LATEST UPDATES

21, ఫిబ్రవరి 2016, ఆదివారం

5. పారిపోయిన గిన్నెలు(Paripoina ginnelu) - 3 తరగతి తెలుగు

This is a simple translate button.

విజయనగర రాజ్యంలో వరహాలయ్య అనే వ్యాపారి ఉండేవాడు. ప్రజలకు తమ అవనరాలకోసం అతని దగ్గర అప్పు తీసుకునేవారు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడంలో కాస్త ఆలస్యమైతే బలవంతంగా ఎక్కువ డబ్బులు వసూలు చేసేవాడు. మరో ఆధారం లేక ఇబ్బంది కలిగినప్పటికీ ప్రజలు అతన్నే ఆశ్రయించేవారు. ఈ విషయం రాయలవారి ఆస్థానంలో ఉన్న తెనాలి రామకృష్ణుడికి తెలిసింది. ఎలాగైనా వరహాలయ్యకు బుద్ధి చెప్పాలనుకున్నాడు.

ఒకరోజు రామకృష్ణుడు వరహాలయ్య దగ్గరికి వెళ్ళి ‘‘ మా ఇంట్లో రేపు విందు జరుగుతుంది. అన్నం వండడానికి ఒక పెద్ద గిన్నె కావాలి’’ అని అడిగాడు. అందుకు వరహాలయ్య ‘‘రెండు బంగారు నాణేలు ఇస్తేనే అరువుగా గిన్నె ఇస్తాను,’’ అన్నాడు. రామకృష్ణుడు సరేనని ముందుగానే రెండు బంగారు నాణేలు చెల్లించి గిన్నెను తీసుకువెళ్ళాడు.

రెండు రోజుల తరువాత రామకృష్ణుడు తాను తీసుకువెళ్ళిన గిన్నతో పాటు మరో గిన్నెను కూడా వరహాలయ్యకు ఇచ్చాడు. ‘‘నువ్వు ఇచ్చిన గిన్నెకు నిన్న రాత్రి ఈ గిన్నె పుట్టింది,’’ అని చెప్పాడు. రామకృష్ణుడు ఇంత అమాయకుడా ? వరహాలయ్య సంబరపడిపోయాడు. అతనేటువంటి వాడయితేనేం నాకు మాత్రం భలే లాభం అనుకున్నాడు.

వారం రోజుల తర్వాత రామకృష్ణుడు తిరిగి వరహాలయ్య దగ్గరికి వెళ్ళాడు. ‘‘ రేపు అమ్మగారి పేరు మీద అన్నదానం చేయాలనుకుంటున్నాను. నాకు కొన్ని గిన్నెలు కావాలి. ఇదివరకటిలాగే అద్దె చెల్లిస్తాను,’’ అన్నాడు.

అందుకు వరహాలయ్య, ‘‘ కొన్ని కాదు, నాదగ్గర ఉన్న అన్ని గిన్నెలూ ఇస్తాను,’’ అన్నాడు సంతోషంగా, ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ బండిమీద వేసి రామకృష్ణుడి ఇంటికి పంపించాడు. ఈసారి తనకు ఎంత లాభం కలుగుతుందో అని ఆశగా చూడసాగాడు. వరహాలయ్య.

పది రోజులు గడిచిపోయాయి. రామకృష్ణుడు గిన్నెలు తిరిగి ఇవ్వలేదు. చివరకు వరహాలయ్యే అతని ఇంటికి వెళ్ళి గిన్నెలను గురించి అడిగాడు. అప్పుడు రామకృష్ణుడు, ‘‘ నువ్వు ఇచ్చిన గిన్నెలు నిన్న రాత్రి పారిపోయాయి,’’ అని చెప్పాడు. ‘‘గిన్నెలు పారిపోవడం ఏమిటి ? అంతా మోసం!’’ అంటూ అరిచాడు వరహాలయ్య. నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్ళి రామకృష్ణుడి మీద ఫిర్యాదు చేశాడు.

రాజుగారు రామకృష్ణుణ్ణి పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నరు. వరహాలయ్య గుిరించి కూడా వివరాలు సేకరించారు.

వరహాలయ్యతో, ‘‘నీ గిన్నెకు మరో గిన్నె పుట్టడం నిజమైనప్పుడు గిన్నెలు పారిపోవడం కూడా నిజమేగా!’’ అన్నాడు రాజు.

వరహాలయ్య సిగ్గుతో తల దించుకున్నాడు. తనకు బుద్ధి చెప్పడానికే రామకృష్ణుడు ఇలా చేశాడని అర్థం చేసుకున్నాడు. అప్పటినుండి వరహాలయ్య నీతిగా జీవించాడు.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి