మేము నలుగురం కలసి వచ్చినప్పుడు మాత్రమే ఇవ్వాలి. ఒక్కరు వచ్చి అడిగినా ఇవ్వవద్దు అని చెప్పి ఊర్లోకి వెళ్దామన రెండడుగులు వేశారు.

ఆ నలుగురిలో ఒకడు పెద్దమ్మ అమాకత్వాన్ని ఆసరా చేసుకుని ఎలాగైనా ఆ వరహాలను కాజేయాలని పథకం వేసి తోటి మిత్రులతో నేను పెద్దమ్మ దగ్గరకు వెళ్ళి రాతిచెంబు తెచ్చుకుంటాను అని, పెద్దమ్మ చెంబును ఇవ్వదేమో మీరు కూడా ఇవ్వమని చెప్పండి అన్నాడు. మేము చెబుతాములే అని ఆగారు. ఆ నాలుగవ వాడు పెద్దమ్మను వరహాల మూటను తెమ్మన్నారు ఇవ్వు అని అడిగాడు. పెద్దమ్మ లేదు మీ నలుగురు కలిసి వస్తేనే ఇవ్వమన్నారు కదా నేను ఇవ్వను అని చెప్పింది. వెంటనే వాడు ఆ ముగ్గురితో పెద్దగా మీరు కూడా చెబితేనే ఇస్తుందట, ఇవ్వమని చెప్పండి అన్నాడు. ఆ ముగ్గురూ రాతిచెంబేకదా అడిగేది దానికి లోపలకి వెళ్ళి చెప్పటం ఎందుకని బయట నుండి పెద్దమ్మా ఇవ్వు అన్నారు. పెద్దమ్మ మళ్ళీ అడిగింది ఇవ్వనా అని, వాళ్ళు సరే ఇవ్వు అని ఊర్లోకి వెళ్ళారు.

ఆ నాలుగవ వాడు వరహాల మూటను తీసుకుని దొడ్డి దారిన పారిపోయాడు. పెద్దమ్మ వంట సిద్ధం చేసి వారి కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఇంతలో ముగ్గురు వచ్చి భోజనం చేశాక పెద్దమ్మను వరహాల మూటను అడిగారు. పెద్దమ్మ అదేమిటి మీరు ఇవ్వమని బయటి నుంచి చెబితేనే కదా ఆ నాలుగవ వానికి ఇచ్చాను. మరలా నన్ను అడుగుతారేమిటి? అని అమాయకంగా అన్నది.‌ మేము నిన్ను ఎప్పుడు ఇవ్వమన్నాము? వాడు రాతిచెంబు కదా నిన్ను అడిగినది. అదే ఇవ్వమని చెప్పాము. మాకు తెలియదు మంచితనంగా మా వరహాలు మాకివ్వు లేదంటే న్యాయాధికారి వద్దకు వెళ్తాం అని గొడవ చేశారు. తనకేం తెలియదని మీరు బయటనుండి ఇవ్వమంటేనే ఇచ్చాను అని పెద్దమ్మ మొత్తుకున్నా వినలేదు ముగ్గురూ పెద్దమ్మను న్యాయాధికారి వద్దకు తీసుకుని వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పి పెద్దమ్మ వద్ద నుండి వరహాలు ఇప్పించమని కోరారు. పెద్దమ్మ జరిగిన విషయాన్ని చెప్పినా న్యాయాధికారి పట్టించుకోకుండా పెద్దమ్మనే వరహాలు చెల్లించాలని తీర్పు చెప్పాడు.

అప్పుడే ఏదో పని మీద రాజధానికి బయల్దేరిన మర్యాద రామన్నతో చెప్పుకుంది పేదరాశి పెద్దమ్మ దొంగలు ఆమెను న్యాయాధికారి వద్దకు తీసుకు వెళ్ళగా, అతడూ వారినే సమర్ధించిన సంగతీ చెప్పింది. అంతా విని, “ప్రభువులకు పొయ్యేకాలం. రాజోద్యోగి తప్పు చేస్తే, అది ప్రభువు చేసినట్టే” అన్నాడు రామన్న. రాజును తిట్టాడని భటులు రామన్నను బంధించి, కొలువులో హాజరు పెట్టారు. రామన్న తనకు అపచారం చెయ్యలేదని, తీర్పు అతడినే చెప్పమని కోరాడు ప్రభువు. ప్రస్తుతం ముగ్గురు దొంగలే ఉన్నారు. వారిలో ఆఖరి వాడిని తీసుకురాగలిగితే, ఒప్పందం ప్రకారం వారికి పెద్దమ్మ వరహాలు చెల్లిస్తుంది అని తీర్పు చెప్పాడు. నాల్గోవాడు దొరకడం కల్ల. అదీ రామన్న యుక్తి. తీర్పు అందరికీ నచ్చింది. ప్రభువు కూడా రామయ్యను తీర్పులు చెప్పే న్యాయాధికారిగా ఉండవలసిందిగా కోరాడు.

6, ఏప్రిల్ 2020, సోమవారం

తెలుగులో వంద ఉత్తమ పుస్తకాలు - రచయితలు

తెలుగులో వంద ఉత్తమ పుస్తకాలు

●కన్యాశుల్కం - గురజాడ అప్పారావు 

●మహాప్రస్థానం - శ్రీశ్రీ

●ఆంధ్ర మహాభారతం - కవిత్రయం

●మాలపల్లి  - ఉన్నవ లక్ష్మినారాయణ

●చివరకు మిగిలేది - బుచ్చిబాబు

●అసమర్థుని జీవయాత్ర - గోపీచంద్

●అమృతం కురిసిన రాత్రి - దేవరకొండ బాలగంగాధర తిలక్

●కాలాతీత వ్యక్తులు - డాక్టర్‌ శ్రీదేవి

●వేయి పడగలు - విశ్వనాథ సత్యనారాయణ

●కళాపూర్ణోదయం - పింగళి సూరన

●సాక్షి - పానుగంటి లక్ష్మీనారాయణ

●గబ్బిలం - గుఱ్ఱం జాషువా

●వసు చరిత్ర - భట్టుమూర్తి

●అతడు ఆమె - ఉప్పల లక్ష్మణరావు

●అనుభవాలూ..జ్ఞాపకాలు - శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి

●అముక్త మాల్యద - శ్రీకృష్ణదేవరాయులు

●చదువు - కొడవగంటి కుటుంబరావు

●ఎంకి పాటలు - నండూరి సుబ్బారావు

●కవిత్వ తత్వ విచారము - డాక్టర్‌ సిఆర్‌ రెడ్డి

●వేమన పద్యాలు - వేమన

●కృష్ణపక్షం - కృష్ణశాస్త్రి

●మట్టిమనిషి - వాసిరెడ్డి సీతాదేవి

●అల్పజీవి - రావిశాస్త్రి

●ఆంధ్రుల సాంఘిక చరిత్ర - సురవరం ప్రతాపరెడ్డి

●ఆంధ్ర మహాభాగవతం - పోతన

●బారిస్టరు పార్వతీశం - మెక్కుపాటి నరసింహశాస్త్రి

●మొల్ల రామాయణం - మొల్ల

●అన్నమాచార్య కీర్తనలు - అన్నమాచార్య

●హంపీ నుంచి హరప్పా దాకా - తిరుమల రామచంద్ర

●కాశీయాత్రా చరిత్ర - ఏనుగుల వీరాస్వామయ్య

●మైదానం - చలం

●వైతాళికులు - ముద్దుకృష్ణ

●ఫిడేలు రాగాల డజన్‌ - పఠాభి

●సౌందర నందము - పింగళి, కాటూరి

●విజయవిలాసం - చేమకూర వేంకటకవి

●కీలుబొమ్మలు - జివి కృష్ణారావు

●కొల్లాయి గడితేనేమి - మహీధర రామమోహనరావు

●మ్యూజింగ్స్‌ - చలం

●మనుచరిత్ర- అల్లసాని పెద్దన

●పాండురంగ మహత్యం - తెనాలి రామకృష్ణ

●ప్రజల మనిషి - వట్టికోట ఆళ్వార్‌ స్వామి

●పాండవోద్యోగ విజయములు - తిరుపతి వేంకటకవులు

●సమగ్ర ఆంధ్ర సాహిత్యం - ఆరుద్ర

●దిగంబర కవిత - దిగంబర కవులు

●ఇల్లాలి ముచ్చట్లు - పురాణం సుబ్రమణ్యశర్మ

●నీలిమేఘాలు - ఓల్గా

●పానశాల - దువ్వూరి రామిరెడ్డి

●శివతాండవం - పుట్టపర్తి నారాయణాచార్యులు

●అంపశయ్య - నవీన్

●చిల్లర దేవుళ్లు - దాశరథి రంగాచార్య

●గణపతి - చిలకమర్తి లక్ష్మీనరసింహం

●జానకి విముక్తి - రంగనాయకమ్మ

●స్వీయ చరిత్ర - కందుకూరి

●మ¬దయం - కెవి రమణారెడ్డి

●నారాయణరావు - అడవి బాపిరాజు

●విశ్వంభర - సినారె

●దాశరథి కవిత - దాశరథి

●కథాశిల్పం - వల్లంపాటి వెంకటసుబ్బయ్య

●నేను.. నా దేశం - దర్శి చెంచయ్య

●నీతి చంద్రిక - చిన్నయ సూరి

●పెన్నేటి పాట - విద్వాన్‌ విశ్వం

●ప్రతాపరుద్రీయం - వేదం వెంకటరాయశాస్త్రి

●పారిజాతాపహరణం - నంది తిమ్మన

●పల్నాటి వీర చరిత్ర - శ్రీనాథుడు

●రాజశేఖర చరిత్ర - కందుకూరి

●రాధికా సాంత్వనము - ముద్దు పళని

●స్వప్ప లిపి - అజంతా

●సారస్వత వివేచన - రాచమల్లు రామచంద్రారెడ్డి

●శృంగార నైషధం - శ్రీనాథుడు

●ఉత్తర రామాయణము - కంకంటి పాపరాజు

●విశ్వ దర్శనం - నండూరి రామమోహనరావు

●అను క్షణికం - వడ్డెర చండీదాస్

●ఆధునిక మహాభారతం - గుంటూరు శేషేంద్రశర్మ

●అడవి ఉప్పొంగిన రాత్రి - విమల

●చంఘీజ్‌ ఖాన్‌ - తెన్నేటి సూరి

●చాటు పద్య మంజరి - వేటూరి ప్రభాకరశాస్త్రి

●చిక్కనవుతున్న పాట - జి లక్ష్మినరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్

●చితి.. చింత - వేగుంట మోహనప్రసాద్

●గద్దర్‌ పాటలు - గద్దర్

●హాంగ్‌ మీ క్విక్‌ - బీనాదేవి

●ఇస్మాయిల్‌ కవిత - ఇస్మాయిల్

●కుమార సంభవం - నన్నే చోడుడు

●కొయ్య గుర్రం - నగ్నముని

●మైనా - శీలా వీర్రాజు

●మాభూమి - సుంకర, వాసిరెడ్డి

●మోహన వంశీ - లత

●నగరంలో వాన - కుందుర్తి

●రాముడుండాడు రాజ్యముండాది - కేశవరెడ్డి

●రంగనాథ రామాయణం - గోన బుద్దారెడ్డి

●సౌభద్రుని ప్రణయయాత్ర - నాయని సుబ్బారావు

●సూత పురాణం - త్రిపురనేని రామస్వామిచౌదరి

●శివారెడ్డి కవిత - శివారెడ్డి

●సాహిత్యంలో దృక్పథాలు - ఆర్ఎస్‌ సుదర్శనం

●స్వేచ్ఛ - ఓల్గా

●తెలుగులో కవితా విప్లవాల స్వరూపం - వేల్చేరు నారాయణరావు

●కరుణశ్రీ - జంధ్యాల పాపయ్యశాస్త్రి

●వేమన - రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ

●తృణకంకణం - రాయప్రోలు

●హృదయనేత్రి - మాలతీ చందూర్

●బ్రౌను నిఘంటువు - చార్లెస్‌ బ్రౌన్

మర్యాద రామన్న కథలు - సుబ్బయ్య మూర్ఖత్వం

మర్యాద రామన్న కథలు
సుబ్బయ్య మూర్ఖత్వం

ఒక ఊళ్లో సుబ్బయ్య, శంకరయ్య అనే వ్యక్తులు పక్కపక్క ఇళ్లలో కాపురం ఉండేవారు. సుబ్బయ్య వ్యాపారి కాగా, శంకరయ్య ఊర్లో కూలీనాలీ చేసుకుని జీవనం సాగిస్తుండేవాడు. సుబ్బయ్య అహంకారి, దుర్మార్గమైన మనస్తత్వం కలిగినవాడు. శంకరయ్య చాలా మంచివాడు, నిజాయితీపరుడు.

ఒకరోజు సుబ్బయ్య ఏదో పనిమీద పక్క ఊరికి వెళ్తూ... "శంకరయ్యా...! నేను పక్కనే ఉండే శివపురానికి వెళ్తున్నాను. తిరిగీ వచ్చేందుకు వారం రోజులుదాకా పట్టవచ్చు. అప్పటిదాకా నా గుర్రాన్ని నీ ఇంట్లో కట్టేసి వెళ్తాను" అని అన్నాడు. దీంతో మంచివాడైన శంకరయ్య, సరేనని గుర్రాన్ని తన ఇంటి వరండాలో కట్టేసుకున్నాడు.

సుబ్బయ్య ఊరెళ్లిన తరువాత రెండు రోజులపాటు బాగా ఆరోగ్యంగానే ఉన్న గుర్రం... మూడోరోజు అకస్మాత్తుగా జబ్బుపడి చనిపోయింది. ఏం చేయాలో, సుబ్బయ్యకు ఏమని చెప్పాలో తెలియని శంకరయ్య దేవుడా...! అంటూ తలపట్టుకుని బాధపడుతూ కూర్చున్నాడు. ఇక చేసేదేముంది.. సుబ్బయ్య వచ్చాక ఆ గుర్రం ఖరీదు కట్టిచ్చేస్తే సరిపోతుందని తనను తాను సముదాయించుకున్నాడు.

చెప్పినట్టుగానే వారం రోజుల తరువాత వచ్చాడు సుబ్బయ్య. గుర్రం చనిపోయిన విషయం తెలుసుకున్న సుబ్బయ్య ఆగ్రహంతో.. "చూడు శంకరయ్యా...! నేను గుర్రాన్ని అప్పగించి వెళ్ళాను. ఇప్పుడు నా గుర్రం నాకు కావాలి. దానికి బదులుగా డబ్బుగానీ, మరే ఇతర గుర్రముగానీ వద్దు...! ఏమైనా చేయి, నాకు దాంతో సంబంధం లేదు" అని తెగేసి చెప్పాడు. దీంతో ఏమీ పాలుబోని శంకరయ్య మర్యాద రామన్న వద్దకెళ్లి జరిగినదంతా చెప్పి వాపోయాడు.

అంతా విన్న మర్యాద రామన్న... ఒక గొప్ప ఎత్తువేసి, వివరంగా చెప్పి శంకరయ్యను పంపించాడు. మర్యాద రామన్న సలహా మేరకు కాచుక్కూర్చున్న శంకరయ్య ఇంటికి గుర్రం గురించి అడిగేందుకు వచ్చాడు సుబ్బయ్య. రావడమేగాకుండా, గోడకు ఆనించి పెట్టిన పెద్ద పెద్ద కుండలను పొరపాటున బద్దలు కొట్టేశాడు.

దీంతో "అయ్య బాబోయ్..! నా కుండలు బద్ధలైపోయాయి సుబ్బయ్యా... ఇప్పుడెలా..?" అని గట్టిగా అరిచాడు శంకరయ్య. "దీని కోసం ఇంత రాద్ధాంతం చేయాలా శంకరయ్యా...? వాటి ఖరీదు నేను కట్టిస్తాన్లే, లేకపోతే వేరే కుండలను కొనిస్తాను" అన్నాడు సుబ్బయ్య. "అయ్యో అలా చెబుతారేంటి..? నాకు నా కుండలే కావాలి, వేరేవి వద్దు" అని గట్టిగా పట్టుబట్టాడు శంకరయ్య.

సుబ్బయ్య, శంకరయ్యలు ఎంతసేపు వాదించుకున్నా సమస్యకు పరిష్కారం దొరకక పోవడంతో... చివరకు ఇద్దరూ కలసి మర్యాద రామన్న ఇంటికి వెళ్ళారు. ఇద్దరి మాటలను ఓపికగా విన్న మర్యాద రామన్న... సుబ్బయ్యను మందలించి, గుర్రం ఖరీదును శంకరయ్య వద్ద తీసుకుని, అతడి కుండల ఖరీదును చెల్లించమని తీర్పు చెప్పాడు. దీంతో.. తప్పు తెలుసుకున్న సుబ్బయ్య ప్రశ్చాత్తాపంతో ఇంటిదారిపట్టాడు.

5, ఏప్రిల్ 2020, ఆదివారం

విక్రమాదిత్య కథలు -తెల్ల కాకులు - మంచి పాములు

విక్రమాదిత్య కథలు
తెల్ల కాకులు - మంచి పాములు

అనగనగా  ఓ రోజు లోకంలో కాకులన్నీ తెల్లగా అయిపోయాయిట.

'తెల్లకాకులేమిటి చెప్మా' అని అందరూ వింతగా చెప్పుకోనేలోపు గోవులన్ని తెల్లగా మారిపోయాయిట.
కర్రావులు, నల్లావులు, మచ్చల ఆవులూ తెల్లగా తెల్లబడిపోయాయిట.*
*పుట్టల నుంచి బయటకు వచ్చిన తెల్లటి పాములు, వీధుల్లో పిల్లలతో ఆడుకోవడం మొదలుపెట్టాయిట.

ఏమవుతోందసలని అందరూ రచ్చబండల దగ్గర చేరి తోచిన కారణం చెప్పుకుంటుండగా, బావుల దగ్గర నీళ్ళు చేదుకుంటున్న ఆడంగులు, బిత్తరపోతూ రంగు మారిన నీళ్ళని చేతి లోకి తీసుకు చూసారట. అవి పాలు! కమ్మటి, చిక్కటి పాలు.

వంటిళ్ళలో ఉప్పుగల్లు ఘుమ ఘుమలాడుతూ కర్పూరం అయిపోయిందట.

ఉమ్మెత్త పువ్వులు దివ్య పరిమళాలు వెదజల్లడం మోదలుపెట్టాయట.

ఒక వింతా! ఎటు చూసినా ఏదో ఒక కబురే! అందరి ముఖాల్లోనూ ఆశ్చర్యమే!

మేతకి వెళ్ళిన మందలని తీసుకొచ్చే కాపరులకి, ఎవరిదే ఆవో తెలియక గడబిడ పడుతూ వస్తూ వస్తూ ఇంకో వింత కబురు మోసుకొచ్చారు. "అయ్యలూ, ఎవరి పశువు ఏదో తేల్చుకోవడమెలా ఉన్నా, రేపటికి మందలకి గడ్డి లేదయ్యా! బీళ్ళు అన్ని ఖాళీ. గడ్డి పోచన్నది లేకుండా పీక్కుపోయారయ్యా!" అని. ఎవరయ్యా గడ్డి పట్టుకుపోయినదీ అంటే.. రాజులు. భూమండలం లో ఉన్న బుల్లి రాజులు, చిన్న రాజులు, చిటికె రాజులు, పొటికె రాజుల మొదలు మహా రాజుల వరకూ అందరూ గడ్డి బీళ్ళమ్మట పడి పీక్కుపోయారట.

ఇవన్ని పైనుంచి చూస్తూ విస్తుపోయిన సురలోకవాసులు విష్ణుమూర్తి దగ్గరకు పరుగులు తీసారుట.

పాల సంద్రంలో పాముసజ్జె మీద కునుకు తీస్తున్న దేవరవారిని లక్ష్మి కుదిపి లేపింది.

కళ్ళు తెరిచిన స్వామికి తన పద్మహస్తాన ఉన్న తెల్ల తామరపువ్వును చూపి" ఇదేంటి నాథా, తెల్ల తామరల మయం అయిపోయింది మన పెరటి కొలను. మరో రంగే కనిపించడం లేదే! ఏం చిత్రం స్వామీ !" అని తెల్లబోయింది.

ఈ లోపు అక్కడికి చేరిన దేవతలు తమ గోడు ఏలికతో వెళ్ళబోసుకున్నారిలా.

"స్వామీ! భూలోకంలో ఏ గోవు చూసినా కామధేనువులా ఉంది. నందిని మించినట్టున్నాయ్ గిత్తలన్నీ. ఏ పూవు చూసినా పారిజాత పరిమళమే. భూమి మీద తెల్లఏనుగులని చూసి తన గొప్పింకేమిటని ఐరావతం అలిగి పడుకుంది. హిమాలయానికి దారి తెలియడం లేదు. అన్ని కొండలూ తెల్లగా మెరిసిపోతున్నాయ్. ఉప్పు, నీళ్ళు లేక ప్రజలు అల్లల్లాడుతున్నారు. తెల్లారితే పశువులకి ఓ గడ్డిపోచ కూడా లేదు. తెల్లారడమేమిటి మహానుభావా! సూర్యుడు కుంగి ఝాము కావొస్తున్నా, ఎక్కడా చీకటి ఛాయలే లేవు. చంద్రుడికి ఏం చెయ్యాలో పాలుబోవడం లేదు. పాలంటే గుర్తొచ్చింది ప్రభో! అన్ని సంద్రాలూ పాల సంద్రాలై పోయాయ్. చేపజాతి మొత్తం అజీర్తితో ధన్వంతరి ఇంటికి చేరుకున్నాయ్. ఇంకా ఏం జరగనుందో! ఏమిటి ఉత్పాతం తండ్రీ? "

కలువ రేకుల వంటి కళ్ళని ఓ క్షణకాలం మూసి తల పంకించి, నవ్వుతూ కళ్ళు తెరిచాడు నారాయణుడు.
"ఈ మార్పులకి కారణం 'భోజరాజ కీర్తి చంద్రిక'. ఆ రాజు కీర్తి  ప్రభావానికి నల్లనివన్నీ తెల్లబడ్డాయ్. లేని సుగుణాలు చరాచరాలకు అంటుతున్నాయ్." అని చెప్పాడు.

"మరెలా అన్నగారూ, తెల్ల తామరలు లక్ష్మికి, తెల్లని పాములు ఫరమేశ్వరునికి తప్పవా ఇకపై?" అడిగింది పార్వతి.

"తెల్లబడిన నారాయణుడిని కూడా చూడాల్సివస్తుందేమో, ఈ పరిస్థితిని చక్కదిద్దకపోతే!" హాస్యమాడాడు నారదుడు.

"ఇంకేం, ఈ సమస్యని నువ్వే చక్కదిద్దగలవాడివి నారదా!" అని చురక వేస్తూ, కర్తవ్యం బోధించి పంపాడు నారదుడిని భోజరాజు వద్దకు శ్రియఃపతి.

భూలోకంలో భోజరాజాస్థానం గడ్డి పోచ నోటకరిచి కానుకలతో నిలబడ్డ రాజులతో కిక్కిరిసిపోతోంది.
భూమండలంలో రాజులంతా భోజుడికి సామంతులవడానికి వచ్చి చేరారక్కడ. ఎక్కడెక్కడి దేశాలనుంచో ఇంకా తరలి వస్తున్నారు. ఏం జరుగుతోందో అంతు చిక్కక ఆశ్చర్యపోతున్న భోజుడిని సమీపించాడు నారదుడు.

"మహానుభావా, వందనం. సరైన సమయానికి విచ్చేసారు. ఏమిటీ వైపరీత్యం?" అని ప్రశ్నించాడు భోజుడు.

"నీ గొప్పదనమే భోజరాజా, ఈ విచిత్రాలకు నువ్వే కారణం. నీ కీర్తి కాంత ప్రభావమే ఇదంతా! భూలోకం ఏం చూసావ్! దేవతలు సైతం అసూయపడేంత దూరం పాకింది నీ కీర్తి. నారాయణుడే నెవ్వెరబోయాడు." అని చెప్పాడు నారదుడు.

"అవునా..!!!" అని ఆశ్చర్యపోయిన భోజుడు, మునివేళ్ళతో గర్వంగా మీసాన్ని మెలేయడం, లోకం యథాతథం కావడం ఒకేసారి జరిగింది.

దిక్కుల్ని జయించిన మహారాజయినా పొగడ్తకి దాసుడే కదా!

పొగడ్తకి లొంగిన వాడు పదుగురిలో ఒకడు, సామాన్యుడు.

4, ఏప్రిల్ 2020, శనివారం

నాలుగక్షరాల సరళ పదాలు మరియు బిగ్గరగా చదివే వీడియో

నాలుగక్షరాల సరళ పదాలు మరియు బిగ్గరగా చదివే వీడియో
అవతల అవసరం అవగతం అలమర అలగటం
అసహనం అపజయం ఆచరణ ఆదరణ ఆమరణ
ఆచమనం ఇరగటం ఇవతల ఇరవడం ఇమడటం
ఉడకటం ఉరవటం ఉతకడం ఊడవటం ఎగరటం
ఎదగడం ఎవరన ఏడవటం కదలక కరవడం
కలపక కలవరం కలకలం కలపడం గణగణ
గబగబ గలగల గరగర గడవటం గడపడం
గజగజ ఘనఘన చదవటం చకచక జలజల
జరజర టపటప టకటక డబడబ డగడగ
తరతమ తళతళ తడవక తలపక తరలక
తహతహ దడదడ దబదబ ధనధన దశరధ
నడవడ నవశకం నవరసం నరనరం నరహర
నమలటం పడమర పరంపర పకపక పసపస
పటపట పరవశం పరపర బరబర బలవడం
బలవంతం భగభగ మరవక మరలక మడవక
మలమల మనవనం మదగజం మసలడం యనమల
యకశక లకలక లగలగ లబలబ వడకడం
వలవల వదలక షకలక సలసల సహచర
సడలక హరహర కళకళ
వీడియోను వీక్షించడానికి ఇక్కడ నొక్కండి..

మూడక్షరాల సరళ పదాలు మరియు బిగ్గరగా చదివే వీడియో

మూడక్షరాల సరళ పదాలు మరియు బిగ్గరగా చదివే వీడియో
అలక అరక అమల అటక అచట
అబల అనగ అకట అపర అక్షరం
ఆవల ఆపద ఆవడ ఆనక ఆనప
ఆమడ ఆయన ఆలన ఆసర ఇతర
ఇగర ఇరగ ఇచట ఈదర ఈవల
ఈయన ఉడక ఉదక ఉడత ఉపమ
ఉరక ఉలవ ఊయల ఊహల ఊదర
ఊరక ఎచట ఎడమ ఎకరం ఎసర
ఎదర ఏలన ఏడవ ఏమర ఐదవ
ఔనట కమల కడవ కడవ కడప
కలత కలక కలప కవల కపటం
కనకం కలశం గడప గవద గరళం
గలబ గనక గగనం గమనం గణన
చదరం చరక చమట చవక చవట
చలమ చలక జనప జలజ భజన
జగడం తడవ తగరం తబల తపన
తనయ దవడ దహనం ధవళం నరకం
నడక నయనం నలక నవల పనస
పడక పడవ పలక పరమ పదవ
పసర బడవ బయట బరక బరమ
బంజర మకరం మగధ మందస మడత
మడమ మడవ మసక మరల మరక
యతల లవంగం రగడ రభస రచన
రమణ రక్షణ లగడం లవణం లలన
వనజ వరద వలన వరస వదనం
వచనం వలస శనగ శరభం సరళ
సహనం లక్షణం
వీడియోను వీక్షించడానికి ఇక్కడ నొక్కండి..

విక్రమాదిత్య కథలు - వడ్డికాసుల చెట్టు!

విక్రమాదిత్య కథలు - వడ్డికాసుల చెట్టు!

పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని  బేతాళుడు, ‘‘రాజా, భీతిగొలిపే ఈ శ్మశానంలో, అర్ధరాత్రివేళ ప్రతి ఒక్కసారీ కార్యభంగం కలుగుతున్నా, మరింత పట్టుదలతో కార్యసాధనకై నువ్వు కనబరుస్తున్న దీక్ష మెచ్చదగిందే.

కానీ, లోకంలో కొందరు వ్యక్తుల ప్రవర్తన అతి విచిత్రంగానూ, నిగూఢంగానూ వుంటుంది. అలాంటి వారు పరోపకారం చేస్తున్నామన్న భ్రమ కల్పించి, ఆత్మబంధువుల మధ్యా, రక్తసంబంధీకుల మధ్యా పరస్పర అనుమానాలూ, ద్వేష భావాలూ కల్పిస్తూంటారు. అలాంటి వారెవరో నిన్ను ఏదో దుస్సాధ్యమైన కార్యాన్ని చేపట్టేలా ప్రోత్సహించి వుంటారన్న అనుమానం కలుగుతున్నది. ఈ విషయమై నీకు తగు హెచ్చరికగా వుండేందుకు, జడనాధుడనేవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా, విను,’’ అంటూ ఇలా చెప్పసాగాడు: భద్రపురంలో మణిదీపుడనే భాగ్యవంతుడున్నాడు. ఆయన భార్య వేదవతిది కూడా సంపన్న కుటుంబం. ఇద్దరూ ఎంతో మంచి వారు; దానశీలురు. అడిగినవారికి లేదనకుండా ఇచ్చి సాయపడేవాడు మణిదీపుడు. ఇంటికొచ్చినవారిని కన్నతల్లిలా ఆదరించి పంపేది వేదవతి.

కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు! ఆ దంపతుల ఒక్కగానొక్క కొడుకు గుణదీపుడు పెరిగి పెద్దవాడయ్యే సరికి, వారికి తాతలనాటి ఇల్లు మినహాయించి ఇంకేమీ మిగల్లేదు. నిజానికి ఇంట్లో ఏం జరుగుతున్నదీ గుణదీపుడికి తెలియదు. వాడు అదే ఊళ్ళోని జడనాధుడనేవాడితో కలిసి దూరప్రాంతాలకు వెళ్ళి, వైద్యవిద్యనభ్యసించాడు. కొడుకు గుణదీపుడికేకాక జడనాధుడికి కూడా అవసరమైన డబ్బును మణిదీపుడు పంపుతూండేవాడు. విద్యాభ్యాసం పూర్తిచేసుకుని భద్రపురం వచ్చేసరికి, గుణదీపుడికి తన ఇంటి పరిస్థితులు తెలిసివచ్చాయి.

‘‘పెద్దలిచ్చిన ఆస్తిని నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చుచేసి, నాచేతికి చిప్పనిచ్చావు. ఇప్పుడేం చేయాలో నాకు పాలుపోవడం లేదు,’’ అన్నాడు గుణదీపుడు కోపంగా తండ్రితో. ‘‘నాయనా! సంపదలు మనవెంట రావు. మన మంచి మనలను సర్వదా కాపాడుతుంది.  నీ తండ్రి చేసిన పనులన్నింటి వెనకా, నా ప్రోత్సాహం కూడా వుంది. అది తప్పని నీవనుకుంటే, ఆ తప్పు మా ఇద్దరిదీ. ఇప్పటికీ మనకు వచ్చిన లోటులేదు. నిలువ నీడ వుంది. నువ్వు వైద్యవృత్తి ప్రారంభించావంటే, నీకు బోలెడు ఆదాయం వస్తుంది,’’ అంటూ కొడుకును సముదాయించింది వేదవతి.

గుణదీపుడు వైద్యవృత్తిని స్వీకరించాడు. అంతో ఇంతో ఆదాయం బాగా వస్తున్నా, అతడికి తృప్తిగా వుండేది కాదు. అందుకు కారణం జడనాధుడు. సంవత్సరం తిరక్కుండానే జడనాధుడికి తన మందులతో శవాలకు సైతం ప్రాణం పోయగలడన్న పేరు వచ్చింది. వైద్యం కోసం ఎక్కడెక్కడ నుంచో వచ్చే రోగులతో, అతడి ఇల్లు కిటకిటలాడిపోతూండేది. క్రమంగా అతడివద్ద సంపద పెరగసాగింది.  ‘‘నీ డబ్బుతోనే వైద్యవిద్య నేర్చుకుని, నీ కొడుక్కే పోటీగా తయారయ్యాడీ జడనాధుడు! నీ మూలంగా నా ఆస్తీ పోయింది. నేర్చిన వైద్యవిద్యా అక్కరకు రావడం లేదు,’’ అంటూ గుణదీపుడు తండ్రి మీద కోపంగా విసుక్కున్నాడు.

‘‘నాయనా! ఇప్పుడు నీ ఆదాయం తక్కువేంకాదు. వైద్యవృత్తిలో సేవాధర్మమే ప్రధానం. నీవు నీ విద్యతో ప్రజలకు సాయపడు. అప్పుడు ప్రజలే నిన్ను గొప్పగా చూసుకుంటారు. నీకు జీవితంలో ఏ లోటూ వుండదు,’’అని మణిదీపుడు, కొడుక్కు హితవు చెప్పాడు కానీ, గుణదీపుడి దృష్టంతా సంపాదన మీదనే వుండేది. అదేమో పెరక్కుండా వుంది! ఈ విషయం ఆ ఊళ్ళో బియ్యం వ్యాపారం చేసే మహాసేనుడికి  తెలిసింది. ఆయనకు రత్నమాల అనే ఒకే ఒక్క కూతురు. తనకు మగబిడ్డలు లేనందున, ఆయన యోగ్యుడైన యువకుణ్ణి ఇల్లరికం తెచ్చుకోవాలని  చూస్తున్నాడు. అందుకని ఆయన గుణదీపుణ్ణి కలుసుకుని, ‘‘బాబూ!

నీ కుటుంబం గురించి నాకు బాగా తెలుసు. నీ పూర్వీకులు ఎన్ని దానధర్మాలు చేసినా, మీ కుటుంబం సిరిసంపదలతో వర్థిల్లుతూండేది, అది వారి జాతకబలం. నీ తల్లిదండ్రులు నష్టజాతకులు! వారితో కలిసివుంటే నీకు ఏమీ  అచ్చిరాదు. నా కూతుర్ని పెళ్ళిచేసుకో. నా ఇంటికి ఇల్లరికం వచ్చేయి. నీ తల్లిదండ్రులను దగ్గరకు చేరనివ్వకు,’’అంటూ తనకు అనుకూలంగానూ, అతడి తల్లిదండ్రులకు ప్రతికూలంగానూ మాటలు చెప్పాడు. ఆ మాటలు గుణదీపుడి మీద బాగా పనిచేశాయి. అటుపైన రత్నమాల అందం కూడా అతణ్ణి ఆకర్షించింది. తానామెను పెళ్ళాడాలనుకుంటున్నట్టు తల్లిదండ్రులకు చెప్పాడు. అందుకు వాళ్ళు, ‘‘నాయనా! నీవు పెద్దవాడివయ్యావు. నీ మంచిచెడ్డలు నీకే బాగా తెలుసు. మేము నిన్ను దీవిస్తున్నాం!’’ అన్నారు.

