LATEST UPDATES

8, మే 2016, ఆదివారం

మూడు చేపలు (Mudu Chepalu)

     ఒక చెరువులో మూడు చేపలు ఉండేవి. అవి మూడు స్నేహంగా ఉండేవి.
     ఒక రోజు జాలర్లు చెరువు దగ్గరకు వచ్చారు.
     ‘‘ ఈ చెరువులో బలమైన చేపలు చాలా ఉన్నాయి. రేపు వచ్చి పట్టుకొందా’’ అనుకొన్నారు.
     వీళ్ళ మాటలు మూడు చేపలూ విన్నాయి.
     ‘‘ఏం చేద్దాం’’ అంది మెదటి చేప.
     ‘‘వాళ్ళు నిజంగానే వస్తారంటావా?’’ అనుమానంగా అడిగింది రెండో చేప.
     ‘‘వాళ్ళు అలాగే అంటారు. వస్తారా చస్తారా ..... వచ్చిన మనం వాళ్లకి దొరుకుతామా?’’ అంది మూడో చేప.
     ‘‘తప్పకుండా వస్తాను. మనం ఈ చెరువును వదిలిపెట్టి వెళదాం’’ అంది మొదటి చేప.
     ‘‘చిన్నప్పటి నుండి పుట్టి పెరిగిన ఈ చెరువును నేను రాను. రాబోను’’ అంది మూడో చెప.
     రెండో చెప ఎటూ తేల్చుకోలేక ఏం మాట్లాడకుండా ఉండిపోయింది.
     ‘‘నేను వెళుతున్నాను. మీ ఇష్టం’’ అంటూ మొదటి చేప ఒక సన్నటి కాలువ గుండా ఈదుకొంటూ మరో చెరువులోకి వెళ్ళిపోయింది.
     మర్నాడు జాలర్లు వచ్చి వల విసిరాడు. రెండు చేపలు అందులో చిక్కుకున్నాయి.
     ‘‘అయ్యో! అది చెప్పనట్లు వినకపోయామే’’ అని రెండూ దుఃఖించాయి.
     తెలివి గల రెండో చేప కదలక, మెదలక చచ్చిపోయినట్లు ఉండిపోయింది.
     ‘‘చనిపోయిన చేప మనకెందుకు’’ అనుకొని దానిని వదిలి వేశారు జాలర్లు.
     తప్పించుకోవడానికి ప్రయత్నించిన మూడో చేపను పట్టుకొని వెళ్ళిపోయారు జాలర్లు.

7, మే 2016, శనివారం

ఎవరి పని వారే చెయ్యాలి (evari pani vare cheyali)

    అనగా అనగా ఒక ఊరు. ఆ ఊరిలో చాకలి రామయ్య ఉండేవాడు. ఆయనకు ఒక గాడిద, ఒక కుక్క ఉండేది. గాడిద రోజూ చాకిరేవుకు బట్టలు మోసేది. కుక్క ఇంటికి కాపల కుసేది. రామయ్య వాటికి సరైన ఆహారం పెట్టెవాడు కాదు. ఆహారం సరిగా పెట్టడం లేదని అవి రోజూ బాధపడుతుండేవి.
     ఒక రోజు రామయ్య ఇంట్లో దొంగలు పడ్డారు. కుక్క దొంగలు రావడం చూసింది. కాని మొరగకుండా ఉండిపోయింది. గాడిద కూడా దొంగలు రావడం, కుక్కమొరగ కుండా ఉండడం గమనిస్తూనే ఉంది.
     ‘‘మన యజమాని ఇంట్లో దొంగలు పడ్డారు కదా ఎందుకు నువ్వు మొరగడం లేదు? అవి అడిగింది గాడిద.
     ‘‘యజమాని మనల్ని ఉంచుకొన్నాడు. ఆయనకు మనం ఎంతో సేవ చేస్తున్నాం. అయినా మనకు కడుపు నిండా ఆహారం పెట్టడం లేదు. అందుకే నేను మొరగడం లేదు?’’ అంది కుక్క.
     గాడిద మనస్సు ఒప్పుకోలేదు. యజమాని ఎలాగైనా నిద్రలేపాలని బిగ్గరగా గాండ్రించడం మొదలు పెట్టంది.
     గాడిద అరుపులకు దొంగలు పారిపోయారు కాని, మంచి నిద్రలో ఉన్న రామయ్యకు, నిద్రాభంగం కలిగింది. గాడిద  అలా అరవడం అతనికి కోపం తెప్పించింది. కట్టె తీసుకొని గాడిదను ఎడాపెడా కొట్టాడు. ఆ దెబ్బకు గాడిద విలవిలలాడింది.
     ‘ఎవరి పని వారే చెయ్యాలి’ అని అందుకే అంటారు.

బాతు - బంగారు గుడ్డు(Bathu - Bangaru guddu)

     ఒక పల్లి ఒక బాతును తరుముతోంది.
     దీనిని రంగన్న అనే ఆసామి చూశాడు.
     పిల్లిని తరిమేసి బాతును కాపాడాడు.
     ‘‘రంగన్నా రంగన్నా నన్నెందుకు కాపాడావు’’ అంది బాతు.
     ‘‘నువ్వు ఆపదలో ఉన్నావు కదా అందుకే!’’ అన్నాడు రంగన్న.
     ‘‘నువ్వు నన్ను కాపాడవు కదా... నేను నీకు రోజుకో బంగారు గుడ్డును ఇస్తాను’’ అంది బాతు.
     చెప్పినట్లుగానే బాతు రంగన్నకు రోజుకో బంగారు గుడ్డు ఇవ్వసాగింది.
     రంగన్న వాటిని అమ్ముకొని  ధనవంతుడయ్యాడు.
     ధనవంతుడైన రంగన్నకు దురాశ కలిగింది.
     ‘ఈ బాతు రోజుకో బంగారు గుడ్డు పెడుతోంది.
     దీని కడుపులో ఎన్ని గుడ్లు ఉంటాయో ఏమో! దీని కడుపు కోస్తే అన్నీ ఒకే మారు తీసుకోవచ్చు కదా!’ అనుకొన్నాడు.
     బాతు కడుపును కోశాడు.
     కాని దాని కడుపులో మరుసటి రోజు గుడ్డు ఒకటి మాత్రమే ఉంది.
     ‘అయ్యో! బంగారు బాతును చేతులారా చంపుకొన్నానే’ అని ఏడుస్తూ కూర్చున్నాడు రంగన్న.

కూరగాయల కథ (Kuragayala katha)

     అనగనగా ఉల్లిపాయంత ఊరు.
     ఆ ఊరిలో ఉండే ముసలమ్మ ఒక రోజు పొలం వెళుతోంది.
     ఆమెకు వంకాయంత వజ్రం దొరికింది.
     ఆ వజ్రాన్ని భద్రంగా పట్టుకొని ఇంటికి వచ్చింది.
     దాన్ని బీరకాయంత బీరువాలో దాచింది.
     ముసలమ్మ వజ్రాన్ని దాచడం కిటికీ లోంచి దొండకాయంత దొంగ చూశాడు.
     ముసలమ్మ తిరిగి పొలం వెళ్ళిపోయాక వాడు బీరకాయంత బీరువాను పగలగొట్టి వంకాయంత వజ్రాన్ని దొంగిలించాడు.
     ఆ దొంగను ముసలమ్మ చూసింది.
     వెంటనే పొట్లకాయంత పోలీసుకు వెళ్ళి చెప్పింది.
     ఆ పోలీసు జీడి పప్పంత జీపు వేసుకొని దొండకాయంత దొంగను పట్టుకొన్నాడు.
     జామకాయంత జైలులో పెట్టాడు. ఆ జైలుకు తాటి కాయంత తాళం వేశాడు.

కోతి - మేకు(Kothi - Meku )

     ఒక చెట్టుపైన కొన్ని కోతులున్నాయి. ఆ చెట్టు కింద వడ్రంగి వారు పని చేస్తున్నారు.
     మధ్యాహ్నం వండ్రంగి వారు ఇంటికి వెళ్ళి పోయారు.
     అంతకు ముందు వారు చేసిన పనిని కోతులు గమనించాయి. అవి కిందికి దుమికి ఆడుకోసాగాయి.
     వాటిలో ఒక కోతి ఒక దూలంపైకి ఎక్కింది. ఆ దూలాన్ని పనివాళ్ళు మధ్యకు నిలువుగా కోస్తున్నారు. పని పూర్తి కాలేదు. సగం చీలిన దూలం మధ్య మేకులు ఉన్నాయి.
     ‘‘ఏయ్ నేనేం చేస్తున్నానో చూడు’’ అంది దూలం మీదికి ఎక్కిన కోతి.
     ‘‘ఇంత క్రితం వాళ్ళు మేకులు పెడుతూ తీశారు కదా’’ అంది చాలా తెలివి ఉన్న దానిలా.
     ‘‘అవునవును’’ అంటూ అన్నీ తల లూపాయి.
     ‘‘ఇప్పుడు నేను  ఈ మేకులు తీయబోతున్నాను’’ అంది.
     ‘‘అలాగలాగే’’ అన్నాయి. మిగితా కోతులన్నీ ముక్త కంఠంతో.
     కోతి మేకు ఊడ బెరికెటప్పుడు ఆ దూలం రెండు భాగాల మధ్య కోతితోక ఉండిపోయింది. కోతి మేకు ఊడబెరకగానే ఆ రెండు భాగాలు మూసుకుపోయి తోక అందులో ఇరుక్కుపోయింది.
     మేకు పీకినందున మిగితా కోతులన్నీ చప్పట్లు కొట్టాయి. కాని ఈ కోతికి మటుకు కళ్ళలోంచి నీళ్ళు కారాయి.
     ఇంతలో వడ్రంగి పనివాళ్ళు వచ్చారు. మిగితా కోతులన్నీ పారిపోయాయి. ఈ కోతి మాత్రం మిగిలిపోయింది.
     ‘‘మళ్ళీ ఇలాంటి పని చేస్తావా?’’ అడిగాడు వడ్రంగి.
     ‘‘చేయను. బుద్దొచ్చింది.’’ అని లెంపలేసుకొంది కోతి.
     వడ్రంగి మళ్ళీ మేకు కొట్టడంతో కోతి తోక బయటి కొచ్చింది. ‘బ్రతికాన్రా’ అనుకొని పారిపోయింది తోకను‘ఉఫ్ ఉఫ్’ అని ఊదుకొంటూ!

కుక్క - మాంసపు ముక్క (kukka - mamsapu mikka)

     అనగా అనగా ఒక కుక్క.
     దానికి ఆకలి వేసి ఆహారం కోసం వెదకసాగింది.
     కుక్కకు ఒక మాంసపు ముక్క దొరికింది.
     అది నోగ కరుచుకొని మంచి స్థలంలో కూర్చుని తిందామనుకొంది.
     కుక్క వెళుతున్న దారిలో దానికి ఓ కాలువ కనబడింది.
     కాలువకు అటువైపు వెళ్ళి తిందామని కాలువ మీదున్న తాటి వంతెన మీదుగా నడుస్తూ నీళ్ళలోకి చూసింది.
     నీటిలో తన నీడ కనిపించింది.
     ఆ నీడను చూసి మరో కుక్క నీటిలో ఉంది అని అది అనుకొంది. దాని నోట్లో మాంసం ముక్క కూడా తీసుకుంటుందని ‘భౌ భౌ’ అని అరిచింది.
     కుక్క నోట్లో మాంసం ముక్క నీళ్ళలో పడిపోయింది.
     ‘అయ్యో!’ అనుకొంటూ మాంసం ముక్క కోసం కుక్క నీళ్ళలోకి దుమికింది. నీటిలో అది తడిచిపోయింది కాని మాంసం ముక్క దొరకలేదు.

పిల్లికి సన్మానం (Pilliki sanmanam)

     ఒక ఇంటిలో ఒక పెద్ద గండు పిల్లి ఉండేది.
     అది ఆకలేసినప్పుడల్లా ఎలుకలను పట్టి తినేది.
     ఎలుకలన్నీ ఒక రోజు గుంపుగా చేరాయి.
     పిల్లి కాళ్ళకు గజ్జెలు కట్టాలని నిర్ణయించాయి.
     దాని కాళ్ళకు గజ్జెలు కడితే అది వచ్చినప్పుడు గజ్జల మోత వినిపిస్తుంది.
     అది విని తాము పారిపోవచ్చుని అనుకొన్నాయి.
     కాని పిల్లి కాళ్ళకు గజ్జెలు ఎవరు కట్టేది ?
     గజ్జెలు కట్టడానికి వెళ్ళే ఎలుకను పిల్లి తినేస్తుంది.
     తెలివిగల చిట్టెలుక ‘‘కుక్క మామను పిలుద్దాం’’ అంది.
     ఎలుకలు కుక్కమామను కలిసి తమ ఆలోచన చెప్పాయి.
     కుక్క సరే అని పిల్లి దగ్గరకు వెళ్ళింది.
     ‘‘పిల్లీ! పిల్లీ! నీకు ఘన సన్మానం చెయ్యాలని అనుకొంటున్నాం. నీ అంగీకారం వచ్చాను’’ అంది.
     కుక్క వచ్చి అలా అడగటంతో సంతోషపడింది.
     పెద్ద ఎత్తున సన్మానం జరిగింది. ఎలుకలు ‘‘ అందమైన దానివి నువ్వు. నీ కాళ్ళకు గజ్జలు కడిదే మరింత అందంగా ఉంటావు’’ అంటూ పొగిడాయి.
     ఆ పొగడ్తల మైకంలో పిల్లి ‘సరే’ అంది.
     ఎలుకలు పిల్లికి గజ్జెలు కట్టాయి.
     ఆ వేదిక మీద పిల్లి హుందాగా అటూ ఇటూ పచార్లు చేసింది. ఆనందంలో నృత్యం చేసింది. ఎలుకలు ‘ఆహా ఓహో’ అన్నాయి.
    ఎలుకల సమస్య తీరిపోయింది.
     పిల్లి వచ్చిన ప్రతిసారీ గజ్జెల చప్పుడు వినిపించేది. దాంతో ఎలుకలు పారిపోయి ప్రాణాలు కాపాడుకొనెవి.

కోడి - కుక్క - నక్క (Kodi - kukka - nakka)

     అనగా అనగా ఒక అడవిలో కోడి, కుక్క ఉండేవి.
     అవి రెండు మంచి స్నేహితులు. ఒక రోజు కోడి, కుక్క సరదాగా షికారు బయలు దేరాయి అలా వెళుతూ, వెళుతూ ఉంటే చీకటి పడిపోయింది. అరె! చీకటి పడింది. ఇప్పుడెలా? అడవి జంతువులు వస్తాయో ఏమో అనుకొని భయపడ్డాయి. కోడి తెలివిగా చెట్టుమీద కూర్చింది. కుక్కేమో చెట్టు తొర్రలో దాక్కుంది.
     కొంత సేపటికి ఒక నక్క అటువైపుగా పోతూ కోడిని చూసింది.
     ‘‘కోడమ్మా! కోడమ్మా! పాట పాడవా’’ అని అడిగింది.
     ‘‘కొక్కొరకో .... కో’’ అంటూ కోడి పాట పాడింది.
     ‘‘కోడమ్మా - కోడమ్మా చెట్టు దిగి వచ్చి పాడవా?’’ అంది నక్క.
     నక్క మోసం కోడికి అర్థం అయింది.
     ‘‘నక్క బావా! నక్క బావా! నా యింకో స్నేహితుడు చెట్టు తొర్రలో ఉన్నడు. వాడిని అడుగు’’ అంది.
     ఎంచక్కా వాణ్ణి తినొచ్చు. ఆ తర్వాత నీ సంగతి చూస్తా’’ అనుకొని నక్క చెట్టు తొర్రలో మూతి పెట్టింది.
     లోపల ఉన్న కుక్క నక్కను కరిచింది.
     ‘‘చచ్చాను బాబోయ్!’’ అని అరుస్తూ నక్క పరుగు తీసింది.
     కోడి - కుక్క సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయాయి.

గాడిద - తోడేలు(Gadida - Thodelu)

     ఒక గాడిదకు ముల్లు గుచ్చుకొంది.
     కుంటడం మొదలు పెట్టింది.
     అడవిలో ఉండే తోడేలు తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని ఊరి దగ్గరికి వచ్చింది.
     దానికి కుంటే గాడిద కనిపించింది.
     దాన్ని ఎలాగైనా తినాలని తోడేలు అనుకొంది.
     గాడిద కూడా తోడేలును చూసింది. దానికి భయం వేసింది.
     పారిపోదామంటే కాలులో ముల్లు గుచ్చుకొంది కదా!
     ఏం చెయ్యాలా అని ఆలోచించింది.
     ‘‘గాడిదా! గాడిదా! ఎందుకు కుంటుతున్నావ్?’’ అని అడిగింది తోడేలు.
     ‘‘ నా కాల్లో ముల్లు గుచ్చుకొంది. నువ్వు నన్ను తినాలనుకొంటే ఆ ముల్లు నీకు గుచ్చుకొంటుంది. అందుకని ముందు ముల్లు తియ్యి. అప్పుడు ఎంచక్కా తినొచ్చు’’ అంది గాడిద.
     ‘‘ఓహో అలాగా!’’ అంటూ తోడేలు గాడిద కాలిలో ముల్లు తీయడానికి కూర్చుంది.
     తోడేలు నోటితో ముల్లు తీయగానే దాని మూతి మీద గాడిద కాలితో ఓ తన్ను తన్నింది.
     ‘‘అయ్య బాబోయ్ చచ్చాన్రో’’ అంటూ తోడేలు అడవిలోకి పరుగు పెట్టింది.

కోతి - రెండు పిల్లలు (Kothi -Rendu pillulu)

     రెండు పిల్లులు మంచిగా స్నేహంగా ఉండేవి.
     వాటికి ఒకరోజు ఒక రొట్టే దొరికింది.
     ‘‘ముందు నేను చూశాను కాబట్టి నాకు కొంచెం ఎక్కువ యివ్వాలి’’ అంది ఓ పిల్లి.
     ‘‘కాదు నేనే చూశాను. నాకే కొద్దిగా ఎక్కువ యివ్వాలి’’ అంది రెండో పిల్లి.
     ఇలా కొద్ది సేపు వాదులాడుకొని రెండూ సరిసమంగా పంచుకోవాలని నిర్ణయించుకొన్నాయి.
     మళ్ళీ మనం గొడవ పడకుండా మధ్యవర్తిని ఎవరినైనా పెట్టుకొందాం మనుకొన్నాయి.
     మధ్యవర్తి కోసం వెళుతున్న వాటికి కోతి బావ ఎదురయ్యాడు. వీళ్ళ గొడవ విన్నాడు.
     సరే నేను మీకు గొడవ రాకుండా రొట్టెను సరిసమానంగా పంచుతానని ఓ త్రాసు తెచ్చాడు. రొట్టెను రెండు ముక్కలు చేసి త్రాసులో అటూ ఇటూ వేశాడు.
     ఓ వైపు మొగ్గు ఎక్కువ చూపింది. ఎక్కువ ఉన్నవైపు రొట్టె కొంచెం ముక్క తీసుకొని నోట్లో వేసుకొన్నాడు కోతిబావ. అలా ఆ రొట్టెను దాదాపు సగం వరకు కోతిబావే తినేశాడు.
     మన మధ్య పంపకానికి మూడో వాడి దగ్గరకు వెళితే మనకి అసలుకే మోసం వస్తుందని పిల్లులు గ్రహించాయి.
     ‘‘నీ తీర్పు ఇక చాలు’’ అంటూ మిగిలిన రొట్టె తీసుకొని పిల్లులు ఉడాయించాయి.

6, మే 2016, శుక్రవారం

రంగు మారిన తోడేలు(Rangu Marina Thodelu)

     ఒక తోడేలు అడవిని దాటింది. ఊరు చేరింది. ఎక్కడైనా ఒక కోడిని పట్టుకొని గుటుక్కున మింగేద్దామని దాని ఆలోచన. ఒక ఇంటిలోకి దూరింది. అది రంగులద్దే వాడి ఇల్లు. తోడేలు కాలుజారి నీలిరంగు నింపి ఉన్న తొట్టెలో పడింది. ఆ రంగంతా అంటుకొని తోడేలు కాస్తా నీలిరంగు తోడేలై పోయింది.
     అడవిలోకి వెళ్ళిన తోడేలును మిగితా జంతువులు వింతగా చూశాయి.
     ‘‘నే నెవరను కొన్నారు?’’గంభీరంగా అడిగింది తోడేలు.
     ‘‘మాకు తేలీదు’’ ముక్త కంఠంతో అన్నాయి మిగితా జంతువులు.
     ‘‘నన్ను చంద్ర లోకం నుండి దేవుడు పంపించాడు’’ మరింత గంభీరంగా, హుందాగా అంది తోడేలు.
     మిగితా జంతువులన్నీ భయపడ్డాయి.
     ‘‘ఇవాల్టి నుండి మీ రాజును నేనే ... లేదంటే దేవుడికి కోపం వస్తుంది’’ అంది బెదిరిస్తున్నట్లు.
     ‘‘అవును - అవును -అలాగే .... అలాగే.... నువ్వే మా రాజువి’’ అన్ని జంతువులు చేతులు జోడించి చెప్పాయి.
     సింహం తన తలపైని కిరీటాన్ని తీసి నీలి తోడేలు తలపైన ఉంచింది. తోడేలు రాజయింది. తనిప్పుడు రాజు కదా! తోడేేలు లాగ ఉండ కూడదు అని చాలా జాగ్రత్తగా చాలా ఠీవిగా ఉండసాగింది.
     ఒకరోజు నాలుగైదు తోడేళ్ళు కలిసి ఒకేసారి గుంపుగా అరిచాయి. నీలిరంగు తోడేలు తన నైజ గుణాన్ని అణచుకోలేకపోయింది. తాను కూడా మిగిలిన తోడేళ్ళలాగ అరిచింది. దాని బండారం బయట పడింది.
     ఏనుగు తొండంతో నీళ్ళు తెచ్చి దానిమీద కుమ్మరించింది. తోడేలు అసలు రంగు బయట పడింది. తోడేలు పారిపోయింది. జంతువులు పకపకా నవ్వాయి.

కట్టెలు కొట్టేవాడు (Kattelu Kottevadu)

     అనగా అనగా ఒక ఊరిలో ఒక కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు.
     అతడు చాలా మంచివాడు. ఎప్పుడూ అబద్దాలు చెప్పేవాడు కాదు.
     ఒకరోజు అడవికి వెళ్ళి ఒక చెట్టును కొట్టసాగాడు.
     ఆ చెట్టు కింద ఒక పెద్ద బావి ఉంది.
     కట్టెలు కొడతూ ఉంటే గొడ్డలి చెయ్యిజారి బావిలో పడింది.
     గొడ్డలి పోవడంతో అతను చాలా బాధ పడ్డాడు.
     చెట్టు దిగి ఏడవడం మొదలు పెట్టాడు.
     ఇంతలో జలదేవత ప్రత్యక్షమైంది.
     ‘‘ఎందుకయ్యా ఏడుస్తున్నావు?’’ అని అడిగింది.
     ‘‘ నా గొడ్డలి బావిలో పడిపోయింది’’ అన్నాడు.
     ‘‘బాధ పడకు నేను తెచ్చి యిస్తాను’’ అంటూ మాయమైంది. కొద్ది సేపటిలోనే ఒక బంగారు గొడ్డలి తెచ్చింది. ‘‘ఇది నాది కాదు’’ అన్నాడు కట్టెలు కొట్టేవాడు. సరే అని జలదేవత మళ్ళీ వెళ్ళి ఈసారి వెండి గొడ్డలి తెచ్చింది.
     ‘‘ఇది కూడా నాది కాదు’’ అన్నాడు కట్టెలు కొట్టేవాడు.
     జలదేవత మళ్ళీ వెళ్ళి ఈసారి నిజంగానే అతని గొడ్డలి తెచ్చింది. దాన్ని చూడగానే ఆనందంగా ‘‘ఇధి నా గొడ్డలే!’’ అన్నాడు కట్టెలు కొట్టేవాడు.
     జలదేవత అతని నిజాయితీని మెచ్చుకొంది.
     ‘‘నీది కాని దాని కోసం ఆశపడక నిజాయితీగా నిజమే చెప్పినందుకు నీకు బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి కూడా బహుమతిగా యిస్తున్నాను’’ అంది.

నాలుగు తోకల ఎలుక ( Nalugu Thokala Eluka)

     అనగా అనగా ఎలుక.
     దానికి నాలుగు తోకలుండేవి.
     దానిని అందరూ గేలి చేసేవారు.
     ‘‘నాలుగు తోకల ఎలుక నాలుగు తోకల ఎలుక’’ అని పిలిచేవారు.
     ఎలుక పిల్లల అరుపులు భరించలేక దర్జీ దగ్గరకు వెళ్ళి ఒక తోక కత్తిరించమంది.
     దర్జీ తోకను కత్తిరించాడు.
     మరునాటి నుండి పిల్లలు మూడు తోకల ఎలుక అని పిలిచేవారు.
     ఎలుక కోపంతో వెళ్ళి దర్జీతో మళ్ళీ ఒక తోకను కత్తిరించమంది.
     దర్జీ అలాగే తోకను కత్తిరించాడు.
     అయినా పిల్లలు గోల చేయడం ఆపలేదు.
     ఇప్పుడు ‘ రెండు తోకల ఎలుక రెండు తోకల ఎలుక’ అని గోల చేయసాగారు.
     ఎలుక మరో తోకను కత్తిరించమంది.
     ఎలుకకు ఒకటే తోక మిగిలింది.
     తెల్లవారింది. జనం ‘ఒంటి తోక ఎలుక, ఒంటి తోక ఎలుక’ అనసాగారు.
      పాపం ఎలుక ఈ గొడవ పడలేక ఉన్న ఒక తోకా కత్తిరించేయమంది.
     మరి జనం ఊరకుంటారా?
     ‘‘తోకలేని ఎలుక తోకలేని ఎలుక’’ అనడం మొదలు పెట్టారు.

తేలు - తాబేలు (Thelu - Thabelu)

     ఒకసారి ఒక తేలు నీళ్ళలో పడి కొట్టుకొని పోతుంది.
     దానికి ఈత రాదు కదా!
     ఒక తాబేలు కొట్టుకు పోతున్న తేలును చూసింది.
     పాపం అనుకొని ‘‘తేలూ తేలూ నా మీద ఎక్కు నిన్ను ఒడ్డుకు చేరుస్తాను’’ అంది.
     తేలు తాబేలు వీపు మీద ఎక్కింది.
     కానీ అది తాబేలును కుట్టడం మొదలు పెట్టింది.
     తాబేలుకు బాధ అనిపించింది.
     ‘‘నేను నీకు సహాయం చేస్తుంటే నన్నెందుకు కుడుతున్నావు’’ అంది తాబేలు.
     ‘‘కుట్టడం నా స్వభావం’’ అంది తేలు.
     ‘‘ఓహో అలాగా! అయితే మనగడం నా స్వభావం’’ అంటూ తాబేలు బుడుంగున నీటిలో మునిగి పోయింది.
      అంతే! తేలు మళ్ళీ నీళ్ళలో పడి కొట్టుకు పోయింది.

నీకు ఒకటి నాకు రెండు (Neeku Okati Naku Rendu)

     ఒక గ్రామంలో ఓ భార్యాభర్తలు జంట ఉండేది.
     ఇద్దరికీ చాదస్తం ఎక్కువ. ఒక రోజు భర్త జొన్నలు తెచ్చి రొట్టె చేయమంది.
     భార్య చక్కగా రొట్టెలు చేసింది.
     భర్త తెచ్చిన జొన్నలతో మూడు రొట్టెలు అయ్యాయి.
     ఇద్దరూ తినడానికి కూర్చున్నారు.
     భార్య రెండు రొట్టెలు వేసుకొని భర్తకు ఒకటి వేసింది.
     అది చూసి భర్త నాకు రెండు నీకు ఒకటి అన్నాడు.
     కాదు నాకు రెండు నీకు ఒకటి అంది భార్య.
     ఈ విధంగా ఇద్దరూ చాలా సేపు వాదించుకున్నారు.
     చివరకు ఒక ఒప్పందానికి వచ్చారు.
     ఇద్దరూ కదలకుండా, మాట్లాడకుండా ఉండాలి.
     ఎవరు కదిలినా, మాట్లాడినా వాళ్ళు ఒక రొట్టే తినాలి.
     ఇద్దరూ సరే అంటే సరే అనుకొని కదలకుండా, మాట్లాడకుండా కూర్చున్నారు.
     కొద్దిసేపటికి ఒక కుక్క వచ్చింది.
     భార్యాభర్తలిద్దరినీ చూసింది. వాళ్ళు కదలడం లేదు.
     కుక్క భౌ భౌ అని అరిచింది.
     అయినా కదలలేదు.
     మెల్లగా వారిద్దరి మధ్యలో ఉన్న రొట్టెలను ఎత్తుకొని పోయింది.
     భార్యాభర్త లిద్దరూ లబోదిబోమని ఏడ్చారు.

పట్టిందల్లా బంగారం (Pattindalla Bangaram)

     అనగా అనగా ఒక ఊరు.
     ఆ ఊరిలో ఒక ధనవవంతుడైన వ్యాపారి ఉన్నాడు.
     ఆయన పేరు కోటయ్య.
     ఆయన దగ్గర కావలసినంత డబ్బు, బంగారం ఉంది.
     అయినా ఇంకా బంగారం కావాలని ఆశ పుట్టింది.
     గుడికి వెళ్ళి దేవతను ప్రార్థించాడు.
     దేవత ప్రత్యక్షమై ‘ఎం వరం కావలో కోరుకో’ అంది.
     కోటయ్య ‘‘ నేను పట్టిందల్లా బంగారం కావాలి’’ అని కోరుకొన్నాడు.
     ‘‘సరే! నువ్వు కోరిన వరం ఇచ్చాను వెళ్ళు’’ అంది దేవత.
     కోటయ్య ఇంటికి వచ్చాడు.
     ఆయన పట్టుకొన్నదల్లా బంగారు అయింది.
     తోటలోకి వెళ్ళి పూల మొక్కలను తాకాడు.
     అవి కూడా బంగారంగా మారాయి.
     కోటయ్య ఆనందానికి హద్దులు లేవు.
     కాసేపటికి ఆయనకు ఆకలి వేసింది.
     వంట గదిలోకి వెళ్ళి ముందుగా కాసిన్ని నీళ్ళు తాగాలను కొన్నాడు.
     కాని అతని చేయి తగలగానే నీరు బంగారంగా మారిపోయింది.
     అంతలో ఆయన కూతురు వచ్చింది.
     కూతురును ముట్టుకోగానే ఆమే కూడా బంగారం విగ్రహాంగా మారిపోయింది.
     కోటయ్యకు ఏడుపు ఆగలేదు.
     వెంటనే దేవతను తలచుకొన్నాడు.
     దేవత ప్రత్యక్షమై ‘‘ మళ్ళీ ఏం కావాలి?’’ అని అడిగింది.
     ‘‘అమ్మా! నాకేమి వద్దు. నీ వరం నువ్వు వెనక్కి తీసుకో!’’ ఉన్నదాంతోనే తృప్తిగా జీవిస్తాను అన్నాడు.
     ‘‘సరే’’ అంటూ దేవత మాయం అయింది.
     కోటయ్య మామూలు మనిషిగా మారి హాయిగా ఉన్నాడు.

బలపం (Balapam)

     రాధ పలక మీద అ ఆ లు దిద్దుతోంది.
     దిద్దుతూ గట్టిగా పలుకుతోంది.
     అంతలో రాధని వాళ్ళమ్మ పిలిచింది. రాధ పలక, బలపం పక్కన పెట్టింది. అమ్మ దగ్గరకు పరుగు తీసింది.
     అప్పటిదాకా రాధ వేళ్ళ మధ్య ఉన్న బలపం ‘ అమ్మయ్య’ అని గాలి పీల్చుకొంది. ఈ పాపను వాళ్లమ్మ ‘రాధ’ అని కేక వేసింది. ఆ పాప పేరు రాధ అయితే మరి నా పేరు? అనుకొంది బలపం.
     బలపానికి ఎంతసేపు ఆలోచించిన తన పేరు గుర్తు రాలేదు.
     రాధ వచ్చేలోగా తన పేరు తెలుసుకు రావాలని బయలు దేరింది బలపం.
     బలపానికి గబగబా నడిచి వెళుతున్న ఒక టీచర్ ఎదురయ్యాడు.
     ‘‘సార్ సార్! నా పేరు మరచి పోయాను. ఒకసారి గుర్తు చేయరా?’’ అని అడిగింది బలపం.
     ‘‘నాకు ఇప్పటికే బడికి ఆలస్యం అయిపోయింది. పిల్లలకంటే ముందుగానే టీచర్ బడిలో ఉండాలి. ఇప్పుడు కాదు తర్వాత కనబడు’’ అంటూ వెళ్ళి పోయాడు టీచర్.
     బలపం దగ్గరలో ఉన్న పాఠశాల వైపు నడుస్తోంది. దానికి రోడ్డు మీద ఒక కనిపించింది. బలపం పుస్తకం దగ్గరకు వెళ్ళింది.
     ‘‘ మా రాధమ్మ అ ఆ లు దిద్దుతుంటే నా పేరు మర్చిపోయాను. నా పేరు ఏమిటి?’’ అని అడిగింది బలపం.
     ‘‘నువ్వు యిలా రోడ్ల మీద పడి అందరినీ అడిగే బదులు మీ రాధనే అడగవచ్చు కదా?’’ అంది పుస్తకం.
    బలపానికి ఆ ఆలోచన నచ్చింది. వెంటనే ఇంటికి వెళ్ళింది. ఏం తెలీనట్లు పలక పక్కనే కూర్చింది.
     ‘‘ఎక్కడికి పోయావు’’ అడిగింది పలక.
     ‘‘ నాపేరు మర్చిపోయా! తెలుసుకొందామని వెళ్ళాను’’ అంది.
     నన్నడిగే నే చెప్పేదాన్ని కదా! నీ పేరు బలపం. నా పేరు పలక. మనిద్దరి సహకారం లేనిదే ఎవరూ అ ఆ లు కూడా నేర్చుకోలేరు’’ అంది పలక.

నక్క - ద్రాక్షపళ్ళు (Nakka Draksha pallu )

     ఒక నక్కకి ఆకలి వేసింది.
     ఏదైనా తిందామని వెదుకుతూ బయలు దేరింది.
     ఆహారం కోసం తిరుగుతున్న నక్కకు ద్రాక్షతోట కనిపించింది.
     దానికి నోరు ఊరింది.
     ద్రాక్ష పందిరి ఎత్తుగా ఉంది.
     ఓ గెంతు గెంతి అందుకోవాలని ప్రయత్నించింది.
     ద్రాక్ష పళ్ళ గుత్తి అందలేదు.
     ‘ఇంకాస్త పైకి’ అనుకొంటూ మళ్ళీ మళ్ళీ గెంతింది.
     ఎంతసేపు గెంతినా ద్రాక్షపళ్ళు అందలేదు.
     నోరు ఊరించే ద్రాక్షపళ్ళు ఆనక్కకు అందలేదు.
     అవి దానికిప్పుడు అందంగా కనిపించడం లేదు.
     ‘‘ఛీ! ఈ పళ్ళు ఏం బాగుంటాయి? పుల్లగా ఉంటాయి’’ అనుకొంటూ అక్కణ్ణించి వెళ్ళిపోయింది.

దాచిన సంపద(Dhachina Sampada)

     అనగనగా అనగా ఒక రైతు.
     ఆయనకు ఐదుగురు కొడుకులు.
     వాళ్ళు తండ్రి సంపాదించింది తింటూ సోమరులుగా తిరిగే వాళ్ళు.
     రైతుకు కొడుకుల గురించి బెంగ పట్టుకొంది.
     ఆయన చాలా కాలం ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు.
     ఒక రోజు కొడుకులను పిలిచి యిలా చెప్పాడు.
     ‘‘మన కుటుంబం భూమిని నమ్ముకుని జీవిస్తోంది. చాలా కాలంగా మీకు తెలీకుండా కొంత ధనం పోగుచేసి మన పొలంలో దాచి ఉంచాను. నేను పెద్ద వాడినై పోమాను. ఆ నిధి ఎక్కడ దాచానో ఇప్పుడు గుర్తులేదు. మీరు మన పొలంలో వెతికి ఆ నిధిని తీసుకోండి. మీ జీవితం సుఖంగా గడిచి పోతుంది’’. ఐదుగురు కొడుకులు పొలం అంతా తవ్వి చూశారు. ఎంత తవ్వినా తండ్రి చెప్పిన నిధి వారికి దొరకలేదు.
     తండ్రి మీద కాళ్ళు ఎంతగానో చిరాకు పడ్డారు.
     ‘‘నేను మీ కోసం నిధిని దాచింది నిజమే! సమయం వచ్చినపుడు అది బయట పడుతుంది. మీరు ఎలాగూ భూమిని చక్కగా తవ్వారు కాబట్టి సాగు చెయ్యండి’’ అన్నాడు రైతు.
     తండ్రి చెప్పింది విని కోపం వచ్చినా, తప్పదు కదాని పొలం సాగు చేశారు.
     పంట విరగ పండింది.
    రైతు కొడుకులను మళ్ళీ చేర పిలిచి ‘‘నాయనలారా! మీరు పండించిన పంటే నేను దాచి పెట్టిన నిధి. కష్టపడితే ప్రతి సంవత్సరం మీకీ నిధి దొరుకుతుంది’’ అన్నాడు.
     రైతు కొడుకులకు శ్రమించడంలోని ఆనందం తెలిసి వచ్చింది.

ఐకమత్యం(Ikamathyam)

     మన శరీరంలో కాళ్ళు, చేతులు, తల, నోరు ఇలా చాలా అవయవాలున్నాయి. అవన్నీ సవ్యంగా పని చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం!
     ‘‘నడవాలన్నా, పరిగెత్తాలన్నా నేనే చెయ్యాలి. నా గొప్పదనం మిగితా వాటికి తెలియడం లేదు’’ అనుకొన్నాయి. కాళ్ళు. వెంటనే నడవడం మానుకొన్నాయి.
     ‘‘ఏ పని చెయ్యాలన్నా నేనే కదా చెయ్యాల్సింది. ముట్టుకోవడం, పట్టుకోవడం, మొయ్యడం అన్నీ నేనే. నా గొప్పదనం ఎవరూ గుర్తించండం లేదు. కాళ్ళేమో తామే గొప్ప అనుకొంటూ నడవడం మానేశాయి. సరే! నేను నా పని చెయ్యను’’ అనుకొని చేతులు పని చెయ్యడం మానేశాయి.
     వీటిని చూసి కళ్ళు చూడటం మానేశాయి. నోరు ఆహారం తీసుకోవడం మానేసింది.
     నోరు ఎప్పుడైతే ఆహారం తీసుకోవడం మానేసిందో అప్పటి నుండి మిగితా అవయవాలు దానివైపు గుర్రుగా చూడసాగాయి. రెండు మూడు రోజులు గడిచేసరికి వాటి శక్తి సన్నగిల్లిపోయింది.
     ఇహ లాభం లేదని అవన్నీ నోటి దగ్గరకు వెళ్ళి ఆహారం తీసుకోమని వేడుకొన్నాయి. అది ‘సరే’ అంది.
     ‘‘కాళ్ళు, చేతులు, తల, కళ్ళు, చెవులు, గుండె, ఊపిరితిత్తులు ఇలా మనందరం ఒక చోట ఉంటున్నాం. మనం ఎవరు గొప్ప అని పోటీపడితే తేల్చడం ఎవరికీ సాధ్యం కాదు. ఎవరిగొప్ప వారికి ఉంది. గొప్పలు పక్కన పెట్టిన ఐకమత్యంతో ఉంటే ప్రపంచంలో దేనినైనా సాధించవచ్చు’’ అంది నోరు.

5, మే 2016, గురువారం

ఎవరు గొప్ప? (Evaru goppa)

     ఒక నాడు అడవిలో జంతువులు, పక్షులు ఒక చోట చేరాయి.
     ‘‘నేను గొప్పంటే నేను గొప్ప’’ అని పోటీ పడ్డాయి.
     ‘‘అందరి కంటే పెద్దగా, బలంగా ఉంటాను నేనే గొప్ప’’ అంది ఏనుగు.
     ‘‘అందరి కన్నా గొప్ప దాన్ని నేనే కదా! అందుకే నన్ను మృగరాజు అంటారు’’ అంది సింహం.
     ‘‘అందరి కంటే వేగంగా పరుగెత్తుతాను. కాబట్టి నేనే గొప్ప’’ అంది జింక.
     ‘‘నిన్ను వేటాడి చంపేస్తాను కదా? నా కన్నా నువ్వు గొప్పా?’’ అని మండిపడింది పులి.
     ‘‘నాలాగ ముద్దుగా ఎవరూ పలకలేరు. కాబట్టి నేనే గొప్ప’’ అంది చిలుక.
     నాలాగ ఎవరూ అందంగా నాట్యం చెయ్యలేరు. అందువల్ల నేనే గొప్ప’’ అంది నెమలి తన పింఛం విప్పుతూ.
     ‘‘నేను లేకుండా వనమే లేదు. నా వల్లే చెట్లు కాయలు కాస్తాయి. కాబట్టి నేనే గొప్ప’’ అంది సీతాకోక చిలుక.
     ఇదంతా వింటున్న వనదేవత చిరునవ్వుతో వారి మధ్య ప్రత్యక్షమయింది.
     ‘‘మీరు మాట్లాడు కొంటున్నదంతా నేను విన్నాను. మీరందరూ ఉంటేనే వనానికి అందం. మీలో ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఎవరి గొప్పవారిదే! ఇంకెప్పుడూ యిలాంటి విషయాల్లో పోటీ పడకండి. నేల తల్లి ఆనందంగా ఉండాలంటే వనాలు కావాలి. నేను సంతోషంగా ఉండాలంటే మీరంతా ఉండాలి’’ అంది.
     అది విని అడవిలోని జంతువులు, పక్షులు తమలో తాము ఎవరు గొప్పని వాదులాడుకోవడం తప్పని తెలుసుకొన్నాయి.

గంగాళం చచ్చిపోయింది (Gangalam chachipoindi)

     తెనాలి రామలింగడు ఇంటికి సమీపంలో పాపాయమ్మ అనే ఆవిడ ఉండేది.
     పెళ్ళిళ్ళు, పేరంటాలు వంటి శుభకార్యాలకు అవసరమైన పాత్రలు అవీ అద్దెకు యిచ్చి జీవనం సాగించేది.
     ఆ ఊళ్ళో అలా పాత్రలను అద్దెలకు యిచ్చేవారు ఎవరూ లేకపోవడంతో ఆవిడ ఆడింది ఆటగా, పాడింది పాటగా ఉండేది.
     ఆవిడకు ఎలాగైనా బుద్ది వచ్చేలా చేయాలని రామలింగడు అనుకొన్నాడు.
     ఒకరోజు ఆమె ఇంటికి వెళ్ళి ఓ మూకుడును అద్దెకు తెచ్చుకొన్నాడు.
     రెండు రోజుల తరువాత దాన్ని తిరిగి యిచ్చేస్తూ ఓ అట్లకాడను కూడా ఇచ్చాడు.
     మీరు ఇచ్చిన మూకుడు రాత్రి అట్లకాడను ప్రసవించింది అని చెప్పాడు.
     కానీ ఖర్చులేకుండా ఊరికే అట్లకాడ రావడంతో పాపాయమ్మ సంతోషించింది.
     కొద్ది రోజులు గడిచాక రామలింగడుకు గంగాళం అవసరమైందని తీసుకువెళ్ళాడు.
     మర్నాడు ఉదయమే వచ్చి పాపాయమ్మను నిద్రలేపి ‘‘పాపాయమ్మ గారూ! మీ గంగాళం రాత్రి ప్రసవ వేదనతో పురిటిలో చనిపోయింది. అది ఈ చెంబును కనింది’’ అంటూ పాపాయమ్మకు ఓ చిన్న చెంబు యిచ్చి కన్నీరు పెట్టాడు.
     పాపాయమ్మ కోపంతో ‘‘గంగాళం ఎక్కడైనా చచ్చిపోతుందా?’’ అని అరచి గొడవ చేసింది.
    ‘‘ఆ రోజు మూకుడుకు అట్లకాడ పుట్టినప్పుడ, ఈ గంగాళం ప్రసవించడంలో చనిపోడంలో ఆశ్చర్యం ఏం ఉంది?’’ అన్నాడు తెనాలి రామలింగడు.
     పాపాయమ్మకు ఏం చెయ్యాలో తోచక నోరు మూసుకొని కూచుంది.

అక్బర్ - బీర్బల్ (Akbar - Birbal)

     అక్బర్ ఒక రాజు. అతని మంత్రి బీర్బల్.
     ఒకరోజు బీర్బల్ సభకు ఆలస్యంగా వచ్చాడు. రాజు దానికి కారణం అడిగాడు.
     ‘‘మహారాజా! పిల్లవాడికి సముదాయించి రావడంలో యింత ఆలస్యం అయింది’’ అన్నాడు బీర్బల్.
     ‘‘పిల్లలను సమదాయించడం అంత కష్టమా?’’ అన్నాడు అక్బర్.
     ‘‘అవును. కావాలంటే మీరు నాకు తండ్రిగా నటించి నన్ను సముదాయించి చూడండి’’ అన్నాడు బీర్బల్. రాజు ‘సరే’ అన్నాడు.
     ‘‘నాన్నా నాకు కుండ కావాలి’’
     ‘‘అలాగే’’ అంటూ వెంటనే కుండ తెప్పించాడు రాజు.
     ‘‘నాకు ఏనుగు కావాలి.’’
     రాజు ఏనుగును తెప్పించాడు.
     ‘‘నాన్నా! ఈ కుండలో ఆ ఏనుగును పెట్టండి’’
     ‘‘కుండలో ఏనుగును పెట్టడం వీలుకాదు నాయనా!’’
     ‘‘ఊ! ఊ! ఊ! పెట్టాలి’’ అంటూ ఏడుపు అందుకొన్నాడు బీర్బల్.
     అక్బర్ ‘‘పిల్లలను సముదాయించడం కష్టమే’’ అని తెలిసి వచ్చింది.

రంగు మారిన కోడి పిల్లలు (Rangu marina kodipillalu)

     ఓ రోజు ఒక కోడి తన ఆరుగురు పిల్లలతో షికారు బయలు దేరింది.
     కోడి తన పిల్లలను జాగ్రత్తగా గమనిస్తూ నడుస్తోంది.
     కోడి పిల్లలు కనిపించిన గింజలు, పురుగులు తింటూ తల్లి వెంట వెళుతున్నాయి.
     అలా అవి చాలా దూరం వెళ్ళాయి.
     తల్లితోపాటు నడుస్తున్న కోడి పిల్లలకు రోడ్డు పక్కన పడి ఉన్న ఒక పొగగొట్టం కనిపించింది.
     అవి దానిలో దూరి అటు నుంచి ఇటు వైపుకు వచ్చాయి.
     ఈ లోగా తల్లికోడి వెనుతిరిగి చూసి పిల్లలు కనిపించకపోయేసరికి కంగారు పడింది.
     ఏం చెయ్యాలో తెలీక ‘కొక్కొరోకో’ అంటూ గట్టిగా పిలిచింది.
     పొగగొట్టంలోంచి బయటకు వచ్చిన కోడి పిల్లలు గొట్టం  మసి అంటుకొని నల్లగా మారాయి.
     తల్లికోడి వాటిని గుర్తుపట్టలేక పోయింది.
    తల్లి పిలుపు విని కోడి పిల్లలు కూడా నెమ్మదిగా ‘కొక్కొరోకో’ అని అరిచాయి.
    రంగు మారిన పిల్లల్ని తల్లికోడి గుర్తించలేదు. కాని వాటి అరుపును గుర్తించింది. బిడ్డ గొంతును తల్లి గుర్తిస్తుంది కదా.

నక్క - తాబేలు (Nakka - Thabelu)

     అనగనగా ఒక అడవిలో ఓ నక్క ఉండేది. ఒకరోజు అది ఆహారం కోసం వెతుకుతూ తిరగసాగింది. నక్క ఓ నది ఒడ్డున వెళుతుంటే దానికి నీటిలో తాబేలు కనిపించింది. నక్క దానిని నోటితో గబుక్కున పట్టుకొంది. ఆత్రంగా తినబోయింది. కాని తినలేకపోయింది.
     ‘‘నక్కబావా! నక్కబావా! నన్ను నీటిలో నానబెట్టు. నేను మెత్తబడతాను. అప్పుడు సులభంగా నువ్వు తినచ్చు’’ అంది తాబేలు.
     ‘‘అయ్యో! నువ్వు నీటిలోకి వెళితే మళ్ళీ ఒడ్డుకురావు’’ అంది నక్క.
     ‘‘అయితే నా వీపు మీద కూర్చుని కొంత ముందుకు నీళ్ళలో వెళ్ళింది. ‘నానేవా? నానేవా?’ అని అడిగింది. తాబేలు యింకా నానలేదు అంటూ మరింత ముందుకు పోసాగింది.
     నక్కకి కోపం వచ్చింది. ‘‘నువ్వు నానేవా లేదా?’’ అంటూ గద్దించి అడిగింది.
     తాబేలు భయం నటిస్తూ ‘‘నువ్వు కూర్చున్న స్థలం తప్ప అంతా నానేను. నువ్వు కొంచెం పక్కకు జరిగితే నేను పూర్తిగా నాన్తాను’’ అంది.
     నక్క తాబేలు మాటలు నమ్మి పక్కకు జరిగి నీటిలో పడిపోయింది. తాబేలు వెంటనే నీటి అడుగుకు జారిపోయింది.

పక్షులు - బోయవాడు (Pakshulu - Boyavadu )

     అదొక పెద్ద అడవి.
     ఒక వేటగాడు అడవిలో పక్షుల్ని పట్టుకోవడానికి వలపన్ని చెట్టు చాటున దక్కొన్నాడు.
     చెట్టు కింద గింజలు చల్లాడు.
     గాలిలో ఎగిరే పక్షులు నేలమీద గింజల్ని చూశాయి.
     అందులో ఒక పక్షి చాలా తెలివైంది.
     ‘‘ఈ అడవిలో గింజలు ఎలా వస్తాయి. ఇందులో ఏదో మోసం ఉంది. మనం తినవద్దు’’ అంది.
      కాని మిగితా పక్షులు దాని మాట వినలేదు.
     పక్షులు నేలమీద వాలి వలలో చిక్కుకొన్నాయి.
     అయ్యో! అంటూ బాధపడసాగాయి.
     ‘‘మనం ఎలాగైనా తప్పించుకోవాలి. అందరం కలిసి ఒకేసారి పైకి ఎగురుదాం’’ అంది తెలివైన పక్షి.
     అలా పక్షులన్నీ వలతో పాటు ఎగిరి పోతుంటే వేటగాడు ఏడుస్తూ వెంట పడ్డాడు..
     కానీ పక్షులు చిక్కలేదు.
     పక్షులు అలా ఎగురుకొంటూ వెళ్ళి వాటి స్నేహితుడైన ఎలుక ముందు వాలాయి.
     ఎలుక వలను కొరికి పక్షులను రక్షించింది.

కాకి - కడవ (kaki - kadava)

     వేసవి కాలం. మిట్ట మధ్యాహ్నం.
     ఒక కాకి ఎండలో తిరిగి తిరిగి అలసిపోయింది.
     దానికి దాహం వేసింది.
     నీళ్ళ కోసం వెతుకుతూ, వెతుకుతూండగా ఓ ఇంటి పెరటిలో ఒక కడవ కనిపించింది.
     కాకి రివ్వున వెళ్ళి కడవ మీద వాలింది.
     కడవలో సగం దాక నీళ్ళు ఉన్నాయి.
     అయినా అవి దానికి అందలేదు.
     కాకికి నీళ్ళు చూడగానే మరింత దాహం వేసింది.
     నీళ్ళు ఎలా తాగాలా అని ఆలోచిస్తూ అది పెరటి గోడ మీద వాలింది.
     అక్కడ నుంచి ఎగిరి చెట్టు కొమ్మ మీద వాలింది.
     అది అలా ఆలోచిస్తూ పెరడు అంతా ఎగురుతూ, వాలుతూ ఉంది.
     దానికి పెరటిలో చిన్న చిన్న గులకరాళ్ళు కనిపించాయి.
     దానికి వెంటనే ఓ ఆలోచన వచ్చింది.
     కాకి ఒక్కో గులకరాయి తెచ్చి కడవలో వేయసాగింది.
     కొంత సేపటికి కడవలో నీళ్ళు పైకి వచ్చాయి.
    కాకి తన దాహం తీర్చుకొని ఆనందంగా ఎగురుకొంటూ ఇంటికి పోయింది.

కప్పగంతులు (kappa ganthulu)

     అనగనగా ఒక రాజు.
     ఆయనకు ప్రతిరోజు చెరువు గట్టుకు షికారు వెళ్ళడం అలవాటు.
     రాజు ప్రతిరోజు చెరువు దగ్గరకు రావడం గమనించింది ఓ కప్ప.
     ఒక రోజు రాజుగార్ని పలకరించింది కప్ప.
     ‘‘మహారాజా! ప్రతిరోజూ మీరు వంటరిగా ఇక్కడికి ఎందుకు వస్తారు ? ’’అని అడిగింది.
     ‘‘ ఈ చెరువు మా పూర్వీకులు తవ్వించారు. ఇక్కడికి వస్తే వారిని చూసినంతగా ఆనందం కలుగుతుంది.’’ అన్నాడు. రాజు.
     ‘‘నేను కూడా నీలానే ఈ చెరువులోని కప్పలకు రాజును. నేను నీలాగ అడుగులో అడుగు వేసి నడువను. గెంతుతూ వెళతాను. నాలాగా నువ్వు చెయ్యగలవా?’’
     ‘‘నీలాగ గెంతడం నాకు చేత గాదు’’ అన్నాడు రాజు.
     ‘‘నాలాగా బెకబెక మనగలవా?’’ అంది కప్ప.
     ‘‘అదీ నాకు చాతకాదు’’ అన్నాడు రాజు.
     ‘‘నేను నీళ్ళలోను, భూమి కూడా జీవించగలను తెలుసా?’’ అంది కప్ప.
     ‘‘ఆ! ఆ! తెలుసు. నువ్వు కప్పవి. కప్పకి తగిన లక్షణాలు నీకున్నాయి. నేను రాజును కదా! కాబట్టి నేను రోజులాగే ఉండాలి. నీలాగా గెంతుతూ ఉంటే అందరూ నవ్వరూ?’’ అన్నాడు రాజు.
     కప్ప మరోమాట మాట్లాడకుండా చెరువులోకి ఒక గెంతు గెంతింది.
    

సింహం - నాలుగు ఆవులు (Simham - naalugu Avulu )

     పూర్వం ఓ గ్రామంలో నాలుగు ఆవులు ఎంతో ఐకమత్యంతో, స్నేహంగా ఉండేవి.
     అవి ఎప్పుడూ కలిసే ఉండేవి.
     అవి గ్రామానికి దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళి కడుపునిండా మేసేవి.
     ఆ అడవిలో ఓ సింహం ఉండేది.
     అది ఆవుల మీద కన్నేసింది.
     ఆవులను తినాలనే కోరిక దానికి కలిగింది.
     తాను మృగరాజుననే గర్వం, చాలా బలవంతుడినన్న అహం ఆ సింహానికి ఉన్నాయి.
     సింహానికి కోరిక కలగగానే ఆవుల మీద లంఘించింది.
     నాలుగు ఆవులు ఐకమత్యంతో సింహాన్ని ఎదుర్కొన్నాయి.
     వాటి దెబ్బకు సింహం పారిపోయింది.
     కొన్నాళ్ళకు నాలుగు ఆవుల మధ్య ఐక్యత చెడిపోయింది.
     ఒకదానితో ఒకటి పోట్లాడుకొన్నాయి.
     అప్పటి నుండీ అవి దేనికదే విడివిడిగా అడవిలో తిరగసాగాయి.
     సింహం ఇది గమనించింది.
     నాలుగూ ఒకచోట ఉంటే వాటి మీద పడడానికి ఇబ్బంది కానీ ఒక్కొక్కటీ విడివిడిగా ఉండే కష్టమేమిటి?
     సింహం ఒక్కో ఆవును పట్టుకొని తిని కడుపు నింపుకొంది.

Chevula Pilli (చెవుల పిల్లి )

     ఒక కుందేలు, తాబేలు స్నేహంగా ఉండేవి.
     ‘తను బాల తెల్లగా బొద్దుగా, అందంగా ఉంటా’ నని కుందేలుకు గర్వం.
     ఒకసారి తాబేలును ఆట పట్టించాలనే కోరిక కలిగింది కుందేలుకు.
     ‘‘తాబేలు మామా! తాబేలు మామా! నువ్వు మా యింటికి వస్తావా ? నీకు చక్కటి పాయసం చేసి యిస్తాను’’ అంది.
     తాబేలు ‘‘సరే వస్తాను’’ అంది.
     తాబేలు గబగబా నడవలేదు కదా! అందుకని తాబేలు రాగనే ‘‘ నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు. ఇక నువ్వు రావని చేసిన పాయసం అంతా నేనే తాగేశాను’’ అంది కుందేలు.
     కుందేలు ఎందుకు యిలా చేసిందో తాబేలు గ్రహించింది. దానికి బుద్ది చెప్పాలనుకొంది.
     కొద్ది రోజుల తర్వాత కుందేలును విందుకు ఆహ్వానించింది తాబేలు.
     కుందేలు రాగానే ‘‘శుభ్రంగా కాళ్ళు కడుక్కొని రా! విందు ఆరగిద్దాం’’ అంది తాబేలు.
     కుందేలు కాళ్ళు కడుక్కొని వచ్చింది. తాబేలు దాని కాళ్ళకు మసి అంటించింది. ‘‘మళ్ళీ శుభ్రంగా కడుక్కురా’ అంది.
    అలా కాళ్ళు కడుక్కొని వచ్చిన ప్రతిసారి కాళ్ళకు మసి అంటించింది తాబేలు.
     కుందేలుకు ఎంతో విసుగు అనిపించింది.
     అది తాబేలు గ్రహించింది. ‘నేను నెమ్మదిగా బాధ పెట్టాను. అందుకు ఇప్పుడు నేను యిలా చేయాల్సి వచ్చింది. అనవసరంగా ఎవరినీ బాధపెట్టకు’’ అంది తాబేలు మందలిస్తూ.

Kothulu Topilu ( కోతులు - టోపీలు)

     అనగనగా ఒక ఊళ్ళో రాజయ్య అనేవాడు టోపీలమ్మేవాడు. ఒకరోజు అతను టోపీలు అమ్మడానికి పక్క గ్రామం బయలు దేరాడు.
     టోపిలమ్మా టోపీలు
     రంగు రంగు టోపీలు
     రకరకాల టోపీలు...
     అని పాడుకొంటూ వెళ్ళసాగాడు. చాలా మంది టోపీలను ఎగబడి కొన్నారు.
     మధ్యహ్నం అయ్యేసరికి రాజయ్యకు ఆకలి వేసింది. ఒక చెట్టు క్రింది కూర్చుని అమ్మ ఇచ్చిన టిఫిన్ తిన్నాడు. ఇంతలో వాడికి నిద్ర ముంచుకు రావడంతో నిద్రపోయాడు.
     చెట్టుపై నున్న ఒక కోతి రాజయ్య తలపై నున్న టోపీని చూసింది. అది వెంటనే కిందికి దిగింది. రాజయ్యక సంచిలోంచి ఒక టోపిీ తీసుకొని తలపై పెట్టుకొంది. అది చూసి మిగితా కోతులన్నీ వచ్చి ఒక్కో టోపీ తీసుకొని  తమ తలపై పెట్టుకొని చెట్టు ఎక్కేసాయి. సంచీ ఖాళీ అయిపోయింది.
     రాజయ్య నిద్రలేచి చూసే సరికి సంచీ ఖాళీగా కనిపించింది. తలపైకెత్తి చూశాడు. చెట్టుమీద టోపీలు పెట్టుకొన్న కోతులు కనిపించాయి.
     రాజయ్యకు దుఃఖం వచ్చింది. టోపీలు ఎలా సంపాదించాలా అని బుర్ర గోక్కున్నాడు. అది చూసి కోతులన్నీ బుర్ర గోక్కున్నాడు. అది చూసి కోతులన్నీ బుర్ర  గోక్కోసాగాయి. వాటి ప్రవర్తన  చూసిన రాజయ్యకు ఒక ఉపాయం తట్టింది.
     వెంటనే అను వెక్కిరించాడు. కోతులు వెక్కించాయి. రాజయ్య ఎగిరాడు. కోతులూ అలాగే ఎగిరాయి. రాజయ్య ఎలా చేస్తే కోతులూ అలానే చేశాయి. చివరగా రాజయ్య తన తలపైని టోపీని తీసి నేలపైకి విసిరాడు. కోతులన్నీ టోపీలను తీసి  కిందికి విసిరాయి.
     రాజయ్య గబగబా ఆ టోపీలన్నీ ఏరుకొని సంచీలో వేసుకొని వెళ్ళి పోయాడు.
     ‘టోపీలమ్మా టోపీలు... అంటూ మళ్ళీ పాట మొదలు పెట్టాడు.

15, ఏప్రిల్ 2016, శుక్రవారం

తెలివైన ఆవు - కథ

అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని దగ్గర ఒక ఆవు ఉండేది. అది ఒక రోజు ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయింది. అది సహాయం కోసం ఎన్నో గంటలు అరిచి గీపెట్టింది. చాలా సేపటి తర్వాత గాని ఆవు బావిలో పడిందని తెలుసుకోలేకపోయాడు ఆ యజమాని, ఇన్నాళ్లుగా తనకి ఎంతో సేవ చేసిన ఆవును కాపాడాలని అనుకోలేదు అతను. ఎందుకంటే ఆ ఆవును పైకి తీయడం అనవసరం ముసలిది అయినది అనుకున్నాడు.

అంతేకాక ఆ బావిని కూడా మూసేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అందుకని దానిమీద మట్టి వేసి బావి నింపటం మంచిదని భావించాడు ఆ వ్యక్తి.

ఆ పనిచేయడానికి తనకు సహాయం చేయమని పక్కింటి వారిని కూడా పిలిచాడు.ఆతను పారతో బావిలోని ఆవుపై మట్టి వేయడం ప్రారంభించాడు. పక్కింటివారు కూడా పారలతో మట్టి వేస్తూ ఆయనకు సహాయం చేయసాగారు. ఏం జరుగుతోందో అర్ధం కాని ఆవు మొదట అంబా అరిచింది, తరువాత అరవకుండా ఉండిపోయింది. అమ్మయ్య ఆనుకున్నాడు.

కొద్దిసేపు పారతో మట్టి వేసిన తరువాత బావిలోకి చూసిన ఆయన ఆశ్చర్యపోయాడు. తనపైన మట్టిపడుతున్న ప్రతిసారి ఆవు మట్టిని విదుల్చుకుంటూ ఆ మట్టిమీదే నలబడి పైకి రాసాగింది.అతనికి,ఆతని పక్కింటి వారికి ఆశ్చర్యం కలిగింది. బావిలో నిండిన మట్టి మీదుగా ఎక్కి ఆవు పైకి వచ్చేసింది. ఆవు తెలివికి మెచ్చిన అతను,తన తప్పు తెలసుకొని, అప్పటి నుంచి ప్రేమగా చూడసాగాడు.

నీతి : ఈ ఆవులాగే మనమీద కుడా ఎంతో మంది దుమ్ము, మట్టి వేస్తుంటారు. కాని ఆ దుమ్మును, మట్టిని దులుపుకొని జీవితంలో పైకి వచ్చేవారే తెలివైనవారు.

26, ఫిబ్రవరి 2016, శుక్రవారం

పులితోలు కప్పుకొన్న మేక (కథ)

     అనగనగా ఒక మేక ఉండేది.
     పాపం దానికి ఆకలి ఎక్కువ. ఎంత తిన్నా కడుపు నిండేది కాదు.
     ఎటు వెళ్ళినా పచ్చటి తోటలు కనిపించేవి. లోపలికి దూరి తిందామంటే కాపలావాళ్ళు ఉండేవాళ్ళు. వరుసగా కొన్ని రోజుల పాటు కడుపు నిండా తినాలని మేక ఆశ. ఆ ఆశ తీరే మార్గం కోసం వెదకసాగింది.
     దానికి ఒక రోజు అడవి ప్రాంతంలో పులితోలు దొరికింది.
     అది కప్పుకొని మేక ఒక తోట లోకి వెళ్ళింది. తోటకు కాపలా కాస్తున్న వాళ్ళు నిజంగా పులి వచ్చిందని భయపడి పారిపోయారు.మేక కడుపు నిండుగా హాయిగా మేసింది.
     పులితోలు తన కోరిక తీర్చిందని సంతోషపడింది.
     మేక ప్రతిరోజు పులితోలు కప్పుకొని తోటలలో పడి మేయసాగింది. తోట మాలికి అనుమానం వచ్చి మేక వెనగ్గా వెళ్ళి దాని మోసం తెలుసుకొన్నాడు.
     మర్నాడు అది అలవాటుగా తోటలోకి రాగనే దాన్ని  పట్టుకొని కట్టివేశాడు.

ఎలుక - పిల్లి - కుక్కలు (కథ)

     ఒక చెట్టు కింద కలుగులో ఓ ఎలుక ఉండేది.
     అది ఒకరోజు ఆహారం కోసం బయటికి వచ్చి అటూ ఇటూ తిరుగతోంది. దాన్ని ఓ అడవి పిల్లి చూసింది.
     పిల్లి ఎలుక వెంట పడింది. ఎలుక పిల్లికి దొరకలేదు. పరుగెత్తుకెళ్ళి తన కలుగులోకి దూరింది.
     అడవి పల్లి భయంతో ఎలుక కలుగులోనే ఎక్కువ రోజులు ఉండి పోయింది. అడవి పిల్లి వల్ల తనకు కష్టాలు వచ్చాయని  దిగులు పడసాగింది.
     ఒకరోజు ఎలుక ఉన్న ప్రాంతంలో చాలా హడావిడిగా ఉంది.
     ఎలుక సంగతేమిటో చూద్దామని బయటకు వచ్చింది.
     ఎవరో వేటగాళ్ళు, వాళ్ళ వెంట రేచు కుక్కలు కనిపించాయి.
     ఎలుకకు తన కష్టాలు తీరే ఉపాయం తోచింది.
     ఎలుక కుక్కలు ఉన్న చోటికి వెళ్ళి వాటి ఎదురుగా నృత్యం చేయడం మొదలు పెట్టింది.
     ‘మనం కొరికి తినే ఎముక ముక్కంత కూడా లేని యిది మన నృత్యం చేయడమా?’ అని కుక్కలకు కోపం వచ్చింది.
     అవి ఎలుకను పట్టుకోవడానికి ప్రయత్నించాయి.
     ఎలుక అటు ఇటూ తిరిగి చివరికి అడవి పిల్లి ఉన్న చోటికి వెళ్ళ పొదల్లో దాక్కుంది.
     కుక్కలు రొప్పుకొంటూ అక్కడికి వచ్చి ఎదురుగా అడవి పిల్లి కనిపించగానే గట్టిగా మొరిగాయి.
     కుక్కలు ఎక్కడ తనను చంపుతాయో అని భయపడి అడవి పిల్లి అడవి వదిలి పారపోయింది.

25, ఫిబ్రవరి 2016, గురువారం

దయ - 3వ తరగతి (చదువు ఆనందించు)

     పూర్వం కపిలవస్తు నగరాన్ని శుద్ధోదనుడు అనే రాజు పరిపాలించేవాడు. అతని కొడుకు గౌతముడు. అతనికి సిద్ధార్థుడు అనే పేరు కూడ ఉన్నది. గౌతముడు చిన్నతనం నుండి పెద్దల మీద గౌరవం, భూతదయ వంటి సుగుణాలతో పెరిగాడు. దేవదత్తుడు అతని చిన్ననాటి మిత్రుడు.

    ఒకనాడు వాళ్ళిద్దరు నదీ తీరానికి పోయారు. అక్కడ ఆకాశంలో హాయిగా ఎగిరే హంసలను దేవదత్తుడు చూశాడు. వాటిని వేటాడాలని బాణంతో కొట్టాడు. ఆ బాణం ఒక హంసకు తగిలి గిలగిల కొట్టుకుంటూ గౌతముని ముందుపడ్డది. గౌతముడు జాలితో, కింద పడ్డ హంసను ఒడిలోకి తీసుకొని నెమ్మదిగా బాణం తీశాడు. దాని శరీరాన్ని నిమురుతూ దానికి ఊరట కలిగించాడు.

     అప్పుడు దేవదత్తుడు అక్కడికి వచ్చి, ‘‘నేను హంసను కొట్టాను కాబట్టి అది నాదే!’’ అన్నాడు. ‘‘ మిత్రమా! ఆకాశంలో హాయిగా ఎగిరే హంసను ఎందుకు హింసించావు? జీవహింస పాపం కదా!’’ అంటూ హంసను ఇవ్వడానికి గౌతముడు ఇష్టపడలేదు. దాంతో వాళ్ళ కొట్లాట రాజుగారి దగ్గరికి పోయింది.

     ఇద్దరూ రాజాస్థానంలో న్యాయాధికారికి విన్నవించారు. దేవదత్తుని బాణం వల్ల హంస చచ్చిపోతే అది అతనిది అయ్యేది. కాని భూతదయతో గౌతముడు దాని ప్రాణాన్ని కాపాడినందు వల్ల అది గౌతమునిదే అవుతుందని న్యాయాధికారి తీర్పు చెప్పాడు. ఈ తీర్పుతో దేవదత్తుడు సంతోషపడలేదు. వెంటనే న్యాయాధికారి ఒక పీటను తెప్పించి దానిమీద హంసను ఉంచమన్నాడు. గౌతముణ్ణి, దేవదత్తుణ్ణి విడివిడిగా హంసను పిలువమన్నాడు. అది ఎవరి దగ్గరకు పోతే అది వారిది అవుతుందని చెప్పాడు. మొదట దేవదత్తుడు హంసను పిలిచాడు.

     అతని కోపపు చూపుకు, కఠినమైన పిలుపుకు హంస రాలేదు. గౌతముడు అప్యాయంగా హంసను పిలువగానే ఆ హంస అతని ప్రేమపూర్వకమైన పలుకులకు ఎగిరి వచ్చి, చేతిపైన వాలింది. గౌతముని అహింసా పద్ధతికి సభలోని వారంతా చప్పట్లు కొట్టారు. రాజు, న్యాయాధికారి సంతోషించారు.

అందువల్ల కాఠిన్యం కంటే ప్రేమ, దయ ఉన్నవాళ్ళకే అందరి మన్నన దొరుకుతుంది.

అమ్మ - 3వ తరగతి పాఠ్యాంశము


అమ్మ (http://telugu.naabadi.org)
అమ్మ మనకు దైవమురా!
అమ్మ ప్రేమ రూపమురా!
అమ్మవంటి దేవత ఈ
అవనిలోన లేదురా!

     తన రక్తము పోసి మనను
     కనిపెంచునురా!
     తీపికథలు చెప్పిబువ్వ
     తినిపించునురా!

అమ్మపిలుపులో ఎంతో
కమ్మదనం ఉందిరా!
అమ్మ పలుకు మాటల్లో
అమృతమే చిందురా!

     జోలపాట పాడి
     ఉయ్యాల లూపురా!
     లాలిపాట పాడి
     నిదుర బుచ్చురా!

 ‘‘బాల గేయాలు - వేముగంటి నరసింహాచార్యులు’’

వానదేవుడా... - 3 వ తరగతి పాఠ్యాంశము

వానదేవుడా (http://telugu.naabadi.org)

వానల్లు కురువాలె వానదేవుడా!
వరిచేలు పండాలె వానదేవుడా!!
నల్లాని మేఘాలు వానదేవుడా!
సల్లంగ కురువాలె వానదేవుడా!!
తూరుపు దిక్కున వానదేవుడా!
తుళ్ళి తుళ్ళి కురువాలె వానదేవుడా!!
 చాటంత మబ్బుపట్టి వానదేవుడా!
వర్షంగా మారాలె వానదేవుడా!!
చుక్కచుక్క నీరు చేరి వానదేవుడా!
మాకు ఆసరవ్వాలె వానదేవుడా!!
మావూరి కుంటల్లు వానదేవుడా!
మత్తడై దుంకాలె వానదేవుడా!!
చెరువులన్ని నిండాలె వానదేవుడా!
అలుగులై పారాలె వానదేవుడా!!
 పద్దలంతా కలిసి వానదేవుడా!
కాలువలు తవ్వాలే వానదేవుడా!!
బీడు భూములన్నీ వానదేవుడా!
బిరాన తడ్వాలె వానదేవుడా!!
పడావు భూములన్ని వానదేవుడా!
పంట చేలవ్వాలి వానదేవుడా!!
పన్నెండు పరగణాల వానదేవుడా!
చేలన్ని తడవాలె వానదేవుడా!!
మూన్నాళ్ళు యెదగాలి వానదేవుడా!
యెన్నుల్లు వేయాలె వానదేవుడా!!
పన్నెండు ధాన్యాలు వానదేవుడా!
పంట చేల్లో పండాలె వానదేవుడా!
భాగ్యాలు కలుగాలె వానదేవుడా!!
 పేదసాద బతుకాలె వానదేవుడా!
గొడ్డుగోద బతుకాలె వానదేవుడా!!
కూలినాలి దొరుకాలె వానదేవుడా!
వెతలన్ని తీరాలె వానదేవుడా!!
వలసబోయినోళ్ళంత వానదేవుడా!
ఊళ్ళకు రావాలె వానదేవుడా!!
బతుకులన్ని మారాలె వానదేవుడా!
సౌభాగ్యమందాలి వానదేవుడా!!

పాము - ముంగిస (కథ)

     అనగనగా ఒక గ్రామంలో గోపయ్య అనే రైతు  ఉండేవాడు. ఆయన భార్య గంగమ్మ. వాళ్ళు ఒక ముంగిసను పెంచేవారు. ఇలా ఉండగా గంగమ్మకు ఓ పిల్లవాడు పుట్టాడు. ముంగిస పిల్లవాడితో చక్కగా ఆడుకునేది.

     ఒకరోజు గంగమ్మ మంచి నీళ్ళు తేవడానికి వెళ్ళింది. తిరిగి వచ్చే సమయానికి ఆమెకు గుమ్మంలోనే ముంగిస ఎదురయింది. ముంగిస నోరంతా ఎర్రగా రక్తంతో నిండి ఉంది. గంగమ్మ ముంగిసను చూసి కంగారు పడింది. అది తన ముద్దుల కొడుకుని చంపేసి ఉంటుందని భావించింది. అలా అనుకోగానే ముందు వెనుకలు చూడకుండా చేతిలోని నీళ్ల చిందెను ముంగిస మీద పడేసింది. ఆ దెబ్బకు ముంగిస గిలగిల లాడుతూ ప్రాణాలు వదిలింది.

     గంగమ్మ ఆదుర్దాగా పిల్లవాణ్ణి పడుకో పెట్టిన చోటుకు పరుగు తీసింది. పిల్లాడు చక్కగా కేరింతలు కొడుతూ ఆడుకొంటున్నాడు. వాడి దగ్గరలో చచ్చిపడి ఉన్న పాము కనిపించింది. పాము బారిన పడకుండా పిల్లవాణ్ణి ముంగిస కాపడిందని  గంగమ్మకు అర్థం అయింది. తన తొందరపాటుకు చింతించింది.

కాకుల జంట - కథ

     అడవిలో ఒక చెట్టు మీద కాకుల జంట ఉండేది. ఆ చెట్టు కిందకు తరుచుగా ఇతర జంతువులు కూడా కచ్చి విశ్రాంతి తీసుకునేవి. చెట్టు కింద ఉన్న పుట్టలో ఒక నల్ల తాచుపాము ఉండేది.

     కాకి జంట చెట్టుమీద గూడు కట్టుకుంది. ఆ గూటిలో గుడ్లు పెట్టింది. ఆ గుడ్లను పొదగగానే నాలుగు కాకిపిల్లలు బయటకు వచ్చాయి. కాకుల జంట చాలా సంబరపడి పిల్లలను ముద్దాడాయి.

     ఒకరోజు కాకులు తమ పిల్లలకు ఆహారం తేవడం కోసం బయటకు వెళ్ళాయి. అప్పుడు చెట్టు కింద ఉన్న పాము చెట్టుపైకి ఎక్కి గూటిలో ఉన్న పక్షి పిల్లలను తినివేసింది.

     ఆహారం తీసుకొని వచ్చిన కాకుల జంటకు పాము చెట్టు దిగతుండటం కనిపించింది. అవి భయపడ్డాయి. వెంటనే గూటిలోకి వెళ్ళి చూస్తే వాటికి పిల్లలు కనిపించలేదు. వాటికి పాము తినేసిందన్న విషయం అర్థం అయింది. కాకులు చాలాసేపు ఏడ్చాయి.

     మళ్ళీ కొన్నాళ్ళకు కాకుల జంట గుడ్లు పెట్టాయి. ఈసారి కూడా పాము వచ్చి తినేస్తుందేమోనని చాలా భయపడ్డాయి. పాము బారి నుండి ఎలాగైనా పిల్లలకు రక్షించుకోవాలని  అనుకున్నాయి. కాకుల జంట తమ గద్ద మిత్రుని దగ్గరకు వెళ్ళినాయి. జరిగిన విషయాన్ని చెప్పాయి. ఈ సమస్యను పరిష్కరిస్తానని గద్ద చెప్పింది. గద్ద కాకుల జంటకొక ఉపాయం చెప్పింది. అవి సరేనని వెళ్లాయి.

     ఉపాయం ప్రకారం కాకుల జంట, గద్ద చెట్టు మీద వాలాయి. ఇవి చూస్తుండగానే పాము బయటకు వచ్చి చెట్టు ఎక్కబోయింది. ఇది కాకుల జంట గద్దకు సైగ చేసాయి. గద్ద రయ్యిమని వచ్చి పామును తన్నుకొని పోయింది. కాకుల జంట పాము పీడ విరగడయిందని సంతోషించాయి.

గాడిద సలహా! - కథ

     ఒక రైతు దగ్గర ఒక ఎద్దు ఉండేది. దానికి నాగలి కట్టి పొలం దున్నేవాడు. బండికి కట్టి లాగించే వాడు.  సాయంత్రానికి అది చాలా అలసిపోయేది. యజమాని మీద కోపం వచ్చేది. కొన్ని సంవత్సరాల తర్వాత రైతు ఒక గాడిదను కొని తెచ్చాడు. ఆ గాడిద ఎద్దుతో యజమాని నిన్ను బాగా చూస్తాడా? అని అడిగింది. ఎద్దు దానితో తన కష్టాన్నంతా చెప్పుకుంది. అప్పుడు గాడిద నీకు పని తప్పించుకునే ఉపాయం చెపుతానంది. మేత మానేసి నీళ్ళు మానేసి జబ్బు చేసినట్లుగా నటించమంది. మర్నాడు ఎద్దు లేవలేదు. మేత తినలేదు, నీళ్ళు తాగలేదు. రైతు దాన్ని చూసి జాలిపడి వదిలివేసి పొలానికి వెళ్ళిపోయాడు. రెండవ రోజు కూడా ఎద్దు అలాగే చేసింది. రైతు దాన్ని వదిలిపెట్టి గాడిదను పొలానికి తీసుకొని వెళ్ళాడు. దానితో పని చేయించాడు. ఆ పని దానికి కష్టమైపోయింది. అయ్యో! పొరపాటు చేశానే! సహాయం చేద్దామనుకుంటే ఆ పని అంతా నా మీద పడింది. ఏదైనా మార్గం ఆలోచించాలి అనుకుంది. సాయంత్రం ఎద్దును కలిసినప్పుడ ఇలా అంది. ‘‘రెండు రోజులు కులాసాగానే గడిచాయి. కాని, ఒక్కటే విచారం. నిన్ను రేపు ‘పశువధశాల’కు తోలుకుని పోతానని రైతు అన్నాడు’’ అంది. అంతే ఎద్దుకు భయం వేసింది. మరునాడు మామూలుగా మేత తిన్నది. రైతు పొలానికి తీసుకొని వెళ్ళాడు. దీనితో గాడిద తనకు పని తప్పినందుకు ఊపిరి పీల్చుకుంది.

ఎవరు చేస్తారు? - కథ

     ఒక ఊళ్ళో ఒక కోడి, బాతు, కుక్క, పంది స్నేహంగా ఉండేవి. కలిసి తిరిగేవి. కోడి కష్టపడి పని చేసేది. మిగితావి సోమరిగా ఉండేవి. ఒకరోజు కోడికి మొక్కజొన్న విత్తనం దొరికింది. దాన్ని మిత్రులకు చూపించి ‘‘దీన్ని ఎవరు నాటుతారు’’ అని అడిగింది.

     ‘‘నేను కాదు, నేను కాదు’’ అన్నాయి అవి. సరేనని కోడి ఆ విత్తనాన్ని నాటింది. కొన్ని రోజుల్లో చిన్న మొలక వచ్చంది.

     ‘‘ఈ మొక్కకు నీళ్ళు ఎవరు పోస్తారు?’’ మిత్రులను అడిగింది కోడి. ‘‘నేను కాదు, నేను కాదు’’ అంటూ తప్పించుకొన్నారు మిత్రులు. కోడి రోజూ శ్రద్ధగా మొక్కకు నీరు పోసింది. మొక్క పెరిగి కంకివేసింది.

     ‘‘కంకులను ఎవరు కోస్తారు?’’ మరోసారి మిత్రులను అడిగింది కోడి. ‘‘నేను కాదు, నేను కాదు’’ అన్నారు మిత్రులు. కోడే కంకులు కోసింది. వాటిని బాగుచేసి పిండి చేసింది. ఆ పిండితో రొట్టెలు చేసింది. మిత్రులైన బాతు, కుక్క, పంది ఏ పనిలోనూ సహాయ పడలేదు.

     కోడి రొట్టెను చేసి ‘‘దీన్ని ఎవరు తింటారు?’’ అని అడిగింది. ‘‘నేనంటే, నేనంటూ’’ బాతు, కుక్క, పంది ముందుకు దూకాయి.

     ‘‘గింజను తెచ్చింది, నాటింది, కంకికోసింది, పిండి చేసింది, రొట్టె కాల్చింది నేనే కదా! మీ కసలు రొట్టె ఎందుకు ఇవ్వాలి?’’ అంటూ మొత్తం కోడి తినేసింది.

     మిత్రులు సిగ్గుపడి ఆ రోజు నుండి కష్టపడి పని చేయడం మొదలు పెట్టారు.

నక్క - కాకి (కథ)

     అనగనగా ఒక ఊళ్ళో ఒక కాకి.
     ఆ కాకికి ఒకరోజు మాంసం ముక్క దొరికింది.
     దాన్ని చెట్టుకొమ్మ మీద కూర్చుని తినాలనుకొంది కాకి.
     అప్పుడు ఆ దారి వెంట ఒక నక్క వెళుతోంది.
     కాకమ్మ, దాని నోట్లో మాంసం ముక్క నక్క కంట పడ్డాయి.
     ఎలాగైనా కాకమ్మను మోసం చేసి మాంసం తినాలనుకొంది నక్క.
     ‘‘కాకమ్మా కాకమ్మా ఒక పాట పాడవా? నీ పాటంటే నాకు చాలా ఇష్టం. చిలకమ్మా, కోకిలమ్మా నీ ముందో లెఖ్ఖా? అడవిలో అందరూ నీ గురించే అనుకొంటున్నారు’’ అంటూ పొగిడింది.
     ఆ పొగడ్తలకు పొంగిపోయింద కాకి.
     ‘‘కా...  కా...’’ అంటూ పాడింది.
     కాకి నోట్లోని మాంసం ముక్క కింద పడింది.
     నక్క ఆ మాంసం ముక్క అందుకొని తింది. కాకి ఏడుస్తూ బాధడింది.

చాకలివాడి గాడిద - కథ

     ఒక చాకలివాడు గాడిదపైన బట్టల మూటవేసి, మూట మీద తన కొడుకును కూచోపెట్టి ఇంటికి బయలుదేరాడు.
     దారిలో కొందరు కలిశారు. వాళ్ళు గాడిద మీద కూర్చున్న కొడుకుతో ‘‘ఏమయ్యా........ ముసలి తండ్రిని నడిపిస్తూ నువ్వు గాడిద పైన ఎక్కావా?’’ అని తిట్టారు.
     వెంటనే అతను గాడిద దిగి తండ్రిని కూర్చోపెట్టి తాను నడవసాగాడు.
     మరికొంత దూరం వెళ్ళే సరికి ఇంకెవరో ఎదురయ్యి తండ్రితో ‘‘ ఏమయ్యా! చిన్న  పిల్లవాణ్ణి నడిపిస్తూ నువ్వు గాడిద ఎక్కుతావా?’’ అన్నారు.
     తండ్రి మళ్ళీ కొడుకును తనతోపాటు గాడిద మీ కూచోపెట్టుకొని వెళ్ళసాగాడు. అంతలోనే కొందరు. ఎదురుపడ్డారు.
     ‘‘ఏమయ్యా! మీకు బుద్ధి ఉందా! బక్క చిక్కినా గాడిద మీద బట్టల మూటతో పాటు మీరిద్దరూ ఎక్కుతారా? మీరసలు మనుషులేనా?’’ అని తిట్టారు.

     వాళ్ళిద్దరూ ఏం చెయ్యాలో పాలుపోలేదు. చివరికి ఇద్దరూ కలిసి గాడిద కాళ్ళు కట్టి కర్రకు వేలాడదీసి నడవసాగారు.
     ఈ వింత చూస్తూ దారిలో వాళ్ళు అల్లరి చేయసాగారు.
     ఆ అల్లరికి గాడిత బెదిరిపోయింది. అటు ఇటు గింజుకొని తాళ్ళు తెంపుకొని పరుగు పెట్టింది.
     తండ్రీ కొడుకులు బాధపడుతూ గాడిదను వెతకడానికి బయలుదేరారు.

కప్ప పాట - కథ

     ఒక రోజు కప్పకు పాట పాడాలనుకొంది.
     కోయిలమ్మ దగ్గరికి వెళ్ళి తనకూ పాట నేర్పమంది.
     కోకిల నవ్వింది. ‘‘నువ్వు పాట నేర్చుకోవడం కుదరదు’’ అంది.
     ‘‘లేదు. నేను పాట నేర్చుకోవాలి’’ అని గోల చేసింది. కప్ప.
    ‘‘పోనీలే కొద్ది రోజులు నేర్పితే కప్పకు తెలిసి వస్తుంది’’ అనుకొంది కోయిల.
     ప్రతి రోజూ కప్పకు పాటలు నేర్పసాగింది కోయిల.
     ఎన్ని రోజులు గడిచినా కప్పకు పాట రాలేదు.
     ఈ లోగా మామిడి చెట్లు పూతకు వచ్చాయి.
     మావి చిగురు తిన్న కోయిల పాట పాడబోయింది.
     కాని కోయిల కూ... అని పాడబోతే ‘బెక బెక’ అనే శబ్దం వచ్చింది.
     కోయిల పాట కప్పకు రాలేదు కానీ కప్ప ‘బెక బెక’ మాత్రం కోయిల కొచ్చింది.
     తన గొంతు ఏమయిందోనని కోయిలకు భయం వేసింది.
     మొదటి పనిగా కప్పకు పాట నేర్పించే పని మానేసింది.

పొగరుబోతు కుక్క - కథ

     అనగనగా ఒక ఊళ్ళో ఒక కుక్క ఉండేది. దాని యాజమాని దాన్ని చిన్నప్పటి నుండి ఎంతో ముద్దుగా పెంచాడు. మిగితా కుక్కలు కంటే నేను గొప్పదాన్నని దానికి గర్వం. ఆ విధిలో ఎవరు వెళుతున్న గట్టిగా అరవడం, కరవడం చేసేది. దాన్ని అందరూ పొగరుబోతు కుక్క అనేవాళ్ళు.

     కుక్క యజమానికి అదొక తలనొప్పిగా తయారయింది. ఆయనకు అదంటే ఎంతో ప్రేమ. అందుకని వదులుకోలేడు. కాని వీధిలో వాళ్ళ గొడవ ఎక్కువయింది. అందరితో మాట్లాడి ‘ఈ కుక్క మెడలో గంట కడుతాను. ఇది వస్తుంటే గంట చప్పుడవుతుంది. కదా! ఎవరైన సరే దీనికి దొరకుండా పారిపోవచ్చు’ అన్నాడు.

     గంట కట్టడంతో జనం అమ్మయ్య అనుకొన్నారు. అది వస్తుంటే గంట శబ్దం వినిపించేది. దాంతో ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండేవాళ్ళు. కుక్కకు మాత్రం గంట కట్టాక గర్వం పెరిగిపోయింది. నేను గప్పదాన్ని కాబట్టి గంట కట్టారు అని అది మిగతా కుక్కలతో అనేది.

     కుక్కకు బుద్ధి చెప్పాలని ఓ రోజు ముసలి కుక్క ఒకటి ‘‘ఈ గంట నీకు అలంకారం అనుకొని గర్వ పడుతున్నావ్. నువ్వు గర్వం గల కరిచే కుక్కవని అందరూ జాగ్రత్తగా ఉండటానికే ఈ గంట కట్టారు’’. అంది.

     పొగరుబోతు కుక్క ఆలోచలనలో పడింది. మొదటి నుంచి అన్ని విషయాలు గుర్తు చేసుకొంది. తనతో ముసలి కుక్క చెప్పిన మాటలు నిజమని తెలుసుకొంది. బుద్ధి తెచ్చుకొంది. ఆరోజు నుండి అది ఎవరినీ కరవలేదు.


24, ఫిబ్రవరి 2016, బుధవారం

చీమ కథ

     చీమ చాలా చిన్నది. అయినా ఆ చిన్న చిన్న చీమల మధ్య ఐకమత్యం ఎక్కువ.

     ఎప్పుడూ కలిసి మెలసి ఉండే చీమల లోంచి ఓ చిన్న చీమ దారి తప్పింది.

     తన వాళ్ళను వెతుక్కుంటూ తిరుగుతోంది. అలా తిరిగి తిరిగి అలసిపోయింది.

     దానికి ఆకలి వేసింది. దగ్గరలో చీమకు చక్కెర కనిపించింది.

     దాన్ని తిందామనుకోనేలోగా వానజల్లు పడింది.

     చక్కెర కరిగిపోయింది.

     వానజల్లు తగ్గాక మళ్ళీ ముందుకు సాగింది.

     దానికి బియ్యపు గింజ కనిపించింది.

     ఆత్రంగా దానివైపు పరుగు తీసింది చీమ.

     అంతలో పెద్దగాలి వీచి బియ్యపు గింజ కొట్టుకుపోయింది.

     చీమకు ఏడుపు వచ్చినంత పనైంది.

     దాని అదృష్టం బాగుండి దానికి రొట్టె ముక్క కనిపించింది.

     అది తిందామనుకొని అటువైపు వెళ్ళింది.

     అంతలో ఒక ఎలుక పరిగెత్తుకొచ్చి రొట్టె ముక్కను తీసుకుపోయింది.

     చీమకు ఆకలితో కళ్ళు తిరగసాగాయి.

     అది నెమ్మదిగా ఓ యింట్లోకి వెళ్ళింది.

     అక్కడ పాలు కనిపించాయి.

     చీమకు ప్రాణం లేచి వచ్చింది.

     పాలు తాగుదామనుకొని గిన్నె దగ్గరికి చేరింది.

     నెమ్మదిగా గిన్నె మీదిగా పాకింది.

     ఈ లోగా పిల్లి వచ్చి పాలన్నీ తాగేసింది.

     చీమ ‘‘ఓ భగవంతుడా! నన్ను యింత చిన్న దానిగా ఎందుకు పుట్టించావు’’ అంటూ ఏడవసాగింది.

     దేవుడికి జాలి కలిగింది. చీమ ముందు ప్రత్యక్షమై ‘‘ఎందుకు ఏడుస్తున్నావు?’’ అని అడిగాడు.

     చీమ జరిగిందంతా చెప్పింది.

     దేవుడు చీమకు చక్కెర, బియ్యం, రొట్టె, పాలు యిచ్చాడు. చీమ ఆనందించింది.

రాజు - కథ

     ఒక రాజుకు నలుగురు కొడుకులు ఉండేవారు. రాజు వేటకు వెళ్లాడు. రాజు తిరిగి భవంతికి రావడానికి చాలా రోజులు పడుతుంది. ఒక ఊరపిచ్చుక రాజుగారి పట్టెమంచం పట్టెల మీద గూడు కట్టింది.

     ఊరపిచ్చుక గుడ్లు పెట్టి నాలుగు పిల్లలు చేసింది. అది పిల్లలకు మేత తెచ్చి పెట్టేది.

     కొన్నిరోజులు గడిచాక ఆడ పిచ్చుక, మగ పిచ్చుకతో ‘‘ఏమయ్యా మన పిల్లగాండ్లు పెరిగాక వాళ్లు గూడు ఎక్కడ పెట్టుకోవాలి’’ అడిగింది.

     మగ పిచ్చుక ‘‘మనం రాజు మంచం పట్టె మీద గూడు పెడితే మన పిల్లలు రాజు కొడుకుల మంచం పట్టెల మీద పెట్టుకుంటారు’’ అంది.

అక్షరాల కథ

     అనగనగా ఒక ఇల్లు. ఆ ఇంట్లో క, గ, చ, జ, ట అనే స్నేహితుండేవారు. ఒకరోజు ‘క’ అనే అక్షరం ఆకలేస్తుంది తిందాం అంది. ‘గ’ అనే అక్షరం ఎక్కడ తెచ్చుకుని తిందాం అంది. అప్పుడు ‘చ’ అనే అక్షరం అప్పు తెచ్చుకుని తిందాం అంది. వెంటనే ‘జ’ అనే అక్షరం చేసిన అప్పు ఎలా తీరుద్దాం అని అడిగింది. సమాధానంగా ఎగకొట్టి పారపోదాం అంది ‘ట’ అక్షరం. తప్పు, తప్పు అందరం కష్టపడి అప్పు తీరుద్దాం అన్నాయి మిగితావి.

పల్లెవాడు - పాము (కథ)

     ఒక ఊళ్ళో రామయ్య అనే రైతు ఉండేవాడు.

     రామయ్యకు మంచివాడని, దయగల వాడని మంచి పేరు.

     ఒక రోజు రామయ్య పొలం వెళుతున్నాడు. ఓ డొంక దారిలో నడుస్తుండగా అతనికి సమీపంలో ఒక పొద దగ్గర మంట కనిపించింది.

     ఏమయిందా అని అనుకొంటూ పొద దగ్గరకు వెళ్ళాడు.

     పొద చుట్టూ మంటలు. మధ్యలో ఒక పాము. అది బయటకు రావడానికి నానా అవస్థ పడుతోంది.
 
    ఆ పామును చూడగానే రామయ్యకు ఎంతో జాలి వేసింది. దాన్ని ఎలా అయినా కాపాడాలని అనుకొన్నాడు.

     చేతిలోని చేతికర్ర చివర తన భుజం మీది తుండు ఉట్టిలా కట్టి పాము దగ్గరగా పెట్టాడు.

     పాము నెమ్మదిగా తుండులోకి పాకింది. దాన్ని గబుక్కున బయటకు లాగాడు. అయితే పాము తనను కాపాడింది ఎవరన్నది కూడా ఆలోచించకుండా రామయ్యను కాటు వేసింది.

    అందుకే అంటారు అపకారికి ఉపకారం చేయకూడదు అని.

ఎవరి న్యాయం వాళ్ళది - కథ

     ఒక చెట్టు తొర్రలో ఒక పక్షి గూడు పెట్టుకుంది. ఒకరోజు అది గూటికి ఆలస్యంగా తిరిగి వచ్చింది. అప్పటికే ఒక కుందేలు ఆ చెట్టు తొర్రలో గుర్రు పెట్టి నిద్రపోయింది.

     ఏయ్! ఎవరు నువ్వు? నా గూటికి ఎందుకొచ్చావు. వెంటనే ఇక్కడి నుండి వెళ్లిపో అని పక్షి అంది. దేవుడిచ్చిన భూమిని, చెట్లను, చెట్ల తొర్రలను ‘నా స్వంతం’ అని ఎవరూ అనలేదు. ఈ స్థలం నీది కాదు, నాది. కావాలంటే ఎవరైనా పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి న్యాయం చెప్పమని అడుగు అని కుందేలు పక్షితో అంది.

     పాపం పక్షి రాత్రంతా చెట్టు కొమ్మలమీద గడిపింది తెల్లవారగానే పక్షి, కుందేలు పెద్ద మనిషిని వెతుక్కుంటూ వెళ్ళాయి. ఒక చెరువు గట్టున బావురు పిల్లి కన్పించింది. రెండూ కూడబలుక్కొని బావురు పిల్లిని పెద్దమనిషిగా అంగీకరించి తమ కథలు మొదలు పెట్టాయి. కాని బావురుపిల్లి చెవిటి దానిగా నటిస్తూ ‘‘నేను ముసలి దాన్ని నాకు చెవులు సరిగా పని చేయడం లేదు. ఇంకాస్త దగ్గరికి వచ్చి చెప్పండి’’ అంది. పక్షి, కుందేలు బావురుపిల్లికి బాగా దగ్గరగా వచ్చి మళ్లీ కథ మొదలు పెట్టబోయింది. అంతే! బావురు పిల్లి చప్పున ఒక చెేత్తో పక్షిని, ఇంకో చేత్తో కుందేలును అదిమిపట్టి చంపి తినేసింది.

చేసుకున్న వాడికి చేసుకున్నంత - కథ

     ఒక కుక్క తన ఎడమ కాలిలో చెవిని గోక్కుంటోంది. అకస్మాత్తుగా ఎలుకలను వెదుకుతూ ఒక పిల్లి అటు వచ్చింది. దానిని చూచి కుక్కకు నోరూరింది. దానని తినాలనే కోరిక కలిగింది. వెంటనే దానపై దూకకుండా తెలివిగా పట్టుకోవాలనుకుంది. పిల్లి కూడా కుక్కను చూచి తటాలున నిలబడిపోయి తియ్యగా ఇలా అంది: ‘శ్రీమాన్ తమరు విచారముగానున్నట్లు కనిపించుచున్నారు! కారణమేమిటి?’ దానికి ఏమి చెప్పమంటావు పెద్దమ్మా! నా రెండు కాళ్ళలో ముళ్లుగుచ్చుకున్నాయి అంది కుక్క. ‘వెధవ ముళ్ళు మీకెందుకుగుచ్చుకొన్నాయని’ పిల్లి అడిగింది. ‘‘దారిలో అవి గుచ్చుకున్నాయి. నీ పళ్ళతో వీటిని తీసివేయ్యి. జీవితాంతం నీకు ఋణపడి ఉంటాను. భయపడకు. నిన్నేం చెయ్యను’’ అంది. కుక్క నాకు ముళ్ళు తీయడం రాదని పిల్లి చెప్పింది. నేను నేర్పుతాను. దగ్గరకు రమ్మనమని కుక్కపిలిచింది. ఈ కొత్త కళ నేర్చుకోవడానికి నాకు దృష్టి దోషం ఉంది. దగ్గరలో ఈ కళ తెలిపిన ఒక దయ గల తోడేలు ఉంది. దాన్ని తీసుకొని వస్తానని పిల్లి అనడంతో కుక్క తోడెలు మాట వినగానే తుళ్ళిపడి వద్దు అంది. పిల్లి ఇప్పుడే తీసుకొని వస్తా అంటూ వెనుకకు పరిగెత్తింది. కుక్క కూడా కంగారుపడి భయంతో పారిపోయింది.

23, ఫిబ్రవరి 2016, మంగళవారం

మేకపోతు గాంభీర్యం - కథ

     అనగా అనగా ఒక అడవిలో ఒక మేక ఉండేది. ఒక రోజు మేక షికారుకు బయలు దేరింది. ఆడుతూ పాడుతూ అడవంతా సరదాగా తిరిగింది. తిరిగి తిగిరి చూద్దామని వెళ్ళిన మేక అక్కడే కూర్చొని విశ్రాంతి తీసుకుందామనుకుంది. అంతలో అక్కడికి సింహం వచ్చింది. సింహాన్ని చూడగానే మేకకు భయం వేసింది. ప్రాణాలు ఎలా రక్షించుకోవాలి? అనుకుంది. లేని గాంభీర్యాన్ని నటిస్తూ సింహంతో ‘‘ఓ సింహమా! మంచి సమయానికి వచ్చావు. నేను పులులు, ఏనుగులు అన్నీ జంతువులను తిన్నాను. కాని ఇంత వరకు సింహాన్ని రుచి చూడలేదు. నా కోరిక ఇవాళ తీరేలా ఉంది. నేను రాక్షసి మేకను అంటూ రెండడుగులు ముందుకు వేసింది. సింహం ఆ మాటలు నిజమే అనుకొని ఒకటే పరుగు తీసింది. మేక తన ఉపాయం ఫలించినందుకు సంతోషిస్తూ ఇంటికి వెళ్ళిపోయింది.

పక్షులు - కథ

     ఒక ఊరిలో ఒక పెద్ద చింత చెట్టు ఉండేది. ఆ చెట్టు నిండా పక్షులు ఉండేవి. ఆ పక్షులను వేటగాళ్ళు వచ్చి రెండు పక్షులను ప్రతిరోజు తీసుకొని వెళ్ళేవారు. ఒక రోజు అందులో ఒక పక్షికి అనుమానం కలిగి పక్షులను లెక్కించింది. రెండు తక్కువగా ఉన్నాయి. మరునాడు లెక్కపెట్టగా మరో రెండు తక్కువగా ఉన్నాయి. దాంతో అవి ఏమైపోతున్నాయని ఆరా తీయడానికి రాత్రంతా నిద్రపోకుండా చెట్టుపై కాపలాకాసింది. అప్పుడు వేటగాళ్ళు పక్షులకై వచ్చారు. పక్షి వెంటనే వేగంగా ఎగిరి వచ్చి వారి కంటిలో పొడిచింది. అప్పుడు వేటగాళ్ళు కంటిచూపు పోయింది. ఈ విషయంను మిగిలిన పక్షులు తెలుసుకొని ఆ పక్షిని ఎంతగానో అభినందించాయి. ఇక ఆ పక్షులకు ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాయి.

తెలివితక్కువ ఏనుగు - కథ

     అడవిలో ఒక ఏనుగు ఉండేది. అది ఏమాత్రం పనిపాటా లేక ఊరకే తిరుగుతూ ఉండేది. ‘‘కొండంత ఉన్నావు. బండెడు తింటావు. బుద్దేమి లేదురా బండన్న’’ అంటూ చిన్న కుందేళ్ళు సైతం ఆటపట్టిస్తూ ఉంటే దానికి కోపం వచ్చి బుద్ది పెంచుకోవాలని ఊళ్ళోకి బయలుదేరింది.

     దారిలో ఒక ఎద్దు కనిపించింది. దానితో ‘‘ఎద్దన్నా ఎద్దన్నా తెలివి పెంచుకునే దారేదైనా ఉంటే చెప్పవా’’ అంది. ‘‘అబ్బో! బండి కట్టడం, కాడి ఎత్తడం, మెరక దున్నడం నాకు చాలా పని ఉన్నది కానీ నన్ను వదిలేయవయ్యా’’ అంది ఎద్దు. సరేలే అనుకుని అటుపక్కగా వెళుతున్న చీమతో ‘‘చీమతల్లి, చిన్న చెల్లి నాకు బుద్దంటే ఏమిటో చెప్పవా?’’ అంది ‘‘ఏమీ అనుకోవద్దు ఏనుగన్నా వానాకాలం వస్తే నాకు సున్నా అందుకే ఇలా పరిగెడుతున్నా. ఖాళీ ఉన్నప్పుడైతే చెపుతా ఏనుగన్నా’’ అంటూ వెళ్ళిపోయింది. ఇలా దారిలో చాలా జంతువులు కలిశాయి. కానీ ఎవరూ సమాధానం చెప్పలేదు.

     విసిగి విసిగి వెనక్కు వచ్చిన ఏనుగుతో చెట్టుమీద చిన్న కాకి ఇలా చెప్పింది. ‘‘బుద్ది కోసం బజారును పడి తిరగాల్సిన  అవసరం లేదు. బుద్ది మంతులు అందరూ ఎవరు పని వారు చేసుకుంటారు. నీ పని నీవు చేసుకో చాలు.’’ ఏనుగుకు నిజంగా బుద్ది వచ్చింది. తన పని తాను చేసుకుంటూ ఎవరితోనూ మాటపడకుండా హాయిగా జీవించింది.

నక్క - భూదేవర (కథ)

     ఒక నక్కకు భూమిమీద ఒక పైస దొరికింది. అది పైసతో పుట్నాలు కొనుక్కుంది. తినేసింది. కొన్ని రోజులు గడిచాయి. భూమి మీద పైస దొరికింది గనుక ఆ పైస భూదేవరది. ‘‘నాపైస నాకు తిరిగి ఈయవా?’’ అని భూదేవర అడిగింది. నక్క భూమిని తప్పించుకోవడానికి ఎంతో దూరం పరుగెత్తింది.

     అక్కడ కూడా భూమి ఉన్నది కదా!. ‘‘నాపైస తిరిగి ఈయవా’’ అని భూదేవర మళ్ళీ అడిగింది. నక్క మళ్ళీ పరుగెత్తింది. అక్కడ కూడా భూమి ఉన్నది. భూదేవర మళ్ళీ అడిగింది. నక్క మళ్ళీ పరుగెత్తింది. అలా తొగరి చేండ్ల నుండి పరుగెత్తుంటే దాని కంటికి తొగరి పుల్ల గుచ్చుకుంది. దాని కన్నొక్కటి పోయింది. భూదేవర నక్కను మళ్ళీ పైస అడిగినప్పుడు నక్క కోపంతో ‘‘నీవు గుడ్డి నక్కకు ఇచ్చావా మంచి నక్కవా’’ అని అడిగింది. భూదేవర ‘‘మంచి నక్కకే’’ అని అంది. నక్క తన కన్నును చూపింది. భూదేవర మళ్ళీ ఆ నక్కను పైస అడగలేదు.

     ‘‘నా కంటిని మంచిగా చేయి’’ అని నక్క పోచమ్మ దేవరను వేడుకుంది. భోనము వేస్తాను అంది. పోచమ్మ నక్క కన్నును నయం చేసింది. నక్క భోజనము వేయడం మరచిపోయింది. పోచమ్మ తల్లి నక్కను భోజనమేయమంది. ‘‘అమ్మా నీకు గుడ్డి నక్క భోనమేస్తా అన్నదా మంచి నక్కనా’’ అని నక్క అడిగింది. ‘‘గుడ్డి నక్కనే’’ అని పోచమ్మ తల్లి అంది. ‘‘నా కన్ను చూడు. నేను గుడ్డినక్కనా?’’ అని నక్క అడిగింది. ‘‘కాదు’’ అంది పోచమ్మ. మరి నేను భోనమువేయను అని నక్క తప్పించుకుంది.

22, ఫిబ్రవరి 2016, సోమవారం

విద్య - కథ

     అనగనగా ఒక ఊళ్ళో రాము, సోము అనే అన్నదమ్ములు ఉన్నారు. వాళ్లు బడికి వెళ్లకుండా అల్లరిగా తిరిగే వారు. వాళ్ళ అమ్మానాన్నా చాలా బాధ పడేవారు.

     ఒకరోజు వాళ్ల ఊరి చెరువు గట్టు మీద ఒకతను నడుచుకుంటూ వస్తూ, కాలు జారి చెరువులో పడ్డాడు. అందరూ అయ్యో! అయ్యో! అంటున్నారే కాని ఎవరు ఆయన్ని కాపాడటం లేదు. అక్కడే ఆడకొంటున్న రాము, సోము చెరువులో పడ్డ అతనిని కాపాడి ఒడ్డుకి తెచ్చారు.

     ఈ విషయం రాము, సోము వాళ్ల అమ్మానాన్నకు తెలిసి పరుగెత్తుకుంటూ వచ్చారు. తమ బిడ్డలు ఒక మనిషి ప్రాణం కాపాడారని తెలిసి సంతోషంచారు. ఆ పెద్దాయన ఎవరోకాదు ఆ ఊరికి కొత్తగా వచ్చిన మాష్టారు. ఆయన పేరు రామయ్య.

     రాము, సోము బడికి రాకపోవడం చూసి, వాళ్లింటికి వెళ్లాడు. రాము, సోముల గురించి వాళ్ల అమ్మానాన్నను అడిగి తెలుసుకున్నారు. పిల్లలిద్దర్నీ దగ్గర కూర్చోచెట్టుకొని మీరు గొప్ప వారవుతారు. రోజూ బడికి రండి మీకు మంచి కథలూ, పాటలూ, ఆటలూ నేర్పుతాను అని చెప్పారు. అప్పటినుండి రాము, సోము బడికి వెళ్లి బాగా చదువుకున్నారు. గొప్పవారయ్యారు.

చీమ - కథ

     ఒక ఊరిలో మూడు చీమలుండేవి. వాటి పేర్లు ఎర్రచీమ, నల్లచీమ, తెల్లచీమ. అవి స్నేహంగా ఉండేవి.

     ఒక రోజు ఎర్రచీమకు నల్లచీమ మీద సందేహం కలిగింది. ఎర్రచీమ వెళ్ళ నల్లచీమ, నల్లచీమా! నల్లచీమా! నువ్వు ఎందుకు నల్లగా ఉన్నావు? అని అడిగింది. నల్లచీమ దానికి నేను ఎండలో ఉంటాను కాబట్టి నల్లగా ఉంటానని చెప్పింది.

     ఒక రోజు నల్లచీమ వెళ్ళి ఎర్రచీమను నువ్వెందుకు ఎర్రగా ఉంటావని అడిగింది. నేను పళ్ల రసాలు తాగుతాను కాబట్టి ఎర్రగా ఉంటానని చెప్పింది.

     నల్లచీమ, ఎర్రచీమ రెండు కలిసి వెళ్ళి తెల్లచీమను నువ్వెందుకు తెల్లగా ఉంటావని అడిగాయి. దానికి తెల్లచీమ నేను పౌడర్ పూసుకుంటానని జవాబిచ్చింది.

అరటి మేలు (కథ)

     అనగా అనగా ఒక అడవి. అడవిలో రకరకాల పండ్ల చెట్లున్నాయి. ఆ పండ్లన్నీ స్నేహంగా ఉండేవి. ఆ ఫండ్లన్నింటిలో యాపిల్ ని అడవికి రాజుగా ఎన్నుకున్నాయి. యాపిల్ తాను ఎర్రగా అందంగా ఉంటానని గర్వపడేది. మిగితా పండ్లకు ఇది నచ్చేది కాదు. ఒక రోజు యాపిల్ ‘నాతో ఎవరు పోటీకి వస్తారు’ అంది అరటి ముందు కొచ్చింది. ‘అడవి చివర రాము, సోము ఇద్దరున్నారు. వీరిలో ఒకరు యాపిల్, మరొకరు అరటిపండు తిన్నారు. వారిద్దరిలో ఏ పండు తిన్నవారు బలంగా బొద్దుగా ఉంటారో ఆ పండు అడవికి రాజు అని చిలుక చెప్పింది. కొన్ని రోజులు అలా తిన్న తరువాత రాము బలంగా, బొద్దుగా తయారయ్యాడు. సోము ఎప్పటిలానే ఉన్నాడు. అరటి పండును రాజుగా ఎన్నుకున్నారు. యాపిల్ గర్వం అణిగింది. మిగితా పండ్లన్నీ సంతోషించాయి.

మూడు నిజాలు (కథ)

     అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక తెలివైన మేకపిల్ల ఉండేది. అది ఒకసారి మందలో నుంచి తప్పిపోయింది. తన వాళ్ళ కోసం అడవి అంతా తిరిగింది. అయినా ఏ ఒక్కరూ కనిపించలేదు. చివరకు నీరసంగా ఒక చెట్టుకింద కూలబడింది. అప్పుడే అక్కడికొక పులి వచ్చింది. మేకపిల్ల పులిని చూసింది. అయినా భయపడలేదు. దాని ధైర్యం చూసి పులికి ముచ్చటేసింది. మేకపిల్ల దగ్గరకెళ్ళి ‘ఏమోయ్.. నేనంటే నీకేం భయం లేనట్టుంది’ అంది పులి. ‘చూసి భయపడేంత భయంకరంగా లేవే!’ అంది మేక పిల్ల. ‘ఆహా.. మాటలు బాగానే మాట్లాడుతున్నావు. ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చావు?’ అడిగింది పులి. ‘మందలో నుండి తప్పిపోయాను, మా వాళ్ళ కోసం వెతుకుతూ ఇక్కడికి వచ్చాను. మరి వెళ్తాను..’ బయలు దేరుతూ అంది మేకపిల్ల. ‘ఎక్కడికెళ్లేది? నన్ను తప్పించుకుని వెళ్ళడం నీతరం కాదు’ అంది పులి. ‘కాదు నేను వెళ్ళి తీరాలి’ గట్టిగా అంది మేక. తప్పకుండా వెళ్లి తీరాలంటే నేను అడిగే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పాలి’ అంది పులి. ‘చెప్తే నా దారిన నన్ను వెళ్ల నిస్తావా?’ అడిగింది మేకపిల్ల. ‘ఓ నిక్షేపంగా’ అంది పులి అయితే వినండి ‘నేను మావాళ్ల వద్దకు వెళ్లి.. నేనొక పులిని చూశాను. అది నన్నుచంపకుండా వదిలేసింది’ అంటాను. ‘వాళ్ళు నమ్మరు. ఇది మొదటి నిజం’. ఇక రెండో నిజం... ‘మీరు మీ స్నేహితుల దగ్గరకెళ్లి నేనొక మేకపిల్లను చూశాను. దాన్ని నేను చంపకుండా వదిలేశాను’ అంటారు. వాళ్లెవరూ మీరు చెప్పింది నమ్మరు. ఇది రెండో నిజం అంది మేకపిల్ల. మరి మూడో నిజం.. అంటూ కుతుహలంగా అడిగింది పులి. ‘ఎదురుగా నేనున్నా మీరు నింపాదిగా మాట్లాడుతూ కూర్చున్నారంటే ఇప్పుడు మీకు ఆకలెయ్యట్లేదు. ఇదే మూడో నిజం అంది మేక పిల్ల. ‘అబ్బో! ఏమో అనుకున్నాను. నువ్వు నిజంగా తెలివైన మేకపిల్లవే. నీ తెలివి తేటలకు మెచ్చి నిన్ను వదిలేస్తున్నాను అంది పులి. మేక పిల్ల సంతోషంగా వెళ్లపోయింది.

కోతులు - తోట (కథ)

     అనగ అనగ ఒకరాజు. అతడు ఒకనాడు భోజనాలు ఏర్పాటు చేశాడు. ఉళ్ళో వాళ్ళందరినీ పిలిచాడు. అందరూ వెళ్ళారు. ఒక రైతు వెళ్ళలేదు. అతను తోటలో కూర్చొని విచారిస్తూ ఉంటాడు. అది ఒక కోతి చూచింది. ‘‘రాజుగారి భోజనానికి ఎందుకు వెళ్ళలేదు ?’’ అని అడిగింది.

     రైతు ‘‘మొక్కలకు నీరు పెట్టేది ఉంది. అందుకే వెళ్లలేదు’’ అని అన్నాడు. ‘‘నీవు వెళ్లు. నేను నీరు పెడతా’’ అన్నది కోతి. ‘‘వేళ్లు నానేటట్లు నీరు ఇవ్వాలి’’ అన్నాడు. రైతు. కోతి ‘‘సరే’’ అంది.

     రైతు రాజు గారింటికి భోజనానికి వెళ్ళాడు. కోతి తన మిత్రులను పిలిచింది. వందలు వేలు కోతులు వచ్చాయి. ‘‘ ఈ మొక్కలన్నింటికి నీరు ఇవ్వాలి’’ అంది కోతి. కోతులన్నీ ‘సరే’ అన్నాయి. డొన్నలు కుట్టి, వాగు నుంచి నీళ్ళు తెచ్చాయి. మొక్కలకు పోశాయి. ‘‘నీరు మొక్కల వేళ్ళకు తగిలాయా’’ అంది కోతి. ‘‘తెలవదు’’ అన్నాయి మిగితా కోతులు. ‘‘మొక్కను పీకి చూడండి’’ అంది కోతి. కోతులు మొక్కలన్నింటిని పీకి వాటి వేళ్ళను చూశాయి.

     తిరిగి వచ్చిన రైతు తన తోటను చూసి లబోదిబోమన్నాడు.

రాము తెలివి - కథ

     రామాపురంలో రాము అనే తెలివైన అబ్బాయి ఉండేవాడు. రోజూ లాగానే బడికి వెళ్ళే దారిలో బఠానీలు కొన్నాడు. దుకాణం తాత బఠానీలు తక్కువగా ఇచ్చాడని గమనించాడు. మరుసటి రోజు ఇంకొంచెం తగ్గటం తెలుసుకుని ‘ఎందుకు తాతా తగ్గిస్తున్నావు’ అని అడిగాడు. ‘బాబు బఠానీలు ఎక్కువగా ఉంటే నీవు మోయలేవు’ అని తాత చెప్పాడు.

     సరేనని రాము తక్కువ డబ్బులు ఇచ్చాడు. ‘ఏంది బాబూ తక్కువన్నాయి’ అడిగాడు తాత. ‘ ఏం లేదు తాతా ఎక్కువ ఇస్తే నీవు లెక్క పెట్టుకోలేవని తక్కువ ఇచ్చాడు’ అన్నాడు ఆ తెలివైన అబ్బాయి. రాము తెలివికి తాత తప్పు తెలుసుకున్నాడు. అప్పటి నుండి సరిపడా బఠానీలు ఇవ్వడం మొదలు పెట్టాడు.

21, ఫిబ్రవరి 2016, ఆదివారం

5. పారిపోయిన గిన్నెలు(Paripoina ginnelu) - 3 తరగతి తెలుగు

విజయనగర రాజ్యంలో వరహాలయ్య అనే వ్యాపారి ఉండేవాడు. ప్రజలకు తమ అవనరాలకోసం అతని దగ్గర అప్పు తీసుకునేవారు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడంలో కాస్త ఆలస్యమైతే బలవంతంగా ఎక్కువ డబ్బులు వసూలు చేసేవాడు. మరో ఆధారం లేక ఇబ్బంది కలిగినప్పటికీ ప్రజలు అతన్నే ఆశ్రయించేవారు. ఈ విషయం రాయలవారి ఆస్థానంలో ఉన్న తెనాలి రామకృష్ణుడికి తెలిసింది. ఎలాగైనా వరహాలయ్యకు బుద్ధి చెప్పాలనుకున్నాడు.

ఒకరోజు రామకృష్ణుడు వరహాలయ్య దగ్గరికి వెళ్ళి ‘‘ మా ఇంట్లో రేపు విందు జరుగుతుంది. అన్నం వండడానికి ఒక పెద్ద గిన్నె కావాలి’’ అని అడిగాడు. అందుకు వరహాలయ్య ‘‘రెండు బంగారు నాణేలు ఇస్తేనే అరువుగా గిన్నె ఇస్తాను,’’ అన్నాడు. రామకృష్ణుడు సరేనని ముందుగానే రెండు బంగారు నాణేలు చెల్లించి గిన్నెను తీసుకువెళ్ళాడు.

రెండు రోజుల తరువాత రామకృష్ణుడు తాను తీసుకువెళ్ళిన గిన్నతో పాటు మరో గిన్నెను కూడా వరహాలయ్యకు ఇచ్చాడు. ‘‘నువ్వు ఇచ్చిన గిన్నెకు నిన్న రాత్రి ఈ గిన్నె పుట్టింది,’’ అని చెప్పాడు. రామకృష్ణుడు ఇంత అమాయకుడా ? వరహాలయ్య సంబరపడిపోయాడు. అతనేటువంటి వాడయితేనేం నాకు మాత్రం భలే లాభం అనుకున్నాడు.

వారం రోజుల తర్వాత రామకృష్ణుడు తిరిగి వరహాలయ్య దగ్గరికి వెళ్ళాడు. ‘‘ రేపు అమ్మగారి పేరు మీద అన్నదానం చేయాలనుకుంటున్నాను. నాకు కొన్ని గిన్నెలు కావాలి. ఇదివరకటిలాగే అద్దె చెల్లిస్తాను,’’ అన్నాడు.

అందుకు వరహాలయ్య, ‘‘ కొన్ని కాదు, నాదగ్గర ఉన్న అన్ని గిన్నెలూ ఇస్తాను,’’ అన్నాడు సంతోషంగా, ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ బండిమీద వేసి రామకృష్ణుడి ఇంటికి పంపించాడు. ఈసారి తనకు ఎంత లాభం కలుగుతుందో అని ఆశగా చూడసాగాడు. వరహాలయ్య.

పది రోజులు గడిచిపోయాయి. రామకృష్ణుడు గిన్నెలు తిరిగి ఇవ్వలేదు. చివరకు వరహాలయ్యే అతని ఇంటికి వెళ్ళి గిన్నెలను గురించి అడిగాడు. అప్పుడు రామకృష్ణుడు, ‘‘ నువ్వు ఇచ్చిన గిన్నెలు నిన్న రాత్రి పారిపోయాయి,’’ అని చెప్పాడు. ‘‘గిన్నెలు పారిపోవడం ఏమిటి ? అంతా మోసం!’’ అంటూ అరిచాడు వరహాలయ్య. నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్ళి రామకృష్ణుడి మీద ఫిర్యాదు చేశాడు.

రాజుగారు రామకృష్ణుణ్ణి పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నరు. వరహాలయ్య గుిరించి కూడా వివరాలు సేకరించారు.

వరహాలయ్యతో, ‘‘నీ గిన్నెకు మరో గిన్నె పుట్టడం నిజమైనప్పుడు గిన్నెలు పారిపోవడం కూడా నిజమేగా!’’ అన్నాడు రాజు.

వరహాలయ్య సిగ్గుతో తల దించుకున్నాడు. తనకు బుద్ధి చెప్పడానికే రామకృష్ణుడు ఇలా చేశాడని అర్థం చేసుకున్నాడు. అప్పటినుండి వరహాలయ్య నీతిగా జీవించాడు.

20, ఫిబ్రవరి 2016, శనివారం

మంచి మాటలు


1. జీవితంలో ఎప్పుడైనా
       ఎవరి నైనా పనికి రాని వారిగా
         పరిగణించవద్దు ఎందుకంటే
           చెడిపోయిన గడియారం
             కూడ రోజుకు రెండు సార్లు
               సరైన సమయం
                  సూచిస్తుంది

2. ఎప్పుడూ ఇతరుల తప్పులను
      అన్వేషించే వ్యక్తి అందమైన
         పుష్పాల పరిమళాలను
           వదలి పుండు మీద వాలే
             ఈగ లాంటి వాడు

3. పేదరికం ధరిచేరినప్పుడు
      ఆప్తమిత్రులు కూడ
        దూరమైతారు అదే
          ధనవంతులైనప్పుడు
            తెలియని వారు కూడ
               మిత్రులవుతారు

4. ఒక్క సారి నవ్వుతూ చూడు
      ప్రపంచంలో ఉండే అందాలన్ని
        నీ సొంతమవ్వుతాయి కానీ
          తడిసిన కనురెప్పలతో
             చూసే అద్దంకూడ మసక
                బారి పోతుంది

5. తొందరగా దొరికేది ఏదైనా
       ఎక్కువకాలం మన్నికరాదు
         ఎక్కువకాలం మన్నిక
           వచ్చేది అంతతొందరగా
              దొరకదు

6. జీవితంలో వచ్చే చెడు రోజులు
      కూడా మన మంచి కొరకే
        అనుకోవాలి అప్పుడే
          తెలుస్తుంది నిజమైన
            స్నేహితులు ఎవరైనది

7. మనిషికి రోగాలు కుందేలు లాగా
      వస్తాయి తాబేలు లాగా
        వెళ్లుతాయి కానీ డబ్బులు
          తాబేలు లాగ వస్తాయి
             కుందేలు లాగా
                వెళ్లుతాయి

8. చిన్న చిన్న మాటల్లో ఆనందాన్ని
       వెతకటం అలవాటు
         చేసుకోవాలి ఎందుకంటే
           పెద్ద పెద్ద మాటలు
             జీవితంలో చాలా
                అరుదుగా చోటు
                   చేసుకుంటాయి

9. ఈశ్వరుని ప్రార్ధించినప్పుడు
      నాకు ఏమి ఇవ్వలేదని
        బాధపడకు ఎందుకంటే
          నీకు అక్కడ ఇవ్వక
            పోయినా నీకు నచ్చిన
              చోట నీకు ఈశ్వరుడు
                నచ్చినవిధంగా ఇస్తాడు

10. నిత్యము ఎదురయ్యే
        అపజయాలను చూసి
          నిరాశ చెందకు కానీ
            ఒక్కోసారి తాళంచెవి
              గుచ్చంలో ఉండే ఆఖరి
                తాళంచెవి కూడ తాళం
                   తెరుస్తుందని
                      గమనించు

11. ఈ సమాజంలో నేను ఒక్కడిని
         ఎంచేయగలననీ ప్రతి మనిషి
           నిరాశ చెందుతుంటాడు
             కానీ ఒక్క సారి తలపైకెత్తి
               చూడు ప్రపంచానికి
                వెలుగునిచ్చే సూర్యుడు
                   కూడ ఒక్కడేనని 

12. బంధవులు ఎంత చెడ్డ వారైనా
         సరే వదులుకోవద్దు
           ఎందుకంటే మురికి నీరు
             దప్పిక తీర్చలేక పోయిన
               కనీసం అగ్గి మంటలు
                 ఆర్పటానికి పనికి
                    వస్తాయి

13. నమ్మక ద్రోహి స్నేహితునికన్నా
        దురాశపరుడు సన్నిహితుడు
          మిన్న మట్టితో చేసిన
            మనుషులు కాగితాలకు
               అమ్ముడు పోతారు

14. మనిషి గా మాట్లాడుట
         రాక పోయినా కనీసం
           పశువుల మౌనంగా
             ఉండటమే ఉత్తమం

15. మనకు మాటలు రాక ముందు
       మనముఎంచెప్పబోతున్నామో
         అమ్మకు అర్థమయ్యేది కాని
           మనము మాటలు అన్ని
             నేర్చిన తరువాత ఇప్పుడు
                మాటమాటకు ప్రతిసారి
                   అమ్మా నీకు అర్థం
                      కాదులే అంటాం

16. కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులు
          దూరమైనారని బాధపడకు
            ఎందుకంటే నీవు ఒక్కనివే
               జయించగలవని వారు
                 నమ్మినందుకు నీవు
                     సంతోషించు

17. సిగ్గు మర్యాద లేని
        ధనవంతుడు ఎల్లయ్య కన్నా
          మంచి మానవత్వం ఉన్న
            పేదరికం సుబ్బయ్య మిన్న

18. జీవితంలో హెచ్చుతగ్గులు
         రావటంకూడ మనమంచి
           కోసమే అనుకోవాలి
             ఎందుకంటే ECG లొ
               వచ్చే సరళరేఖా కూడ
                  మృత్యువును
                     సూచిస్తుంది

19. ఈ రోజుల్లో సంబంధాలు
         రొట్టె తొ సమానమైనవి
           ఎందుకంటే కొద్దిగా మంట
             ఎక్కవైందొలెదో రొట్టె
               మాడిమసి కావటం
                   ఖాయం

20. జీవితంలో మంచి వారి కోసం
         అన్వేషించ వద్దు ముందు
            నీవు మంచిగా మారు
              బహుశా నిన్ను కలిసిన
                వ్యక్తికి మంచి మనిషి
                   అన్వేషణ పూర్తి
                      కావచ్చు నేమో