దీనికి గుణదీపుడు ఆశ్చర్యపడి, ‘‘మీకిప్పుడు బొత్తిగా ఆదాయం లేదు. కొడుకుగా మిమ్మల్ని పోషించవలసిన బాధ్యత నా మీద వుంది. నేను మిమ్మల్ని అలక్ష్యం చేస్తే, లోకులు నన్ను దుమ్మెత్తిపొయ్యరా?’’అని అడిగాడు. మణిదీపుడు నవ్వి, ‘‘లోకాపవాదుకు భయపడి, నీవు మమ్మల్ని చేరదీయవద్దు. మా గురించి నీకు ఏ బెంగా వద్దు. నారు పోసినవాడే నీరూ పోస్తాడు,’’ అన్నాడు  గుణదీపుడు, రత్నమాలను పెళ్ళిచేసుకుని, అత్తవారింటికి  వెళ్ళిపోయాడు. ఈ లోగా జడనాధుడికి మణిదీపుడి అవస్థ తెలిసింది. అతడు వారిని చూడబోతే వాళ్ళు, ‘‘మేము సుఖంగా వున్నాం. మా అబ్బాయి ఎంత బ్రతిమాలినా, వాడి దగ్గరకు వెళ్ళడం లేదు. మా కట్టెలు, ఈ ఇంటనే వెళ్ళిపోవాలని మా కోరిక!’’ అంటూ, పరోక్షంగా తాము అతడితో రాలేమని సూచించారు.

జడనాధుడు కొద్దిక్షణాలు మౌనంగా వూరుకుని, ‘‘నేనిక్కడికి స్వార్థంతో వచ్చాను. మీ పెరట్లో ఒక చెట్టు వుంది. దాని పేరు ఎవరికీ తెలియదు. అయితే, ఆ చెట్టు కాయలతో అద్భుతమైన మందులు తయారు చేయవచ్చునని, నాకు తెలిసింది. అది ఏడాది పొడుగునా కాయలు కాస్తూనే వుంటుంది గదా. ఒక్కోకాయ పది బంగారు కాసుల విలువచేస్తుంది. ఐతే, అంత ధర నేనివ్వలేను.  మీరు  రోజూ నాకు ఒక కాయ ఇస్తే, నేను మీకు ఒక్క బంగారు కాసు ఇవ్వగలను. మీరు జీవించి ఉన్నంతకాలం,  ఆ చెట్టు కాయలు మరెవరికీ అమ్మబోమనీ, ప్రతిరోజూ నాకొకకాయ తప్పక అమ్మగలమనీ పత్రం రాసి ఇస్తే, నాకెంతో మేలుచేసినవారౌతారు,’’ అని చెప్పాడు.

మణిదీపుడు ఆలోచనలో పడి, ‘‘నీవు చెప్పేవరకూ నాకు మా చెట్టుకాయల విలువ  తెలియదు. వాటిని నీవడిగిన ధరకు తప్పక ఇవ్వగలను. కానీ నేను నీకు పత్రమెందుకు రాయాలో తెలియడంలేదు,’’ అన్నాడు. ‘‘అయ్యా! ఈ కాయల విలువ బయటి వాళ్ళకు తెలిస్తే ప్రమాదం. వాటిని అమ్మమని చాలామంది అడుగుతారు.  ఆ కాయలను  ఒక రకంగా వాడితే ప్రాణాలు పోసే మందు అవుతుంది; మరొకరకంగా వాడితే ప్రాణాలు తీసే విషం కూడా కాగలదు.  ఇవి నావంటివాడి చేతిలో వుంటేనే దురుపయోగం కాకుండా వుంటాయి. మీరు పత్రం రాయడం వల్ల, మీపై వేరెవరూ ఒత్తిడిచేసే అవకాశం లేదు,’’ అని జడనాధుడు వివరించి చెప్పాడు. మణిదీపుడు, జడనాధుడు కోరిన విధంగా పత్రం రాసి ఇచ్చాడు. ఆ రోజు నుంచీ మణిదీపుడి దశ తిరిగింది. ఆయన తను సుఖంగా తింటూ, అవసరంలో వున్నవారిని ఆదుకుంటూ, ఎప్పటిలా పరోపకారం కొనసాగిస్తున్నాడు.

తండ్రి పరిస్థితి మళ్ళీ మెరుగుపడినట్టు గ్రహించిన గుణదీపుడు, కారణం అర్థంకాక సతమతమయ్యాడు. అతడి భార్య రత్నమాల, అతడితో, ‘‘నీ తండ్రి నిన్ను మోసం చేశాడు. ఆయన వద్ద పెద్దలిచ్చిన ఆస్తి ఇంకా చాలా వుండి వుంటుంది. ఆ ఆస్తిని ఇష్టం వచ్చినట్టు ఖర్చుచేస్తున్నాడు. నువ్వు వెళ్ళి అందులో వాటా అడుగు,’’ అంటూ రెచ్చగొట్టింది.

గుణదీపుడు, తండ్రిని కలుసుకుని, ఆస్తివిషయమై నిలదీశాడు. మణిదీపుడికి  పెరటిచెట్టు కాయల విషయం చెప్పక తప్పలేదు. ఆ విషయం వినగానే గుణదీపుడు పెరట్లోకి పరిగెత్తి, అవి వేల సంఖ్యలో వుండడంతో గుండెలు బాదుకుని, ‘‘ఇంత విలువైన చెట్టు విషయాన్ని నాకు చెప్పకుండా దాచడమేకాక, నాతో సంప్రదించకుండా కాయల గురించి పత్రం కూడా రాశావు.  ఇది చాలా అన్యాయం.  నా వాటాకోసం ఇప్పుడే గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాను,’’ అంటూ గొడవ చేశాడు. ఈ సంగతి గ్రామాధికారిదాకా వెళ్ళడం ఇష్టంలేక, మణిదీపుడు, జడనాధుడికి కబురు పెట్టాడు. అతడు వచ్చి సంగతి తెలుసుకుని, ‘‘గుణదీపుడి మాటల్లో న్యాయముంది. నేనొక ఉపాయం చెబుతాను. ఈ చెట్టు కాయల్లో నాలుగువేల కాయలను తీసుకుని వెళతాను.

అందుకు ప్రతిఫలంగా మీకు నేను ప్రతిరోజు ఒక బంగారు కాసు చొప్పున, పదకొండు సంవత్సరాలు ఇవ్వాల్సి వుంటుంది. అయితే, కాయలు ముందుగా ఇస్తున్నారు కాబట్టి, మీ డబ్బుకు బాగా వడ్డీ కూడా వస్తుంది. అందువల్ల నేను, మీరు  జీవించి వున్నంతకాలం రోజుకొక్క బంగారు కాసు ఇచ్చుకుంటాను. ఈ రోజు నుంచీ, ఈ చెట్టుపైనా, దాని కాయలపైనా సర్వాధికారాలు గుణధీపుడికే విడిచిపెడదాం,’’ అన్నాడు మణిదీపుడితో.  ఇది గుణదీపుడికీ నచ్చింది. ఆ తర్వాత గుణదీపుడు ఆ చెట్టు కాయలను అమ్మడానికి ప్రయత్నిస్తే, ఆ కాయల్లో వైద్యానికి పనికొచ్చే  ఎలాంటి గుణం లేదన్నారు వైద్యులు. చివరకు గుణదీపుడు, జడనాధుడి వద్దకే వెళ్ళి, ‘‘నీకు తోచిన వెలకట్టి ఆ కాయలు నువ్వే తీసుకో,’’ అన్నాడు. జడనాధుడు నవ్వి, ‘‘ఆ పిచ్చికాయల్ని నేనేం చేసుకోను?’’ అన్నాడు.

‘‘అవి పిచ్చికాయలా?  వాటికేగా నువ్వు కాయకు బంగారుకాసు చొప్పున వెల గట్టావు!’’ అన్నాడు గుణదీపుడు ఆశ్చర్యంగా. ‘‘నీ తండ్రి నుంచి తీసుకున్నప్పుడే, ఆ కాయలు నాకు విలువైనవి. మీ పెరటిచెట్టు వడ్డికాసుల చెట్టు! నీతండ్రి ఇతరులకు చేసిన ఉపకారాల పెట్టుబడికి వడ్డీగా కాసులు ఇచ్చే కాయలనది కాస్తుంది!’’ అన్నాడు జడనాధుడు. ఆ జవాబుకు గుణదీపుడి ముఖం వెల వెలపోయింది. అతడు తలవంచుకుని కొంతసేపు మౌనంగా వూరుకుని, ‘‘జడనాధా! నువ్వు మా కుటుంబ విషయాల్లో ఇంత నర్మగర్భంగా ప్రవర్తించవలసింది కాదు. ఏమైనా నాకళ్ళు తెరిపించినందుకు కృతజ్ఞతలు!’’ అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు.

బేతాళుడు ఈ కథ చెప్పి, ‘‘రాజా! వైద్య విద్య పూర్తిచేసి తిరిగివచ్చినప్పటి నుంచీ, మణిదీపుడికి తన కుటుంబం పట్ల జడనాధుడి ప్రవర్తన విచిత్రంగానూ, నిగూఢంగానూ వున్నట్టు తెలుస్తూనే వున్నది కదా?  తన సహాధ్యాయి అయిన గుణదీపుడు, తల్లిదండ్రుల పట్ల కనబరుస్తున్న నిరాదరణ, జడనాధుడికి తెలియంది కాదు. ఐనా, అతడు గుణదీపుడిని సరిదిద్దేందుకు ప్రయత్నించ లేదు. వైద్య వృత్తిలో తనకు మితిమించిన సంపాదన వున్నది గనక, మణిదీపుడి పెరటిచెట్టు కాయలను అడ్డం పెట్టుకుని వినోదించినట్టు కనబడుతున్నది. అది తను వైద్యవిద్యను అభ్యసించేందుకు సాయపడిన ధర్మాత్ముడి పట్ల అమర్యాదా, కృతఘ్నతా అనిపించుకుంటుంది గదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలి పోతుంది,’’ అన్నాడు.

దానికి విక్రమార్కుడు, ‘‘జడనాధుడి ప్రవర్తనలో విచిత్రం, నిగూఢత కాక; ఆర్థికంగా, మానసికంగా స్థాయీభేదాల్లో వుండే మనుషుల ప్రవర్తనకు అనుగుణంగా ఎలా మసులు కోవాలో ఎరిగిన లోకజ్ఞత కనబడుతున్నది. ఎంత నిరాదరణకు గురైనా నిర్మల మనస్కు లైన తల్లిదండ్రులు, తమ కన్నబిడ్డలను ఇతరుల వద్ద కించపరచరు. ఆ కారణం వల్లనే మణిదీపుడు, జడనాధుడితో - మా అబ్బాయి  ఎంత బతిమాలినా, వాడి దగ్గరకు వెళ్ళడం లేదు, అన్నాడు.

అలాంటి పరిస్థితుల్లో చేసేది లేక, తనకు మేలు చేసినవారి పట్ల కృతజ్ఞత కనబరచడానికి, జడనాధుడు పెరటిచెట్టు కాయలకు లేనిపోని విలువ కట్టి,  మణిదీపుడికి సాయపడ్డాడు. ఆ తర్వాత, గుణదీపుడు చెట్టుకాయలకు తోచిన వెలకట్టి తీసుకోమన్నప్పుడు జడనాధుడు - నీతండ్రి నుంచి తీసుకున్నప్పుడే ఆ కాయలకు విలువ అనేశాడు. ఆ జవాబుతో, జరిగిన వాస్తవం, తన తల్లిదండ్రులు చేసిన పరోపకారం విలువ, ఏమిటో గ్రహించిన గుణదీపుడు, నా కళ్ళు తెరిపించావంటూ కృతజ్ఞత చెప్పుకుని వెళ్ళి పోయాడు,’’ అన్నాడు.  రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ గానే, బేతాళుడు శవంతోసహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు.

3, ఏప్రిల్ 2020, శుక్రవారం

రెండు అక్షరాల సరళ పదాలు మరియు బిగ్గరగా చదివే వీడియో

రెండు అక్షరాల సరళ పదాలు మరియు వీడియో
అర ఆట ఆడ ఆన ఆవ ఆశ
ఆహ ఇల ఇక ఇంట ఇహం ఈక
ఈగ ఈత ఈడ ఈశ ఈల ఈట
ఉమ ఉప ఉపం ఉష ఊడ ఊక
ఊచ ఊబ ఊర ఊహ ఎద ఎడం
ఎల ఎర ఏక ఏత ఏట ఏడ
ఎంత ఏల ఐన ఐస ఒర ఒక
ఓడ ఓర ఔర కల కండ కడ
కఫం కథ కరం గద గడ గళం
చంప జగం జడ జత జనం జల
తల తరం తడ తన తమ దడ
దండ దళం ధనం దయ నగ నట
నరం నవ నస నల పగ పటం
పద పర పస బస బండ బంక
మగ మఠం మంగ మండ మతం మంద
మన మలం మమ యమ రమ రసం
రణం లత లంక లవం లయ లక్ష
వడ వంద వనం వరం వల వంట
వస శకం శత శరం సగం సన
సమం సహ హలం హర హంస క్షమ
క్షయ క్షణం ఱంపం
వీడియోను వీక్షించడారనికి ఇక్కడ నొక్కండి...

మూసుకోకురా కళ్ళు మూసుకోకురా కోవిద్-19 పాట,రచన : శ్రీ రమేశ్ గోస్కుల గారు, పాడినవారు : ఐ. వసంత టీచర్

మూసుకోకురా కళ్ళు మూసుకోకురా

కోవిద్-19 పాట    
రచన :  శ్రీ రమేశ్ గోస్కుల గారు
పాడినవారు : ఐ. వసంత టీచర్


మూసుకోకురా కళ్ళు మూసుకోకురా
కళ్ళు మూసి లోకమంతా కూల్చబోకురా 


గడపదాటితే చాలు గండమైతది
గండమై బ్రతుకు సుడి గుండమైతది
విను సోదరా జర విను సోదరి
వినకుంటే చీకట్లు ముంచి వేయురా
 
మూసుకోకురా



ఖండాలు దాటుతూ గుండెల్నిపిండుతూ
మహమ్మారి కరోనా మైకాన ముంచును
ఉసురుతీయును ఉప్పు పాతరేయునూ
ఉన్నచోట ఉంటే మీకు మేలు జరుగును
చెప్పినట్లు వింటె నీదె దేశ సేవరా
చేరువైతే మనకు ఎంతో ముప్పు వచ్చురా

మూసుకోకురా

చైనాను దాటింది ఇటలీని కూల్చింది
మన దేశం చేరింది మనల బాధ పెడుతుంది
పేద ధనిక తేడా లేదు షేక్ హాండ్ ఇస్తే చాలు
మందులేని వీడిపోని మాయదారి మహమ్మారి
కళ్ళు తెరిచి ఉన్న కూడా మాటు వేసి కాటు వేయు
దూరాన్ని పాటించు రోగాన్ని ఓడించు

మూసుకోకురా


దొంగలాగ నిన్ను చేరి దొరలాగా మారురా
చుట్టు చేరినోళ్ళనంతా చుట్టి మట్టు పెట్టురా
మాస్కు కట్టరా ముక్కు నోరు దాయరా
శుభ్రతను పాటించి వైరస్ ను తరమరా
దగ్గు,జలుబు వస్తే డాక్టర్లా కలువరా
క్వారంటైన్ తో నీవు ఆరోగ్యం పొందరా!



స్వీయ పరిశుభ్రతను పాటించండి
కరోనాను తరిమి తరిమికొట్టండి
ధన్యవాదములు


తెనాలి రామకృష్ణ కథలు - 18 అత్యంత మూర్ఖుడు

తెనాలి రామకృష్ణ కథలు - 18
అత్యంత మూర్ఖుడు

కృష్ణదేవరాయల మహారాజు ఆస్దానంలో ప్రతి సంవత్సరం ఒక వింత పోటీ జరిగేది. పాల్గొనే వారందరికీ ఒక పోటీ పెట్టి అందులో గెలిచిన వారికి ఆ సంవత్సరానికిగానూ అత్యంత ముర్ఖుడు అనే బిరుదునిచ్చి 5000 వరాహాలు బహుమానంగా అందజేసేవారు. ప్రతి సంవత్సరం తెనాలి రామలింగడే విజేతగా నిలిచి 5000 వరాహాలు ఎగరేసుకు పోయేవాడు. ఈసారి ఎలాగైనా అతన్ని గెలవకుండా ఆపాలని ఇతర ఆస్ధానకవులు, అధికారులు అతని వద్ద పనిచేసే అబ్బాయికి డబ్బు ఆశ చూపి రామలింగడిని ఒక గదిలో తాళం వేసి బంధించమని పురమాయించారు. ఆ కుర్రాడు అలాగే చేశాడు.

పోటీ అయిపోయిన తర్వాత రామలింగడు సభకు చేరుకున్నాడు. "ఇదేమిటి రామలింగా! నీవు పోటీ ముగిసిన తర్వాత విచ్చేశావు" అని అడిగాడు కృష్ణదేవరాయలు. "ప్రభూ! నాకు వంద వరహాలు అవసరమయ్యాయి. వాటిని పోగు చేసేసరికి ఇంత సమయం పట్టింది" అని జవాబిచ్చాడు రామలింగడు.

"నువ్వు ఈ పోటీలో పాల్గొని ఉంటే 5000 వరహాలు సంపాదించేవాడివి కదా! వంద వరహాలు కోసం 5000 వరహాలు కాదనుకున్నావు" అన్నాడు మహారాజు. "ప్రభూ! నేనొక పెద్ద మూర్ఖుడిని" అన్నాడు రామలింగడు. బదులుగా మహారాజు "నువ్వు అత్యంత మూర్ఖుడివి. నీలాంటి మూర్ఖుడిని నేనింతవరకు చూడనే లేదు" అన్నాడు.

"అంటే ఈ పోటీలో విజేతను నేనే అన్నమాట!" అని ఎగిరి గంతేశాడు రామలింగడు. అప్పటికి గాని రాజుగారికి తను నోరుజారానని అర్ధం కాలేదు. కాని రామలింగడి వంటి చతురుడికి ఈ బహుమానం దక్కడం గర్వకారణమని భావించి రాయలవారు అతడికి 5000 వరహాలను బహుమానంగా ఇచ్చి సత్కరించాడు. మరోసారి రామలింగడే అందరికన్నా తెలివైన మూర్ఖుడని రాయలవారి ఆస్ధానంలో నిరూపితమైంది.

ప్రశ్న: చలికాలము లో దోమలు ఎక్కడికి పోతాయి?

ప్రశ్న: చలికాలము లో దోమలు ఎక్కడికి పోతాయి?

జవాబు :
 చలికాలము లో దోమలు ఎక్కడికీ పోవు . చలి ఎక్కువగా ఉన్నప్పుడు వాతావరనము సరిపోక దోమలు ఎటో పారిపోతాయనుకుంటాము కాని నిజానికి అవి ప్రతికూల పరిస్థితులనుండి  తప్పించుకునేందుకు దాక్కుంటాయి. ఎక్కువగా ..వేడిగా ఉన్న మన బెడ్ రూములలోనే నివాసాలు ఏర్పరచుకుంటాయి. వీలైతే మనకు కుట్టడానికి ప్రయత్నిస్తాయి. చలికాలము ముందు పెట్టిన గుడ్లు పొదగబడక అలాగే ఉంటాయి. ప్యూపా దశకు చేరినవి అలాగే నిలబడతాయి.  ఇక పెడ్ద దోమలయితే గోడలకు అంటిపెట్టుకుని అటూ ఇటూ ఎగరక శరీరములో నిలువ చేసునివున్న శక్తిని వినియోగించుకుటాయి. తిరిగి చల్లని ఉష్ణోగ్రత పోయి అనుకూల పరిస్థితులు రాగానే గుడ్లు , ప్యూపాల నుండి దోమలు పుట్టుకొస్తాయి.

విక్రమాదిత్య కథలు - నాగదేవత

విక్రమాదిత్య కథలు
నాగదేవత

పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘‘రాజా, భీతిగొలిపే ఈ శ్మశానంలో, అర్ధరాత్రి వేళ ఎడతెగని ఇక్కట్లకు లోనవుతూ కూడా, నువ్వు సాధించదలచిన కార్యం పట్ల చూపుతున్న పట్టుదల మెచ్చదగిందే.కాని, కార్యం ఫలించనున్న తరుణంలో, ధర్మాంగదుడిలాగా దాన్ని చేజార్చుకుంటావేమో అన్న శంక కలుగుతున్నది. నీకు తగు హెచ్చరికగావుండేందుకు అతడి కథ చెబుతాను, శ్రమతెలియకుండా, విను, '' అంటూ ఇలా చెప్పసాగాడు:

ధర్మాంగదుడు, విశ్వనాధుడు అనేవాళ్ళు చాలా కాలంగా మంచి మిత్రులు.అయితే, వారిస్నేహానికి భూషయ్య రూపంలో పరీక్ష వచ్చింది. భూషయ్య మోసగాడు. దొంగ పత్రాలు సృష్టించడంలో నేర్పరి. ఆ…యన, ధర్మాంగదుడు తన వద్ద పొలాన్ని తాకట్టుపెట్టి రెండు వేల వరహాలు తీసుకున్నట్లు దొంగపత్రం సృష్టించాడు. వడ్డీతో సహా తన బాకీ మూడువేల వరహాలయిందనీ, తక్షణం ఆ బాకీ తీర్చకపోతే ధర్మాంగదుడి పొలాన్ని తను స్వాధీనం చేసుకుంటాననీ కబురు పెట్టాడు. ధర్మాంగదుడు వెంటనే వెళ్ళి న్యాయాధికారిని కలుసుకుని, భూషయ్య మోసం నుంచి తనను కాపాడమని కోరాడు. న్యాయాధికారి కాసేపాలోచించి, ‘‘ఏ నేరంపైన అయినా విచారణ జరపకుండా నిర్ణయం తీసుకోరాదు. నాకు నువ్వు మంచివాడివనీ తెలుసు, భూష…య్య మోసగాడనీ తెలుసు. అయినా విచారణ జరిగేదాకా భూషయ్యను ఆపాలంటే, నీవువెయ్యి వరహాలు ధరావతు కట్టాలి. ఎవరైనా నీగురించి హామీ ఇవ్వాలి,'' అన్నాడు.

అప్పుడు ధర్మాంగదుడి వద్ద డబ్బులేదు. అయినా అతడు బెంగపడలేదు. ఊళ్ళో తనకింతో అంతో పరపతివుంది కాబట్టి అప్పు పుడుతుందను కున్నాడు. కానీ అతడి పొలం చిక్కుల్లో పడిందని తెలిసి, ఎవరూ అతడికి అప్పివ్వడానికి ముందుకు రాలేదు.
ఇలాంటి కష్ట సమయంలో విశ్వనాధుడు తనను ఆదుకుంటాడని ధర్మాంగదుడు నమ్మాడు. అయితే, అదే సమయంలో విశ్వనాధుడి తండ్రికి పెద్ద జబ్బు చేసింది. వైద్యానికి చాలా డబ్బు ఖర్చయింది. అంతలోనే అతడి చెల్లికి చక్కని పెళ్ళి సంబంధం వచ్చింది. పెళ్ళి ఖర్చులకు అయిదు వేల వరహాలదాకా అవసరమని అంచనా వేశాడు. డబ్బు కోసం విశ్వనాధుడు శతవిధాల ప్రయత్నిస్తూంటే భూషయ్య అతణ్ణి కలుసుకుని, ‘‘నీకు నేను సాయపడతాను. బదులుగా నువ్వు నాకు సాయపడాలి,'' అన్నాడు.

విశ్వనాధుడు స్నేహం కంటే అవసరమే ముఖ్యమనుకున్నాడు. అతడు ధర్మాంగదుడి విషయంలో హామీవుండడానికి నిరాకరించాడు. ధర్మాంగదుడికి ఎక్కడా అప్పు పుట్టలేదు. అతడి పొలం భూషయ్య పాలయింది.అప్పుడు ధర్మాంగదుడికి, భూషయ్య మీదకంటే విశ్వనాధుడి మీద ఎక్కువ కోపం వచ్చింది. ముందతడు ఆ మిత్రద్రోహిని చంపేయాలనుకున్నాడు. కానీ అందువల్ల ప్రయోజనమేముంటుంది? తను హంతకు డనిపించుకుని ఉరికంకంబ మెక్కాల్సివస్తుంది.

పోనీ, విశ్వనాధుణ్ణి కసితీరాకొడదామన్నా - అప్పుడూ అందరూ తనను పరమదుష్టుడని అసహ్యించుకుంటారు! విశ్వనాధుడి మీద పగతీర్చుకునే మార్గం తోచక చివరకు ధర్మాంగదుడు, ఊరిచివర కొండగుహలో వుండే బైరాగి వద్దకు వెళ్ళి తన గోడు వినిపించాడు. ఆ బైరాగి చాలా గొప్పవాడనీ, ఆయన మహిమలు చేయగలడనీ అంతా చెప్పుకుంటారు. బైరాగి, ధర్మాంగదుడు చెప్పింది విని, ‘‘తన స్వార్థంకొద్దీ నీకు సాయపడలేదు కాబట్టి విశ్వనాధుడు మంచి మిత్రుడు కాదు. మరి నీ సంగతేమిటి? నీకు సాయపడలేదని నువ్వు విశ్వనాధుడికి అపకారం చెయ్యాలనుకుంటున్నావు. నువ్వూ మంచి మిత్రుడివి కావు!'' అన్నాడు.

‘‘స్వామీ, అపకారం చేసింది విశ్వనాధుడు. నేను అతడికి అపకారం చేయాలనుకోవడం లేదు. అతడి పట్ల ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను. అందుకు మీ సాయం కోరి వచ్చాను,'' అన్నాడు ధర్మాంగదుడు. ‘‘ఇప్పుడు నీ మనసునిండా పగవుంది. పాముకు విషమెలాంటిదో, మనిషికి పగ అలాంటిదే. నేను విషప్రాణులకు సాయపడను. నీవు పగను విడిచి పెట్టిరా. అప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకుందాం,'' అన్నాడు బైరాగి. ‘‘స్వామీ! నామనసులోని పగపోయే మార్గం కూడా, మీరే చెప్పండి. ఆ పగ ఉధృతాన్ని తట్టు కోలేకుండావున్నాను,'' అన్నాడు ధర్మాంగదుడు.

బైరాగి కొద్దిసేపు ఆలోచించి, ‘‘అయితే విను. నేను నిన్ను పాముగా మార్చగలను. అప్పుడు నీ పగ అంతా విషంగా మారి, నీతలలో చేరుతుంది. ఆ విషం బారినుంచి బయట పడగానే, నీకు తిరిగి మనిషిరూపు వస్తుంది. పాము రూపంలో వున్నంత కాలం నీకు పూర్వజ్ఞానం వుంటుంది కానీ, బుద్ధులు మాత్రం పామువే వుంటాయి. ఎటొచ్చీ పాము రూపంలో వుండగా ఏ మనిషైనా నిన్ను చంపితే మాత్రం ఆరూపంలోనే మరణిస్తావు!'' అన్నాడు. ధర్మాంగదుడు మారాలోచనలేకుండా దీనికి అంగీకరించాడు. బైరాగి అతణ్ణి పాముగా మార్చేశాడు.పాముగా మారిన ధర్మాంగదుడు, అక్కణ్ణించి పాకుతూ పొలాలవైపు వెళ్ళాడు. పొలంలో రైతు ఒకడు కరన్రు నేలకు తాటిస్తూ వస్తూంటే, దాని దెబ్బ ధర్మాంగదుడి తోకకు తగిలింది.

అతడికి కోపం వచ్చి సర్రున లేచి పడగ ఎత్తి బుస్సుమన్నాడు. అప్పటికే రైతు ముందుకు వెళ్ళిపోయాడు. ఆ శబ్దం విని పక్కనున్న పొదల్లో నుంచి పాము ఒకటి బయటికి వచ్చి, ధర్మాంగదుడితో, ‘‘నువ్వా మనిషి వెంటబడి కరుస్తావేమో అని భయపడ్డాను. మనిషి కంటబడడం మనకు ప్రమాదం అని తెలుసుగదా!'' అన్నది. ధర్మాంగదుడు కాసేపు ఆ పాముతో మాట్లాడి చాలా విశేషాలు తెలుసుకున్నాడు. తలలోని విషాన్ని పాములు ఆత్మరక్షణకు మాత్రమే ఉపయోగించుకుంటాయి. మనిషివల్ల అపకారం జరిగినా, ప్రాణప్రమాదం లేకపోతే అతడి జోలికి వెళ్ళవు. వాటికి పగ అన్నది తెలియదు. అది నిజమేననిపించింది, ధర్మాంగదుడికి. కానీ విశ్వనాధుడు తన శత్రువు. అతణ్ణి మాత్రం కాటువేయాలి. అప్పుడు విశ్వనాధుడి ప్రాణాలు పోతాయి. తనకు శిక్షావుండదు!

ధర్మాంగదుడు ఇలా నిర్ణయించుకుని, ఎవరికంటా పడకుండా విశ్వనాధుడి ఇల్లు చేరాడు. ఇంట్లోని ముందరిగదిలో విశ్వనాధుడి కొడుకు ఆరేళ్ళవాడు బొమ్మలతో ఆడుకుంటున్నాడు. వాడు ధర్మాంగదుణ్ణి చూడనే చూశాడు. వెంటనే భయంతో, ‘‘పాము!'' అని గట్టిగా అరిచాడు. ఆ కురవ్రాణ్ణి కాటేసి విశ్వనాధుడికి పుత్రశోకం కలిగించాలని ధర్మాంగదుడు అనుకున్నాడు కానీ, తనకే అపకారమూ చేయనివాడి జోలికి వెళ్ళడం తప్పని, అతడికి అనిపించింది. అందుకని అక్కణ్ణించి చరచరా పాక్కుంటూ పూజగదిలోకి దూరాడు.

ఇంతలో ఇంటిల్లపాదీ విశ్వనాధుడి కొడుకు చుట్టూ చేరారు. వాడు చెప్పిందివిని, అంతా పూజగదిలోకి వెళ్ళారు. చూస్తే, అక్కడ పూజామందిరంలో, పడగ విప్పి ఆడుతున్నాడు ధర్మాంగదుడు. ‘‘నాగదేవత! కళ్ళు మూసుకుని నమస్కరించండి. ఎవరికీ ఏ అపకారమూ జరగదు! ఈ రోజుతో మనకూ, మనవాళ్ళకూ వచ్చిన కష్టాలన్నీ తొలగిపోతాయి. దుష్టుల కారణంగా నీ స్నేహితుడు ధర్మాంగదుడికి వాటిల్లిన కష్టం కూడా మంచులా కరిగి పోవాలని నాగదేవతకు మొక్కుకో నాయనా,'' అన్నది విశ్వనాధుడి తల్లి. అక్కడున్న వారందరూ ఆమె చెప్పినట్లే చేశారు. ఆ మాటలు విన్న పామురూపంలోని ధర్మాంగదుడు ఉలిక్కి పడ్డాడు. ఎంత ప్రయత్నించినా అతడిలో కసి పుట్టలేదు.

‘‘ఛీ! నాయీ విషంవల్ల ఏ ప్రయోజనమూ లేదు,'' అనుకుంటూ ధర్మాంగదుడు తనకోరలతో పూజామందిరాన్ని కాటువేశాడు. కోరల విషం బ…యట పడగానే, అతడి పాము రూపంనశించి తిరిగి ధర్మాంగదుడయ్యాడు. అక్కడున్న వారందరూ ఇంకా కళ్ళు మూసుకునే వుండడంతో తనూ లేచి వారితో కలిశాడు. కళ్ళు తెరిచిన విశ్వనాధుడి తల్లి, మందిరంలో నాగదేవత మాయంకావడం చూసి, మరింత భక్తిభావంతో నాగస్తోత్రం చేసింది. ఆమె ప్రతి చవితి పర్వదినాన వెళ్ళి పాముపుట్టలో పాలు పోసివచ్చేది.

ఎలాంటి కష్టాలు వచ్చినా, నాగదేవత కరుణవల్ల తొలిగి పోతాయని కొడుకుకు చెపుతూండేది. విశ్వనాధుడు కొద్దిసేపు తర్వాత కళ్ళు తెరిచి, పక్కనేవున్న ధర్మాంగదుణ్ణి చూసి ఆశ్చర్యపడి ఏమనాలో తెలి…యక తలదించుకున్నాడు. అప్పుడు ధర్మాంగదుడు, ‘‘మిత్రమా! నీ అవసరం నీచేత చేయించిన పనివల్ల, నాకు పొలం పోయింది. అంత మాత్రాన, అంతకంటే విలువైన నీ స్నేహాన్ని పోగొట్టుకునేందుకు నేను సిద్ధంగాలేను,'' అన్నాడు.

ఈ మాటలకు విశ్వనాధుడితో పాటు, అతడి కుటుంబం వారందరూ ధర్మాంగదుణ్ణి ఆకాశాని కెత్తేశారు. ఈ విషయం తెలిసి ఊళ్ళో వారందరు కూడా, ధర్మాంగదుణ్ణి ఎంతగానో మెచ్చుకున్నారు. భూషయ్యలో కూడా, ఆ తర్వాత మార్పు వచ్చి ధర్మాంగదుడికి చేసిన అన్యాయాన్ని సరిదిద్దు కున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, ‘‘రాజా! విశ్వనాధుడు, ధర్మాంగదుడికి ఎంతో ఆప్తమిత్రుడుగా వుంటూ, ఆపద సమయంలో తన స్వార్థం కొద్దీ, అతడికి సహాయం నిరాకరించాడు.అటువంటి మిత్రద్రోహి మీద పగసాధించేందుకు ధర్మాంగదుడు, మహిమగల బైరాగిని ఆశ్రయించి పాముగా మారాడు గదా? కానీ, పూజామందిరంలో అవకాశం వున్నా అతడు, విశ్వనాధుడితో తమ స్నేహాన్ని గురించి అన్న మాటలకూ, పాముగా అతడి ప్రవర్తనకూ పొంతన వున్నట్టు లేదుకదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలి పోతుంది,'' అన్నాడు.

దానికి విక్రమార్కుడు, ‘‘మనుషులలాగే పశుపక్ష్యాదులక్కూడా ప్రకృతి ప్రభావ కారణంగా సహజ స్వభావమంటూ ఒకటి వుంటుంది. ధర్మాంగదుడు సాధారణంగా మనుషులకుండే ఊహాపోహలతో, పాములకు తను సహజంగా వున్నవనుకుంటున్న దుష్టస్వభావం, పగల గురించి ఆలోచించాడు. బైరాగి, అతడికి పాముగా పూర్వ జ్ఞానం వుంటుందనీ, బుద్ధిమాత్రం పాములదేననీ చెప్పాడు! ధర్మాంగదుడు కాకతాళీయంగా పొలంలో మరొక పాముకు తటస్థపడినప్పుడు, ఆ పాము - పాములు తలలోని విషాన్ని ఆత్మరక్షణకు మాత్రమే ఉపయోగించు కుంటాయనీ, వాటికి పగ అన్నది తెలి…యదనీ చెప్పింది.

ఆ సమయాన, బుద్ధి విషయంలో పాముల స్థాయిలో వున్న ధర్మాంగదుడికి, అది ఆచరించదగిందిగా తోచింది. పైగా, విశ్వనాధుడు, ధర్మాంగదుడు మిత్రులే. అనుకోకుండా కష్టాల పాలైన ధర్మాంగదుడు మిత్రుణ్ణి సాయం కోరాడు. అది సహజం. అయితే, ఆ సమయంలో విశ్వనాధుడు కూడా తండ్రి అనారోగ్యం, చెల్లెలి పెళ్ళి ఖర్చులు కారణంగా కష్టాల్లో ఉండడం వల్ల, స్నేహితుడు కోరిన సాయం చేయలేక పో…యాడు. అయితే, ధర్మాంగదుడు అది గ్రహించలేక, ఆవేశంతో అతని పట్ల ప్రతీకార వాంఛను పెంచుకున్నాడు. పూజగదిలో పామును చూడగానే విశ్వనాధుడి తల్లి అన్నమాటలతో ధర్మాంగదుడికి తన పొరబాటు తెలియవచ్చింది. అందువల్లనే, అతడు విశ్వనాధుణ్ణి కాటువేయలేదు,'' అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు.